'''అభ్రకం''' లేదా '''మైకా''' ఖనిజాల సమూహం అనేది వివిధ లోహాలతో ఉన్న అల్యుమినోసిలికేట్లు. ఇది చక్కని పలకలుగా విడివడి ఉంటుంది. మైకా అనేక దగ్గర సంబంధం గల పదార్థాలతో కూడి పరిపూర్ణ ఆధారభూత చీలికలను కలిగి ఉంటుంది. దీనిని '''కాకి బంగారం''' అని కూడా అంటారు. ఇది అద్దపు పెంకుల వలె ఉంటుంది. రసాయనికముగ ఈ కాకిబంగారం మెగ్నీషియమ్, ఇనుము, సోడియమ్,పొటాషియమ్తో కూడుకొనిన సిలికేట్ యౌగికము. దీని పొరలు తేలికగా అతుక్కుని ఉంటాయి, అందువలన వీటి పొరలను తేలికగా విడదీయవచ్చు. తేలికపాటి పొరలను చేతితో గట్టిగా నలిపి నట్లయితే పొడి పొడి అవుతుంది. ఈ అద్దపు వంటి పెంకు పొరలు తెల్లగా మెరుస్తుంటాయి. అభ్రకం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మైకా గనులు నెల్లూరుజిల్లాలోని గూడూరు పరిసర ప్రాంతాలలో కలవుఉన్నాయి. ఇక్కడి మైకా గనులు 1,000 చ.అ. విస్తీర్ణంలో కలవుఉన్నాయి. ఇక్కడ ముస్కోవైట్, క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, వెర్మిక్యులైట్ రకముల మైకా లభిస్తుంది. మైకా గనులు భారతదేశంలో నెల్లూరుజిల్లా గూడూరు ప్రాంతంలో, జార్ఖండ్ లోని ధనబాద్ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఎలక్ట్రానిక్/విద్యుత్ పరిశ్రమలకు ఆభ్రకం తప్పనిసరిగా కావాలి. మైకా 700 నుంచి 1000 డిగ్రీల సెంటిగ్రేడు వద్ద ద్రవీభవనం చెందుతుంది. గూడూరు ప్రాంతంలో లభించే గ్రీన్, రూబీ రకాల మైకాకు 800 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిని తట్టుకోగల శక్తి ఉంది. మైకాను ప్రధానంగా విద్యుత్ పరిశ్రమల్లో వినియోగించే పరికరాల తయారీలోను, అణుపరీక్షలు, రియాక్టర్లలోను వినియోగిస్తుంటారు. మైకా ఖనిజాన్ని 1885లో నెల్లూరుజిల్లా సైదాపురం ప్రాంతంలో జర్మనీ దేశస్తులు గుర్తించి అప్పుడే షామైన్ అనే పేరుతో గనుల తవ్వకాన్ని ప్రారంభించారు. సైదాపురం ప్రాంతాలలో 143కి పైగా గనుల్లో మైనింగ్ జరుగుతూ 30 వేల మందికి ఉపాధి లభిస్తుండేది, కాలక్రమంలో మైకా గనుల ప్రభావం తగ్గి ఉపాధి పొందే వారి సంఖ్య తగ్గి 10వేల మందికి పరిమితమయ్యింది. ప్రస్తుతం సైదాపురం ప్రాంతంలో ప్రధానంగా లభించే గ్రీన్, రూబీ రకాల మైకాకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. నెల్లూరు మైకాకు చైనా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. నాణ్యమైన మైకా కిలో రూ.25 వేల నుంచి రూ.40 వేల ధర పలుకుతుంది. సాధారణ రకం మైకా వెయ్యి నుంచి పదివేల రూపాయల ధర పలుకుతుంది. మైకా భారతదేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టిన ఒక వనరు.