బ్రాహ్మణీకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
==కథాసంగ్రహము==
సుందరమ్మ పల్లెటూరి బ్రాహ్మణపిల్ల. సంప్రదాయంగావస్తున్న నికార్సైన పూర్వాచారపరాయణకుటుంబం లో పుట్టిన కారణంచేత మడి, ఆచారం, దేవుళ్లు, దెయ్యాలు, జ్యోతిషాలు, సోదెలు మొదలైన మూఢనమ్మకాలుగల అమాయక ప్రవృత్తి కలిగింది. బహు చిన్ని వయస్సు అయినా పెద్ద ఆచారాలు, పెద్దమడులు, పెద్దవూహలు. ఎనిమిదోయేటనే మేనత్తకొడుక్కిచ్చి పెళ్లిచేశారు. పెళ్లికాగానే సంస్కృత విద్యాభ్యాసంకోసం పరదేశాలకు పోయి ఆరేళ్లు గడచివచ్చి కార్యంచేసుకుని భార్యతో కాపురం సాగించాడు. సుందరమ్మ యితని రసికతకు దీటైన సౌందర్యరాశి అవటంచేత రెండు సంవత్సరాలపాటు యధేచ్ఛగా ప్రవర్తించారు. ఇంతలో దేవుడికి కన్ను కుట్టిందికాబోలు దాంపత్యాన్ని త్రుంచివేశాడు. తీవ్రజాడ్యం యేర్పడి భూశయనం చేయబడ్డాడు అతడు. దీపం కునికిపోయే సమయంలో సుందరమ్మను, మామగార్ని దగ్గరకు పిలిచి "నేను పోయినా దానిలో నివసించబోతున్నాను. దాని అందాన్ని అమితంగా ప్రేమిస్తున్నాను. దానిని వికారం చెయ్యొద్దు" అని చెప్పి ప్రాణాలు విడిచాడు. మూడు సంవత్సరాలు గడిచాయి. భర్తకు చేసిన వాగ్దానం ప్రకారం యేయితరజోక్యం కలుగచేసికోకుండా తొణుకాడని గాంభీర్యంతో తపశ్శాలినిలాగుందే అనుకునేటట్టు తోపచేస్తోంది. ఇంతలో తండ్రికూడా మరణించాడు. దిక్కు శూన్యమయ్యేసరికి మేనమామ చేరదీశాడు. మేనమామ వెంకట్రామయ్య యింట్లో చంద్రశేఖరమనే బీదకుర్రాడు చదువుకుంటూ వెంకట్రామయ్య కూతురుకు పాఠాలు, సంగీతం చెబుతున్నాడు. సుందరమ్మను కూడా వానిదగ్గర పాఠం, సంగీతం వగైరా నేర్చుకోవలసిందిగా మేనమామ ఆజ్ఞాపించాడు. చంద్రశేఖరం ఆగర్భదరిద్రుడు. వీనికి సుందరమ్మమీద మనసు పారింది. కొంతకాలం వీనిచేష్టలు ఆమె గుర్తించనే లేదు. సుందరమ్మకు ఆ గొడవే లేదు. చంద్రశేఖరం తాపన అంతకంతకు జాస్తి అవుతోంది. తన ఉపాయాలన్నీ విఫలమవుతాయి. కొంత కాలానికి వాని దురూహ సుందరమ్మకు కొంచెం అర్థమవుతుంది. అయినా తొణకదు. ఆతడో ఆమెమీద త్రాచుపగ పట్టాడు. ద్వేషం, మోహం రెండూ పెన వేసుకుని బాధిస్తున్నాయి అతన్ని. ఆమెను పొందనిదే తన జన్మసార్థకత కాదనే మూర్ఖపు పట్టుపట్టి ధైర్యంచేసి సఫలుడైనాడు. సుందరమ్మ పొత్తికడుపు పెద్దదై నునుపెక్కుతోంది.సుందరమ్మ గర్భధారణ విషయం వెంకట్రామయ్య నోటీసులోకి వెళ్లింది. సుందరమ్మను చంద్రశేఖరానికిచ్చి వివాహం చేయడం తప్ప వేరే ఉపాయమేమీ తోచక వానిని పట్టి తీసుకువచ్చి వివాహం జరిపించి యిరవై అయిదు రూపాయల బ్యాంకు గుమాస్తాపనికూడా కుదిర్చి వేరే కాపురం పెట్టించి చేతులు కడిగేసుకున్నాడు. ఈ వివాహ విషయంలో చంద్రశేఖరం సుందరమ్మల ఇష్టాయిష్టాలను తెలుసుకోవటానికి యెవ్వరూ ప్రయత్నించలేదు. సుందరమ్మ చంద్రశేఖరాన్ని ప్రేమించలేదు. పైగా తన జీవితాన్ని ధ్వంసంచేసినాడనీ, తాను తన పూర్వపుభర్తకు చేసిన వాగ్దానం భంగం చేసినదనీ, యీ వితంతు వివాహం మహాపాపకార్యమనీ చంద్రశేఖరాన్ని ద్వేషంగా చూడటం మొదలెట్టింది. సుందరమ్మ యొక్క ప్రకృతిని తెలుసుకోకుండా తను అంటే ఆమె విముఖురాలుగా వుండటం ఆమెకు పరపురుష సంబంధ మున్నదని చంద్రశేఖరం అనుమానపడి యిద్దరకూ ఒకరిని చూస్తే ఒకరికి ఏమాత్రం పడకుండావచ్చింది.
"https://te.wikipedia.org/wiki/బ్రాహ్మణీకం" నుండి వెలికితీశారు