యర్రమల కొండప్ప అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు.

యర్రమల కొండప్ప
యర్రమల కొండప్ప విగ్రహం
జననం1867
India అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం1971 మార్చి 24(1971-03-24) (వయసు 104)
వృత్తిరాజకీయాలు
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధుడు, హరిజనోద్ధారకుడు, దాత
మతంహిందూ
తండ్రిఎర్రమల వెంకటప్ప
తల్లిసుబ్బమ్మ

జీవిత విశేషాలు మార్చు

ఇతడు మధ్య తరగతి రైతు కుటుంబానికి చెందినవాడు. రెండవ తరగతి వరకు చదువుకున్నాడు. ఇంటిలో తగాదాపడి బయటకు వచ్చి పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరాడు. 1902లో లోకమాన్య తిలక్ బెంగళూరు నుండి బొంబాయికి రైలులో వెళ్తూ గుంతకల్లు స్టేషన్‌లో ప్రజలనుద్దేశించి చేసిన ఉపన్యాసం విని ఇతడు ప్రభావితుడై తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తిలక్ ఉద్యమంలో పాల్గొన్నాడు.

1921లో మహాత్మాగాంధీ తాడిపత్రికి వచ్చినప్పుడు అతని వెన్నంటే ఉన్నాడు. సహాయ నిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. బ్రిటీషుప్రభుత్వము ఇతనికి జైలు శిక్ష విధించి, బళ్ళారిజైలులో నిర్బంధించింది. ఆ జైలులో గదర్ పార్టీ వ్యవస్థాపకుడు పృథ్వీసింగ్ ఆజాద్ (1892-1989), హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్‌కు చెందిన గయాప్రసాద్ కటియార్ (1900–1993) లతో ఇతనికి పరిచయం ఏర్పడింది. ఎర్రమల కొండప్ప తపన, అంకిత భావము, దేశ సేవగురించి తప్ప వేరే ఏ ఆలోచన లేకపోవడం, స్వచ్ఛత వల్ల పృథ్వీసింగ్, గయాప్రసాద్ లకు చాలా ఇష్టుడు అయినాడు. వారు ఇతనికి “ కపాస్ ” బాంబులు చేయడం నేర్పించారు. అయితే గాంధీజీ అహింసా సిద్ధాంతం పట్ల అచంచల విశ్వాసంగల ఎర్రమల కొండప్ప ఆ ప్రక్రియను ఉపయోగించలేదు.[1]

ఇతడు ఊరి బయట చేనులో గుడిసె వేసుకుని ప్రత్తి పండించి, నూలువడికి సరఫరాచేశాడు. గాంధీ హరిజన ఉద్యమం ప్రారంభించక ముందే ఇతడు తన తోట దగ్గర ఉన్న మిస్సమ్మ బంగ్లాలో ఉన్న హరిజన బాలికలకు నీటి వసతి కల్పించాడు. ఆసుపత్రిలో ఒక స్త్రీ కొడుకును కని మరణిస్తే ఆ బిడ్డను పెంచి పెద్దచేశాడు. 1930 మార్చిలో ఉప్పుసత్యాగ్రహము ప్రారంభమైంది. “ సముద్రము అందుబాటులో లేనివారు ఎక్కడికక్కడ వున్న అవకాశాలను ఉపయోగించుకొని ఉప్పు తయారు చేసుకోవచ్చు” అని ఉద్యమంలో ఒక సడలింపు ఇచ్చారు. బ్రిటీషు ప్రభుత్వం ఉప్పు తయారును నిషేధించింది. ఆ నిషేధాన్ని ధిక్కరించి అనంతపురం ఇంజనీరింగు కాలేజీ సమీపంలోని బంజరు భూమిలోని ఉప్పుమన్ను తెచ్చి తన తోటలో ఆ మట్టిని ఒడగట్టి తేటతెల్లని ఉప్పును తయారు చేసి బహిరంగంగా పొట్లాలు కట్టి ఆ ఉప్పును ఉద్యోగస్తులకు, బజార్లు తిరిగీ అమ్మాడు. ఆ విధంగా ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్న మొట్టమొదటి వ్యక్తి జిల్లాలో ఇతడే. ఉప్పు అమ్ముతున్న 65 ఏళ్ళు పైబడ్డ వృద్ధుడైన ఎర్రమల కొండప్పను అరెస్టు చేయడానికి పోలీసులే సిగ్గుపడి అరెస్టు చేయలేదు.

1934లో గాంధీ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తన రెండు ఎకరాల భూమిని హరిజనోద్ధరణ కోసం గాంధీగారికి దానం చేశాడు. కేశవ విద్యానికేతన్ పేరుతో హరిజన హాస్టల్‌ను నిర్మించాడు. తన 50 ఎకరాల ఆస్తిని అమ్మివేసి ఆ ధనం మొత్తాన్ని దానధర్మాలకు వినియోగించాడు. తన స్వంతమైన 40 జతల ఎద్దులను కూడా దానం చేశాడు. ఆమరణాంతం గాంధేయవాదిగా ఉన్న కొండప్ప 1971, మార్చి 24వ తేదీన తన 104వ యేట మరణించాడు.[2]

మూలాలు మార్చు

  1. విద్వాన్ దస్తగిరి. "అంబేద్కర్ భవన్ ,కేశవ విద్యానికేతన్ స్థలదాత ఎవరో తెలుసా?". రాయలసీమ ఇన్ఫో. Archived from the original on 9 సెప్టెంబరు 2021. Retrieved 9 September 2021.
  2. స్వాతంత్ర్య యోధుడు ఎర్రమల కొండప్ప - అనంతనేత్రం - వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక సంచిక - పేజీ 137