సీతారాం ఏచూరీ, 1952లో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన [[మోహన్ కందా]] మేనల్లుడు. ఈయన తల్లి కల్పకం, మోహన్ కందా సోదరి మరియు, ప్రముఖ సంఘసంస్కర్త [[దుర్గాబాయి దేశ్ముఖ్]] శిష్యురాలు. సీతారాం విద్యాభ్యాసమంతా దిల్లీలోనే సాగింది. దిల్లీ ఎస్టేట్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. సీబీఎస్ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బీఏ(ఆనర్స్) ఆర్థికశాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్యూలో పీ.హెచ్.డీ లో చేరినా, డాక్టరేటు పూర్తి చేయలేకపోయారు. సీతారాం ఏచూరి, సీమా చిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. గతంలో ఆమె బీబీసీ హిందీకి దిల్లీ ఎడిటర్గా పనిచేశారు.ప్రస్తుతం సీమా చిస్తీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో రెసిడెంట్ ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం, కుమార్తె ఎడిన్బరోలో ఫ్రొఫెసర్, ఓ కుమారుడు జర్నలిస్ట్, మరో కుమారుడు ఇంకా చదువుతున్నారు. సీతారాం ఏచూరి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్ టైమ్స్లో కాలమ్స్ రాస్తుంటారు.