చెలికాని రామారావు

స్వాతంత్ర్య సమర యోధుడు
(చెలికాని వెంకటరామారావు నుండి దారిమార్పు చెందింది)

చెలికాని వెంకట రామారావు (జులై 15, 1901 - సెప్టెంబరు 25, 1985) (ఆంగ్లం:Chelikani Ramarao) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది, సోషలిస్టు. 20 వ శతాబ్దపు భారతదేశ చరిత్రలోని ఉజ్వల అధ్యాయాలకు ప్రతీకగా నిలుస్తారు. మానవత, నిజాయితీ, వినమ్రత, విస్పష్టమైన నిబద్ధత మొదలైన విశిష్ట లక్షణాలతో ఆయన తన కాలంనాటి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. వివేకానందుని బోధనలు, బ్రహ్మ సమాజ ఉద్యమం, రఘుపతి వెంకటరత్నం గారి శిష్యరికం, స్వతంత్ర పోరాటం, జైలు జీవితం, హరిజనసేవ, స్త్రీ జనోద్దరణ, కమ్యూనిస్టు ఉద్యమం, పార్లమెంటు సభ్యత్వం, వైద్యసేవ మొదలైన అంశాలకు ఆయన ఒక వాహిక లాగా నిలవడమే గాక వాటిపై తనదైన ముద్ర వేశారు.

చెలికాని వెంకట రామారావు
చెలికాని రామారావు
జననంచెలికాని వెంకట రామారావు
జులై 15, 1901
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని కొందెవరం
మరణంసెప్టెంబరు 25,1985
రామచంద్రపురం
ఇతర పేర్లుచెలికాని రామారావు
వృత్తి1వ లోక్‌సభ సభ్యులు
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమర యోధులు
పదవి పేరు1వ లోక్‌సభ సభ్యులు
రాజకీయ పార్టీకమ్యూనిస్టు
భార్య / భర్తడాక్టర్ కమలమ్మ
తండ్రినారయణస్వామి,
తల్లిసూరమ్మ

జీవిత విశేషాలు మార్చు

ఈయన జులై 15, 1901లో నారాయణస్వామి, సూరమ్మ దంపతులకు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని కొందెవరంలో జన్మించారు. సంఘ సంస్కరణోద్యమాలు, సాయుధ విప్లవోధమాలు జరుగుతున్న తూర్పుగోదావరి జిల్లాలోణి అద్వితీయమైన వాతావరణం ప్రభావం బాల్యం నుండే ఆయన పై చెరగని ముద్ర వేసింది. ముఖ్యంగా పిఠాపురం రాజావారి వ్యక్తిత్వం చిన్నతనంలోనే రామారావును విశేషంగా ఆకట్టుకుంది. రాజావారి సహాయం తోనే రామారావు ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు రాసి ఉన్నత పాఠశాలలో ప్రథముడిగా ఇలిచాడు ఉన్నత పాఠశాల జీవితం లోనే స్వదేశీ ఉద్యమం వైపు మొగ్గు చూపిన రామారావు కాలేజీ చదువుకోసం కాకినాడ వెళ్ళేనాటికి థియోసాఫికల్ సొసైటీ కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యారు. దేశం పరిపాలనలో మగ్గిపోతుంటే సుఖంగా కూర్చుని చదువుకోవడం సాంఘిక ద్రోహమని 1921, జనవరి 26న చదువుకు స్వస్తి చెప్పి ఇల్లొదిలి విశాలమైన ప్రజా జీవితం లోకి ప్రవేశించారు. జాతీయ ఉద్యమంలో చేరాడు. 1922లో రాజమండ్రిలో మొదటిసారి జైలు శిక్షను అనుభవించాడు. 1924లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రేసు మహాసభలో వాలంటరీ కమాండర్ గా పనిచేసాడు. 1926-30 నిజాం సంస్థానంలో M&S చదివి, అక్కడి, సంస్కరణోద్యమాలతో సంబంధాలు నెలకొల్పాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. 1931లో డాక్టరు డిగ్రీ పట్టా పొందారు.తరువాతి రోజుల్లో సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు ఆయనను బాగా ఆకర్షించాయి. తెలుగునాట సాంఘిక విప్లవానికి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాయకత్వం వహించిన కందుకూరి వీరేశలింగం పంతులు కూడా ఆయనను ఎంతగానో ప్రభావితం చేశారు. 1934 లో కందుకూరి దగ్గర పెరిగిన డాక్టర్ కమలమ్మను రామారావు గారు కులాంతర వివాహం చేసుకున్నారు. కాకినాడలో వైద్యవృత్తిని నిర్వహించాడు. ఇంకా జిల్లా హరిజన సంఘ అధ్యక్షులుగా 1935 లో వ్యవహరించాడు. ఈయన డాక్టరుగా 1937 నుండి రంగూన్లో ఉన్నాడు. 1948-1952లలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము ప్రకారం అరెస్టు కాబడి, కడలూరు జైలులో శిక్ష అనుభవించాడు. 1952లో కాకినాడ పార్లమెంటు సభ్యునిగా తొలి లోక్‌సభకు సి.పి.ఐ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా) అభ్యర్థిగా ఎన్నికైనాడు. 1957, 1962లలో తిరిగి కాకినాడ నియోజకవర్గము నుండి సి.పి.ఐ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీచేసినా గెలుపొందలేదు. రామారావు 84 సంవత్సరాల నిండైన సార్థక జీవితాన్ని గడిపి సెప్టెంబరు 25, 1985న దివంగతులైనాడు.

కమ్యూనిష్టు వాదిగా మార్చు

తాను నమ్మిన ఆశయాలను మనసా వాచా కర్మణా ఆచరించి తరువాత తరాలకు ఆదర్శప్రాయుడైన మహానుభావుడు ఆయన. తన దగ్గర వైద్యం చేయించుకున్న బీదసాదల నుంచి ఏవిధమైన రుసుమూ తీసుకోకుండా ఖర్చులకోసం తిరిగి వారికే కొంత డబ్బు ముట్టచెప్పేవారు. మూర్తీభవించిన సౌజన్యంతో జీవితంలో కడదాకా కష్టజీవుల అభ్యున్నతికోసం కృషిచేసిన డాక్టర్ రామారావు గారు చరిత్రలో ఒక "లిజెండరీఫిగర్"గా నిలిచిపోతారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహాత్మా గాంధీ ఆయనను బాగా ఆకర్షించారు. ఆయన ప్రభావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన డాక్టర్ రామారావు గారి జీవితంలో సంభవించిన విప్లవ పరిణామక్రమంలో చివరకు ఆదర్శ కమ్యూనిస్టుగా మారారు.

స్వాతంత్ర్య పోరాటంలో.. మార్చు

1921 లో కాకినాడ కళాశాలలో చదువుతుండగా గాంధీజీ పిలుపునందుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పాఠశాలలు, కోర్టులు బహిష్కరిస్తూ సాగిన సత్యాగ్రహ ఉద్యమంలోకి ప్రవేశించారు. రామారావుగారు స్వతంత్ర పోరాటంలోకి దూకడం ఇంట్లో పెద్దవారికి యిష్టంలేదు. ఆ సందర్భంలో ఆయన సహాయ నిరాకరణోద్యమంలో పాలుపంచుకోవడానికి ఇల్లు విడిచి వెళ్ళిపోతూ వారి పెద్ద అన్నయ్యగారికి 25-1-1921 తేదీన రాసిన ఒక ఉత్తరంలోని ఈక్రింది భాగాలను గమనిస్తే డాక్టర్ చెలికాని చిత్తశుద్ధి, ఉద్యమంపట్ల వారి అవగాహన మనకు అర్ధమవుతాయి.

నేను ఎవరిదైనా ఉపన్యాసము వినికానీ, ఏదో వ్యాసము చదివి కానీ ఆలోచించకుండగ ఇందులో ప్రవేశించిన వాడనుకాదు. ఈ ఉద్యమము గూర్చి పరిశీలించగా క్రమముగా నాకు కలిగినదేకాని ఒకరు చెప్పినది కాదు....సహాయ నిరాకరణము దేశమంతటికి సంబంధించిన విషయము. జీవిత పరమావధిని గూర్చి తలచిన యెడల ఒక మహోద్యమమునకు మానవుని జీవితము సమర్పించుట బహుసార్ధకము. ...కష్టములు లేకుండా గొప్ప కార్యక్రములు సాధింపజాలము. ఈ కష్టములన్నియు ఇతరులమీద మోపుట తప్పు. ఎవరికివారు ధర్మమని తోచిన యెడల పూనుకొని పనిచేయవలెను.. ....నాకు డబ్బు అక్కరలేదు. రేపు పిఠాపురం నుండి రైలు మీద వెళ్ళుటకంటె నాశక్తి మీద ఆధారపడి నడచిపోవుట మంచిదగుటచే తెల్లవారుజామున బయలుదేరుచున్నాను.

—చెలికాని రామారావు

తన ఉద్యమ ప్రవేశం గురించి రామారావుగారు ఒక ఇంటర్ వ్యూలోఇలా చెప్పారు.

నేను 1921 జనవరి ఒకటవ తేదీన కాకినాడలో స్వతంత్ర పోరాటంలో చేరాను. అంతకుముందు ఏ నాయకులను కలువలేదు. ఏ సభలకు వెళ్ళలేదు. ఈ శతాబ్ద ప్రారంభం నుంచి 1921 వరకు జరిగిన విషయాలే నన్ను పురికొల్పాయి. ముఖ్యంగా వందేమాతరం ఉద్యమంలో జరిగిన సంఘటనల గురించి పెద్దవాళ్ళు చెప్పగా విన్న విషయాలూ, గాంధీ మహాత్ముడు శాంతియుతంగా సత్యాగ్రహ ఆయుధంతో మొదలుపెట్టిన పోరాటమూ నన్ను ఉత్తేజితుడ్ని చేశాయి.

—చెలికాని రామారావు

డాక్టర్ చెలికాని 1922 మార్చి నెలలో చట్టధిక్కరణ నేరానికి ఒక సంవత్సరం రాజమండ్రి జైలులో నిర్భంధించబడ్డారు. అక్కడ నీలకంఠ బ్రహ్మచారి అనే విప్లవకారునితో పరిచయమైంది.అతని ద్వారానే రామారావుగారు రష్యా విప్లవం గురించీ లెనిన్ గురించీ ముఖ్యమైన విషయాలెన్నో తెలుసుకున్నారు.

జైలు నుంచి విడుదలయ్యాక బులుసు సాంబమూర్తి, మొసలికంటి తిరుమలరావుగార్లతో కలిసి జిల్లా కాంగ్రెస్ సంఘం అభివృద్ధికి ఆయన ఎంతో కృషిచేశారు. ప్రభుత్వంవారు కాకినాడలో బంగారువారి సత్రంలో ఉండే పట్టణ కాంగ్రెస్ కార్యాలయాన్ని రూపుమాపి, ఎవరైనా కాంగ్రెస్ ఆఫీసుకు ఇల్లు ఇస్తే ఆ యింటి యజమానికి జైలు శిక్ష విధింపబడుతుందని దండోరా వేయించారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో శ్రీమతి పెద్దాడ కామేశ్వరమ్మ, వేదాంతం వెంకట కృష్ణయ్య మొదలైన వారితో కలసి రామారావుగారు ధైర్యంగా కాంగ్రెస్ ఆఫీసు తిరిగి ప్రారంభించారు. 1923 లో కాకినాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు మహాసభల ఆహ్వాన సంఘంలో ప్రధానమైన బాధ్యతలు నిర్వహించారు. 1925 నుంచి ఉదృతంగా ఖాదీ ప్రచారంలో కూడా పాల్గొన్నారు. జాతీయ దృక్పధంతో విద్యనేర్పాలనే ఉద్దేశంతో బందరులో స్థాపించబడ్డ జాతీయ కళాశాల నిధులకోసం చందాలు వసూలుచేశారు.

1930 లో హైదరాబాదు మెడికల్ కాలేజీలో చదువుతూ 15 రోజులలో పరీక్షలున్నా లక్ష్యపెట్టకుండా- కళాశాల వదలిపెట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమంలో బులుసు సాంబమూర్తి, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, మొసలికంటి తిరుమలరావు లతో కలిసి పనిచేశారు. 1930-31 శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని కాకినాడలో హిందూ స్థానీ సేవాదళ్ శిక్షణాశిబిరానికి కెప్టెన్ గా ఉండి చట్టధిక్కరణ నేరానికి తిరిగి ఒకటిన్నర సంవత్సరాలు రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. అప్పుడు బెంగాలీ డిటెన్యూలతో పరిచయం ఏర్పడింది. వారిదగ్గర కమ్యూనిస్టు మూలసూత్రాల గురించి వివరంగా తెలుసుకుని ఆ సిద్ధాంతాల వలన ఎంతో ప్రభావితులయ్యారు.

డా.రామారావు తూర్పు గోదావరి జిల్లాలో హరిజన ఉద్యమంలో కూడా ఎంతో చురుకుగా పనిచేశారు. 1935 నుంచి జిల్లా హరిజన సేవా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. జిల్లాలో మొట్టమొదటి హరిజన హాస్టల్ ను నిర్వహించారు. అప్పటిలో ఆయన మద్దూరి అన్నపూర్ణయ్య వంటి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి చెందిన ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగి వుండేవారు.

1939 లో సుభాస్ చంద్రబోస్ కాకినాడ వచ్చినప్పుడు గాంధీ అనుయాయులంతా ఆయన రాకను వ్యతిరేకించారు. అప్పుడు బోస్ సభకు రామారావు గారు హాజరై ఆసభ విజయవంతంగా జరిగేందుకు తోడ్పడ్డారు. తరువాత డాక్టర్ చెలికాని కమ్యూనిస్టుగా మారి రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. 1940 లో రామచంద్రపురంలో వైద్య వృత్తిలో స్థిరపడి ప్రజాసేవ చేస్తూ దీనజన బాంధవుడిగా పేరుపొందారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వంటి ప్రముఖ నాయకులెందరో రామారావుగారి యింట్లో ఆశ్రయం పొందారు. అనేకమంది పార్టీ ముఖ్యులు నెలల తరబడి వైద్యసహాయం పొందారు.

స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో కూడా డాక్టర్ గారికి నిర్భంధం తప్పలేదు. కడలూరు జైలులో పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేసినప్పుడు తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచెయ్యకుండా రాత్రింబవళ్ళు వారి గురించి ఎంతో శ్రమపడ్డారు. జైలులో కూడా ఆనాటి రాజకీయ ఖైదీల న్యాయమైన హక్కులకోసం పోరాటాలు సాగించారు. స్వాతంత్ర్యోద్యమకాలంలోనూ, ఆ తరువాతి కాలంలోనూకూడా డాక్టర్ చెలికాని అనేక సంవత్సరాలు రాజమండ్రి, బళ్ళారి, కోరాపుట్, కడలూరు జైళ్ళలో తీవ్ర నిర్భంధానికి గురై ఆరోగ్యాన్ని కోల్పోయారు. గేస్ట్ర్రిక్ అల్సర్ కి గురైన డాక్టర్ గారికి ఒకసారి పెద్ద ఆపరేషన్ జరిగింది.

తరువాతి కాలంలో క్షయవ్యాధితో పాడైన ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఈరెండు ఆపరేషన్లూ శారీరకంగా డాక్టర్ రామారావు గారిని ఎంతో దెబ్బతీశాయి. అయినా ఆయనలోని విప్లవ కార్యదీక్ష ఏమాత్రం కుంటుపడలేదు.

1952 లో జరిగిన ఎన్నికలలో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అనారోగ్యంతో శానిటోరియంలో ఉన్న రామారావుగారు ప్రచారంలో పాల్గొనక పోయినా ఆ ఎన్నికలలో మొసలికంటి తిరుమలరావు, బులుసు సాంబమూర్తి మొదలైన హేమాహేమీలపై విజయం సాధించారు. శ్రామికజన పక్షపాతిగా ఆయన తనవాణిని లోక్ సభలో సమర్ధవంతంగా వినిపింపచేశారు. సభ దృష్టికి ఆయన తీసుకువచ్చిన ఎన్నోసమస్యలకు సంబంధించి పండిట్ నెహ్రూ వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. 1956లో లోక్ సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ నాయకత్వంలో చైనా పర్యటించిన అధికార ప్రతినిధివర్గంలో సభ్యునిగా డాక్టర్ చెలికాని చైనా అధ్యక్షుడు మావోతో సహా ముఖ్యనాయకులందరినీ కలిసి చర్చలు జరిపారు.

రామారావుగారి జీవనసహచరి కమలమ్మగారు 1976 లో మరణించే ముందు ఒక సంవత్సరం పైగా అనారోగ్యంతో మంచంమీద కదలలేని స్థితిలో ఉండిపోయారు. ఆ సంవత్సర కాలమూ రామారావుగారు ఆమె దగ్గరే ఉండి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు. "ఇంతమంది ఉండగా ఈ వయసులో మీకెందుకు శ్రమ?" అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు గుండెను కదిలిస్తుంది. "జీవితమంతా రాజకీయాలలో మునిగిన నేను భర్తగా ఆవిడకు న్యాయం చేకూర్చలేకపోయాను. ఈ స్థితిలో ఆవిడకు సేవచేయ్యడం నా బాధ్యత!"అన్నారు. ఆర్థిక సంబంధాలు బెడిసికొడితే భార్యాభర్తలే పరస్పరం విరోధులుగా మారుతున్న ఈ దౌర్భాగ్యపు వ్యవస్థలో డాక్టర్ రామారావుగారి జవాబు ఆయనలోని ఉదాత్తమైన జీవితాదర్శాన్ని తెలియచేస్తుంది.[1]

విశేషాలు మార్చు

  • ఈనాడు జాతీయోద్యమ విలువలు లేవు.డబ్బు, అధికారం రాజకీయ జీవితాన్ని కలుషితం చేస్తున్నాయి.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డాక్టరు చెలికాని వెంకట్రామారావుగారి ఆదర్శ జీవితాన్ని స్మరించుకోటం ఎంతైనా అవసరం- చండ్ర రాజేశ్వరరావు
  • 1944లో తనకు ఒక కుమారుడు కలగగానే కుటుంబ నియంత్రణ చికిత్స చేసుకున్నారు.
  • 1952లో ప్రథమ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుంచి ఆధిక్యంతో గెలుపొందారు. ప్రజాపార్టీ నాయకుడు బులుసు సాంబమూర్తినీ, కాంగ్రెస్ అభ్యర్థి మొసలికంటి తిరుమలరావులిద్దర్నీ ఓడించి గెలిచారు. ఎన్నికల్లో పోటీచేసిన సమయంలో ఆయన అనారోగ్యంతో మద్రాసు తాంబరం ఆస్పత్రిలో ఉన్నారు. ఒక్కరినీ ఓటు అడగలేదు.

మూలాలు మార్చు

  1. 1985అక్టోబరు 5 సంతాపసభ సందర్భంలొ ‘విశాలాంధ్ర దినపత్రిక’ ప్రచురించిన అదృష్టదీపక్ రచన

యితర లింకులు మార్చు