రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక పక్షం వహించిన దేశాల కూటమిని అక్ష రాజ్యాలు (Axis powers, Axis alliance, Axis nations, Axis countries) అంటారు. వీరి కూటమి మిత్ర రాజ్యాల కూటమికి వ్యతిరేకంగా యుద్ధం సాగించింది. అక్షరాజ్యాల కూటమిలోని మూడు ప్రధాన దేశాలు - నాజీ నాయకుడు హిట్లర్ నాయకత్వంలో ఉన్న జర్మనీ, ఫాసిస్టు నాయకుడు ముస్సోలినీ నాయకత్వంలో ఉన్న ఇటలీ, జపాన్. 1940లో వారి మధ్య జరిగిన "త్రిపక్ష ఒడంబడిక" (Tripartite Pact) ద్వారా అక్షరాజ్యాల కూటమి ఏర్పడింది. ఈ మూడు దేశాలే కాకుండా వారి అధినంలో ఉన్న వలస రాజ్యాలు లేదా మిత్ర దేశాలు కూడా ఈ అక్షరాజ్యాల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాయి. అక్ష రాజ్యాల పూర్తి ఓటమితో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది.


మొట్ట మొదటిసారి "అక్షం" లేదా "ఇరుసు" (axis) అనే పదం ముస్సోలినీ వ్యాఖ్యనుండి వచ్చింది. నవంబరు 1936లో జర్మనీ, ఇటలీల మధ్య జరిగిన మైత్రీ ఒప్పందం తరువాత "ఇటలీ, జర్మనీ అనే దేశల ఇరుసు చుట్టూరా మిగిలి ఐరోపా దేశాలు భ్రమిస్తాయని" ముస్సోలినీ అన్నాడు. అంతవరకూ ఇటలీకి వ్యతిరేకమైన జర్మనీ అబిసీనియా యుద్ధంలో ఇటలీని సమర్ధించింది. తత్ఫలితంగా ఇరు దేశాల మధ్య స్నేహం నెలకొని 1939లో రెండు దేశాల కూటమి లేదా "అక్షం" ఏర్పడింది.


1940 సెప్టెంబరు 27లో జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు చేసుకొన్న మైత్రి ఒప్పందం తరువాత "అక్ష రాజ్యాలు" అనే పదం వాడుకలోకి వచ్చింది. తరువాత హంగెరీ, రొమేనియా, స్లొవేకియా, బల్గేరియా దేశాలు 1940-41 మధ్యకాలంలో ఈ కూటమిలో చేరాయి. అయితే మిలిటరీ పరంగా ఈ కూటమిలో జర్మనీ, జపాన్‌లు శక్తివంతమైన దేశాలు.


ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

యితర లింకులు మార్చు