నవశక్తి (వారపత్రిక)
నవశక్తి 1937 డిసెంబరు 15వ తేదీన ప్రారంభమైన వారపత్రిక. రాజమండ్రి నుండి వెలువడినది. మద్దూరి అన్నపూర్ణయ్య ఈ పత్రిక సంపాదకుడు. కార్మికుల, కర్షకుల పక్షాన ఈ పత్రిక నిలిచింది. ఈ పత్రికను కమ్యూనిస్టులు తమ రాజకీయ తరగతులలో పంచిపెట్టేవారు. ఈ పత్రిక విద్యార్ధి, వామపక్ష ఉద్యమాలకు మద్దతు పలికేది.[1] కొన్నిరోజులకు ఈ పత్రిక సోషలిస్టు పార్టీ ఆధికార పత్రికగా మారి విజయవాడ నుండి వెలువడసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ పత్రిక మూతబడింది.
![]() | |
సంపాదకులు | మద్దూరి అన్నపూర్ణయ్య |
---|---|
తరచుదనం | వారపత్రిక |
స్థాపక కర్త | మద్దూరి అన్నపూర్ణయ్య |
మొదటి సంచిక | డిసెంబరు 15, 1937 |
దేశం | ![]() |
కేంద్రస్థానం | రాజమండ్రి |
భాష | తెలుగు |
చరిత్ర
మార్చుఈ పత్రిక ఆవిర్భావం గురించి రావినూతల శ్రీరాములు తన "మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య జీవితచరిత్ర" అనే గ్రంథంలో ఈ విధంగా పేర్కొంటాడు.[2]
(మద్దూరి అన్నపూర్ణయ్య) 1935 జూలై 7న రాజమండ్రి చేరుకున్నాడు. తన పిత్రార్జితం రెండు ఎకరాలు అమ్మివేశాడు. ఆ వచ్చిన డబ్బుతో ఒక పత్రిక నడపాలని నిశ్చయించుకున్నాడు.
స్తబ్దులుగా పడివున్న జనానికి చైతన్యం కలిగించడం పత్రిక లక్ష్యంగా ఉండాలని ఆయన భావన.
నూతన పత్రికకు నవశక్తి అని నామకరణం చేశాడు. స్వంత బాధ్యతపై నడిపేందుకు డిక్లరేషన్ తీసుకున్నాడు.
1937 డిసెంబర్ 15న 'నవశక్తి' మొదటి సంచిక కారల్ మార్క్స్ ముఖచిత్రంతో వెలువడింది. 'కార్మిక కర్షకులారా ఏకముగండు' అనే నినాదం కూడా ప్రముఖంగా ముద్రించారు. పండిత జవహర్ లాల్ నెహ్రూ, జయప్రకాశ్ నారాయణ్ ప్రభృతులు 'నవశక్తి'ని ఆశీర్వదించారు.
'నవశక్తి' పత్రిక ఆశయాన్ని అన్నపూర్ణయ్య ఇలా వివరించాడు. "ఇది సోషలిస్టు విధానాన్ని అందిస్తుంది. కాంగ్రెసు స్వాతంత్ర్య పోరాటాన్ని బలపరుస్తుంది. సామ్రాజ్యవాదాన్ని చీల్చిచెండాడటానికి సాయపడుతుంది."
తొలుత అన్నపూర్ణయ్య వ్యక్తిగతంగా ప్రారంభించిన 'నవశక్తి' కాంగ్రెసు సోషలిస్టు అధికార పత్రికగా వెలువడసాగింది.
అప్పట్లో కమూనిస్టు పార్టీపై నిషేధం మూలంగా పుచ్చలపల్లి సుందరయ్య ప్రభృతులు కాంగ్రెసు సోషలిస్టుపార్టీలో ఉండేవారు. మద్దుకూరి చంద్రశేఖరరావు, తుమ్మల వెంకట్రామయ్య గార్లు అన్నపూర్ణయ్యతో పాటు సంపాదకవర్గంలో ఉండేవారు. 1938 చివరకు సంపాదక వర్గంలో సభ్యుల సంఖ్య పెరిగింది. అన్నపూర్ణయ్య మినహా మిగతావారందరూ కమ్యూనిస్టులే. చివరకు అన్నపూర్ణయ్య నవశక్తితో తన సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాడు.
రచనలు
మార్చుఈ పత్రికలో ప్రచురితమైన కొన్ని రచనలు[3]:
- దేశచరిత్రలు - శ్రీరంగం శ్రీనివాసరావు
- జాతీయ ఐక్య సంఘటనమే సామ్రాజ్యవాదాన్ని సరిగా ఢీ కొంటుంది - పోలేపెద్ది నరసింహమూర్తి
- రష్యాలో కుట్రలు - మద్దుకూరి చంద్రశేఖరరావు
- ఆంధ్రరాష్ట్రోద్యమము - వావిలాల గోపాలకృష్ణయ్య
- ప్రపంచ యుద్ధం వస్తే... - పుచ్చలపల్లి సుందరయ్య
- ఫేసిజం - కంభంపాటి సత్యనారాయణ
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ సారథులు – 17 ; మద్దూరి అన్నపూర్ణయ్య". విశ్వ సంవాద్ కేంద్ర, ఆంధ్రప్రదేశ్. Vishwa Samvad Kendra Andhra Pradesh. Retrieved 3 March 2025.
- ↑ రావినూతల శ్రీరాములు (1 March 2000). మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య జీవితచరిత్ర (PDF). హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. p. 23. Retrieved 3 March 2025.
- ↑ ఆండ్ర శేషగిరిరావు (1 June 1938). "ఆంధ్రభూమి పుస్తకపీఠము". ఆంధ్రభూమి మాసపత్రిక. 6 (11): 523. Retrieved 3 March 2025.