ఓ వ్యక్తి నాదస్వరం ఊదుతూ ఉంటే చుట్టగా చుట్టిన తాడు పాములాగా పైపైకి లేస్తుంది. ఆ తరువాత ఆ వ్యక్తి దానిని పట్టుకుని పైకి ఎగబ్రాకుతాడు. ఈ విద్యను గురించి నూటయాబై సంవత్సరాల క్రితం ఒక ఆంగ్లేయుడు భారత దేశంలో ఒక ఇంద్రజాల ప్రద్రర్శనను చూసి మెచ్చుకుని ఆనాడే పత్రికలలో వ్రాశాడట. ఆ ఇంద్రజాలంలో ఒకడు త్రాడు నొక దానిని పైకి నిలువుగా విసిరి గాలిలో నిలబెట్టి దాని పైకి ఎగబ్రాకి మాయమైనాడట. తరువాత అతని అంగాలన్నీ ఖండాలుగా క్రింద పడిపోయాననీ మరి కొంత సేపటికి యథా ప్రకారంగా వాడు త్రాటిమీద నుండి గబగబా దిగి వచ్చాడని వ్రాశాడు. ఇలాంటి కథనే "కొరివి గోపరాజు" సింహాసన ద్వాత్రింశికలో వివరించాడు.<ref>{{cite wikisource |title=తెలుగువారి జానపద కళారూపాలు |chapter=గమ్మత్తుల గారడీ విద్యలు|year= 1992 |publisher=తెలుగు విశ్వవిద్యాలయం}} </ref>