జంబలకిడిపంబ

1993 సినిమా
(జంబలకిడి పంబ నుండి దారిమార్పు చెందింది)

జంబలకిడిపంబ ఇ. వి. వి సత్యనారాయణ దర్శకత్వంలో 1992 లో వచ్చిన ఒక విజయవంతమైన హాస్యభరిత సినిమా.[1][2][3] ఇందులో నరేష్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు.

జంబలకిడిపంబ
దర్శకత్వంఇ.వి.వి. సత్యనారాయణ
రచనదివాకర్ బాబు
స్క్రీన్ ప్లేఇ.వి.వి. సత్యనారాయణ
కథఇ.వి.వి. సత్యనారాయణ
నిర్మాతడి.వి.వి. దానయ్య, జె. భగవాన్, సరస్వతి కుమార్
తారాగణంనరేష్,
ఆమని
ఛాయాగ్రహణంఇ. వి. వి. గిరి
కూర్పుకె. రవీంద్ర బాబు
సంగీతంరాజ్-కోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1992
భాషతెలుగు

ఈ సినిమాలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆడవాళ్ళ పనులు మగవారు, మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో వినోదభరితంగా తెరకెక్కించారు.

కథ మార్చు

రామలక్ష్మి కోట శ్రీనివాసరావు కూతురు. విశాఖపట్నంలో వాళ్ళు నివసించే కాలనీలో మగవాళ్ళు అందరూ తీరిగ్గా కూచుని పేకాట ఆడుకుంటూ సరదాగా గడుపుతుంటే వారి భార్యలు ఇంటి పనిలో సతమతమవుతూ ఉంటారు. వారి బాధల్ని చూసి రామలక్ష్మి మనసు బాధ పడుతూ ఉంటుంది. ఆమె అలా బాధ పడినప్పుడల్లా ఎక్కడో నుంచో ఆమెకు ఒక లేఖ అందుతూ ఉంటుంది. మొదట్లో ఆమె దానిని పెద్దగా పట్టించుకోదు. కానీ అది ఆమె మహిళల సమస్యల గురించి బాధ పడినప్పుడల్లా కనిపించే సరికి ఒకసారి ఆ లేఖను చదువుతుంది.

ఆ లేఖలో ఆమెను విశాఖ పట్నానికి కొంచెం దూరంలో ఉన్న బొర్రా గుహల దగ్గరికి ఒంటరిగా రమ్మని రాసి ఉంటుంది. రామలక్ష్మి అక్కడికి వెళ్ళి అంబ అనే యోగినిని కలుసుకుంటుంది. ఆమె పురుషాధిక్య సమాజం వలన తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి జీవితం మీద విరక్తితో అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. సమాజం మీద కక్ష తీర్చుకోవడానికి ఆమె జంబలకిడి పంబ అనే మందు తయారు చేసి ఉంటుంది. ఆమె శిష్యుడు చిదంబరానంద స్వామిని పిలిచి ఆ మందును రామలక్ష్మికిచ్చి ఆ మందును తీసుకెళ్ళి తాగే నీళ్ళలో కలపమంటుంది.

మరుసటి రోజు క్యాంపు నిమిత్తం విశాఖపట్నం వెళ్ళివచ్చిన ఓ పోలీసు ఐజీ మరికొంత మంది అధికారులు వింతగా ప్రవర్తిస్తుంటారు. పోలీసులు వైజాగ్ లో ఏదో జరిగిందని అనుమానించి అక్కడికి రాకపోకలు నిషేధిస్తారు. ఏం జరిగిందీ తెలుసుకోమని స్పెషల్ ఆఫీసరు నరేష్ ను అక్కడికి పంపిస్తారు. నరేష్ అక్కడికి వెళ్ళేసరికి ఆడవాళ్ళంతా మగ వాళ్ళుగా, మగవాళ్ళంతా ఆడవాళ్ళుగా ప్రవర్తిస్తుంటారు. సరిగ్గా అదే సమయానికి స్టూవర్టుపురంలోని తూటాలరాణి అనే బందిపోటు రాణి వైజాగ్ లో ఉన్న పరిస్థితులను ఉపయోగించుకుని అక్కడ సంపదను కొల్లగొట్టవచ్చునని తన మకాం అక్కడికి మార్చేస్తుంది.

ఒకసారి నరేష్ బీచ్ లో రామలక్ష్మిని కలుస్తాడు. అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళలా ప్రవర్తిస్తున్నా అతను మాత్రం మామూలుగా ఉండటం గమనించి 24 వ తేదీన నువ్వు నీళ్ళు తాగలేదా అని ప్రశ్నిస్తుంది. దాంతో నరేష్ కు ఆ తేదీన ఏదో జరిగుండాలనీ దాని వెనుక రామలక్ష్మి హస్తం ఉంటుందనీ అనుమానం మొదలవుతుంది. తరువాత ఒక కేసు విషయమై పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన నరేష్ కు అక్కడ ఎస్సై నాగులు కూడా మామూలుగానే ఉండటం గమనిస్తాడు. నాగులు కూడా తాను 24 వతేదీన పనిమీద వైజాగ్ నుంచి బయటికి వెళ్ళినట్లు, తిరిగి వచ్చిన తరువాత అందరూ వింత వింతగా ప్రవర్తిస్తున్నట్లూ చెబుతాడు. దాంతో నరేష్ అనుమానం రూఢి అవుతుంది. రామలక్ష్మి నుంచి ఎలాగైనా ఆ సమాచారం రాబట్టాలనుకుంటారు.

ఈ లోపు రామలక్ష్మి కూడా నరేష్ ఒక పోలీసు అధికారి అనీ, అక్కడ జరుగుతున్న సంఘటనలను దర్యాప్తు చేయడం కోసం వచ్చాడనీ తెలుసుకుంటుంది. అతని చేత కూడా జంబలకిడి పంబ మందు తాగించాలని పథకం వేస్తుంది. కానీ నరేష్ ఆ మందు తాగినట్లు నటించి ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. వారిద్దరి శోభనం రోజున నరేష్ తన అసలు రూపం బయట పెట్టి ఆ మందు వెనుక రహస్యం ఏమిటని రామలక్ష్మిని నిలదీస్తాడు. దానికి రామలక్ష్మి సమాధానం చెప్పకుండా మొండికేస్తుంది. చివరికి నరేష్ కోపంలో ఆమెను తోయడంతో స్పృహ కోల్పోతుంది. ఆమె తిరిగి స్పృహలోకి వచ్చే లోపు నరేష్, నాగులు కలిసి మరో నాటకం ఆడి ఆమె నుంచి నిజం రాబడతారు.

నరేష్, నాగులు కలిసి బొర్రా గుహల్లో ఉన్న అంబను కలవడానికి వెళతారు. ఈ లోపునే అక్కడ అంబ చనిపోయి ఉంటుంది. చిదంబరానంద మాత్రం ఆ మందు రామలక్ష్మికి ఇచ్చింది తనేనని చెబుతాడు. దానికి విరుగుడు మందైన పంబ లకిడి జంబను కూడా అతను కనిపెట్టి ఉంటాడు. మొదట్లో రామలక్ష్మికి మందు ఇచ్చినపుడు జంబలకిడి పంబలో విరుగుడు మందు కలిపేశాననీ దాని వల్ల కలిగే దుష్ప్రయోజనాలు తనకు తరువాత తెలిశాయనీ చెబుతాడు. ఈ పొరబాటు వల్ల దానిని సేవించిన వారు క్రమక్రమంగా ఐదు దశల్లో పిచ్చివాళ్ళు ఐపోతారనీ చెబుతాడు. దానికి వారు అతన్ని నిలదీయగా వీటన్నింటికీ అసలు విరుగుడు మందైన పంబ జంబ లంబ లకిడి కూడా తన దగ్గర ఉందని చెబుతాడు. కానీ ఆ మందును వారు అతని దగ్గర నుంచి తీసుకోక మునుపే తూటాలరాణి రామలక్ష్మి సాయంతో వచ్చి చిదంబరాన్ని కిడ్నాప్ చేస్తారు. వాళ్ళు తూటాలరాణిని వెతుకుతూ నగరంలోకి వెళ్ళేలోపే అక్కడ రెండవ దశ మొదలై ఉంటుంది. ఆ దశలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళలాగా, పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు. దాన్ని రామలక్ష్మికి చూపించి నరేష్ జరిగిన అనర్థాన్ని గురించి చెబుతాడు. రామలక్ష్మి కూడా తన తప్పును తెలుసుకొని పరిస్థితిని చక్కదిద్దడానికి వారితో చేతులు కలుపుతుంది.

వారు ముగ్గురూ తూటాలరాణిని వెతుక్కుంటూ వెళుతుండగా అప్పటికే మూడో దశ వచ్చి అందరూ పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తుంటారు. అందరూ కలిసి తూటాల రాణి ఇంట్లో జొరబడతారు. అక్కడ బంధించి ఉన్న చిదంబరానందను విడిపించి విరుగుడు మందును స్వాధీనం చేసుకుంటారు. అప్పటికే నాలుగో దశ వచ్చి అందరి దుస్తులూ, గొంతులూ మారిపోయి ఉంటాయి. చివరికి మందును నీళ్ళ ట్యాంకులో కలుపుతున్నపుడు తూటాలరాణి అడ్డుకుంటే ఆమెతో పోరాడి ఆ నీళ్ళను అందరిచేతా తాగిస్తారు. తూటాలరాణికి శిక్షగా చిదంబరానంద వాళ్ళెప్పుడూ నవ్వుతూ ఉండేటట్లుగా లకిడి జంబ పంబ ఇచ్చేయడంతో కథ సుఖాంతమవుతుంది.

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

  1. "Jamba Lakidi Pamba (1993)". IMDb.
  2. "Jambalakidi Pamba - Full Length Telugu - Comedy Entertainer". YouTube.
  3. "Jamba Lakidi Pamba – A rare example of dark humour". Archived from the original on 2014-09-06. Retrieved 2016-09-14.
  4. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.