పూనా ఒడంబడిక

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ మధ్య ఒప్పందం

భారతదేశంలో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య కుదిరిన ఒప్పందమే పూనా ఒప్పందం (పూనా ఒడంబడిక). 1932 సెప్టెంబర్ 24మహారాష్ట్ర లోని పూనా పట్టణంలో (ఇప్పటి పుణె) లో ఈ ఒప్పందం కుదిరింది.

నేపథ్యం మార్చు

గాంధీజీ ఆమరణ నిరాహారదీక్షతో అంబేద్కర్ తదితరులకు ఇష్టంలేకున్నా సరిగ్గా 83 ఏళ్ల క్రితం పూనా ఒప్పందం జరిగింది. దాని ఫలితంగానే నేటికీ దళితులకు నిజమైన రాజకీయ అధికార భాగస్వామ్యం అందలేదు. రాజకీయ రిజర్వేషన్లు పాక్షిక ప్రయోజనాన్నే అందించాయి. సవర్ణ హిందువులు లేదా దళితేతరులు తమకు అనుకూలమైన దళితులే ఎన్నికయ్యేలా చేస్తున్నారు. అవీ లేకుండా చేయాలని జరిగిన కుట్రలను అంబేద్కర్ ప్రతిఘటించడం వల్లనే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కాయి. లేకుంటే ఆ అవకాశమూ దక్కేది కాదు.

శతాబ్దాలుగా అణచివేతకు, తరతరాలుగా వెలివేతకు గురవుతున్న వర్గాలకు విముక్తిని కలిగించడంలో రాజకీయాధికారం కీలకపాత్ర వహిస్తుందని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ భావించారు. రాజ్యాంగపరంగా అది అక్షరాలా అమలు జరిగేలా చూసేందుకు అహరహం తపించారు. కానీ అంబే డ్కర్ తన ఆలోచనలకు ఆచరణ రూపాన్నిచ్చే ప్రతి సందర్భంలోనూ కొందరు మోకాలడ్డారు. ఆయన ఆశించినది ఆశించినట్టు జరగకుండా, అణగారిన వర్గాలకు ఫలితాలను అందకుండా చేయడంలో కొంత మేరకు కృతకృత్యుల య్యారు. 83 ఏళ్ళ క్రితం 1932 సెప్టెంబర్ 24న, సరిగ్గా ఇదే రోజున ‘పూనా ఒడంబడిక’ పేరిట దళితులకు ద్రోహం జరిగింది. ఇది రెండు విభిన్న సామా జికవర్గాల మధ్య కుదిరిన ఒప్పందం. అంబేద్కర్, గాంధీలు ప్రత్యర్థులుగా నిలిచి పూనాలో కుదుర్చుకున్న ఆ ఒప్పందం దుష్ర్ఫభావం ఫలితంగానే నేటికీ దళితులకు నిజమైన రాజకీయాధికార భాగస్వామ్యం అందలేదు.

అంబేద్కర్, గాంధీల సంఘర్షణ మార్చు

అంబేద్కర్ 1919 నుంచి అంటరాని కులాలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం రావాలనీ, ప్రభుత్వాలలో వారికి సరైన ప్రాతినిధ్యం ఉండాలనీ వాదిస్తూ వచ్చారు. 1927లో సైమన్ కమిషన్ ముందు కూడా ఆయన తన వాదనలను వినిపించారు. 1930-32 మధ్య లండన్‌లో జరిగిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ ఆయన అదే అంశంపై గట్టిగా వాదించారు. మొదటి సమా వేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో మహా త్మాగాంధీ కాంగ్రెస్ తరఫున నిలిచి... అంటరాని కులాల రాజకీయ హక్కుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేద్కర్, గాంధీల మధ్య ఈ విష యమై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అంటరాని కులాలను తరతరాలుగా వెలివేశారనీ, హిందువులలో భాగంగా వీరిని ఏనాడూ చూడలేదనీ, ఆర్థిక, సామాజిక అణచివేతకు గురిచేశారనీ అంబేద్కర్ వాదించారు.

ఆ కారణం గానే వారికి రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం కావాలని, వారి ప్రతినిధులను వారే ఎన్నుకునే అవకాశం కల్పించాలనీ కోరారు. లేకుంటే రాజకీయ స్వేచ్ఛకు బదులు వారు తరతరాల బానిసత్వానికి బలికావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, అంటరాని వారు హిందువులేనని, వారికి ప్రత్యేక ఓటింగ్ హక్కులు, వారి ప్రతినిధులను వారే ఎన్నుకునే ఏర్పాట్లు అవసరం లేదని గాంధీ గట్టిగా అడ్డుతగిలారు. రెండు వాదనలనూ విన్న బ్రిటిష్ ప్రభుత్వం అంబేద్కర్ సూచించినట్టు అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ హక్కుకు,  తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే అవకాశానికి అంగీకరించింది.

దానిని తీవ్రంగా వ్యతిరేకించిన గాంధీ 1932 మార్చి 11న ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తూ ‘‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ హక్కులు కల్పిస్తే నేను ఆమ రణ నిరాహారదీక్ష చేయగలనని తెలియజేస్తున్నాను’’ అని హెచ్చరించారు. ఇదే అంశంపై నాటి బ్రిటన్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ గాంధీకి రాసిన ఒక ఉత్తరంలో రామ్‌సే మెక్‌డొనాల్డ్ ‘‘మీ ఉద్దేశం హిందువులకూ, అంటరాని కులాలకూ కలిపి ఓటింగ్ ఉండాలని కాదు. హిందువుల మధ్య ఐకమత్యం సంరక్షించుకోవాలని కూడా కాదు. అంటరాని కులాల తరఫున శాసనసభలో నలుగురు నిజమైన ప్రజాప్రతినిధులు రాకుండా చేయుటకే మీరు ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారని అనుకోక తప్పడం లేదు’’ అని అన్నారు. ‘‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ ఇవ్వడం కూడా వారిని రక్షించదు’’ అంటూ గాంధీ తన పాత ధోరణిలోనే ఆయనకు సమాధానం ఇచ్చారు.

నిరాహారదీక్ష కుతంత్రం మార్చు

ఆ సందర్భంగా అంబేద్కర్ ‘‘స్వతంత్ర రాజ్యాంగంలో మెజారిటీగా ఉన్న హిందువుల నిరంకుశత్వం నుంచి తమను తాము రక్షించుకోవడానికి రాజ కీయ హక్కులను సాధించుకోవాల్సిన వర్గం ఏదైనా ఉందంటే అది అంట రాని, అణగారిన ప్రజానీకమేననేది వాస్తవం. ఏ మతానికైతే వారు బందీ లుగా ఉన్నారో ఆ మతం వారికి ఒక గౌరవ స్థానాన్ని కల్పించడానికి బదులు కుష్ఠు రోగులకన్నా హీనంగా చూస్తున్నది. దళితులను ఆర్థికంగా మరింత పరా ధీనులను చేస్తున్నది. ఎవరైనా చైతన్యవంతులై తల ఎత్తి నిలబడితే అందరూ కలసి దాడులు చేస్తున్నారు’’ అంటూ గాంధీ లాంటి వారికి దీటైన జవా బిచ్చారు. దళితుల పక్షాన అంబేద్కర్, సవర్ణ హిందువుల పక్షాన గాంధీ తల పడిన సందర్భమిది. చర్చకు వచ్చిన అన్ని ప్రశ్నలకూ అంబేద్కర్ దీటుగా సమాధానం ఇచ్చారు. అంటరాని కులాల ప్రత్యేక ఓటింగ్ హక్కును అడ్డు కోవడానికి గాంధీ ఉపవాస దీక్ష పూని, ప్రాణాలు తీసుకుంటానని భయ పెట్టారు. దీంతో అంబేద్కర్, ఇతర అంటరాని కులాల నాయకులు వారికి ఇష్టం లేని విధానానికి ఆమోదం పలికేలా చేసి, ఒప్పందంపై సంతకాలు చేయించుకున్నారు. ఈ ఒప్పందానికి అంగీకరించకపోతే, తనకు ప్రాణహాని జరిగితే, మైనారిటీలుగా ఉన్న అంటరాని కులాలపై ప్రతి గ్రామంలో దాడులు జరుగుతాయని కూడా గాంధీజీ పరోక్షంగా హెచ్చరించారు. అందువల్ల ఈ ఒప్పందానికి గాంధీ చేసిన కుట్రే ప్రధాన కారణమని చెప్పకతప్పదు.

ఈ ఒప్పందంలో తొమ్మిది అంశాలున్నాయి. ప్రత్యేక ఓటింగ్ పద్ధతికి బదులుగా నేటి రిజర్వుడు స్థానాల విధానానికి అంగీకారం ఈ ఒప్పందంలో కీలక అంశం. నాడే దళితుల నుంచి స్వతంత్ర రాజకీయ నాయకులు ఎదిగే ప్రక్రియకు గండి పడింది. 1937, 1942 సాధారణ ఎన్నికల్లో అదే రుజువైంది. కేవలం కాంగ్రెస్ అనుచరులు మాత్రమే రిజర్వుడు స్థానాల నుంచి ఎన్ని కయ్యారు. వారు కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలుగా మారారే తప్ప అంటరాని కులాల ప్రతినిధులుగా నిలవలేకపోయారు.

రాజ్యాంగ సభలో రిజర్వేషన్ల వ్యతిరేక కుట్ర మార్చు

అంబేద్కర్ అంతటితో ప్రత్యేక ఓటింగ్ హక్కు డిమాండ్‌ను వదిలిపెట్టలేదు. 1946లో రాజ్యాంగ సభకు అందించిన ‘రాష్ట్రాలు-మైనార్టీలు’ అనే వినతి పత్రంలో అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ హక్కును కోరారు. కానీ, రిజర్వేషన్లను, అణగారిన వర్గాల హక్కులను అంగీకరించలేని సవర్ణ హిందువులు మరొక కుట్రకు తెరతీశారు. రాజ్యాంగ రచన సభలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ రూపంలో అడ్డుపడ్డారు. రాజ్యాంగ సభ పటేల్ నేతృ త్వంలో మైనార్టీల సమస్యలపై వేసిన ఉపసంఘం తన నివేదికలో అన్నిరకాల రిజర్వేషన్లనూ రద్దు చేయాలని సిఫారసు చేసింది. ప్రధానిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ మౌనం దాల్చి, అణగారిన వర్గాల హక్కులు పట్టనట్టు వ్యవహరించారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఎన్నికైన ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. దీంతో ఆ సమయంలో రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా, న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్  ప్రత్య క్షంగా రంగంలోకి దిగక తప్పలేదు. ‘‘ఈ రాజ్యాంగ రచన ద్వారా షెడ్యూల్డ్ కులాలకు కొన్ని రక్షణలు లభిస్తాయని భావించాను. అంటరాని కులాలకు మీరు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే నేను రాజ్యాంగ సభలో సభ్యు నిగా కొనసాగాల్సిన అవసరం లేదు. నేను బయటకు వెళ్ళిపోతాను. అంట రాని కులాల సంక్షేమాన్ని సవర్ణ హిందువులు కుట్రపూరితంగా అడ్డుకున్నారని చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ఆయన హెచ్చరించారు. దీంతో పటేల్ వంటి వారు దిగిరాక తప్పలేదు. చివరకు 1949 మే 25, 26 తేదీల్లో రాజ్యాంగ సభ షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లను కొనసాగించాలని తీర్మానించింది.

ఆత్మావలోకనం అవసరం మార్చు

అయితే, రాజకీయ రిజర్వేషన్లు ఒక పాక్షిక ప్రయోజనాన్ని మాత్రమే అం దించాయి. 80 శాతంగా ఉన్న సవర్ణ హిందువులు లేదా దళితేతరులు నిజ మైన దళిత ప్రతినిధులనుగాక, తమకు అనుకూలమైన రాజకీయ నాయకులకే ఎన్నికయ్యే అవకాశం కల్పిస్తున్నారు. అంబేద్కర్ ప్రతిపాదించినట్టుగా ప్రత్యేక ఓటింగ్ పద్ధతి ద్వారా తమ అభ్యర్థులను తాము మాత్రమే ఎన్నుకునే విధా నం అమలు జరిగి ఉంటే నిజమైన దళిత ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే వార నడంలో ఎటువంటి సందేహం లేదు. అంబేద్కర్ పటేల్ నేతృత్వంలో సవర్ణ హిందువుల కుట్రలను గట్టిగా ప్రతిఘటించడం వల్లనే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వే షన్లు దక్కాయి. లేకుంటే దళితులకు ఆ అవకాశమూ దక్కకుండా పోయేది.

ఒప్పందం మార్చు

ఒప్పందం పాఠం

1) ప్రాంతీయ శాసనసభ స్థానాల్లో అణగారిన వర్గాలకు (తరువాతి కాలంలో షెడ్యూల్డు కులాలు అని పేరొందినవి) కింది విధంగా రిజర్వేషన్లు ఉంటాయి: -

మద్రాసు 30; బొంబాయి సింద్ కలిపి 25; పంజాబు 8; బీహారు, ఒడిషా కలిపి 18; మధ్య ప్రావిన్సులు 20; అస్సాం 7; బెంగాలు 30; ఐక్య ప్రావిన్సులు 20. మొత్తం 148. ఈ అంకెలు బ్రిటిషు ప్రధానమంత్రి నిర్ణయానుగుణమైనవి.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు