ఉండమ్మా బొట్టు పెడతా

ఉండమ్మా బొట్టు పెడతా బాబూ మూవీస్ బ్యానర్‌పై ఆదుర్తి సుబ్బారావు సమర్పణలో 1968లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆదుర్తి వద్ద పలు చిత్రాలకు సహాయకుడిగా పనిచేసి పేరు తెచ్చుకున్న కె.విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మూలం 1967లోని మరాఠి చిత్రం థాంబ్ లక్ష్మికుంకుంలావితే. మరాఠీ చిత్రానికి కథ పండిట్ మహాదేవ్ శాస్త్రి జోషి, దర్శకుడు దత్త ధర్మాధికారి. ఇక తెలుగు చిత్రానికి సినిమా అనుసరణ ఆదుర్తి సుబ్బారావు.

ఉండమ్మా బొట్టు పెడతా
సినిమా పోస్టర్
దర్శకత్వంకె.విశ్వనాథ్
తారాగణంజమున,
ఘట్టమనేని కృష్ణ,
ధూళిపాల, చలం, నాగభూషణం, జానకి, నాగయ్య
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ
సంస్థ
శ్రీ ఉదయభాస్కర్ పిక్చర్స్
విడుదల తేదీ
1968
సినిమా నిడివి
156 నిమిషాలు
భాష

సాంకేతికవర్గం మార్చు

నటీనటులు మార్చు

కథ మార్చు

ఆ ఊళ్లోని మోతుబరి ఆసామి దశరథరామయ్య (నాగయ్య). ఆయనకు నలుగురు కుమారులు. పెద్దవాడు శ్రీనివాస్ (నాగభూషణం). పేకాట వ్యసనపరుడు. అతని భార్య తులసి (షావుకారు జానకి). ఇంటి శుభ్రత, పనిపాటల కంటే పూజలకు ఎక్కువ సమయం కేటాయిస్తుంది. వారి కుమార్తె పద్మ (ప్రసన్నరాణి). రెండో కొడుకు వెంకటేశం (అర్జా జనార్ధనరావు). తాగుబోతు, తిరుగుబోతు. మేనమామ సాక్షి రంగారావు కూతురు శేషు (సూర్యకళ)ను పెళ్లి చేసుకుంటాడు. రోజూ భార్యతో గొడవ పడుతుంటాడు. వారికి ఇద్దరు సంతానం. మూడోవాడు చలం (రంగ), అతని భార్య సుమతి (మీనాకుమారి). ఎక్కువ చదివానన్న అహంతో భర్తను అవహేళన చేస్తుంటుంది. నాల్గవ కొడుకు కృష్ణ (కృష్ణ). మంచితనం, సత్ప్రవర్తన కలిగిన కుర్రాడు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటుంటాడు. ఆ ఊరి హరిదాసు (ధూళిపాళ) కుమార్తె లక్ష్మి (జమున). కూతురి పెళ్లికోసం వడ్డీ వ్యాపారి, హోటలు నడిపే పాపాయమ్మ (సూర్యాకాంతం) వద్ద డబ్బు కూడబెడుతుంటాడు దాసు. లక్ష్మిని మౌనంగా ఆరాధిస్తుంటాడు కృష్ణ. ఆమె కూడా అతని పట్ల వౌనంగా ఆరాధన ప్రదర్శిస్తుంటుంది. ఈ సమయంలో లక్ష్మికి పెళ్లి కుదురుతుంది. అయితే, దాసు దాచుకున్న డబ్బులు లేవని పాపాయమ్మ అబద్ధమాడటంతో లక్ష్మి పెళ్లి ఆగిపోతుంది. దశరథ రామయ్య పెద్ద మనసుతో అదే ముహూర్తానికి లక్ష్మి, కృష్ణకు పెళ్లి జరిపిస్తాడు. పేదింటినుంచి వచ్చిన లక్ష్మికి, అత్తవారింట తోడికోడళ్ల నుంచి అవమానాలు ఎదుర్కొంటుంది. వాటిని నిబ్బరంతో భరిస్తూనే, భర్తకు తోడుగా నిలుస్తుంది. పొలంలో బావి తవ్వించి భూమిని సస్యశ్యామలం చేస్తుంది. పురిటికి పుట్టింటికెళ్లి ఆడపిల్లను ప్రసవిస్తుంది. బిడ్డతో వచ్చిన ఆమెకు అత్తింట ఎన్నో ఇక్కట్లు ఎదురవుతాయి. బావగార్లను పోలీసులు అరెస్టు చేయటం, ఇంట్లో అనాచారాలు ఎదురవ్వడం లాంటివి. ఆ ఇంటి సిరి లక్ష్మీదేవి ఇల్లొదిలి వెళ్లిపోతానంటుంది. బొట్టు పెట్టించుకుని వెళ్లమని లక్ష్మీదేవిని కోరి, బిడ్డను ఊయలలో ఉంచి, తాను బావిలోకి దూకి తనువు చాలిస్తుంది లక్ష్మి. ఆమె వచ్చి బొట్టు పెట్టేవరకూ ఉండాలి కనుక లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే ఉండిపోవడం, తోడికోడలు ఆత్మత్యాగంతో తులసీ తదితరుల్లో మార్పురావడం, అన్నదమ్ములు ఐకమత్యంతో భూమిని పండించి జాతీయస్థాయిలో కృషి పండిట్ అవార్డు తండ్రి దశరథ రామయ్యకు వచ్చేలా చేయటం, అవార్డు బహూకరణ సందర్భంలో తమ గత జీవితం గూర్చి మంత్రికి వివరించిన దశరాథ రామయ్య, అవార్డును తన మనుమరాలు, లక్ష్మి కుమార్తె చిన్నలక్ష్మికి అందింపచేయటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.[1]

పాటలు మార్చు

  1. అడుగడుగున గుడి వుంది, అందరిలో గుడి వుంది, ఆ గుడిలో దైవముంది అదియే దైవం - పి.సుశీల
  2. ఎందుకీ సందెగాలి, సందెగాలి తేలి మురళీ తొందర తొందరలాయె విందులు విందులుచేసే - పి.సుశీల
  3. చాలులే నిదురపో జాబిలి కూనా ఆ దొంగ కలవరేకులలో - సుశీల
  4. చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని - ఎస్.పి. బాలు, సుశీల
  5. పాతాళగంగమ్మ రారారా ఉరికి ఉరికి ఉబికి ఉబికి రారారా - ఘంటసాల, సుశీల బృందం, రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  6. రావమ్మ మహాలక్ష్మి రావమ్మా నీ కోవెల ఈ ఇల్లు కొలువై - ఎస్. పి. బాలు, సుశీల బృందం
  7. శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా చేలంతా గంగమ్మ వాన - ఘంటసాల, సుశీల బృందం, రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

మూలాలు మార్చు

  1. "ఉండమ్మా బొట్టు పెడతా - సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 22-09-2018". Archived from the original on 2018-10-03. Retrieved 2018-11-02.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బయటిలింకులు మార్చు