జయంతి భావనారాయణ

జయంతి భావనారాయణ తూర్పుగోదావరి జిల్లా, మోడేకుర్రు గ్రామంలో 1867లో ఒక పేద వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రిపేరు రామయ్య. తల్లి పేరు వెంకమ్మ. స్వగ్రామంలో సంప్రదాయ విద్యను గడించి అమలాపురం పట్టణంలో మేనమామ వద్దకు చేరి ఆంగ్లవిద్యను నేర్చుకున్నాడు. మేనమామ వద్ద ఆంగ్లంతో పాటుగా సంగీతం, నాటకాలలో మెలకువలు నేర్చుకున్నాడు. ఇతడి చిన్నతనంలోనే తండ్రిని, మేనమామను పోగొట్టుకున్నాడు. బ్రతుకుతెరువు కోసం కాకినాడ వెళ్లి అక్కడ ఒక పాఠశాల స్థాపించి పిల్లలకు ఇంగ్లీషు చెప్పేవాడు. తరువాత కోగంటి నరసింహాచార్యులు నడిపే పాఠశాలలో తన పాఠశాలను విలీనం చేసి ఇద్దరూ కలిసి కష్టపడి స్కూలును వృద్ధిలోనికి తీసుకువచ్చారు. ఇతడు 1887లో చల్లా కామయ్య కుమార్తె శేషమ్మను వివాహం చేసుకున్నాడు. జయంతి భావనారాయణ అనేక నాటకాలను వ్రాసి దానిలో నటించేవాడు. నాటకాల కంపెనీతో తగాదా పడి కోర్టుకు వెళ్లవలసి రావడంతో 1890లో నాటకాలలో నటించడం మానివేశాడు. 1895లో పట్టభద్రుడై జగన్నాథపురం లోయర్ సెకండరీ పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయుడిగా చేరాడు. తరువాతి కాలంలో ఇతడు పిఠాపురం మహరాజా కళాశాలలో పండితునిగా పనిచేశాడు. ఇతడు 1917లో పరమపదించాడు.

రచనలు మార్చు

  1. భీమలింగ శతకము
  2. గాయక గాయనీ మనోరంజని
  3. సుమిత్ర చరిత్ర (షేక్స్‌పియర్ వ్రాసిన వింటర్స్ టేల్ ఆధారంగా)
  4. రఘుదేవరాజీయము (షేక్స్‌పియర్ నాటకం పెరిక్లెస్ ఆధారంగా)
  5. అభినయ గీతములు
  6. లక్ష్మీ శనైశ్చర విలాసము
  7. రాజభక్తి గీతములు
  8. సౌందర్య సతీమణి (షేక్స్‌పియర్ నాటకము ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ ఆధారంగా)
  9. రాజపుత్రద్వయ విలాసము
  10. కుముద్వతీ సారంగధరము (ఐదు అంకముల నాటకము)(1909)
  11. ప్రత్యక్ష నారసింహము
  12. లోకోక్తి ప్రకాశిక మున్నగునవి.

మూలాలు మార్చు