భూమి యొక్క సారాన్ని పరీక్షించి తెలుసుకొనే పద్ధతిని భూసార పరీక్ష అంటారు[1]. భూమి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు, దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. రైతు నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలన ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకొని మంచి దిగుబడులు ఇచ్చే పంటను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది. వేసిన పంటకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనపుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గినాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక నేలకు అందించే పోషకాల ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు, దీని ద్వారా పంటపై పెట్టే పెట్టుబడి తగటమే కాక మంచి దిగుబడుల వలన మంచి ఆదాయం పొందవచ్చు. పంట పండించడానికి నేలకు సరిపడ పోషకాలను అందించటం వలన నేల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టడమేకాక భవిష్యత్ తరాలకు పంట పండించడానికి అనుకూలమైన మంచి నేలను అందించగలుగుతాము. నేలలోని కొంత మట్టిని సేకరించి రసాయన పద్ధతుల ద్వారా లేదా ఇతర విశ్లేషణ పద్ధతుల ద్వారా పరీక్షించటం వలన నేలలో మొక్కకు కావాలసిన పోషక పదార్థాలు ఏయే పాళ్ళలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. నేలలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాషియం మొదలైన పోషక పదార్థాలను మొక్కలు సేకరించటం వలన భూసారం తగ్గుతూ ఉంటుంది, అందువలన పంటను వేసే ముందే మట్టి నమూనా పరీక్షించటం ద్వారా ఆ నేలలో తగ్గిన పోషకాలను తెలుసుకొని పంట వేసినప్పుడు తగ్గిన పోషక పదార్థాలను ఎరువుల రూపంలో అందిస్తే సరిపోతుంది.

భూసార పరీక్షను నిర్వహిస్తున్న వ్యక్తి

ప్రయోజనాలు మార్చు

మట్టి పరీక్షలో అమ్ల, క్షార సూచిక లవణాల స్థాయి, సేంద్రియ కర్బనం, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం మొదలైనవి ఏ నిష్పత్తిలో ఉన్నాయో తెలుసుకోవటం వలన నాటిన పైరుకు వయసును బట్టి, కాలాన్ని బట్టి అవసరమైన ఎరువులను సరైన పాళ్లలో అందించవచ్చు. ఈ పరీక్షల వలన అమ్లగుణం ఉన్న నేలలను సున్నంతో, క్షారగుణం ఉన్న నేలలను జిప్సంతో బాగుచేసుకోవచ్చు.

పొలం నుంచి మట్టి నమూనా సేకరణ మార్చు

మట్టి నమూనాను భూమి విస్తీర్ణాన్ని బట్టి, వాలును బట్టి, రంగును బట్టి అవసరమయినని నమూనాలను సేకరించవలసి ఉంటుంది, ఒకటి నుంచి ఐదు ఎకరాల భూమిని ప్రామాణికంగా తీసుకొని భూమిలో పలుచోట్ల ఉన్న మార్పులను బట్టి మట్టి నమూనాలను సేకరించాలి.

భూసార వివరాలు మార్చు

నేల మానవునికి ప్రకృతి సిద్ధంగా లభించిన గొప్ప సంపద. పంటలకు కావాల్సిన అన్ని పోషకాలు కొంత పరిమాణంలో నేలలో సహజంగా వుంటాయి. అయితే వీటిలో ఎంతో వ్యత్యా సాలు ఉండే అవకాశం ఉంది. నేలలో పోషకాలు ఎంత లభ్యమవుతున్నాయో, వేయదలచిన పైరుకు ఎంత అవసరమో నిర్దారించి ఎరువులు వాడాలి. కావున భూసారాన్ని పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భూసార పరీక్షల ముఖ్య ఉద్దేశము

  1. నేలలో సహజంగా వున్న పోషకాల స్థాయిని తెల్సుకొని, వేయబోవు పంటలకు ఎరువుల మోతాదులను నిర్ణయించుటకు.
  2. చౌడు, ఆమ్ల గుణాల స్థాయిని నిర్దారించి సరిచేయుటకు. తద్వారా అధిక దిగుబడులు సాధించడానికి.

భూసార నమూనాల సేకరణ
పొలమంతా ఒకే రకంగా వున్నప్పుడు 5 ఎకరాల విస్తీర్ణానికి ఒక్క నమూనా చొప్పున తీయాలి. మట్టినమూనా తీయదల్చిన పొలంలో 10 నుండి 12 చోట్ల మట్టి సేకరించాలి. మట్టినమూనా తీయదల్చిన చోట నేలపై వున్న గడ్డి, చెత్త, కలుపు మొదలగు వాటిని తీసివేయాలి. పార ఉపయోగించి “ v ’’ ఆకారంలో 6 – 8 అంగళాలు (15 సెం.మీ) అంటే నాగటి చాలంతా గుంత తీయాలి. పై నుంచి దిగువ వరకు ఒకే మందంలో పలచని పొరవచ్చే విధంగా మట్టిని తీయాలి. ఇలా అన్ని చోట్ల నుండి సేకరించిన మట్టిని గోనెపట్టా, పాలీధీన్ పట్టా లేదా గట్లమీద వేసి మట్టి గడ్డలు చిదిమి బాగా కలిపి చతురస్రాకారంగా పరచి నాలుగు సమ భాగాలుగా విభజించాలి. ఎదురు, ఎదురుగా ఉన్న 2 భాగాల మట్టిని తీసుకొని మిగిలిన మట్టిని తీసివేయాలి. మరల నాలుగు బాగాలుగా చేయాలి.
ఈ విధంగా అరకిలో మట్టి నమూనా మిగిలే వరకు చెయ్యాలి. పండ్ల తోటలు వేయదలచిన పొలంలో చదునుగా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అందులో 3 అడుగుల గొయ్యితీసి ప్రతీ అడుగుకు పై నుండి క్రిందికి ఒక్క మట్టినమూనా చొప్పున సేకరించి వివరాలతో పరీక్షా కేంద్రానికి పంపాలి.
నమూనాను శుభ్రమైన గుడ్డ సంచిలో గాని, ఫ్లాస్టిక్ సంచిలో గాని నింపాలి. సంచి లోపల రైతు పేరు, తండ్రి పేరు, గ్రామం, సర్వే నెంబరు, వేయదలచిన పంట మొదలగు వివరాల లో. మట్టినమూనాను దగ్గరలో వున్న భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి.

మట్టి నమూనా సేకరించటంలో మెళకువలు

  1. చెట్ల క్రింద, గట్ల ప్రక్కన, కంచెల వద్ద, కాలిబాటల్లో నమూనాలు తీయకూడదు, బాగా సారవంతమైన చోట్ల, మరీ నిస్సారవంతమైన చోట్ల మట్టిని కలిపి తీయకూడదు.
  2. సమస్యాత్మక భూముల్లో నమూనాలు విడిగా తీయాలి, రసాయన ఎరువులు వేసిన 45 రోజుల లోపు నమూనాలు తీయకూడదు.
  3. నమూనా తీసేటప్పుడు నేలపై నున్న ఆకులు చెత్తాచెదారము తీసివేయాలి, నీరు నిలిచి బురదగా వున్న నేల నుండి నమూనా తీయకూడదు. తప్పని సరిగా తీయవలసి వచ్చినపుడు నీడన ఆరబెట్టి పరీక్షా కేంద్రానికి పంపించాలి.
  4. మెట్ట / ఆరుతడి సేద్యంలో పైరు పెరుగుతున్న సమయంలో నమూనా తీయవలసినపుడు వరుసల మధ్య నుండి నమూనా సేకరించాలి, చౌడు భూముల్లో 0 – 15 సెంమీ, 15 - 30 సెంమీ లోతులో రెండు నమూనాలు తీయాలి.

వనరులు మార్చు

  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]

మట్టి నమూనాకు అవసరమయిన పనిముట్లు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు