వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు సోదరులు రాక్షసులు. వీరి వృత్తాంతం రామాయణంలో అరణ్యకాండలో చెప్పబడింది. శ్రీ రాముడు అరణ్యవాసం చేస్తూ, అగస్త్యుడు ఉండే ఆశ్రమం జాడ సుతీష్ణుడు అనే ఋషి వల్ల కనుగొంటాడు. సీతారామ లక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని వెదుకుకుంటూ వెళుతుంటే ఒక పెద్ద బూడిద, ఎముకల గుట్ట కనిపిస్తుంది. అప్పుడు రాముడు సీతా లక్ష్మణులతో ఆక్కడ పూర్వం జరిగిన వృత్తాంతాన్ని చెబుతాడు.

ఇల్వలుడు వాతాపి నరమాంస భక్షణ మార్చు

ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులలో ఇల్వలుడికి మృతసంజీవిని (చనిపోయిన వారిని బ్రతికించే) విద్య వచ్చును; వాతాపికి కామరూప (కోరిన రూపం పొందే) విద్య వచ్చును. వీరు నరమాసం భుజించడం కోసం ఒక ప్రణాళిక వేసుకొనేవారు. వాతాపి కామారూప విద్యతో మేకగా మారిపోయేవాడు. ఇల్వలుడు అరణ్యంలో, మార్గమధ్యంలో కనిపించే బ్రాహ్మణుల ను తన తండ్రి శ్రాద్ధ కర్మకు భోక్తగా రమ్మని వేడుకొనే వాడు. త్రేతా యుగ ఆచారాల ప్రకారం శ్రాద్ధంలో మాంసం పెట్టాలి. కాబట్టి మేకగా మారిన వాతాపిని ఇల్వలుడు కూర చేసి వడ్డించేవాడు. భోజనం అంతా పూర్తి అయ్యేక ఇల్వలుడు తన మృత సంజీవిని విద్య నుపయోగించి వాతాపిని పిలిచేవాడు. వాతాపి ఆ బ్రాహ్మణుడి ఉదరాన్ని చీల్చుకొని బయటకు వచ్చేవాడు. అప్పుడు ఇల్వలుడు, వాతాపి కలసి చనిపోయిన ఆ బ్రాహ్మణుడిని భుజించేవారు.

అగస్త్యుడు భోక్తగా రావడం మార్చు

ఇలా ఉండగా ఒకరోజు అగస్త్యుడు ఆ మార్గంలో వెళ్తుండడం చూసి ఇల్వలుడు తన తండ్రి ఆబ్దీకానికి భోక్తగా రమ్మంటాడు. త్రికాలవేది అయిన అగస్త్యుడు విషయాన్ని పసిగట్టి 'సరే' అని ఒప్పు కొంటాడు. ఇల్వలుడు యథాప్రకారం వాతాపి ని మాంసం కూరగా చేసి వడ్డిస్తాడు. అగస్త్యుడి ఉత్తరౌపాసన అయ్యాక, ఇల్వలుడు తన మృతసంజీవిని విద్య ఉపయోగించి 'వాతాపీ, రా!' అంటాడు. అప్పటికే అగస్త్యుడు తన తపోశక్తి నుపయోగించి 'జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం' అని వాతాపిని పూర్తిగా జీర్ణం చేసేసుకొంటాడు. అప్పుడుతో వాతాపి జీర్ణం అయిపోయాడు అని చెప్పగా, ఇల్వలుడు కోపంతో క్రూరమైన రాక్షస రూపాన్ని పొంది అగస్త్యుడి మీదకి వస్తాడు. అగస్త్యుడు ఒక హూంకారంతో తన మీదకు వస్తున్న ఇల్వలుడిని తపోశక్తితో ఉగ్రంగా చూస్తే ఇల్వలుడు భస్మం అయిపోతాడు.

ప్రాచుర్యంలో వాతాపి మార్చు

చంటి పిల్లలు జీర్ణం కావడానికి కష్టంగా ఉన్న పదార్థం తిన్నప్పుడు పెద్దలు 'జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం' అంటారు. (వాతాపి లాంటి వాడే జీర్ణం అయ్యినప్పుడు ఈ పదార్థం జీర్ణం అవ్వడం ఏమంత కష్టం కాదు అని అర్థం). అగస్త్యుని పొట్ట లోని వాతాపి జీర్ణం అయినట్లుగానే ఈ చిన్ని పొట్ట లోని పదార్థం కూడా జీర్ణంఅయిపోవాలి అని కోరిక. పసిపిల్లలకు ఉభయ సంధ్యలలోను ఉగ్గు పట్టడం ఆనువాయితీ. కాళ్లమీద పసిబిడ్డను పడుకో పెట్టుకుని, ఉగ్గు పట్టించిన తర్వాత ఆ పిల్లవాని కాళ్లు,చేతులు అటూ,ఇటూ ఊపుతూ "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అంటారు. ఈవిధంగా అనడంవల్ల, ఉగ్గుతో బాటూగా నోటి లోపలికి వెళ్లిన వాయువులు తేణుపు ద్వారా బహిర్గతమై, ఆముదము లోనికి ఏవిధమైన అడ్డంకి లేకుండా పొట్టలోనికి వెళ్లి తన పని కానిస్తుంది. ఇలా చేయనప్పుడు పిల్లలు ఒక్కొక్కప్పుడు వాంతి చేసుకుంటారు అనేది బిడ్డతల్లులకు అనుభవవేద్యమైన విషయం.(ఈ కాలపు వైద్యులు ఆముదము వాడడం తప్పు అంటారు).

"https://te.wikipedia.org/w/index.php?title=వాతాపి&oldid=1956769" నుండి వెలికితీశారు