పరమపదం: కూర్పుల మధ్య తేడాలు
శ్రీవైష్ణవ దివ్య దేశములలోని 108 వ దివ్య దేశము. అయిన తిరు పరమపదం లేక శ్రీవైకుంఠమును తెలుగు భాషలో వివరించితిని. |
(తేడా లేదు)
|
14:29, 1 మార్చి 2020 నాటి కూర్పు
తిరు పరమపదం / శ్రీ వైకుంఠం
శ్రీ మహా విష్ణువు (108 వ దివ్య దేశము)
తిరు పరమపదం లేక శ్రీ వైకుంఠం దివ్యక్షేత్రము స్వర్గలోకమున కలదు. ఇచ్చటి మూలవర్లు పరమపద నాథుడు, తాయారు – పెరియ పిరాట్టియార్. తీర్థమును విరాజానది అని, విమానమును అనంతాంగ విమానమని పిలిచెదరు. వైకుంఠం, వైకుంఠ లోకం, విష్ణులోకం, పరమపదం, నిత్య విభూతి లేక వైకుంఠ సాగర్ అనునది స్వర్గలోకమున ఉండు విష్ణుమూర్తి యొక్క నివాస స్థానముగా, సర్వలోక ప్రభువుగా, అన్ని వేదములలోనూ, హిందూ పురాణములలోనూ, వైష్ణవ మతాచారములలోనూ కొనియాడబడినది.
వైకుంఠం విష్ణుమూర్తి యొక్క నివాస స్థానముగా ఎల్లప్పుడూ తన దేవేరి లక్ష్మీదేవితో కూడి ఉంటాడు. శ్రీ రామానుజులవారు “పరమపదం లేక నిత్య విభూతి అనునది పరమాత్మ నివసించు స్వర్గలోకము మరియు విడదీయలేని భక్తితో కూడిన ప్రపంచము. సర్వలోకముల కంటెను దూరముగా ఉండునది మరియు ఇంతకు మించి మరేదియు లేదు. దీనిని జయ విజయులు ద్వారపాలకులుగా కాపాడుతూ ఉంటారు.” అని స్వర్గలోకమును గురించి వివరించారు.
వైకుంఠము సత్యలోకము పైన 2,62,00,000 యోజనముల దూరములో విస్తరించియున్నది. అనేక పురాణములు మరియు వైష్ణవ సిధ్ధాంతముల ప్రకారం, మకర రాశి లేదా మకరరాశి దిశలో వెళితే ఆచ్చట ఒక గ్రహము కలదు. ఆ గ్రహము మీద విరజా నది తీరాన గల వైకుంఠములో శ్రీమహావిష్ణువు నివసిస్తాడు.
భాగవతము ప్రకారము వైకుంఠము అన్ని లోకములకంటెను అత్యున్నతమైన లోకముగా, విష్ణుమూర్తి నివాస స్థానముగా తెలుపబడెను. ఇది అన్నిటికంటే అతీతమైనది; చీకటి మరియు జనన మరణ సంసారము కంటెను అతీతమైనది; త్రిగుణములకంటెను (మూడు గుణములు) అతీతమైనది; మరియు ప్రశాంతతను కోరు సన్యాసులు అచ్చటికి చేరి తిరిగిరాని ప్రదేశము. వైకుంఠములో నివసించువారికి ప్రాకృతిక శరీరము ఉండదు, కానీ పరిశుధ్ధ ఆత్మలుగా ఉంటారు. ఈ ఆత్మలు విష్ణుమూర్తిలాగే ఉండి, నారాయణ గానే పరిగణింపబడుతారు. విష్ణుమూర్తి/నారాయణ వైకుంఠములో శ్రీ తో – అనగా అదృష్ట దేవతలతో, రత్నములతో పొదగబడిన గోడలుగల భవనములలో, సిరి సంపదలతో నివసిస్తారు. అచ్చటి ఉద్యానవనములలో మన మనో కోరికలు తీర్చు చెట్లతో సంవత్సరము పొడవునా, వాటంతట అవే వెలుగులు చిందిస్తూ ఉంటాయి మరియు పరిమళ భరితమైన గాలులు వీస్తూ ఉంటాయి. తుమ్మెదలు వివిధ రకాలైన పూల చెట్లపై వాలి ఆ పూవులలోని మకరందమును గ్రోలుతూ ఉంటాయి. విష్ణు భక్తులు తమ అందమైన భార్యలతో వజ్ర వైడూర్యములు పొదిగిన వాహనములపై సంచరిస్తూ ఉంటారు.
భగవంతుడు బ్రహ్మ యొక్క సృష్టికి సంతసించి, తన భక్తులకు అన్నిటికంటే ఉత్తమమైన వైకుంఠములో స్థానము కల్పిస్తాడు. ఈ స్వర్గలోకమునకు చేరినవారు అన్ని విధాలైన పాపములనుండి మరియు భయములనుండి విముక్తులగుదురు. భేదములేమియు లేక అందరూ సమానముగానే చూడబడతారు. వైకుంఠమునకు చేరిన తరువాత వారి శరీరం ఆకాశపు నీలిరంగుతో వెలిగిపోతూ ఉంటుంది. వారి కళ్ళు కమలములవలే ఉంటాయి. వారి శరీరముపై పసుపు రంగు వస్త్రములతో చాలా ఆకర్షణీయముగా ఉంటారు. అందరూ యవ్వనవంతులుగానే ఉండి, నాలుగు చేతులతో, మెడకు, చేతులకు, చెవులకు, భుజములకూ అనేక ఆభరణములతో దేదీప్యమానముగా వెలిగిపోతూ ఉంటారు.
వైకుంఠములో అనేక చోట్ల పుష్పక విమానములు ఎగురుతూ కనిపిస్తాయి. ఈ విమానములు గొప్ప మహాత్ములు మరియు భగవద్భక్తులకూ లభిస్తాయి. ఇచ్చటి యువతులు కాంతి కంటే మెరుపైన దివ్య సౌందర్యముతో వెలిగిపోతుంటారు. ఇచ్చట వీరందరినీ చూస్తుంటే, ఆకాశము మేఘములు, మెరుపులతో అలంకరించబడినట్లుగా ఉంటుంది.
అదృష్ట దేవత అయిన లక్ష్మీదేవి, తన చెలికత్తెలతో విష్ణుమూర్తి పాదములను వివిధ రకాలైన పూవులతో సేవిస్తూ స్వామిపై కీర్తనలు ఆలపిస్తూ భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటుంది. భక్తకోటికి అభయమిచ్చువాడు, లక్ష్మీదేవికి పతి అయినవాడు, అన్ని త్యాగములకు అతీతమైనవాడు, లోకములన్నిటికీ ప్రభువైనవాడు, మరియు తన ముఖ్య అనుచరులైన సునంద, ప్రబల, అర్హణ లతో సేవింపబడువాడు, అయిన విష్ణుమూర్తిని బ్రహ్మదేవుడు వైకుంఠములో చూశాడు.
విష్ణుమూర్తి తనను చేరుకొన్నవారిని ఎంతో ప్రేమతోనూ, వారివైపు ఆకర్షింపబడినవాడిగా, ఎంతో సంతోషముగా చూస్తాడు. తన చిరునవ్వు ముఖముతో భక్తులను ఆకర్షిస్తాడు. పసుపు వర్ణపు దుస్తులతో, తలపై కిరీటముతో కనిపిస్తాడు. నాలుగు చేతులతో, వక్షస్థలమున శ్రీదేవి గుర్తులతో అలరిస్తూ సింహాసనముపై కూర్చుని ఉంటాడు.
ఋగ్వేదములో శ్రీమహావిష్ణువును గురించి ఇలా చెప్పబడెను:-
“తద్ విష్ణోః పరమం పదం సదా పశ్యన్తి సూరయః“ అనగా, దేవతలు అన్నివేళలా విష్ణుమూర్తి యొక్క స్వర్గలోకమును చూస్తూ ఉంటారు “ అని వైకుంఠమును వర్ణిస్తూ చెప్పారు.
శ్రీ పెరియాళ్వార్ – 190, 277, 399, 472 పాశురములలోనూ; ఆండాళ్ -482 పాశురములోనూ; తిరుమజిసై ఆళ్వార్ – 796, 2476 పాశురములలోనూ; తిరుప్పాన్ ఆళ్వార్ – 927 పాశురములోనూ; తిరుమంగై ఆళ్వార్ – 2042 పాశురములోనూ; పొయ్ గయ్ ఆళ్వార్ – 2149 మరియు 2158 పాశురములలోనూ; పేయాళ్వార్ – 2342 పాశురములోనూ; నమ్మాళ్వార్ – 2867, 3000, 3040, 3431, 3465, 3485, 3627, 3740, 3747, 3755 నుండి 3765 పాశురములలోనూ, నాలాయిర దివ్యప్రబంధములోని పాశురములతో స్వామికి మంగళాశాసనములు చేసిరి.