ట్రోయ్ సంగ్రామం: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{in use}} ==ఇలియాడ్== హోమర్ రాసిన ఇలియాడ్ లో కథనం గ్రీసు సేనలకి, ట్ర...'
(తేడా లేదు)

01:13, 2 జూన్ 2020 నాటి కూర్పు

ఇలియాడ్

హోమర్ రాసిన ఇలియాడ్ లో కథనం గ్రీసు సేనలకి, ట్రోయ్ సేనలకి మధ్య యుద్ధం తొమ్మిదో సంవత్సరంలో ఉండగా మొదలవుతుంది. కవి సాహిత్యాధి దేవత అయిన “మూజ్” ని ప్రార్ధించి గ్రీకు యోధులలో అగ్రేసరుడైన అఖ్ఖిల్లీస్ కోపోద్రేకాలకి కారణమేమిటో చెప్పడంతో గ్రంథ రచన ప్రారంభం అవుతుంది.

యుద్ధం మొదలయి తొమ్మిదేళ్లు గడచిన తరువాత గ్రీకు సైన్యం ట్రోయ్ మిత్రరాజ్యం అయిన క్రిసి ని ముట్టడించి లొంగదీసుకుంటుంది. ఈ సందర్భంలో ఓడిపోయిన రాజ్యానికి చెందిన ఇద్దరు కన్యలు - క్రిసేయిస్ (Chryseis), బ్రెసేయిస్ (Briseis) - గ్రీకుల వశం అవుతారు. గ్రీకుల సేనాధిపతి అగమేమ్నాన్ క్రిసేయిస్ ని తనకి దక్కిన బహుమానంగా తీసుకుంటాడు. అఖ్ఖిల్లీస్ బ్రెసేయిస్ ని తీసుకుంటాడు. క్రిసేయిస్ తండ్రి క్రిసెస్ - సాక్షాత్తు ఒలింపాయన దేవుడైన అప్పాలోకి హితుడు - కూతురు బంధ విమోచనకి అగమేమ్నాన్ కి ఎంతో విలువైన నగలు, ఆభరణాలు పణంగా పెడతాడు కానీ అగమేమ్నాన్ లొంగడు. తన హితునికి ఎదురవుతున్న పరాజయం చూడగానే అప్పాలోకి కోపం వచ్చి అగమేమ్నాన్ సేనల మీద ప్లేగు మహమ్మారి పడాలని శపిస్తాడు.

తమ సేనలు ఎండలలో పిట్టలలా రాలిపోతూ ఉంటే చూసి, కంగారుపడి, అఖ్ఖిల్లీస్ దైవజ్ఞులని సంప్రదించగా, కాల్చస్ (Calchas) అనే దైవజ్ఞుడు లేచి, “ఇదంతా అప్పాలో శాపం వల్ల జరుగుతోంది” అని చెబుతాడు. అప్పుడు అగమేమ్నాన్ - అయిష్టంగానే - క్రిసేయిస్ ని వదలుకుందుకి ఆమోదిస్తాడు; కానీ ఒక మెలిక పెడతాడు. ఏమిటా మెలిక? తాను క్రిసేయిస్ ని వదులుకుంటే ఆ స్థానంలో అఖ్ఖిల్లీస్ తనకి బ్రెసేయిస్ ని ఇచ్చెయ్యాలి! ఈ వంకాయల బేరం విని అఖ్ఖిల్లీస్ కోపోద్రేకుడయి, కత్తి దూసి, అగమేమ్నాన్ తో ద్వంద్వ యుద్ధానికి తయారవుతాడు. ఒక పక్క ట్రోయ్ సేనలు భీకర పోరాటంలో ఉండగా ఈ గిల్లికజ్జాలు ఏమిటని కాబోలు ఒలింపాయని దేవత హేరా ఈ యోధుల మధ్య సంధి కుదర్చమని ఎథీనాని పంపుతుంది. నెస్టర్ సహాయంతో ఎథీనా చేసిన హితోపదేశం అఖ్ఖిల్లీస్ కోపాన్ని చల్లార్చుతుంది. తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారంగా తాను ఇటుపైన యుద్ధం చెయ్యనని ప్రతిన పూని తన గుడారానికి చేరుకుంటాడు. అఖ్ఖిల్లీస్ తన కోపం చల్లారక ముందే తన తల్లి అయిన సముద్రపు “జలకన్య” థేటిస్ ని పిలచి తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారం చెయ్యడానికి దేవతల రాజైన జూస్ నుండి సహాయం అర్థించమని అడుగుతాడు.

ఇది ఇలా ఉండగా అగమేమ్నాన్ క్రిసేయిస్ ని ఆమె తండ్రి దగ్గరకు పంపేసి, బ్రెసేయిస్ ని తన దగ్గరకి రప్పించుకుంటాడు. ఒడీసియస్ తన పడవలో క్రిసేయిస్ ని తీసుకువెళ్ళి ఆమె తండ్రికి అప్పగించగా, అతను సంతృప్తి చెందిన వాడై గ్రీకు సైనికులని శాపం నుండి విముక్తి చెయ్యమని అప్పాలోని కోరుకుంటాడు. గ్రీసు కీ ట్రోయ్ కి మధ్య తాత్కాలికంగా యుద్ధ విరమణకి ఒప్పందం జరుగుతుంది.

గ్రీకు సేనలకి, ట్రోయ్ సేనలకి మధ్య యుద్ధం ఆగింది కానీ అఖ్ఖిల్లీస్ కి అగమేమ్నాన్ కీ మధ్య విరోధ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. దేవతల రాజైన జూస్ ని కలుసుకోడానికి థేటిస్ కి పన్నెండు రోజులు పట్టింది. జూస్ ట్రోయ్ పక్షం కాస్తే భార్య హేరాకి కోపం వస్తుంది; ఆమె గ్రీకుల పక్షం! కాని థేటిస్ కోరికని కాదనలేకపోయాడు, జూస్. హేరాకి కోపం రానే వచ్చింది. మానవుల మధ్య జరుగుతూన్న ఈ పోరాటంలో దేవతలు తల దూర్చడం శ్రేయస్కరం కాదని ఆమె కొడుకు హెఫయెస్టస్ హేరాకి హితోపదేశం చేస్తాడు.

ఈలోగా ట్రోయ్ పక్షం వారు యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అప్పుడు జూస్ ట్రోయ్ పక్షం వహించి వారికీ సహాయం చెయ్యడానికి వస్తాడు. జూస్ ట్రోయ్ పక్షం కాయడం, అఖ్ఖిల్లీస్ అస్త్ర సన్యాసం చేసి ఇహ పోరాడనని భీష్మించుకుని కుర్చోవడం వల్ల గ్రీకు సేనలు బాగా నష్టపోతారు. చాల రోజులు జరిగిన ఆ భీకర పోరాటంలో పేరిస్-మెనలావుస్ ల మధ్య, హెక్టర్-ఏజాక్స్ ల మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధాలు చిరస్మరణీయమైనవి. అయినా సరే ట్రోయ్ సైన్యాలు గ్రీకు సేనా వాహినిని తరిమి కొట్టాయి.

భారత యుద్ధంలో వ్యాసుడు పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని, దినాలవారీగా, వ్యూహాలవారీగా, అస్త్రాల వారీగా ఎలా వర్ణిస్తాడో హోమర్ కూడా అలా ఆ యుద్ధాన్ని వర్ణించుకుంటూ వస్తాడు. చిట్టచివరికి ట్రోయ్ నగరాన్ని పడగొట్టలేక గ్రీసు సేనలు పడవలలో ఎక్కి పారిపోతారు. ఆ హడావిడిలో ఒక కొయ్య గుర్రాన్ని సముద్రపుటొడ్డున వదిలేసి మరీ పోతారు. ట్రోయ్ సేనలు వారి విజయానికి ఆ గుర్రం ఒక అభిజ్ఞానం అనుకుంటూ దానిని ఈడుచుకుని పట్టణపు లోపలికి తీసుకుపోతారు. లోపలికి వెళ్లిన తరువాత ఆ కొయ్యగుర్రం తలుపులు తెరుచుకుని గ్రీకు సేనా వాహిని బయటకి వచ్చి ట్రోయ్ నగరాన్ని పరిపూర్ణంగా కొల్లగొట్టి పోతారు.

భారత యుద్ధం ధర్మయుద్ధానికి ప్రతీక అయితే ట్రోయ్ యుద్ధం దేవతల అహానికి, స్వల్పబుద్ధికి ప్రతీక అనుకోవచ్చు.