జి.ఎస్.మేల్కోటే

స్వాతంత్ర సమరయోధులు, వైద్యులు మరియు పరిపాలనా దక్షులు
(గోపాల సుబ్బుకృష్ణ మేల్కోటే నుండి దారిమార్పు చెందింది)

జి.ఎస్.మేల్కోటే, గా ప్రసిద్ధిచెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు, పరిపాలనా దక్షులు. ఇతను సుబ్బుకృష్ణ దంపతులకు ఒడిషా రాష్ట్రంలోని బరంపురంలో 1901 అక్టోబరు 17 విజయ దశమి రోజున జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎం.ఎస్ పరీక్షలో 1927లో మొదటి తరగతిలో మొదటివారుగా ఉత్తీర్ణులై బంగారు పతకం అందుకున్నాడు. దేశీయ వైద్య విధానాన్ని, యోగాసనాల ప్రభావాన్ని జోడించి ఉత్తమ వైద్యులుగా ఖ్యాతిపొందాడు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, హైదరాబాదు అధ్యక్షులుగా పనిచేశాడు. ఇతను పతంజలి యోగ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించాడు.

గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే
గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే (1952 మేలో)
జననం1901 అక్టోబర్ 17
ఒడిషా రాష్ట్రంలోని బరంపురం
మరణం1982 మార్చి 10
ఇతర పేర్లుజి.ఎస్.మేల్కోటే
వృత్తిఇండియన్ మెడికల్ అసోసియేషన్, హైదరాబాదు అధ్యక్షులు
హైదరాబాదులోని ఐ.ఎన్.టి.యు.సి. శాఖకు అధ్యక్షులు
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు
పదవి పేరుపార్లమెంట్ సభ్యులు హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
పదవీ కాలం1962 నుండి 1977
మతంహిందూ
భార్య / భర్తవిమలాబాయి
తండ్రిసుబ్బుకృష్ణ

ఇతను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. 1916లో స్వదేశీ ఉద్యమంలో మొదటిసారిగా పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం వద్ద, కర్ణాటక రాష్ట్రంలోనూ ఉప్పు తయారుచేసి పోలీసులచే నిర్బంధితులై హింసలకు గురయ్యాడు. కరాచీ కాంగ్రెస్ లో హైదరాబాదు ప్రతినిధిగా 1931 లో పాల్గొన్నాడు. హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ సభ్యులై 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1947, ఆగస్టు 15 న జాతీయ స్వాతంత్ర్యం సందర్భంగా భారత జాతీయ పతాకాన్ని హైదరాబాదులో ఎగురవేయటకు ప్రయత్నించి నిజాం ప్రభుత్వం చేత జైల్లో నిర్బంధించబడ్డాడు. పోలీసు చర్య అనంతరం విడుదలయ్యాడు.

స్వతంత్ర భారతదేశంలో ఇతను ఎన్నో బాధ్యతాయుత పదవులు నిర్వహించాడు. హైదరాబాదు శాసనసభలో 1952 నుండి 1956 వరకు సభ్యులై మొదట ప్రజా పనుల శాఖలో తర్వాత ఆర్థిక శాఖలో మంత్రి పదవి నిర్వర్తించాడు. ఇతను ముషీరాబాదు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో రాయచూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. 1962 నుండి 1977 వరకు భారత పార్లమెంటు సభ్యుడిగా హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. భారత ప్రభుత్వ పతినిధిగా ఆగ్నేయాసియా ప్రాంతీయ ప్రపంచారోగ్య వ్యవస్థా మహాసభ, కామన్ వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లలో పాల్గొన్నాడు. హైదరాబాదులోని ఐ.ఎన్.టి.యు.సి. శాఖకు అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశాడు.

ఇతను భార్య విమలాబాయి కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంది.వీరి మాతృభాష కన్నడం అయినా వీరు ఆంధ్రదేశానికి చేసిన సేవ గణనీయం. ఇతను 1982 మార్చి 10 వ తేదీన పరమపదించారు.

మూలాలు మార్చు