కొమ్మమూరు కాలువ
కొమ్మమూరు కాలువ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా లోని దుగ్గిరాల నుండి బాపట్ల జిల్లా, పెదగంజాం వరకు ప్రవహించే పంట కాలువ. [1] దీన్ని బ్రిటిషు వారు, 19 వ శతాబ్దంలో తవ్వారు. దీని పొడవు 91 కిలోమీటర్లు. ఒకప్పుడు ఇది నౌకా రవాణా మార్గంగా విలసిల్లింది. కాకినాడ నుండి మద్రాసు (చెన్నై) వరకు ఉన్న జల మార్గం లోని కాలువల్లో ఇది ఒకటి. మిగతావి కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, బకింగ్హాం కాలువ. భారత ప్రభుత్వం చేపట్టిన జాతీయ జలమార్గాల ప్రాజెక్టు లోని జలమార్గం 4 లో కొమ్మమూరు కాలువ ఒక భాగం.
కొమ్మమూరు కాలువ | |
---|---|
![]() దుగ్గిరాల వద్ద కొమ్మమూరు కాలువ మొదలైన చోటు | |
విశేషాలు | |
పొడవు | 113 km (70 miles) (ఒరిజినల్గా 91 km or 57 mi) (బ్యారేజి నుండి దుగ్గిరాల వరకు ఉన్న కాలువను కూడా కొమ్మమూరు కాలువ గానే వ్యవహరించడంతో కాలువ పొడవు పెరిగింది.) |
లాకులు | 7 |
భౌగోళికం | |
మొదలైన స్థానం | దుగ్గిరాల |
ముగిసిన స్థానం | పెదగంజాం |
మొదలైన స్థానపు నిర్దేశాంకాలు | 16°19'58.1"N 80°37'51.1"E |
ముగిసిన స్థానపు నిర్దేశాంకాలు | 15°38'47.4"N 80°13'22.7"E |
శాఖలు | చిన్న శాఖలు చాలానే ఉన్నాయి |
ఇది దేనికి శాఖ | కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ |
వీటిని కలుపుతుంది | కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ బకింగ్హామ్ కాలువ |
1855 లో కృష్ణా బ్యారేజిని నిర్మించిన [2] తరువాత ఈ కాలువ నిర్మాణం పూర్తైంది. సాగునీటిని అందించడంతో పాటు, నౌకా రవాణా మార్గంగా కూడా ఇది ఉపయోగపడింది.
నిర్మాణ చరిత్ర సవరించు
కొమ్మమూరు కాలువ నిర్మాణం కృష్ణా బ్యారేజీ నిర్మాణాని కంటే ముందే మొదలైంది. అయితే ఈ పని అంత వేగంగా సాగలేదు. 1858-59 సంవత్సరంలో ఈ కాలువపై 38,100 రూపాయలు ఖర్చుపెట్టారు. 1877 నాటికి కాలువ నిర్మాణం పూర్తై, పెద్దగంజాం వద్ద బకింగ్హాం కాలువను కలిసింది. దానితో మద్రాసుకు జలమార్గం ఏర్పడింది. దుగ్గిరాల నుండి పదగంజాం వరకు ఈ కాలువ పొడవు 91 కి.మీ. [3]
బ్యారేజి నిర్మాణానికి ముందే, కొమ్మమూరు కాలువ నిర్మాణానికి ముందే బ్యారేజీ ప్రాంతం నుండి సహజంగా ఏర్పడిన తుంగభద్ర వాగు ఉండేది. ఈ వాగునే బ్యారేజి నుండి కుడి ప్రధాన కాలువగా మార్చారు. కొమ్మమూరు కాలువ కూడా దుగ్గిరాల నుండి సంగం జాగర్లమూడి వరకు తుంగభద్ర కాలువే. అక్కడి నుండి కొమ్మమూరు కాలువ విడిపోయి చేబ్రోలు దిశగా సాగిపోతుంది. ఈ కాలువల నిర్మాణ పురోగతిపై 1861 లో కెప్టెన్ ఛాంబర్స్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో, కొమ్మమూరు కాలువ సంగం జాగర్లమూడి నుండి 20 మైళ్ళ పొడవు ఉందని రాసాడు. [4] క్రమేణా కొమ్మమూరు కాలువ ఉద్భవ స్థానం దుగ్గిరాల అని, తుంగభద్ర కాలువ (వాగు) పుట్టినది సంగం జాగర్లమూడి అని వ్యవహారం లోకి వచ్చింది.
కొమ్మమూరు కాలువ ఉద్భవించినది దుగ్గిరాల లోనే అయినప్పటికీ, దీని ఉద్భవ స్థానం బ్యారేజీ వద్దనే అని వివిధ రచనల్లో వార్తాపత్రికల్లో రాస్తూ ఉంటారు. మధ్యలో ఉన్న పశ్చిమ ప్రధాన కాలువను ప్రస్తావించరు. కాకినాడ - పాండిచ్చేరి జలమార్గాన్ని నిర్వచించేటపుడు, జాతీయ జలమార్గం 4 ను నిర్వచించేటపుడూ కూడా అలాగే రాసారు. ఉదాహరణకు, భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ జలవనరుల సమాచార వ్యవస్థ వారు కూడా తమ వెబ్సైటులో అలాగే రాసారు. [5] ఆ విధంగా చూస్తే ఈ కాలువ పొడవు 113 కి.మీ. ఉంటుంది.
కాలువ మార్గం సవరించు
కొమ్మమూరు కాలువ ను ఓపెన్స్ట్రీట్మ్యాప్లో చూడండి |
---|
విజయవాడ వద్ద కృష్ణా బ్యారేజి వద్ద నుండి బయలుదేరిన పశ్చిమ ప్రధాన కాలువ, 20 కిలోమీటర్ల దూరం లోని దుగ్గిరాల లాకుల వద్ద మూడుగా చీలుతుంది. వాటిలో ఒకటి కొమ్మమూరు కాలువ కాగా, రెండవది నిజాంపట్నం కాలువ, మూడవది పశ్చిమ గట్టు కాలువ. [1] [6] దుగ్గిరాల లాకుల వద్ద మొదలైన కొమ్మమూరు కాలువ, సంగం జాగర్లమూడి, చేబ్రోలు, కొల్లిమర్ల, నర్సాయపాలెం, కారంచేడు, సంతరావూరు ల గుండా పెదగంజాం చేరుతుంది. పెదగజాం వద్ద ఇది బకింగ్హాం కాలువతో కలుస్తుంది. కొమ్మమూరు కాలువ పంటకాలువ కాగా, బకింగ్హాం కాలువ ఉప్పునీటి కాలువ. ఈ రెండు కాలువలతో పాటు, ఏలూరు కాలువ, కాకినాడ కాలువ, భద్రాచలం వద్ద నుండి ధవళేశ్వరం వరకూ ఉన్న గోదావరి, తెలంగాణ లోని వజీరాబాదు నుండి ప్రకాశం బ్యారేజి వరకు ఉన్న కృష్ణా నది - ఈ ఆరింటినీ కలిపి జాతీయ జలమార్గం 4 గా రూపొందించారు. ఈ కాలువపై దుగ్గిరాల, సంగం జాగర్లమూడి, కొల్లిమర్ల, నర్సాయపాలెం (నల్లమడ), సంతరావూరు, పెదగంజాం మొదలైన చోట్ల లాకులు ఉన్నాయి. [5]
రవాణా, సాగు నీటి సౌకర్యాలు సవరించు
రాజమండ్రి వద్ద గోదావరి నదిపై రైలు వంతెన 1893 లో నిర్మాణమైంది. విజయవాడ మద్రాసు మధ్య రైలుమార్గం 1899 లో సిద్ధమైంది. ఆ తరువాతనే రైలు సౌకర్యం వచ్చింది. అప్పటి వరకు ఈ ప్రాంత వాసులకు ఈ కాలువలే ప్రధానమైన రవాణా సౌకర్యంగా ఉండేవి. [7] సింగరేణి బొగ్గు గనుల నుండి మద్రాసుకు రవాణా అయ్యే బొగ్గు ఈ కాలువ గుండానే వెళ్ళేది. 1896-97 సంవత్సరంలో 33,325 టన్నుల బొగ్గు రవాణా అయింది. [8] 1960 ల వరకు కాలువలో రవాణా జరుగుతూ ఉండేది. ఆ తరువాత రోడ్డు రవాణా, రైలు రవాణా అభివృద్ధి చెందడంతో ఈ కాలువ నిర్లక్ష్యానికి గురైంది.
మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ జలమార్గాల్లో భాగంగా 2016 లో ఈ కాలువను అభివృద్ధి చెయ్యాలనే ప్రతిపాదనలు వచ్చాయి. జలరవాణాకు అనుకూలంగా ఉండాలంటే ఈ కాలువ ఉపరితల వెడల్పు 120 మీటేర్లు, అడుగున 40 మీటర్ల వెడల్పూ ఉండాలి. విజయవాడ నుండి దుగ్గిరాల వరకు కాలువ కొలతలు బాగానే ఉన్నప్పటికీ, ఆ తరువాత వెడల్పు తగ్గిపోతూ వచ్చింది. దుగ్గిరాల నుండి కొల్లిమర్ల లాకుల వరకూ అడుగున 40 మీ. వెడల్పు ఉందిగానీ, పైన వెడల్పు తగ్గిపోయింది. కొల్లిమర్ల తరువాత పెదగంజాం వరకు పైనా అడుగునా రెండుచోట్లా వెడల్పు తగ్గిపోయింది. కొన్నిచోట్ల లోతు కూడా తగ్గిపోయింది. రవాణాకు అనుగుణంగా కాలువను వెడల్పు చెయ్యాల్సిన అవసరం ఉంది. [9]
1897-98 నాటికి కొమ్మమూరు కాలువ కింద 91,162 ఎకరాల ఆయకట్టు ఉండేది. [10] ప్రస్తుతం దీని కింద 2.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. [11] అయితే నిర్వహణ సరిగ్గా జరక్క కాలువ దెబ్బతినడంతో సాగుకు సరిపడా నీరు అండడం లేదు. తుఫాన్లు, వరదల కారణంగా గట్లు దెబ్బతిన్నాయి. గండ్లు పడడం సాధారణమై పోయింది. [12][13] ప్రధాన కాలువకు మరమ్మత్తులు చెయ్యడంతో పాటు, దాని నుంఛి నీటీని తీసుకుపోయే 50 చిన్న కాలువలకు కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. కాలువలో పూడిక తీయాల్సి ఉంది. తూటికాడను తొలగించాల్సి ఉంది. దానితో పాటు కాలువపై ఉన్న వంతెనల వంటి అనేక నిర్మాణాలకు మరమ్మత్తులు చేయాల్సి ఉంది. [14][15]
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 Vijñānasarvasvamu. Vol. 4. తెలుగు భాషాసమితి. 1959. p. 1323.
- ↑ మాదల వీరభద్రరావు (1957). ఆంధ్రప్రదేశ్ జలవిద్యుత్ ప్రాజెక్టులు.
- ↑ మెకెంజీ, గార్డన్ (1883). ఎ మాన్యువల్ ఆఫ్ ది కృష్ణా డిస్ట్రిక్ట్ (PDF). మద్త్రాసు: మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం. p. 264.
- ↑ వాల్ష్, జార్జి (1899). ది ఇంజనీరింగ్ వర్క్స్ ఆఫ్ కృష్ణా డెల్టా (PDF). Vol. 1. మద్రాసు: మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం. pp. 96, 97.
- ↑ 5.0 5.1 "national_waterways-4 - INDIA WRIS WIKI". indiawris.gov.in. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ "PRAKASAM BARRAGE". irrigationap.cgg.gov.in. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ Muthiah, S. (2013-10-27). "Passengers on the Canal..." The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ వాల్ష్, జార్జి (1899). ది ఇంజనీరింగ్ వర్క్స్ ఆఫ్ కృష్ణా డెల్టా (PDF). Vol. 1. మద్రాసు: మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం. p. 142.
- ↑ "జల రవాణాకు మోక్షమెన్నడో." ఈనాడు (గూగుల్ కాషె నుండి వెలికి తీసిన పేజీ). 2021-05-10. Archived from the original on 2022-06-28. Retrieved 2021-06-28.
- ↑ వాల్ష్, జార్జి (1899). ది ఇంజనీరింగ్ వర్క్స్ ఆఫ్ కృష్ణా డెల్టా (PDF). Vol. 1. మద్రాసు: మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం. p. 140.
- ↑ "షట్టర్లు శిథిలం". Sakshi. 2014-09-28. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ "జల విపత్తు". Sakshi. 2013-10-26. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ "కొమ్మమూరు..కన్నీరు!". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2020-11-23. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ "కొమ్మమూరు..కన్నీరు". Sakshi. 2017-03-14. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ "కొమ్మమూరు కాలువకు మరమ్మతులు చేయండి". ప్రజాశక్తి. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.