దేవాంగ పిల్లి అనేది లోరిస్డే (Lorisidae) కుటుంబానికి చెందిన జంతువు. ఆంగ్లంలో స్లెండర్ లోరిస్ అని వీటికి పేరు. దేవాంగ పిల్లుల్లో రెడ్ స్లెండర్ లోరిస్ ( red slender loris- Loris tardigradus) మరియు గ్రే స్లెండర్ లోరిస్ ( gray slender loris - Loris lydekkerianus) అను రెండు రకాలున్నాయి. ఇవి సాధారణంగా శ్రీలంక మరియు దక్షిణ భారత దేశాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో కనిపిస్తాయి. భారత దేశంలో ఇవి ఎక్కువగా అగ్నేయమూల అటవీ శ్రేణుల్లో కనిపిస్తాయి. Loris tardigradus malabaricus అనే ఉప జాతి కేవలం భారత దేశంలోనే కనిపిస్తుంది. వీటికి నంగనాచి , పిగ్మీ, నైట్ మంకీ, మూడు జానల మనిషి అనే పేర్లు కూడా ఉన్నాయి.
==వివరణ==
దేవాంగ పిల్లులు 6 నుండి 15 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. ఇవి 275 గ్రాముల నుండి 348 గ్రాముల వరకూ బరువుంటాయి. వీటికి గుండ్రటి తల, పెద్ద గోధుమ రంగు కళ్ళు, కళ్ళు చుట్టూరా ముదురు గోధుమ లేదా నలుపు జూలు చుట్టిముట్టి ఉంటుంది. చెవులు గుండ్రటి ఆకారంలో పెద్దగా ఉంటాయి. వీపు పై జూలు ఎరుపు-గోధుమ సమ్మేళనం లో ఉండి గుండె భాగం మరియు పొట్ట భాగం పై తెలుపు రంగులో ఉంటుంది. ఆడ దేవాంగ పిల్లులు ఒకటి లేదా రెండు పిల్లలకు జన్మనిస్తాయి. చెట్ల చిటారు కొమ్మలపై జీవిస్తూ ఆకుల్ని, పురుగుల్ని తినే ఈ చిన్న జీవుల సగటు జీవితకాలం 12 నుండి 15 సంవత్సరాలు.
==క్షీణ దశ==
భారత దేశంలో కొన్ని గిరిజన జాతులవారు దేవాంగ పిల్లుల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని, అద్భుత శక్తులున్నాయని విశ్వసిస్తారు. వీటి కళ్ళను క్షుద్ర విద్యలు ప్రదర్శించేవారు ఉపయోగిస్తారు. ఇటీవల కొంతమంది స్వార్ధ పరులు డబ్బు సంపాదన కోసం వీటిని గిరిజనులనుండి సేకరించి విదేశాలకు పెంపుడు జంతువులుగా 'లిల్లీపుట్స్' అనే పేరుతో అమ్ముకోవడం జరుగుతోంది. అందువల్ల దేవాంగ పిల్లుల జాతి కనుమరుగయ్యే ప్రమాదముందని ఆటవీశాఖవారు భావిస్తున్నారు. భారతీయ అటవీ చట్టం ప్రకారం వీటిని కలిగియుండటం మరియు అమ్మడం నేరం.