పప్పూరు రామాచార్యులు

పప్పూరు రామాచార్యులు (నవంబర్ 8, 1896 - మార్చి 21, 1972) [1]రాయలసీమ ప్రముఖుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. శ్రీబాగ్‌ ఒడంబడికలో రాయలసీమకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులలో రామాచార్యులు కూడా ఒకడు.

పప్పూరు రామాచార్యులు
పప్పూరు రామాచార్యులు
జననం(1896-11-08)1896 నవంబరు 8
India అనంతపురం పట్టణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం1972 మార్చి 21
వృత్తిరాజకీయాలు
ప్రసిద్ధిపత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు
పదవి పేరుశాసన సభ్యుడు (ధర్మవరం నియోజకవర్గం)
మతంహిందూ
పిల్లలుముగ్గురు కొడుకులు, 7 మంది కూతుళ్లు
తండ్రిపప్పూరు నరసింహాచార్యులు
తల్లికొండమ్మ

2022 మార్చి 21న పప్పూరు రామాచార్యులు 50వ వర్ధంతి జరుపుకోనున్నారు.[2]

జీవిత విశేషాలు మార్చు

నరసింహాచార్యులు, కొండమ్మ దంపతులకు 1896 నవంబర్ 8వ తేదీనఅనంతపురంలో పప్పూరు రామాచార్యులు జన్మించాడు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన బ్రాహ్మణ కుటుంబీకుడు. ఇతని పూర్వీకులు పప్పూరు నుండి అనంతపురానికి వచ్చి స్థిరపడినవారు కాబట్టి ఇతని కుటుంబాన్ని పప్పూరువారని అనటం ఆనవాయితీ అయింది. ఇతని తండ్రి నరసింహాచార్యులు పేరు మోసిన పౌరాణికుడు. హరికథలు చెప్పడంలో సిద్ధహస్తుడు. అతడి పురాణప్రసంగాలలో హాస్యధోరణి అధికం. ఆ లక్షణాలే కుమారునిలో కూడా పొడచూపాయి. పప్పూరు రామాచార్యులు తండ్రివద్దే సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నాడు. ప్రాథమిక విద్య అనంతపురం మునిసిపల్ హైస్కూలులో సాగింది. రాజమండ్రిలో అతని బావ కుంటిమద్ది రంగాచార్యుల వద్ద చేరి స్కూలు ఫైనల్ పాసయ్యాడు.[3] రాజమండ్రి పాఠశాలలో వడ్డాది సుబ్బారాయుడు ఇతనికి ఆంధ్రభాషను బోధించే గురువు. అక్కడే కందుకూరి వీరేశలింగంతో పరిచయం ఏర్పడింది. 1914-16లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. ఆ సమయంలోనే రాజకీయాలంటే మక్కువ ఏర్పడింది. 1917లో అనంతపురం లోని దత్తమండల కళాశాలలో బి.ఏ.చేరాడు. రామాచార్యులు 1917-1918లలో బి.ఏ. చదువుకుంటున్న సమయంలో సహాధ్యాయి కర్నమడకల గోపాలకృష్ణమాచార్యులతో కలిసి పదిహేను రోజులకొకసారి ‘వదరుబోతు’ పేరున వ్యాసాలను ప్రచురించి కరపత్రాలుగా పంచేవాడు. అప్పటి సమకాలీన సమాజ పరిస్థితులు, సాంఘిక దురాచారాల ఖండన, జాతీయోద్యమం మొదలైన అంశాలపై హాస్య, వ్యంగ్యాత్మక ధోరణిలో, సులభమైన భాషాశైలిలో రెండు సంవత్సరాల పాటు యాభైకి పైగా వ్యాసాలను వెలువరించారు. వీటిలో ఒక వ్యాసం మాత్రం రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశాడు. వీటిని అనాటి అనంతపురంలోని స్వామి విలాస ప్రెస్సు లో ముద్రించారు. ఆంగ్ల సాహిత్యంలో టాట్లర్ పేరుతో వ్యాసాలు రాసిన స్టీలు ప్రేరణతో వీరు ఈ వ్యాసాలు రాశారు[4]. యాబై వ్యాసాలలో ఇరవై రెండు వ్యాసాలను వ్యాసపాఠకుడైన హిందూపురానికి చెందిన పక్కా గురురాయాచార్యుల నుండి సేకరించి, 1932న పుస్తకరూపంలో ముద్రించారు. ఈ పుస్తకానికి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ముందుమాట రాశాడు. 1920లో బి.ఏ. పూర్తికాగానే కలెక్టర్ ఆఫీసులో చిన్న ఉద్యోగంలో చేరాడు.

స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో 1921లో ఆ ఉద్యోగాన్ని మానివేశాడు. ఆ సమయంలో అతనికి కైప సుబ్రహ్మణ్యశర్మతో పరిచయం ఏర్పడింది. అతని సహకారంతో ఇల్లూరులో నీలం సంజీవరెడ్డికి మరికొందరు పిల్లలకు ప్రైవేటు పాఠాలు చెప్పేవాడు. కైప సుబ్రహ్మణ్యశర్మ, అతని సోదరుడు మహానందయ్య, ఐతరాజు నరసప్ప, పాలకొండ రామచంధ్ర శర్మ, ఆత్మారామప్ప మొదలైన వారితో కలిసి 1922లో పినాకిని అనే వారపత్రికను ప్రారంభించాడు. 1925 వరకు ఈ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు. ఆ పత్రిక భాగస్వాములతో భేదాభిప్రాయాలు ఏర్పడి బయటకు వచ్చి 1926లో శ్రీ సాధన అనే పత్రికను స్థాపించి, స్వంత ప్రెస్సు సాధన ముద్రణాలయంలో ప్రచురించాడు. ఈ పత్రికను 1972 మార్చిలో మరణించే వరకూ ఒక్క చేతితో నిరాఘాటంగా నడిపాడు.

గ్రంథాలయోద్యమంలో పాత్ర మార్చు

అనంతపురం జిల్లాలో గ్రంథాలయోద్యమంతో పాటు సాహిత్య సాంన్కృతిక రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో పప్పూరు రామాచార్యులు ఒకరు. నిరంతరం గ్రంథపఠన చేస్తూ అనేక విషయాలను ఆకళింపు చేసుకునేవారు. ఆయన సంస్కృతాంధ్ర పాండిత్యాలు భారతదేశ సంస్కృతి మూలసూత్రాలను చక్కగా అర్ధం చేసుకోవ డానికి దోహదం చేసింది. వ్యక్తిత్వ వికాసానికి గ్రంథపఠన ఆవశ్యకతను తొలుతనే గుర్తించినారాయణ. గ్రంథాలయాలు లేని రోజుల్లో రామాచార్యులు స్వయంగా పుస్తకాలు సేకరించి చిన్న పుస్తక భాండాగారం నెలకొల్పి కొంతకాలం నిర్వహించారు.

అనంతపురం చుట్టుప్రక్కలున్న తాలూకా, గ్రామస్థాయి గ్రంథాలయాలకు సైతం చేర్చేవారు. 1947-52 వరకు అనంతపురం పట్టణ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పడు ఆ మునిసిపాలిటి ఆదాయం పెరిగి 3వ గ్రేడ్ నుండి 2వ గ్రేడ్ స్థాయికి చేరుకుంది. ఇందులో గ్రంథాలయా లకు గ్రంథాలయ పన్నులు సక్రమంగా చెల్లించి నూతనంగా గ్రంథాలయాలను నెలకొల్పి కొత్త పుస్తకాలను సమకూర్చారు. అనంతపురం మునిసిపాలిటీలో నిరంతర విద్యా విజ్ఞాన భాండా గారాన్ని నెలకొల్పడం అనేది ప్రశంసనీయమైన నిర్ణయమని మద్రాస్ మెయిల్ అనే పత్రిక 4.11.1950 తేదీన సంపాదకీయంలో పేర్కొంది. ఆ సంపాదకీయం చదివిన నాటి జిల్లా కలెక్టర్ జేమ్స్ రామాచార్యులను ప్రత్యేకంగా అభినందించారు.

1952లో అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఏర్పడినప్పడు తొలి అధ్యక్షులుగా పనిచేసే అవకాశం కల్గింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సరైన భవనం దొరకలేదు. తన ఇంటిలోని మూడు గదులను గ్రంథాలయ అవసరాలకు ఇచ్చివేశారు. సొంత పత్రిక శ్రీసాధనను జిల్లాలోని గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణి చేశారు. వీరు జిల్లాలోని గ్రంథాలయాలకు చేసిన కృషి మరువరానిది. అనంతవురం జిల్లా కేంద్ర గ్రంథా లయానికి భవనం కావల్సి వచ్చింది. స్థానిక మ్యూజియం వారిని ఒప్పించి ఆ భవనాన్ని రూ.46,000/- లకు గ్రంథాలయ సంస్థకు విక్రయింపచేశారు. రాయలసీమలోని అన్ని జిల్లాలో కంటే ముందుగా అనంతపురంలో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సొంత భవనం సమకూర్చుకుంది. ముందుచూపుతో కేంద్ర గ్రంథాలయ భవన సమీపంలో దాతలతో 30వేలకు పైగా నిధిని, 50 సెంట్ల స్థలాన్ని సేకరించి మహిళా, బాలల గ్రంథాలయాలను ఏర్పరచారు. వీటి ప్రారంభోత్సవానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు విచ్చేయడం విశేషం. జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన ప్రాంగణంలో 1969లో ఆరుబైలు రంగస్థలం భువనవిజయం మంటపం నిర్మాణంలో కీలకపాత్ర వహించి దీని ప్రారంభించడానికి వావిలాల గోపాలకృష్ణయ్య, నీలం సంజీవరెడ్డి, పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు మొదలైన ప్రముఖులు విచ్చేశారు. ఇలా అన్ని సదుపాయాలు చేకూరడంతో 1969లో ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథా లయోద్యమ ప్రముఖులు డా.ఎస్.ఆర్.రంగనాథన్ ప్రశంసలకు పాత్రమైనది. జిల్లా గ్రంథాలయ సంస్థ రావూచార్యులను ఘనంగా సన్మానించింది. 1970లో ఆయన ఛాయాచిత్రాన్ని గ్రంథాలయంలో ఆవిష్కరించారు. 1930లో జరిగిన ఒక సంఘటన పప్పూరి వారికి గ్రంథాలయోద్యమం పట్ల గల అభిమానానికి సేవానిరతికి మచ్చుతునక.

స్వాతంత్రోద్యమంలో పాత్ర మార్చు

ఇతడు కల్లూరు సుబ్బారావు కలిసి గ్రామగ్రామాలకూ తిరిగి అక్కడి ప్రజలలో స్వాతంత్ర్య సమూపార్జనా కాంక్షను రేకెత్తించాడు. మద్యపాన నిషేధము, ఖద్దరు వస్త్రధారణ, హరిజనోద్ధరణ, గ్రామ పరిశుభ్రత మొదలైన కార్యక్రమాలను చేపట్టాడు. 1921లో గాంధీని తాడిపత్రిలో సందర్శించాడు. ఆ సమయంలో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్షను అనుభవించాడు. 1928 నవంబరులో నంద్యాలలో జరిగిన ఆంధ్రమహాసభలలో పాల్గొని దత్తమండలాలకు బదులు రాయలసీమ అని వ్యవహరించాలని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింప జేశాడు. 1932లో ఒక సంవత్సరం పాటు సహాయనిరాకరణోద్యమంలో భాగంగా జైలుశిక్షను అనుభవించాడు.1937 నవంబర్ 17న శ్రీబాగ్‌ ఒడంబడికలో క్రియాశీలక పాత్రవహించాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈయన అరెస్టయ్యి తంజావూరు, వేలూరు జైళ్ళలో రెండేళ్ళు జైలుశిక్ష అనుభవించాడు. ఆ సమయంలో ఇతడు తనకున్న సహజ పౌరాణిక ప్రవచనాలతో తోటి డిటెన్యూలకు భారత, కాళిదాస కావ్యములలోని రమ్యభావాలను వినిపిస్తూ, సత్కాలక్షేపం చేసేవాడు. ఇతని ప్రవచనాపాండిత్యానికి రాజకీయఖైదీలు సంతోషించి జైలులోనే ఇతనికి పండిత సత్కారాలను నెరవేర్చేవారు. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా ఇతడు పురాణ కాలక్షేపాన్ని కొనసాగించాడు. బళ్ళారిలో ఇతడు చేసిన పురాణ పఠనాన్ని విని బళ్ళారి రాఘవ ఇతడిని బంగారుపతకంతో సత్కరించాడు. 1947నుండి 1952 వరకు అనంతపురం పట్టణ మున్సిపల్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. 1952 నుండి 1955 వరకు జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు. 1955 నుండి1962 వరకు ధర్మవరం నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5] ఇతని రచనా సామర్థ్యానికి వదరుబోతు వ్యాసాలు మచ్చుతునకలు. కల్లుపెంట అనే నాటకం వ్రాశాడు. రామయ్య పదాలుపేరుతో 'విశ్వవినుత నామ వినుము రామ' అనే మకుటంతో 40 పద్యాలు వ్రాశాడు. పినాకిని, సాధన పత్రికలతో పాటుగా సహకార పత్రికకు కుడా సంపాదకత్వం నెరపాడు. దక్షిణభారత హిందీ ప్రచారసభ వారి స్రవంతి పత్రిక సంపాదకవర్గంలో సభ్యుడిగా ఉన్నాడు. 1972 మార్చి21 వతేదీ తన 76వ యేట మరణించాడు.

మూలాలు మార్చు

  1. రాయలసీమ రచయితల చరిత్ర - రెండవ సంపుటి- కల్లూరు అహోబలరావు - పుట 158-164
  2. "రాయలసీమ వాగ్వైభవం". andhrajyothy. Retrieved 2022-03-18.
  3. సీమసాహితీస్వరం - శ్రీసాధన పత్రిక - డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి - పుటలు26-38
  4. వదరుబోతు, తెలుగు వాచకం, 10 వ తరగతి(పాతది), ప్రభుత్వ ప్రచురణలు, 2006, పుట- 86
  5. వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక సంచిక - అనంతనేత్రం పుటలు35-38
  • గ్రంథాలయ సర్వస్వం- 2015 జూన్