ది డూన్ స్కూల్ (The Doon School) అన్నది ఉత్తరాఖండ్ రాష్ట్రములోని డెహ్రాడున్‌లో 70 acres (280,000 m2) విస్తీరణములో ఉన్న ఒక స్వతంత్ర పాఠశాల. 1935లో స్థాపించబడిన ఈ పాఠశాలను సతీష్ రంజన్ దాస్ స్థాపించారు. ఈ పాఠశాల యొక్క తొలి ప్రధాన ఉపాధ్యాయుడు ఆర్థర్ ఇ ఫుట్. ఇతర పాఠశాలలతో పోల్చితే ఈ పాఠశాల చిన్నది: ఇక్కడ సాధారణంగా 480 విద్యార్థులు ఉంటారు. ఈ పాఠశాల స్థాపించినప్పటి నుండి పట్టభద్రులైన విద్యార్థుల సంఖ్య ఐదువేలే ఉంటుందని అంచనా. మొత్తం 67 అధ్యాపకులు ఉన్నారు. వీరిలో 15 మంది మహిళలు. అధ్యాపకులు:విద్యార్థులు నిష్పత్తి సుమారు 1:8 గా ఉంది. పాఠశాల 120 స్కాలర్‌షిప్పులను అందిస్తుంది. వీటిలో పాక్షిక, పూర్తి స్థాయి ఆర్థిక సహాయాలు ఉంటాయి. సుమారు 25% విద్యార్థులు ఈ ఆర్థిక సహాయాన్ని పొందుతారు. డూన్ బాలుర పాఠశాల; ఈ పాఠశాలలో చదివిన బాలికలు, పాఠశాల అధ్యాపకుల కూతుళ్ళు మాత్రమే. పాఠశాల ఆశయం యువ భారతీయులకు ఉదార విద్యను అందించడము, వారిలో లౌకికత్వం, క్రమశిక్షణ, సమానత్వం వంటి సిద్ధాంతాలను నెలకొల్పడం. ఈ పాఠశాలకు G20 పాఠశాలలు, రౌండ్ స్కొయర్ సంస్థలలో సభ్యత్వం ఉంది.

ద డూన్ స్కూల్
స్థానం
పటం
సమాచారం
Mottoవిజ్ఞానమే మన జ్యోతి (Knowledge our light)
Founded1935 సెప్టెంబరు 10
స్థాపకులుసతీశ్ రంజన్ దాస్
ప్రధానోపాధ్యాయుడుపీటర్ మెక్ లాలిన్
బోధనా సిబ్బంది67
విద్యార్ధుల సంఖ్య480
Campus69 ఎకరాలు (280,000 m²)
Websitewww.doonschool.com

చరిత్ర మార్చు

 
1917లో డూన్ స్థాపించకముందు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో భాగంగా ఉన్న నేటి డూన్ ప్రధాన బిల్డింగ్

డూన్ స్థాపనకు ముఖ్య కారకుడు, కోల్‌కతాకు చెందిన ప్రముఖ న్యాయవాది ఎస్.ఆర్.దాస్. ఇతను 1927లో లార్డ్ ఇర్విన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో న్యాయసభ్యుడు అయినప్పుడు, ఒక షరతు విధించాడు. తాను ఈ హోదాను ఉపయోగించి భారతదేశంలో ఒక కొత్త పబ్లిక్ పాఠశాల స్థాపించడానికి నిధులు సమకూరుస్తానని, అందుకు అంగీకరించాలన్నదే ఆ నియమం. దానికి ఇర్విన్‌ని ఒప్పించి చేరాడు. 40 లక్షలు రూపాయలు సమకూర్చాలని అతను భారతదేశములో విస్తృతంగా పర్యటించాడు. కాని రూ.10 లక్షలు మాత్రమే నగదు వసూలు అయి మరో రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఉన్న సమయములో అయిన హఠాత్తుగా మరణించాడు. దాస్ ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ సొసైటిని కూడా ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలు జాతి, మతం, అంతస్తు భేదాలు లేకుండా విద్యార్థులను చేర్చుకోవాలన్నదే అతని లక్ష్యం. సాంకేతికంగా, డూన్ పాఠశాల IPSS కే స్వంతం. కాని ఈ పాఠశాల స్వేచ్ఛగా వ్యవహరిస్తుంది.

పాఠశాలలోని హౌస్‌లకు ముందు వేరే పేర్లున్నా, తర్వాత ఐపిఎస్ఎస్‌కు భూరి విరాళాలు ఇచ్చిన దాతల పేర్ల మీదుగా పెట్టడం మొదలుపెట్టారు:

  • హైదరాబాదు హౌస్: సర్ అక్బర్ హైదారి హైదరాబాదు నిజాం నుంచి రూ.2 లక్షలు విరాళం
  • కాశ్మీర్ హౌస్: మహారాజా హరి సింగ్ రూ.1 లక్ష విరాళం ఇస్తానని హామీ ఇచ్చిన తరువాత. ఈ విరాళం 1935లో ఇవ్వబడింది.
  • టాటా హౌస్. టాటా, వాడియా సంస్థలు రూ. 1.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిన తరువాత. ఈ విరాళంలో సగం భాగం 1935లో ఇవ్వబడింది.
  • జైపూర్ హౌస్. రాయి బహదూర్ అమర్నాథ్ అటల్ జైపూర్ దుర్బార్, చిన్న తికానలనుండి రూ.1 లక్ష విరాలానికి ఏర్పాటు చేసిన తరువాత.

ముందుగా రూ.1 లక్ష గుప్త విరాళం ఇచ్చిన రాయ్ బహదూర్ రామేశ్వర్ పేరు మీద భవనాలు పేర్లు పెట్టబడలేదు.

1935 అక్టోబరు 27 నాడు వైస్రాయి, లార్డ్ విల్లింగ్డన్ పాఠశాల ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించారు. 70 బాలురు మొదటి టర్మ్‌కు మరో 110 బాలురు రెండవ టర్మ్‌కు చేరారు.

రవీంద్రనాధ టాగూరు రచించిన జన గణ మన పాట పాఠశాల పాటగా 1935లో తీసుకోబడింది[1]; ఈ పాటే తరువాత భారతదేశం జాతీయ గీతంగా 1947లో స్వీకరించారు.

మార్గదర్శక విలువలు మార్చు

 
డూన్ పాఠశాల ప్రధాన విలువలు.

ఈ బాధ్యతను చేపట్టే ముందు ఆర్థర్ ఫుట్ భారతదేశానికి ఏనాడు రాలేదు. అతను మొదటి చేర్య హరోకు చెందిన J. A. K. మార్టిన్ తన సహాయకుడుగా నియమించడమే. డూన్ పాఠశాల మార్గదర్శక విలువలను తొలి నాళ్ళలోనే, ఫుట్‌తో సహా కొందరు ప్రభావశీలురైన ఉపాధ్యాయలు ఏర్పరిచారు. ఫుట్ విద్యా లక్ష్యాలు అనే పేరుతో పాఠశాల పత్రికలో ఒక వ్యాసం రాసారు. దాంట్లో డూన్‌లో విద్యాభ్యాసం గురించి ఈ విధంగా వివరించారు

సంపూర్ణ విద్య కోసం పిల్లవాడికి ఇవి నేర్పించాలి

  1. మంచి చెడు మధ్య విభేదాలను గుర్తించగలగడం
  2. చెడును కాకుండా మంచిని ఎన్నుకునే అలవాటును ఏర్పరుచుకోవడం
  3. న్యాయంగా ఆలోచించే విధంగా వారి చిన్ని బుర్రలకు శిక్షణ ఇవ్వడం
  4. మనం జీవిస్తున్న ఈ ప్రపంచం గురించిన ముఖ్య విషయాలను తెలుసుకునే విధంగా సామాన్య జ్ఞానం కలిగి ఉండడం
  5. తన భావాలను మాటల్లో, రాతల్లో తాను పని చేయబోయే ప్రజల భాషలలో స్పష్టంగా వ్యక్తపరచగలగడం
  6. ఆరోగ్యకరమైన, బలమైన, శక్తివంతమైన శరీరాన్ని పొంది ఉండడం, దానిని ఎలాగ పరిరక్షించాలో తెలుసుకోవడం
  7. సౌందర్యం, అభిరుచి, భావం గురించిన అవగాహన ఉండడం, తన చుట్టూ ఉన్న వికారాన్ని తొలగించడానికి ప్రయత్నించడం [2]

ఇతర వ్యాసాలలో ప్రతి విద్యార్థి యొక్క అభివృద్ధిలో పలు మైలు రాళ్ళను సూచించారు:

14వ వయస్సు లోపల, సాధారణ సామాజిక ప్రవర్తన గురించిన సూత్రాలను నేర్చుకొని ఉండాలి. లేచి నిలబడి వివిధ జనాల ముందు ఎలాగ మాట్లాడాలని తెలిసి ఉండాలి- తన సొంత తల్లితో, వేరే ఒకరి తల్లితో, తన తండ్రితో, ఉపాధ్యాయులుతో, పనివాళ్ళతో, మహాత్మా గాంధీతో లేదా వైస్రాయ్‌తో ఎటువంటి సంకోచం లేకుండా మాట్లాడగలగాలి... 14 సంవత్సరాల వయస్సుకల్లా భాష, గణితం, సామాజిక ప్రవర్తనలో నేర్పు కలిగి ఉండాలి. ఆ వయస్సు తరువాత, ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. అభిరుచిని పెంచుకోవడం నేర్చుకోవాలి... 16 సంవత్సరాల వయస్సులో, అభిరుచిని పొంది ఉండి, సౌందర్యం-వికారం, బలం-బలహీనత, మంచి-చెడు గురించిన అవగాహన కలిగి ఉండాలి... 17 సంవత్సరాల వయస్సులో, మరొక గుణం రావాలి. తక్కువ స్వభావముగల, ఎక్కువ పరిపక్వత కలిగిన మది: వివేకం అనే గుణం కలిగి ఉండాలి. [2]

జాక్ గిబ్సన్ అనే మరో సంస్థాపక ఉపాధ్యాయుడు, 1940లో తల్లితండ్రులకు రాసిన లేఖలో ఈ విధంగా రాశాడు:

కనిపించేవాటికి గుడ్డిగా వినిపించేవాటికి చెవుటుగా ఉన్న బాలలు ఇంకా చాలా మంది ఉన్నారు. వారు తమ మదిని శూన్యంగా పెట్టుకుంటారు. దానిని అందం కానివి, సత్యం కానివాటితో నింపి, నీచమైన అభిరుచి కలిగి, భయం, పక్షపాతం వంటి గుణాలు కలిగి, ముఖస్తుతికి లొంగి, సొంత ఆలోచన లేకుండా ఇతరుల ఆలోచనను తమ ఆలోచనలాగా చేసుకొన ఉంటారు వారు పాఠశాలను వదిలి వెళ్ళినప్పుడు, సర్వాధికారులు, ప్రకటనలు రాసేవారు, రాజకీయపక్ష నేతలు వంటి వారి ఆలోచనలను తమ ఆలోచనలుగా చేసుకుంటారు: ఎటువంటి మురికికూపంలో వారు పడుతారో ఆ ఆలోచనల బట్టి ఉంటుంది... ఈ కష్టకాలాలలో, ప్రతి బాలుడు స్పష్టంగా ఆలోచించడానికి అలవాటు చేసుకోవాల్సిన అవసరం చాల ఉంది. తాను ఎదురు చూసిన ఫలితాలకంటే వేరే నిర్ణయాలకు రావడానికి సిద్ధంగా ఉండాలి. మనము ఏది సరైన పద్ధతి అని ఇన్నాళ్ళు అనుకోని ఉన్నామో దానికంటే భిన్నమైన దానిని కూడా ఒప్పుకోవాలి. తన శరీరాన్ని కష్టాలకు అలవాటు చేసుకోవాలి. అనుకోని బాధలకు సిద్దంగా ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా, తన సొంత వర్గం, అంతస్తు కంటే బయట ఉన్న వారిని అర్ధం చేసుకొని సానుభూతి చూపించాలి.[2]

డూన్ యొక్క ప్రత్యేక విలువల అభివృద్ధిలో కర్ట్ హహ్న్ ప్రభావం గురించి మార్టిన్ ఈ విధంగా చెప్పాడు:

కర్ట్ హాహ్న్ అనే ఒక అద్బుతమైన జర్మన్ యూదు కనక లేక పోతే, నేను భారతదేశానికి అసలు వచ్చి ఉండేవాడిని కాను.... అతనిని తొలి సారి చూసినప్పుడు, నేను హర్రోలో చరిత్ర బోధిస్తూ ఉన్నాను, అతను సాలెం పాఠశాలకు అధినేతగా ఉన్నారు. ఆ పాఠశాలను అతను లేక కాన్స్టన్స్ తీరములో ప్లేటో, బ్రిటిష్ పబ్లిక్ పాఠశాలల సిద్ధాంతాలతో నెలకొల్పాడు... అతని సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని నాకు ఎంతో కోరిక ఉండేది. కాని సంప్రదాయక హారోలో దానికి అవకాశం లేదు. డెహ్రాడూన్‌లో భారత బాలల కోసం ఏర్పరించిన ఒక కొత్త పబ్లిక్ పాఠశాలకు A.E. ఫుట్ ప్రాధాన ఉపాధ్యాయుడుగా నియమితలయ్యాడు అని ది టైమ్స్‌లో చదవగానే, నేను కూడా అతనితో వస్తానని చెప్పాను. నా కోరికను ఒప్పుకున్నాడు... అంతకు ముందు నాకు భారతదేశంపై ఎటువంటి ఆసక్తి లేదు; నన్ను ఏది ప్రేరేపించందంటే, ఒక కొత్త వాతావరణంలో ఒక కొత్త పబ్లిక్ పాఠశాలను ప్రారంభించే అవకాశం... అన్ని ముఖ్య నిర్ణయాలు ఆర్థర్ ఫుట్ తీసుకున్నా, అదృష్టవశాత్తు, అతని ఆలోచనలు నా ఆలోచనలు ఒక్కలాగే ఉన్నాయి. శిక్షలను పూర్తిగా తొలగించడంలో అతని మాదిరిగా నేను సాహసం చేసి ఉండేవాడిని కాను. కాని సృజనాత్మక కార్యకలాపాలను ప్రారంభించడంలో మేము ఇద్దరూ చాలా ఆసక్తి చూపించాము... ఇక్కడ సమస్య ఏమంటే, సమాజ స్ఫూర్తి ప్రాముఖ్యతను తెలుసుకుంటూనే, ఆత్మ స్థైర్యం, చొరవ పెంచుకోవాలి. [3]

డూన్‌లో జీవితం మార్చు

 
టాటా హౌస్, క్వాద్‌ల తూర్పు వైపు.

విద్యా సంవత్సరం ఫిబ్రవరిలో ఆరంభములో మొదలవుతుంది. మొదటి టర్మ్‌ను (లేదా సెమిస్టర్) స్ప్రింగ్ టర్మ్ అని పిలుస్తారు. ఈ టర్మ్ మే ఆఖరి వరకు నాలుగు నెలల పాటు ఉంటుంది. టర్మ్ మధ్యలో పిల్లలు ఒక వారం పాటు జరిగే మిడ్ టర్మ్‌ను తీసుకుంటారు. ఇది ఒక సాహస యాత్ర, సామాన్యంగా శివాలిక్ కొండు లేదా హిమాలయాలలో ఉంటుంది. దీనిని సీనియర్ బాలురు ఒంటరిగా ఎవరి తోడు లేకుండా తమంతటే తామే పూర్తిగా నిర్వహిస్తారు. ఆక్కడ గుడారాలలో కాంపింగ్ చేసుకొని, తమ ఆహారాన్ని తామే వండుకొని, ప్రతి రోజు గంటల తరపడి ట్రెక్కింగ్‌కి వెళ్తారు. ఆటమ్ టర్మ్ ఆగస్టులో మొదలై నవంబరు చివరి వరకు ఉంటుంది. ఈ టర్మ్ మధ్యలో కూడా ఒక మిడ్ టర్మ్ విరామం ఉంటుంది.

అందరు విద్యార్థులకు పాఠ్యేతర కార్యకలాపాలు, క్రీడలు పాఠశాల జీవితంలో తప్పనిసరిగా ఉంటాయి. క్రికెట్, హాకీ, ఫుట్ బాల్ ఆయా సీజన్‌లో ఆడుతారు. టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, స్క్వాష్, బాస్కెట్‌బాల్, ఈత, బాక్సింగ్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్ పోటీలు జరుగుతూనే ఉంటాయి. దాదాపు 23 క్లబ్బులు, సంఘాలు ఉన్నాయి. తర్కం, చదరంగం వంటి క్లబ్బులు ఉన్నాయి. ఆంగ్ల, హిందీ భాషలలో పలు పత్రికలు ప్రచురించబడుతున్నాయి.

సమాజ సేవ కూడా పాఠశాల జీవితంలో ఒక విడదీయలేని భాగం. ఫుట్ సిద్ధాంతం ప్రకారం, "పిల్లలు డూన్ పాఠశాలను వదిలి ప్రభువర్గానికి చెందినవారిలాగ వెళ్తారు. కాని ఆ ప్రభువర్గం, ధనం, అధికారం లేదా పలుకుబడికి సంబంధించినదిలాగ కాకుండా, నిస్వార్థ సేవాభావంతో కూడినది అయి ఉండాలి." [2] ఈ సంవత్సరాలలో, డాస్కోలు కొన్ని తరాలుగా డెహ్రాడూన్ ప్రాంతములో వెనుకబడిన పిల్లలకు చదువు చెప్పడంలో సహాయపడుతూ వస్తున్నారు. ఇల్లు, సామాజ భవనాలు, పాఠశాల భవనాలు కట్టడంలో; శుభ్రత వ్యవస్థలు; ఇంధన ఆదాయ వ్యవస్థలు; స్వయం ఉపాధి, చిన్న తరహా నీటి పారుదల వ్యవస్థలు వంటి అంశాలలో గ్రామస్తులకు పాఠశాల సహాయ పడుతూ వస్తుంది;

భారతదేశములో పర్వతారోహణని ప్రవేశ పెట్టిన ఘనత డూన్‌దే[4]. దీనికి RL హోల్డ్స్‌వర్త్, జాక్ గిబ్సన్, గురుదయాల్ సింగ్, జయాల్ వంటి పూర్వ విదార్థులే కారకురాలు[5]. డాస్కోలు ఎక్కిన పర్వతాల వివరాలు: 1950లో బందర్‌పంచ్ (6,316 మీటర్లు), 1956లో కాల నాగ్ (6,387 మీటర్లు), 1951లో త్రిసుల్, 1955లో కామెట్ (7,816 మీటర్లు), 1953, 1955లలో అబి గమిన్, 1958లో మ్రిగ్తుని (6,855 మీటర్లు), 2009లో కిలిమంజారో (5,893 మీటర్లు).

సాంప్రదాయంగా డూన్‌లో వివిధ గ్రాడ్ స్థాయిలను "ఫారాలు" అని పిలిచేవారు:

  • F ఫారం = 5వ గ్రేడ్ (ప్రస్తుతం లేదు)
  • E ఫారం = 6వ గ్రేడ్ (ప్రస్తుతం లేదు)
  • D ఫారం = 7వ గ్రేడ్
  • C ఫారం = 8వ గ్రేడ్
  • B ఫారం = 9వ గ్రేడ్
  • A ఫారం = 10వ గ్రేడ్
  • S ఫారం = 11వ గ్రేడ్
  • Sc ఫారం = 12వ గ్రేడ్

పాఠశాలలో ఇచ్చే కొన్ని గుర్తింపులు: స్కూల్ కలర్స్, క్రీడా కలర్స్, గేమ్స్ బ్లేజర్,, పాఠశాల బ్లేజర్. పాఠశాలలో ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు ఏమి లేవు: పిల్లలు తమ బోర్డు పరీక్షలను పూర్తి చేసిన తరువాత, వెళ్లి పోవచ్చు. కాని పలువురు గోల్డెన్ నైట్ కోసం వేచి ఉంటారు: టర్మ్‌కు ఆఖరి భోజనం. మంచి విందు భోజనం వడ్డిస్తారు.

క్రమశిక్షణ కఠినంగా ఉంటుంది. ప్రసిద్ధ కుటుంబాలకు చెందిన పిల్లలను తొలగించడంలోనూ పాఠశాల ఏనాడు వెనకాడలేదు; 1950లలో, సంజయ్ గాంధీ తన సీనియర్ ఏడాదిని వేరొక పాఠశాలలో చదవాలి అని అప్పటి ప్రధాన ఉపాధ్యాయుడు J.A.K. మార్టిన్ చేసిన సూచనను తల్లి ఇందిరా గాంధీ వెంటనే ఒప్పుకుంది; దానికి భిన్నంగా, 2001లో ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి నిత్యానంద్ స్వామి కొడుకును తొలగించినప్పుడు, పాఠశాలకు నీరు, విద్యుత్‌లను నిలిపి వేస్తామని బెదిరించారు.[6] అయితే, ఈ బెదిరింపులు పని చేయలేదు. ఎందుకంటే, తనకంటే, డూన్‌కు రాజకీయ పలుకుబడి ఎక్కువ అని స్వామీ తెలుసుకున్నారు.

విద్యార్థులు, క్యాంపస్ మార్చు

 
నేపథ్యంలో కాశ్మీర్, హైదరాబాద్ హౌస్‌లతో పాఠశాల ప్రధాన మైదానం
 
2010 అక్టోబరులో డూన్స్ పాఠశాల ప్లాటినం జూబ్లీ పురస్కరించుకుని పాఠశాలలో ప్రసంగిస్తున్న నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

డూన్ హౌస్ వ్యవస్థను పాటిస్తుంది. ఐదు పరిపాలనా యూనిట్లు లేదా హౌస్‌లు ఉన్నాయి. అవి హైదరాబాదు, జైపూర్, కాశ్మీర్, ఒబరాయ్, టాటా. ప్రతి హౌస్‌ను ఒక హౌస్‌మాస్టర్ నడుపుతాడు. హౌస్ కేప్టన్ అని పిలిచే ఒక సీనియర్ విద్యార్థి సహాయం చేస్తాడు. మరొక సీనియర్ విద్యార్థి పాఠశాల కెప్టన్‌గా వ్యవహరిస్తాడు. అతనికి ప్రతి హౌస్ నుండి పాఠశాల ప్రేఫేక్ట్‌లు సహాయం చేస్తారు. అంతే కాక, పూర్వ ప్రధాన ఉపాధ్యాయుల పేర్లు కలిగిన ఫూత్, మార్టిన్ అనే రెండు హోల్డింగ్ హొస్‌లు ఉన్నాయి. మొదటి సంవత్సర విద్యార్థులు ఇక్కడ ఒక ఏడాది గడిపిన తరువాత ప్రధాన హౌస్‌లకు వెళ్తారు.

పాఠశాల నిర్మాణం కొరకు ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ సొసైటి డెహ్రాడున్‌లోని చంద్‌బాగ్ ఎస్టేట్‌ను ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కొన్నది. ఈ ఎస్టేట్‌లోని ఒక భాగం ఒకప్పుడు ఒక జింకల పార్క్‌గా ఉండెది. ఇక్కడే ప్రస్తుతం సెంట్రల్ డైనింగ్ హాల్ ఉంది. IPSS పక్కనే ఉన్న ఎస్టేట్‌ను కూడా జేమ్స్ స్కిన్నేర్ సంతతి నుంచి కొన్నది. ఈ భాగమే ప్రస్తుతం స్కిన్నర్స్ ఫీల్డ్ అని పిలవబడుతుంది. ఇది కొన్నప్పుడు, స్కిన్నర్స్ పర్యవేక్షణ లేని వదిలివేసిన ఒక ఎస్టేట్. అప్పుడు ఏనుగుల కొరకు రెండు షేడ్‌లు మాత్రమే ఉండేవి. డూన్ క్యాంపస్‌ ప్రస్తుతం 69 ఏకరాలు స్థలంలో (280,000 m²) ఉంది.

మైదానాలు చాలా అందంగా ఉంటాయి. పలు తోటలు, అరుదైన చెట్లు ఉన్నాయి. కాని విద్యార్థులకు జీవితం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. వారు ఇరుకైన మంచాలలో పడుకుంటారు. వేడిచేయని గదులలో చదువుతారు. నేల గరుకుగా ఉంటుంది. లైట్లు సాధారణ ట్యూబ్ లైట్‌లే. ఆహారం అంత గొప్పగా ఏమీ ఉండదు. చూడడానికి పోషకంగా ఉంతుంది. కాని ఈ పరిస్థితి ఇటీవల మారింది. (గోల్డెన్ నైట్‌లో ఎప్పుడూ అద్భుతమైన భోజనం ఉండేది.)

ఇతర పబ్లిక్ స్కూల్‌ల లాగానె, డూన్‌లో కూడా కొన్ని విశేషమైన పదాలు ఉన్నాయి. వాటిలో కొన్ని: టక్ షాప్ (చిరుతిండి కొన్నందుకు), చేంజ్-ఇన్-బ్రేక్ ( విసుగు తెప్పించే శిక్ష), క్విస్-ఈగో, బాగ్స్ (డిబ్స్), లేండ్ (భట్రాజు), స్కపాట్ (అత్యాశ కలిగిన వ్యక్తి), డోంట్ డై (సరదాగా), స్నీక్ (టేటిల్ టైల్), వెల్ల (సోమరి), వంటివి ఇంకెన్నో[7]. పలువురు విద్యార్థులకు మారుపేరు ఉంటుంది. ఈ పేరు వారి జీవితాంతం కోనసాగుతుంది. ఈ పేరులే స్వల్ప మార్పులతో డూన్‌కు వచ్చే వారి తమ్ముళ్ళకు, వారి కొడుకులకు పెడుతుంటారు. తరగతి పీరియడ్లు స్కూల్స్ అని పిలుస్తారు.

డాస్కోలలో చాలా మంది భారతీయులె. ఐతే, అతి తక్కువ సంఖ్యలో పాకిస్తాన్ నుండి వచ్చినవారు ఉన్నారు: వీరు దేశ విభజనకు ముందు డూన్‌లో చదివారు కాని 1947లో వదలవలసి వచ్చింది. ఇరు దేశాల మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ, భారతీయ, పాకిస్తానీ డాస్కోల మధ్య సంబంధాలు బాగానే ఉంటున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్ విద్యార్థులు ఇప్పటికి ఈ పాఠశాలలో చదువుతూ ఉన్నారు..

ప్రధాన ఉపాధ్యాయులు మార్చు

  • A.E. ఫుట్
  • J.A.K. మార్టిన్
  • C.J. మిల్లెర్
  • E.J. సిమియన్
  • గులాబ్ రంచాందని
  • S.R. దాస్
  • జాన్ A. మసన్
  • కాంతి బాజ్పాయి
  • పేటర్ మాక్లాలిన్, ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయుడు

ఇతర పాఠశాలతో సంబంధాలు మార్చు

1937 నుండి 1980ల వరకు వేల్హం బాయ్స్ పాఠశాల డూన్ పాఠశాలకు, మాయో కాలేజీకి పూర్వరంగ పాఠశాలగా వ్యవహరిస్తూ ఉండేది. ఒక డాస్కో, డూన్‌లో పూర్వ హౌస్ మాస్టర్ అయిన సురేంద్ర "చార్లీ" కందరి, వేల్హంస్‌కు ప్రిన్సిపాల్ అయి ఆ పాఠశాలను ఒక ఉన్నత పాఠశాలగా మార్చినప్పుడు ఈ సంబంధం తెగి పోయింది. అందువలన 1940ల నుండి 1970ల వరకు పలువురు డాస్కోలు వేల్హమైట్‌లు కూడా.

డూన్‌కు వేల్హం బాలికల పాఠశాలకు కుటుంబ సంబంధం ఉంది. డూన్ కు తమ అబ్బాయిలను పంపించే పలు కుటుంబాలు తమ కూతుళ్ళను వేల్హామ్స్‌కు పంపించే వారు. పలువురు డాస్కోలు వేల్హం పూర్వ విద్యార్థినులను వివాహం చేసుకున్నారు. సీనియర్ సంవత్సరములో వేల్హాం గర్ల్స్ తో జరిగే వార్షిక "డాన్స్ సోషల్" ఒక ముఖ్య కార్యక్రమం. పలు పూర్వ విదార్థుల కార్యక్రమాలను ఇరు పాఠశాల పూర్వ విద్యార్థులు కలిసి చేసేవారు.

1998లో, చాంద్ బాగ్ పాఠశాలను పాకిస్తానీ డాస్కోలు స్థాపించారు. ఈ పాఠశాల, లాహూర్‌కు 40 కిమీ ఉత్తరంగా స్థాపించారు. ఈ పాఠశాల డూన్‌ను మాదిరి పాఠశాలగా తీసుకొని నెలకొల్పారు.

భారతదేశంలో ప్రైవేట్ పాఠశాల రంగం వ్యాప్తి చెందినప్పుడు, పలు పాఠశాలలు కావాలనే డూన్ పేరు మాదిరిగానే తమ పాఠశాల పేరును పెట్టుకున్నాయి: డూన్ గ్లోబల్ స్కూల్, డూన్ ప్రెసిడెన్సీ స్కూల్, డూన్ ఇంటర్‌నేషనల్ స్కూల్, డూన్ ప్రిపరేటరి స్కూల్, డూన్ కేంబ్రిడ్జ్ స్కూల్, డూన్ గర్ల్స్ స్కూల్, డూన్ పబ్లిక్ స్కూల్ (ఈ పాఠశాల డూన్ వ్యాలీలోనే లేదు), డూన్ కాలేజీ అఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ వంటివి. ఈ పాఠశాలలు వేటికీ డూన్‌తో సంబంధం లేదు[6]. కొన్ని పాఠశాలలు డూన్ విశేష పద్ధతులను కూడా అనుసరించాయి: ఢిల్లీ పబ్లిక్ పాఠశాల పరీక్షలలో అత్యధిక "మార్కులు" సాధించినవారికి "మార్కర్ కప్" లను అందిస్తుంది; ఇది డూన్ నుంచి తీసుకున్నారు. డూన్ "మార్కర్ కప్"లు కూడా కొన్ని పాఠాలలో అత్యధిక మార్కులు పొందిన వారికి ఇస్తారు. ఈ కప్పులను పాఠశాలకు విరాళాలు ఇచ్చిన పాకిస్తాన్‌కు చెందిన మార్కర్ కుటుంబం పేరు మీద ఇస్తున్నారు.

సినిమాల్లో మార్చు

  • ఐష అనే చిత్రములో రందిర్ ఘమ్బిర్ అనే పాత్ర ఒక డాస్కో.[8]
  • ఒక వివాదాస్పదమైన చిత్రం డేస్డ్ ఇన్ డూన్ . ఈ చిత్రాన్ని పాఠశాల, తమ 75వ వార్షికోత్సవ సందర్భంలో తీయించింది. దీనిని ఒక పూర్వ డాస్కో (అశ్విన్ కుమార్) రూపొందించాడు. అయితే, ఈ చిత్రం పాఠశాలకు చెడ్డ పేరు తెచ్చిందని తరువాత ఈ చిత్రాన్ని పాఠశాల నిషేధించింది.[9]. పాఠశాల తీసుకున్న ఈ అసాధారణ చర్య డూన్ పాటించిన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉంది; గతంలో అనేక క్యాంపస్ ప్రచురణలు పాఠశాలను లేదా ఉపాధ్యాయలను పరిహసిస్తూ ప్రచురించబడినా, పాఠశాల వ్యతిరేకించలేదు.

కల్పనా కథల్లో మార్చు

  • సల్మాన్ రష్డీ ఈస్ట్, వెస్ట్ అనే కథల పుస్తకములలో జులు, చెఖోవ్ అనే ముఖ్య పాత్రలు, డాస్కోలు.
  • కిరణ్ దోషి వ్రాసిన బర్డ్స్ అఫ్ పెసేజ్ అనే పుస్తకములో అభి అనే ప్రధాన పాత్ర ఒక డాస్కో.
  • విక్రం సేథ్ డూన్‌లో తన స్వంత అనుభవాలను ఎ సూటబుల్ బాయ్ అనే పుస్తకములో తపన్ అనే పాత్రలో వ్రాశాడు.
  • అమీనుద్దిన్ ఖాన్ వ్రాసిన ఎ రైట్ రాయల్ బాస్టర్డ్లో ప్రధాన పాత్ర ఒక డాస్కో.

పరిశోధనలో మార్చు

ప్రముఖ పూర్వ విద్యార్థులు మార్చు

 
2017 ఆగస్టులో డూన్ పాఠశాల నమూనా ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్సులో ప్రసంగిస్తున్న 1988 నాటి పూర్వ విద్యార్థి, భారత రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ.

పాఠశాల యొక్క పూర్వ విద్యార్ధులు డాస్కోలు అని పిలవబడుతారు. కాని సరైన పదం మాజీ-డాస్కోలు అని ఉండాలి ఎందుకంటే, డూన్ లో ప్రస్తుత విద్యార్ధులను కూడా డాస్కోలు అనే పిలుస్తారు. పూర్వ విదార్ధులను మాజీ-డాస్కోలు అని లేదా ఓల్డ్ బాయ్స్ అని పిలుస్తారు. డాస్కో అనే పదం డూన్, స్కూల్ అనే పదాల సంక్షిప్త పదం.

ఒక డాస్కో యొక్క "విజయాన్ని" ఫుట్ ప్రజా సేవకు ప్రాముఖ్యత ఇస్తూ, ఈ విధంగా వర్ణించారు:

పద్దెనిమిది -- ఆఖరి అధ్యాయం ముగిసినది, ఆఖరి పరీక్ష, ఆఖరి ఆట ముగిసే ఈల, ఆఖరి గోల్డెన్ నైట్, రైల్వే స్టేషన్‌లో ఆఖరి వీడుకోలు. పాఠశాలలో ఇంకా బాగా చేసి ఉండవచ్చని ఆలోచించడానికి ఇది సమయం కాదు. కాని చెడు అంతా మరిచిపోతాం మంచి మాత్రమే గుర్తుంటుందని తెలుసుకుని మీరు బయిలుదేరండి. పసుపు కార్డులు, ఎర్ర కార్డులు అన్ని కాల్చేయబడుతాయి కాని ఆనర్స్ పుస్తకము మాత్రం అట్టిపెట్టబడుతుంది. మీరు చేసిన గోల్‌లు మాత్రమే ఉంటాయి, మీరు చేయలేకపోయిన గోల్‌లు ఉండవు... మీరు పాఠశాలను వదులుతున్నప్పుడు, మీ వృత్తిలో తదుపరి అడుగు గురించి బహుశా ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఉంటారు. మీ ప్రవర్తన ఎలాగ ఉండబోతుంది? మీరు మీ ఉపకరణాలు, మీ అవకాశాలను వాడి మరింత దానం, బలం, పలుకుబడిని పెంచబోతున్నారా? ఒక ధన సంపాదనా సమాజంలో మీరు ఒక విజయవంతమైన సభ్యుడు అవ్వలానేదే మీ కోరికా? మీ విద్య మీ దేశం మరింత పొందేందుకు వీలిస్తుందా లేదా దేశానికి ఇవ్వడానికా? మీరు వెనుక వదిలేసి వెళ్ళిన గురుతు (ఎందుకంటే దీనిని మీరు తీసుకు వెళ్ళలేరు) మలబార్ హిల్‌లో నిర్మించిన భవనమా లేదా మీరు సేవ చేసిన ప్రజల గుండెల్లో అది నిర్మించినదా?[2]
 
1962 నాటి డాస్కో విద్యార్థి, సామాజిక కార్యకర్త, బేర్‌ఫుట్ కళాశాల స్థాపకుడు బంకర్ రాయ్.

డాస్కోలు, రాజకీయం, ప్రభుత్వ సేవ, భారత్, పాకిస్తాన్ సైన్యం, వ్యాపారం, పత్రికారంగం, కళ, సాహిత్య రంగాల్లో ప్రసిద్ధి చెందారు. వారిలో కొందరు: పూర్వ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ, తొమ్మిది మంది కాబినెట్ మంత్రులు, ఇద్దరు ముఖ్య మంత్రులు, పలువురు భారత దేశ కేంద్ర శాసన సభా సభ్యులు, రాష్ట్ర శాసన సభా సభ్యులు; ఒక ప్రసిద్ధ నక్సలైట్; పంతొమ్మిది మంది జనరల్‌లు, ఇద్దరు అడ్మిరల్‌లు, భారత వాయు దళం, పాకిస్తాన్ వాయు దళం మాజీ అధినేతలు; ఇరవై నలుగురు దేశ రాయబారులు (భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, యునైటెడ్ కింగ్డం దేశాలకు).

 
1973 నాటి డూన్ విద్యార్థి, ప్రముఖ చరిత్రకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత రామచంద్ర గుహ

విక్రం సేథ్, రామచంద్ర గుహ, విజయ్ ప్రశాద్, అమితావ్ ఘోష్ వంటి రచయితలు, ప్రన్నోయ్ రాయ్, కరణ్ థాపర్ వంటి పాత్రికేయులు, రోషన్ సేథ్, చంద్రచూర్ సింగ్ వంటి చలనచిత్ర నటులు, సమాజ సేవకుడు బున్కేర్ రాయ్, శిల్పి అనిష్ కపూర్ - డాస్కోలే. తొలి భారతీయ రోడ్స్ స్కాలర్ లోవ్‌రాజ్ ఒక డాస్కో; ఒలింపిక్ బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు అభినవ్ బింద్ర ఒక డాస్కో; భారతదేశపు తొలి పర్వతారోహకుడు నందూ జయాల్ ఒక డాస్కో [5].

మూలాలు మార్చు

  1. కన్స్ట్రక్టిన్గ్ పోస్ట్-కలోనియల్ ఇండియా: నేషనల్ కేరక్టర్ అండ్ ది డూన్ స్కూల్ , సంజయ్ శ్రీవాస్తవ రచన [1]
  2. 2.0 2.1 2.2 2.3 2.4 ది డూన్ స్కూల్ సిక్ష్టీ యియర్స్ ఆన్ , డూన్ స్కూల్ ఓల్డ్ బాయ్స్ సొసైటీ ప్రచురణ, అక్టోబర్ 1996.
  3. సాహిబ్స్ హూ లవ్ద్ ఇండియా , ఖుష్వంట్ సింగ్ రచించినది, సెప్టెంబర్ 2009
  4. ఎన్సైక్లోపీడియా అఫ్ త్రవెల్, టూరిజం అండ్ ఇకోటూరిజం, వాల్యూం 1 ; P.C. సిన్హా రచించినది[2][permanent dead link]
  5. 5.0 5.1 ఫర్ హిల్స్ తు క్లైమ్బ్ ; ఎడిటర్: ఆమిర్ అలీ; ది డూన్ స్కూల్ ఓల్డ్ బోయ్స్ సొసైటీ ప్రచురుణ
  6. 6.0 6.1 ఇండియా టుడే ఏప్రిల్ 23, 2001 [3] Archived 2010-11-26 at the Wayback Machine
  7. http://www.doonschool.com/m2032/lexicon.htm Archived 2008-12-01 at the Wayback Machine మరిన్ని చూడండి
  8. బాలీవుడ్ హుంగామ , జూన్ 9, 2010
  9. http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Doon-school-bans-Ashvin-Kumars-film/articleshow/6919672.cms డూన్ పాఠశాల అశ్విన్ కుమార్ చిత్రాన్ని నిషేదించింది టైమ్స్ అఫ్ ఇండియా, నవ 14 2010

బాహ్య లింకులు మార్చు

వార్తలలో డూన్