1933 లో పర్లాకిమిడి లో జన్మించిన రాజేశ్వరరావు విజయనగరం లో ఎఫ్.ఎ(ఫెలో ఆఫ్ ఆర్ట్స్.. ఇంటర్మీడియట్ సమానార్హత), పర్లాకిమిడి లో బి.ఎ చదివారు. భువనేశ్వర్ లోని ఉత్కళ విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకం పొందారు. చిన్న వయస్సులోనే రాజేశ్వరరావు రాసిన "టార్చి లైట్" అనే కార్డు కథ 18471947 , ఆగష్టు 15 నాటి "చిత్రగుప్త" సంచికలో ప్రచురితమైంది. దాదాపు ముప్పై కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. "రాగిరేకు" , "విషవలయాలు" , "కర్మయోగులు" కథలకు వివిధ పత్రికల్లో బహుమతులు వచ్చాయి. పలు నవలలు, కథలు, శతకాలు, పద్యాలు రచించారు. తాత గిడుగు రామ్మూర్తి పం'తులు జీవిత విశేషాలు "ఉదాత్త చరితుడు" అన్న పుస్తకంలో పేర్కొన్నారు. ఆ పుస్తకాన్ని ప్రముఖ రచయిత డా. [[సి.రారాయణరెడ్డి]] 2012 లో ఆవిష్కరించారు. ఎంతో కష్టపడి శ్రమకోర్చి సేకరించిన సమాచారంతో తాత జీవిత చరిత్రను తీసుకొచ్చారు. భావవీచికలు, పిల్లలకు పిట్టకథలు, పూలతేరు,అమూల్య క్షణాలతోపాటు వివిధ లలిత గీతాలు, మరెన్నో కథలు రచించారు. హైదరాబాద్ లో ఎ.జి. కార్యాలయ సిబ్బంది స్థాపించిన రంజని సంస్థ అధ్యక్షునిగా కొంతకాలం వ్యవహరించారు. ఆయన రచించిన చిన్నపిల్లల పాటలు, కథలు, ఆకాశవాణిలో ప్రత్యేకంగా ప్రసారమయ్యేవి. సరళ హృదయం, సాధుస్వభావం, సౌజన్యశీలం, మితభాషిత్వం, ఆయన ఉదాత్త వ్యక్తిత్వ లక్షణాలు.