[[బాబర్ నామా]]లో మొఘల్ చక్రవర్తి [[బాబర్]] కోహినూర్ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ "ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది' అన్నాడు. తర్వాత మాల్వాను జయించిన [[ఢిల్లీ]] పాలకుడు [[అల్లావుద్దీన్ ఖిల్జీ]] దీన్ని సొంతం చేసుకున్నాడు. 1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం [[బాబర్]] వశమై 'బాబర్ వజ్రం'గా పేరు పొందింది. మొఘల్ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన [[నాదిర్ షా]] ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు. మహమ్మద్ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి, తలపాగాలు ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు. అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్షాకు ధారాదత్తం చేస్తాడు. నాదిర్షా దాన్ని చూడగానే కోహ్ - ఇ- నూర్ (కాంతి శిఖరం) అని అభివర్ణించాడు. దానికి ఆ పేరే స్థిరపడిపోయింది.