అధినివేశ ప్రతిపత్తి

అధినివేశ ప్రతిపత్తిని ఇంగ్లీషులో Dominion Status అంటారు. ఇది 19 శతాబ్దములో బ్రిటిష్ ప్రభుత్వము తమ నిరంకుశ పరిపాలనలోనుండిన వలసరాజ్యములు స్వరాజ్యముకావలెననికోరి ఆందోళన చేయుచున్న దేశములకు తమ సామ్రాజ్యములో భాగముగనే వుంచుతూ అనుగ్రహించే ఒక విధమైన ప్రజాపరిపాలనా పధ్దతి. అట్టి ప్రజాపరిపాలనా పద్ధతి ఫెడరల్ సంయుక్తరాజ్యాంగమందురు. స్వరాజ్యమే గాని, పూర్ణ స్వరాజ్యము కాదు. అట్టి అదినివేశ స్వరాజ్యమనే రాజ్యాంగము కలుగచేసిన యడల స్వపరిపాలన చేసుకునప్పటికినీ స్వరాజ్య జాతీయప్రభుత్వముతో పరిపాలింపబడు భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యములోని స్వతంత్రరాజ్య సమ్మేళనములో నొకటైయుండెడిది. డొమీనియన్ అనగా రాష్ట్రము అని అర్దము చెప్పినప్పటికీ రాజ్యాంగ స్థితి, ప్రభుత్వాధికారమునొసగిన రాజ్యాంగ సంస్థను బట్టి డొమీనియన్ అను మాట కాలక్రమేణా కొంచెం మార్పుచెందినది. 1926 అక్టోబరు 26 తేదీన బ్రిటిష్ ప్రభుత్వము తమ రాజ్యప్రతినిధి ద్వారా చేసిన ప్రకటనలో అధినివేశ ప్రతిపత్తి వలననే భారతదేశముయెక్క రాజ్యాంగమబివృధ్ధి కాగలదని వక్కాణించియున్నారు. 1926 లో సమావేశమైనబ్రిటిష్ సామ్రాజ్యసభ (Imperial Conference) వారి తీర్మానమునందు అదినివేశస్వరాజ్యములయొక్క లక్షణములు వివిరింపబడియున్నవి. 1920 లో తిలక్ మరణించిన తరువాత కొంతకాలము దేశములో నెలకొనియున్న అనిశ్ఛలతమైనస్వరాజ్యభావముల కాలమందు 1927 లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశములో చేసిన తీర్మానము ప్రకారము భారతరాజ్యాంగ ముసాయిదా (చిత్తు) తయారుచేయబడినదనీనూ అందులో ప్రస్తావించిన స్వరాజ్యము అప్పటిలో బ్రిటిష్ సామ్రాజ్యములోనున్న డొమీనియన్లు అనబడు దేశములు (DOMINIONS) కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశములందు గల స్వరాజ్య ప్రజాప్రభుత్వములాంటి సరిసమానస్తాయిని డొమీనియన్ స్టెటస్ (dominion status) కావలెనని కోరబడినదని చరిత్రలో విశదమగుచున్నది.[1] 1926-1931లో భారతదేశమును పరిపాలించిన వైస్రాయి, లార్డు ఇర్విన్ ప్రభువు అప్పటిలో ఉదృతముగా ప్రబలుతున్న స్వరాజ్య కాంక్షకు సానుభూతిగనూ, కొంత ఉపశమనము కలుగచేయుటకునూ అవలంబించిన రాజనీతితో భారతదేశానికి డొమీనియన్ స్టేటస్ ఇవ్వబడవచ్చునను ఆశాచూపెట్టెను. ఆ కాలమందు తెలుగు ప్రాంతములలో మేధావులు రాజనీతిజ్ఞలును ఆ ఇంగ్లీషు పదమైన డొమీనియన్ స్టేటస్ కు తెలుగుసేతగా అధినివేశ స్వరాజ్యమని చెప్పిరి.[2]

మొదటి ప్రపంచ యుద్ధ పోస్టర్‌ - దీన్ని ఆర్థర్ వార్డ్లే, పార్లమెంటరీ రిక్రూటింగ్ కమిటీ రూపొందించింది. బ్రిటిష్ సామ్రాజ్యంలోని దేశాల పురుషులను బ్రిటిష్ సైన్యంలో చేర్చుకోవాలని కోరింది.

1919 సంవత్సరములో భారతదేశమునకు అధినివేశ ప్రతిపత్తి (Dominion Status)వచ్చునన్న తలపులకు అంకురార్పణ మార్చు

బానిసరాజ్యము (వలసరాజ్యము) గా బ్రిటిష్ ప్రభుత్వపు నిరంకుశ పరిపాలనలో 18 వశతాబ్దమునుండి కుములుతున్న భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యములోనుండిన కెనడా డొమీనియన్ స్వపరిపాలితస్వరాజ్య దేశములాగ ఈ దేశముగూడా డొమీనియన్ స్టేటస్ (అధినివేశ ప్రతిపత్తి) వచ్చునన్న ఆశ ఎలా కలిగినదో చరిత్రలోకి వచ్చినంతవరకూ (1) 1917వ సంవత్సరములో బ్రిటిష్ విదేశ ఇండియా రాజ్యాంగ మంత్రి ఎడ్విన్ మాంటెగూ బ్రిటిష పార్లమెంటులో చేసిన ప్రకటన (2) అప్పటిలో భారతదేశమునందు గవర్నర్ జనరల్ గానుండిన లార్డు షెమ్స ఫర్డుతో కలసి సమకూర్చిన మాంటెగూ-షెమ్స్ ఫర్డు సంస్కరణలు నివేదికను పొందుపరచి 1919 సంవత్సరములో విడుదల చేయబడ్డ ఇండియా రాజ్యాంగ చట్టమునందు పేర్కొన బడ్డ వివరణలు. చూడు మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము .[3]

వలసరాజ్యము నుండి పూర్ణ స్వరాజ్యము మార్చు

భారతదేశము 18వ శతాబ్దమునుండి బ్రిటిష్ వారి బానిస రాజ్యము (వలసరాజ్యము) గా బ్రిటిష్ ప్రభుత్వపు నిరంకుశ పరిపాలననుండి 20వ శతాబ్దములో పూర్ణ స్వపరిపాలిత దేశముగా మారిన చరిత్రలో పరిచయమైన ఆంగ్ల పదములు డొమీనియన్ స్టేటస్, డొమీనియన్, సావెరినిటీ (Dominion status, Dominion and Sovereignty). ఈ మూడు పదములకు వ్యత్యాసముకలదు. 19-20 వ శతాబ్దపు బ్రిటిష్ సామ్రాజ్య చరిత్ర దృష్టితో డొమీనియన్ అనగా ఆ బ్రిటిష్ సామ్రాజ్యములోని అంతర్భాగమైన ఒక దేశము. ఆ నాటి (1867) లో మొట్టమొదటగా కెనడాకు లభించిన స్వపరిపాలన రాజ్యంగము. అటువంటి స్వపరిపాలనను గీటురాయిగా చేసుకుని 1921-24 మధ్యభారతదేశము స్వరాజ్య ఆందోళన నాయకులు కోరిన కోరిక ఆ కెనడా-స్తాయి-స్వపరిపాలన ప్రసాదించమని బ్రిటిష్ ప్రభువులను అర్ధించారు. అందు చే డొమీనియన్ స్టేటస్ (స్థాయి) అనబడినది అదే అదినివేశ స్వరాజ్యము అని తెలుగునాడులో వాడుకలోనుండినది. ఆ చరిత్రనే అధినేవేశ స్వరాజ్యముగా నిచ్చట వివరించబడింది. కాల క్రమేణ డొమీనియన్ అను ఆంగ్ల పదము పరిణామము చెంది స్వపరిపాలిత రాష్ట్రముగా అర్దమైనది. 1940 తరువాత 1947 మధ్య భారతదేశము, పాకిస్తాన్ దేశములను బ్రిటిష్ సామ్రాజ్యములో భాగములుగా డోమీనియన్ స్టేటస్ లు కలుగజేయబడినవి. 1947 ఆగస్టు 15 తేదీనుండి 1950 జనేవరి 26 తేదీ మధ్య భారతదేశమున ఇండియన్ డొమీనియన్ (Dominion of India) గా వ్యవహరించబడింది. అటువంటి డొమీనియన్ దేశమును కూడా తెలుగులో అధినివేశ స్వరాజ్య మనే అంటారు. జనేవరి 26, 1950 తేదీన భారతదేశ రాజ్యాంగము విడుదలచేసిననాటి నుండి సంపూర్ణ స్వామిత్వము (Sovereign Republic). ఆ రెండేండ్ల వ్యవధిలో తుది బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ గను తరువాత తొలి భారతీయ గవర్నర్ జనరల్ గా రాజాజీ అని ప్రసిధ్ది చెందిన చక్రవర్తి రాజగోపాలాచారి (చూడు బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్ ) డొమీనియన్ ఆఫ్ ఇండియాగా సంబోధించబడిన భారతదేశము గురించి వేరుగా వివరించబడింది. (చూడు బయటి లింకులు) ర్

బ్రిటిష్ సామ్రాజ్య రూపురేఖలు. 19- 20 వశతాబ్ధమునాటి చరిత్ర మార్చు

భూగోళముగా చాల విస్తారమై సాంఘికముగా వివిధదేశములు, జాతివారు, మతమువారు కలిసిన పెద్ద రాజకీయ సంస్థ బ్రిటిష్ సామ్రాజ్యము. వివిధ రాజ్యముల సమ్మెళనము. ఆ సామ్రాజ్యములోనుండిన రాజ్యములు ముఖ్యమైనవి ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్. వీటినే బ్రిటిష్ దీవులు అనెడివారు. ఆ బ్రిటిష్ దీవుల ప్రభుత్వమే సామ్రాజ్య సార్వభౌవము. రాజుగారి పేరట పార్లమెంటు చే బ్రిటిష్ దీవులు పరిపాలింపబడుచుండెను. బ్రిటిష్ సామ్రాజ్యములో మూడు రకములైన రాజ్యములుండెడివి. (1) డొమీనియన్సు: కెనడా (Canada Dominion), ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, న్యూఫౌండ్లాండ్, ఐరిషఫ్రీ స్టేట్లు అధినివేశస్వరాజ్యములుగా భ్రిటిష్ సామ్రాజ్యములో భాగముగా నుండెడివి. కానీ ఆవి రాజ్యాంగము కలిగియున్న స్వపరిపాలితరాజ్యములు. బ్రిటిష్ దీవులప్రభుత్వము ఆ డొమీనియన్సపై ఎట్టి రాజ్యాధికారము కలిగియుండలేదు. (2) బ్రిటిష్ సామ్రాజ్యములోని రెండవ రకమైన వలసరాజ్యములు రాజ్యాంగముకలిగినవి. వాటి రాజ్యాంగములలో ఎక్కువపాళ్లు వారి వారి ఆంతరంగిక పరిపాాలనయేనుండినది. కాని కొన్ని విషయములలో సామ్రాజ్యసార్వభౌముని అధికారము చెలామణి అగుచుండెను. అటువంటి దేశములు మాల్టా, దక్షిణ రొడీషియా (3) మూడవ రకం వలసరాజ్యములు సరాసరి బ్రిటిష్ ప్రభుత్వ వలసరాజ్యములు. వీటిపరిపాలననే కొలోనియల్ పరిపాలననేవారు. వీటికి రాజ్యాంగముగానీ స్వపరిపాలనగానీ లేదు. బ్రిటిష్ ప్రభుత్వపు ప్రతినిధి బ్రిటన్ దేశపు వలసదేశపు రాజ్యాంగమంత్రి చెప్పుచేతలక్రిందయుండును. ఇట్టి వర్గమునకు చెందిన వలసరాజ్యములు 20 శతాభ్దారంబములోనివి సింహళము (ఇప్పటి స్రీలంక), పాపువాదీవి, డాగ్ దీవులు (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పై ఆధారపడియున్న సామంతరాజ్యదేశములు). బహుశః భారతదేశము 1930 నాటికి ఆ వర్గములోనుండిన బ్రిటిష్ వలసరాజ్యము. 1940 తరువాతనుండి భారతదేశము, పాకిస్తాన్ కూడా అధినివేశ ప్రతిపత్తిలుగా పరిగణింపబడినవి. (4) ఇంకా ఒక వర్గం వలసరాజ్యములు రక్షితరాజ్యములనబడినవి బ్రిటిష్ సామ్రాజ్యము వారి సంరక్షిత రాజ్యములు (Protectorates), దక్షత రాజ్యములు (protected states) [2]

బ్రిటిష్ వలసరాజ్యముల చరిత్ర మార్చు

భారతదేశము 18వ శతాబ్దం మద్య బ్రిటిష్ వలసరాజ్యముగా (బ్రిటిష్ ఇండియా) కొన్ని పరగణాలతో ప్రాారంభమై క్రమేణా దేశం మొత్తం 19వ శతాబ్దమునకు బ్రిటిష్ వలసరాజ్యమైనది. అంతకన్నా ముందే సా.శ. 15-16 శతాబ్దములనాటికే చాలా దేశములు బ్రిటిష్ వలస రాజ్యములుగా నుండి బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలనలోనుండెడివి. అట్టిదేశములగు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూఫౌండ్లాండ్ మున్నగు దేశములను బ్రిటిష సామ్రాజ్యమునకు డొమీనియన్లుగా ఘోషించి వాటికి 19 -20 శతాబ్దములలో బ్రిటిష్ వారు స్వరాజ్యపరిపాలన కలుగచేసి సామ్రాజ్యమకుటములోనుండినటుల అనుగ్రహించి రాజ్యాంగము కలుగచేసి అదినివేశ స్వరాజ్యములుగా (డొమీనియన్లు) చేశారు. అటువంటి డొమీనియన్లలో కెనడా, న్యూజిలాండ్ మొట్టమొదటగా ఘోషించబడ్డ బ్రిటిష్ డొమీనియనులు (అదినివేశ స్వరాజ్యములు). అందుచే చాలాకాలము దాకా ఆ రెండుదేశముల పేర్లు కెనడా డొమీనియన్ న్యూజిలాండ్ డొమీనియన్ అనబడుతూవుండేవి. తరువాత డొమీనియన్లుగా ఘోషించిన దేశముల పేర్లకు డొమీనియన్ అను మాటను జతచేసివుండలేదు. అనేక దేశములు బ్రిటిష్ వలసరాజ్యముగా మారిన చరిత్ర చూడగా బ్రిటిష్ ప్రభుత్వము సరాసరి ఇతరదేశములను ముట్టడించి వలసరాజ్యములుగా చేసుకునివుండలేదు. బ్రిటిష్ దేశ ప్రజలు 15-16వ శతాబ్దమునుండి వృత్తిరీత్య, జీవనాధారము రీత్య ఇతరదేశములకు వలసపోయి అక్కడె స్థిరపడియుండినవారికి వారిదేశీయుల రక్షణ, సంక్షేమముల కొరకు బ్రిటిష్ ప్రభుత్వము ఆయాదేశములలో పరిపాలనా యంత్రాంగములను స్థాపించి (colonies) క్రమేణ ఆ దేశములను వలసరాజ్యములుగా పరిగణించారు. బ్రిటిష్ ప్రజలు ఇతరదేశములకు వలసకు పోయినవారిని బ్రిటిష్ ప్రభుత్వము వారు వారి రాజప్రతినిధులను పంపి క్రమేణారాజ్యపాలనాధికారములు చేపట్టి ఆ దేశములను పరిపాలించుటకు సైనిక సహాయంతో గవర్నర్లను నియమించి సుస్థిర వలసరాజ్యములు స్థాపించారు. పైనచెప్పిన దేశములు భారతదేశముకన్నాచాల ముందుగనే బ్రిటిష్ వలసరాజ్యములుగా నుండిన దేశములు. అవి 19-20 శతాబ్దములలో అధినివేశ స్వరాజ్యాములుగా అయినవి. 1940 నాటికి ఇండియా పాకిస్తాన్ కూడా అదినివేశ స్వరాజ్యములుగ పరిగణింప బడినవి.

అధినివేశ ప్రతిపత్తిలు మార్చు

1926 లో సమావేశమైన బ్రిటిష్ సామ్రాజ్యసభ (Imperial Conference) వారి తీర్మానమునందును, 1931 సంవత్సరపు వెస్టుమినిస్టర్ చట్టమునందును వివరించబడిన అదినివేశస్వరాజ్యములయొక్క లక్షణములు ఉల్లేఖన [2]
(1) "బ్రిటిష్ దీవులును, అధినివేశ ప్రతిపత్తిలు ఆంగ్లరాజుయొక్క మకుటమునెడల భక్తిమాత్రముచేతనే సంశ్లిష్టత గలిగి యుందురు". బ్రిటిష్ దీవులును, అధినివేశ ప్రతిపత్తిలు సామ్రాజ్యములో సరిసమానమైన భాగములు
(2) "తమ ఆంతరంగిక వ్యవహారమందుగాని విదేశ వ్యవహారములందుగాని ఏవిధముగను ఒకదాని కింకొటి లోబడవలసిన పనిలేదు"
(3) "ఇవి స్వపరిపాలన గల జన సమూహములు"
(4) "సామ్రాజ్యమునందు స్వపరిపాలనముగల ప్రతి రాజ్యాంగమును తన పరిణామమునకు తానే కర్త. స్వరూపము గాకపోయినను స్వభావమునుబట్టి దాని కెట్టి నిర్బంధమును లేదు".

పై చెప్పిన లక్షణములకలిగిన స్వరాజ్యములు అధినివేశ స్వరాజ్యములు. వాటియొక్క రాజ్యాంగ విధానము బ్రిటిష్ దీవులలో గల ప్రజాప్రభుత్వములాంటివే. భారతదేశము 1931లో అధినివేశ స్వరాజ్యమైయుంటే పార్లమెంటు అను ప్రజాప్రభుత్వ సంస్థ నెలకొనియుండి బ్రిటిష్ రాజ్యప్రతినిధిగానున్న గవర్నర్ జనరల్ (వైస్రాయి) బ్రిటిష్ సార్వభౌముని రాజరికమునకుచిహ్నముగా కొనసాగుతూనుండెడివాడు.

బయటి లింకులు మార్చు

https://en.wikipedia.org/wiki/Dominion_of_India

మూలాలు మార్చు

  1. Macropedia Britannica vol 15th Edition(1984). Indian Sub-continent.Vol 9. pp 412.
  2. 2.0 2.1 2.2 "అదినివేశ స్వరాజ్యము" దిగవల్లి వేంకట శివరావు, చెరుకుపల్లి వెంకటప్పయ్య (1933) విజ్ఞానచంద్రికామండలి ప్రచురణ 40. ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ
  3. "The British Rule in India" D.V. Siva Rao(1938) ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షర శాల బెజవాడ. పుట 401