చర్చ:గోరా
ఒడిషా రాష్ట్రం గంజుం జిల్లాలోని ఛత్రపురంలో 1902, నంబర్ 15న వెంకటసుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు గోరా జన్మించారు. పర్లా కిమిడిలో ప్రాథమిక వి ద్యాభాసం పూర్తిచేసిన ఆయన 1913లో పిఠాపురం రాజా కాలేజి హైస్కూల్లో చదివారు. 1920లో పి.ఆర్. కాలేజ్లో ఇంటర్ పూర్తిచేసిన గోరా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభంలో ఆ ఉద్యమంలోకి వెళ్లారు. 1922లో మద్రాసు ప్రెసిడెన్షి కళాశాలలో వృక్షశాస్త్రంలో బిఏ చేశారు. తర్వాత మధురలోని మిషన్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. కోయంబత్తూరు వ్యవసాయ కళాశాలలో కాటన్ రీసెర్చ్ అసిస్టెంట్గా, తర్వాత కొలంబోలోని ఒక కళాశాలలో బయాలజీ అధ్యాపకునిగా, 1928లో కాకినాడ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. తాను నడిచే మార్గం తండ్రికి ఇష్టం లేకపోవడంతో 1928లో భార్యపిల్లలతో ఇంటిని వదిలేసి వచ్చాడు. ఉప్పు సత్యాగ్రహ కాలంలో తనకు పుట్టిన బిడ్డకు లవణం అని నామకరణం చేశారు. తర్వాత సంతానానికి సమరం, నియంత, విజయం తదితర పేర్లను గోరా తమ పిల్లలకు పెట్టుకున్నారు. గోరా సతీమణి సరస్వతి గోరా కూడా భర్త అడుగుజాడల్లో నడిచారు. స్వతంత్ర భావాలుగల గోరా ఎక్కడా ఉద్యోగంలో నిలువలేకపోయాడు. 1940, ఆగస్టు 10న కృష్ణా జిల్లా ముదునూరులో ప్రపంచంలోని మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని 80 మంది యువకులతో గోరా ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రారంభంతో గోరా జీవితంలో నూతన అధ్యాయం మొదలైంది. 1940 నుంచి 1944 వరకు అక్షరాస్యత, అస్పృశ్యత, సహపంక్తి భోజనాలు వంటి ఉద్యమాలు మడనూరు చుట్టుపక్కల నిర్వహించారు. 1944లో గాంధీ కోరికమేర అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్గా అలహాబాద్, ఢిల్లిలో పనిచేశారు. 1947 ఏప్రిల్లో తన కార్యాలయాన్ని విజయవాడలోని పడమటకు మార్చారు. స్వాతంత్య్ర సమరయోధునిగానేకాక, సాంఘిక, ఆర్థిక సమానత్వ సాధనకు, మూఢ నమ్మకాల నిర్మూలనకు, ప్రజల్లో శాస్త్రీయ దృష్టిని పెంపొందించడానికి, వయోజన విద్యా వ్యాప్తికి, కుల, మత తత్వాల నిర్మూలనకు అనితర కృషి గోరా సల్పారు. మహాత్మాగాంధీతో నాస్తికత్వంపై చర్చలు జరిపి, అస్పృశ్యతా నిర్మూలన కోసం కృషి చేసారు. దళితుల దేవాలయ ప్రవేశాన్ని, సమిష్టి భోజనాలను, వివాహాలను విస్తృతంగా ఆయన నిర్వహించారు. ఈ విధంగా సాంఘిక సమానత్వ సాధనకు పెద్దఎత్తున కృషి చేయడమేకాక నాస్తికత్వాన్ని నిర్మాణాత్మక జీవిత విధానంగా ప్రతిపాదించారు. దైవకేంద్ర సమాజం నుంచి మానవ కేంద్రం సమాజంవైపు పురోగమించడానికి మతానంతర సామాజిక వ్యవస్థ నిర్మాణానికి ఆయన ఎంతగానో తపించారు. 1949, జనవరి 30న గోరా సంపాదకత్వంలో 'సంఘం' తొలి సంచిక వెలువడింది. ఆ తరువాత గాంధీ పేరుతో సంఘం స్థాపించాడు. 1962-63లో భారతదేశమంతా పర్యటించి పార్టీ రహిత ప్రజాస్వామ్యం, నిరాడంబరత్వం గురించి విశేష ప్రచారం చేశాడు. పార్టీరహిత ప్రజాస్వామ్య సిద్ధాంతంపై ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులను ఒకే వేదికపైకి తెచ్చి కామన్ ప్లాట్ఫారం పద్ధతి ప్రవేశపెట్టిన ఘనత గోరాదే. సెక్యులర్ వ్యవస్థతో పాటు నాస్తికత్వ వ్యాప్తికీ గోరా ఐదు ఖ ండాలలో విస్తృతంగా పర్యటించారు. స్వంత ఆస్తి అనేది లేకుండా, పూర్తిగా ప్రజలపై ఆధారపడి తన కార్యక్రమాలు కొనసాగించారు. 1968 జనవరిలో 'ది ఏథిస్ప్' అనే ఇంగ్లీషు మాసపత్రిక ప్రారంభించి అంతర్జాతీయ సంబంధాలు పెంచుకున్నారు. 1972లో విజయవాడలో మొట్టమొదటి ప్రపంచ నాస్తిక మహాసభలను నిర్వహించారు. అదేవిధంగా 1980లో రెండవ ప్రపంచ నాస్తిక మహాసభలు కూడా విజయవాడలో నిర్వహించగా, 3వ ప్రపంచ నాస్తిక మహాసభలు ఫిన్లాండ్ రాజధాని హెల్పింక్లో నిర్వహించారు. 1975, జూలై 26న విజయవాడలో భారత గ్రామీణ సమాజంలో మార్పులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై ప్రసంగిస్తూనే గోరా తుదిశ్వాస వదిలారు