అన్నదాత చిత్రం అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 1954 డిసెంబరు 17న విడుదలైంది.

అన్నదాత
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీదేవి,
ఎస్.వి. రంగారావు
సంగీతం ఆదినారాయణరావు
సంభాషణలు ఎం.వి.కృష్ణశర్మ
ఛాయాగ్రహణం సి.నాగేశ్వరరావు
కళ టి.వి.యస్.శర్మ
నిర్మాణ సంస్థ అశ్వరాజ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

కథ మార్చు

కరువుకాటకాలతోనూ, జమీందారీ నిరంకుశత్వంతోనూ సతమతమవుతున్న గ్రామప్రజలను బంగారయ్య (అక్కినేని నాగేశ్వరరావు) అనే యువకుడు సమీకరించి, వారిలో సంఘీభావం పెంపొందించి, బీళ్లన్నీ దున్నించి,పంటలు పండించి కరువు దూరమయ్యేటట్టు చేస్తాడు. వ్యర్థంగా సముద్రంలో కలిసి పోతున్న నదీజలాలకు ఆనకట్ట కడితే క్షామపీడ శాశ్వతంగా తొలగిపోతుందని సంకల్పిస్తాడు. స్వతహాగా మంచివాడైన జమీందారు (శివరామకృష్ణయ్య) అతడికి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఇంజనీర్లను కూడా తోడుగా ఇస్తాడు. కొన్నేళ్ల నిరంతర కృషి ఫలితంగా గ్రామ ప్రజల సహకారంతో ఆనకట్ట పూర్తి అవుతుంది. బంగారయ్య కల ఫలిస్తుంది. అందరూ బంగారయ్యను అన్నదాత అని కీర్తిస్తారు. ఈ కథ ప్రారంభంలో బంగారయ్య క్షామపీడితులకు గంజికేంద్రం నడుపుతాడు. అతనికి శాంత (అంజలీ దేవి) అనే దిక్కులేని యువతి సహాయపడుతుంది. ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. వారికొక ఆడపిల్ల పుడుతుంది. గంజికేంద్రానికి ధనసేకరణ కోసం నాటకాలు వేస్తే బాగుంటుందని తలచి వారు కామయ్య నాయుడు (ఎస్.వి.రంగారావు) సహాయం కోరతారు. కొంతకాలం తర్వాత కామయ్యనాయుడుకూ, తన భార్యకూ అక్రమసంబంధం ఉందని అనుమానించి బంగారయ్య భార్యను, బిడ్డను విడిచి వెళ్లిపోతాడు. కామయ్యనాయుడు తన భార్యకు పుట్టిన కోతిలాంటి నల్లపిల్లను తనకు తెలియకుండా శాంతకు అంటగట్టి ఆమె బిడ్డను తన భార్యకు ఇస్తాడు. శాంత కూతురు అన్నపూర్ణ (అమ్మాజీ) కామయ్యనాయుడు వద్ద పెరిగి పెద్దదవుతుంది. ఆమెను రంగబాబు (చలం) అనే ఆకతాయికి ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయిస్తారు. ఆ పిల్ల మాత్రం వేణుగోపాలస్వామి ఆలయంలో దేవదాసిగా జీవితం గడపాలనుకుంటుంది. కామయ్య నాయుడు కూతురైన నల్ల పిల్ల శాంత వద్ద పెరుగుతుంది. ఆ పిల్లను రంగబాబు వలలో వేసుకుని చెరుస్తాడు. జమీందారు గారి మరణం తరువాత వారసుడైన రంగబాబు చేతికి జమీందారీ వస్తుంది. అతనికి కామయ్యనాయుడు సలహాదారుడవుతాడు. అన్నపూర్ణను బలాత్కారంగా రంగబాబుకిచ్చి పెళ్ళి చేయసంకల్పిస్తాడు కామయ్యనాయుడు. కానీ బంగారయ్య అడ్డుపడి ఆమెను రక్షిస్తాడు. బంగారయ్యమీద కక్ష తీర్చుకోవడానికి జమీందారు రంగబాబు కొత్తగా కట్టిన ఆనకట్టను ధ్వంసం చేయాలని చూస్తాడు. అతని మనుషులు ఆనకట్టను ధ్వంసం చేయబోగా బంగారయ్య అడ్డుకుంటాడు. కామయ్య నాయుడి కుతంత్రాలను చివరకు రంగబాబు గ్రహించి పశ్చాత్తాపపడతాడు. శాంత సౌశీల్యవతి అని గ్రహించి బంగారయ్య ఆమెను స్వీకరిస్తాడు. రంగబాబు నల్లపిల్లను పెళ్ళిచేసుకుంటాడు. కామయ్య నాయుడు కూడా చివరకు పశ్చాత్తాపపడి మంచివాడుగా మారిపోతాడు.[1]

పాటలు, పద్యాలు మార్చు

ఈ చిత్రంలో ఈ పాటలున్నాయి.[2]

  1. ఒంటరి వాడనే భామ నా చెంతగూడవే భామా - పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల
  2. కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా మా యన్న - జిక్కి
  3. ప్రళయపయోధిజలే దృతవానశి వేదం ( జయదేవ అష్టపది ) - పి. సుశీల
  4. రింగు రింగున సాగెపోవె రంగు రంగుల బోటా - పి.సుశీల,పిఠాపురం
  5. కాటకం కాటకం కాటకం మారణ హోమం మృత్యు కావటం
  6. కాలు పెట్టినయంత కస్సని పాదాల మొనసి (పద్యం)
  7. చెలికత్తెల్ కను సన్నలన్ మెలగ దాసీ వ్రాతముల్ (పద్యం)
  8. జయ జయ జయ జయ యదువీర జయతు జయ
  9. శూలాలి బోడవంగ సృక్కి యేడ్చేడివాడే భార్యను (పద్యం)
  10. సతత పతి పాదపద్మ సంస్మరణ దీక్ష దక్క (పద్యం)
  11. స్వర్గ మిదేనోయి ఓయీ స్వర్గ మిదేనోయి వర్గ భేదములు

మూలాలు మార్చు