ఆజాద్ హింద్ ఫౌజ్

రెండవ ప్రపంచయుద్ధంలో ఏక్సిస్ వర్గంపై పోరాడే స్వతంత్ర్య భారత సైన్యం

ఆజాద్ హింద్ ఫౌజ్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆగ్నేయాసియాలో 1942 సెప్టెంబరు 1 న భారతీయ స్వాతంత్ర్య యోధులు, జపాన్ సామ్రాజ్యం కలిసి ఏర్పాటు చేసిన సాయుధ శక్తి. బ్రిటిషు పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం దీని లక్ష్యం. రెండవ ప్రపంచ యుద్ధపు ఆగ్నేయాసియా యుద్ధరంగంలో జరిగిన యుద్ధంలో ఇది జపాను సైనికులతో కలిసి పోరాడింది.[1] ఈ సైన్యాన్ని మొదట 1942 లో రాస్‌ బిహారి బోస్‌ నేతృత్వంలో భారతీయ యుద్ధ ఖైదీలు స్థాపించారు. ఈ యుద్ధఖైదీలు, మలయా, సింగపూర్ యుద్ధాల్లో జపాను వారు పట్టుకున్న బ్రిటిషు భారతీయ సైన్యానికి చెందిన సైనికులు.[2] ఆసియాలో జరిగిన యుద్ధంలో జపాను పాత్రపై ఫౌజు నాయకత్వానికి, జపాను మిలిటరీకీ మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఈ మొదటి ఫౌజు కూలిపోయింది. అదే సంవత్సరం డిసెంబరులో దాన్ని రద్దు చేసారు. రాష్ బిహారీ బోసు ఫౌజును సుభాష్ చంద్రబోసుకు అప్పగించాడు.[3] 1943 లో ఆగ్నేయాసియాకు వచ్చిన సుభాష్ చంద్రబోసు, దీన్ని పునరుద్ధరించాడు. సైన్యం బోసు స్థాపించిన ఆజాద్ హింద్ ప్రభుత్వానికి చెందిన సైన్యంగా ప్రకటించారు.[4] నేతాజీ సుభాష్ చంద్రబోసు గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్, తన పేరు మీదుగా INA బ్రిగేడ్‌లు/రెజిమెంట్‌లకు పేర్లు పెట్టాడు.[5] ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు మీద ఒక మహిళా రెజిమెంటును కూడా నెలకొల్పాడు. బోసు నాయకత్వంలో, మలయా (ప్రస్తుత మలేషియా), బర్మాలోని భారతీయ ప్రవాస జనాభా నుండి వేలాది మంది పౌర వాలంటీర్లు, మాజీ ఖైదీలూ ఫౌజులో చేరారు.[6] ఈ రెండవ INA బ్రిటిషు, కామన్వెల్త్ దళాలకు వ్యతిరేకంగా ఇంపీరియల్ జపాను సైన్యంతో కలిసి బర్మాలో జరిగిన యుద్ధాల్లో పోరాడింది. తొలుత ఇంఫాల్, కోహిమాల్లోను, ఆ తరువాత మిత్రరాజ్యాలు బర్మాను తిరిగి స్వాధీనం చేసుకున్నపుడు వారికి వ్యతిరేకంగానూ పోరాడింది.

ఆజాద్ హింద్ ఫౌజ్
Indian National Army
ఆజాద్ హింద్ ఫౌజ్
అజాద్ హింద్ పతాకం
క్రియాశీలకం1942 ఆగస్టు - 1945 సెప్టెంబరు
దేశం Azad Hind (1943 అక్టోబరు తరువాత)
పాత్రగెరిల్లా, పదాతిదళం , ప్రత్యేక కార్యకలాపాలు
పరిమాణం43,000; రెజిమెంట్లు: గాంధీ బ్రిగేడ్ , నెహ్రూ బ్రిగేడ్, ఆజాద్ బ్రిగేడ్, సుభాష్ బ్రిగేడ్, రాణీ ఆఫ్ ఝాన్సీ రెజిమెంటు
నినాదంఇతెహాద్, ఇత్మద్ ఔర్ ఖుర్బానీ
(ఉర్దూ: ఐక్యత, విశ్వాసం, త్యాగం)
పాదయాత్రకదం కదం బడాయే జా
కార్యకలాపాలురెండవ ప్రపంచ యుద్ధం
కమాండర్స్
కమాండర్-ఇన్-ఛీఫ్మోహన్ సింగ్ (జనరల్)  (1942)
సుభాష్ చంద్ర బోస్  (1943-1945)
ఛీఫ్ ఆఫ్ స్టాఫ్జగన్నాథ్ రావు భోంస్లే
ప్రసిద్ధ
కమాండర్లు
మొహమ్మద్ జమాన్ కియానీ
షా నవాజ్ ఖాన్ (జనరల్)
ప్రేమ్‌ సహగల్
గురుబక్ష్ సింగ్ డిల్లాన్
Monument of INA Martyrs at Kolkata

1942 లో మొదటిసారి INA ఏర్పడినప్పుడు, మరింతమంది భారత సైనికులు ఫిరాయిస్తారనే ఆందోళన బ్రిటిషు భారతీయ సైన్యానికి ఉండేది. సిపాయి విధేయతను కాపాడటానికి రిపోర్టింగ్ నిషేధాన్ని, "జిఫ్స్" అనే ప్రచారాన్నీ మొదలుపెట్టారు. సైన్యం గురించి రాసిన పీటర్ డబ్ల్యూ.ఫే వంటి చరిత్రకారులు, యుద్ధంలో ఐఎన్‌ఎ గణనీయమైన ప్రభావాన్ని చూపలేదని భావిస్తున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత చాలా మంది సైనికులను భారతదేశానికి పంపి, అక్కడ కొందరిపై దేశద్రోహం కేసులు పెట్టి విచారణ చేసారు. ఈ విచారణలు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రేరేపకాలుగా మారాయి. 1946 లో రాయల్ ఇండియన్ నేవీలో బాంబే తిరుగుబాటు, ఇతర తిరుగుబాట్లూ ఈ INA విచారణల నుండి ఉద్భవించిన జాతీయవాద భావాల వల్లనే సంభవించినట్లు భావిస్తున్నారు. సుమిత్ సర్కార్, పీటర్ కోహెన్, ఫే తదితర చరిత్రకారులు -ఈ సంఘటనలు బ్రిటిషు పాలన ముగింపును వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయని అభిప్రాయపడ్డారు. యుద్ధ సమయంలో INA లో పనిచేసిన అనేక మంది వ్యక్తులు భారతదేశంలోను ఆగ్నేయాసియాలోని ఇతర దేశాలలోనూ, ప్రజా జీవితంలో ప్రముఖమైన స్థానాల్లోకి ఎదిగారు. ముఖ్యంగా భారతదేశంలో లక్ష్మీ సెహగల్, మలయాళో జాన్ తివి, జానకి అత్తినహప్పన్.

ఇది ఇంపీరియల్ జపాను తోటి, ఇతర అక్షరాజ్యాల తోటీ ముడిపడి ఉంది. జపాన్ చేసిన యుద్ధ నేరాలలో పాలుపంచుకున్నట్లు ఐఎన్‌ఎ దళాలపై ఆరోపణలు వచ్చాయి.[7] బ్రిటిషు సైనికులు, సైన్యంలో చేరని భారతీయ యుద్ధఖైదీలూ INA సభ్యులను అక్షరాజ్యాల సహకారులుగా భావించారు.[8] కానీ యుద్ధం తర్వాత వారిని చాలా మంది భారతీయులు దేశభక్తులుగా చూసారు. భారత స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భారత జాతీయ కాంగ్రెస్ వారిని స్మరించుకున్నప్పటికీ, భారత ప్రభుత్వం అహింసా ఉద్యమంలో పాల్గొన్నవారికి ఇచ్చిన స్వాతంత్ర్య సమరయోధుల హోదాను INA సభ్యులకు ఇవ్వడానికి నిరాకరించింది. ఐతే, ఫౌజు మాత్రం భారతీయ సంస్కృతి, రాజకీయాలలో ఒక ప్రముఖమైన ఉద్వేగభరితమైన అంశంగా నిలిచిపోయింది.[6][8][9]

మొదటి INA మార్చు

 
మేజర్ ఇవైచి ఫుజివారా మోహన్ సింగ్‌ను పలకరించారు. 1942 ఏప్రిల్.

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభానికి ముందు, బహిష్కరించబడిన భారతీయ జాతీయవాదులకు జపాన్, ఆగ్నేయ ఆసియాలు ప్రధానమైన ఆశ్రయ కేంద్రాలు. దక్షిణ ఆసియాలో మలయన్ సుల్తానులు, విదేశీ చైనీయులు, బర్మా ప్రతిఘటన, భారతీయ స్వాతంత్ర్య ఉద్యమం ల మద్దతు సేకరించేందుకు జపాన్, మేజర్ ఇవైచి ఫుజివారా నాయకత్వంలో సైనిక రాయబారాలను పంపింది. మినామి కికన్ విజయవంతంగా బర్మీస్ జాతీయవాదులను కలుపుకుంది. ఎఫ్ కికాన్ థాయ్‌లాండ్, మలయాళో ప్రవాసంలో ఉన్న భారతీయ జాతీయవాదులతో పరిచయాలను ఏర్పరచుకోవడంలో విజయం సాధించింది.[10][11] ఫుజివారా విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి అని అతని కార్యాలయం ప్రవాస జాతీయవాద నాయకులకు చెప్పింది. అతడికి వారినుండి ఆమోదం లభించింది.[11][12] తరువాతి కాలంలో అతను తనను తాను "లారెన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ" (లారెన్స్ ఆఫ్ అరేబియా లాగా) అని అభివర్ణించుకున్నాడు. తొలుత అతను జియాని ప్రీతమ్ సింగ్, థాయ్-భారత్ కల్చరల్ లాడ్జ్ లను కలిసాడు.[11] ఆగ్నేయాసియాలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, 70,000 మంది భారత సైనికులు (ఎక్కువగా సిక్కులు) మలయాళో ఉన్నారు. మలయన్ యుద్ధంలో జపాన్ సాధించిన అద్భుతమైన విజయంలో సింగపూర్ పతనం తరువాత దాదాపు 45,000 మంది భారతీయులతో సహా అనేక మంది యుద్ధ ఖైదీలు పట్టుబడ్డారు.[13] బ్రిటిషు భారతీయ సైన్యంలో సేవా పరిస్థితులు, మలయాళోని సామాజిక పరిస్థితులు ఈ దళాల్లో విభేదాలకు దారితీశాయి.[14][15] ఈ ఖైదీల నుండే, మొట్టమొదటి భారత జాతీయ సైన్యం మోహన్ సింగ్ నాయకత్వంలో ఏర్పడింది. సింగ్, బ్రిటిషు భారతీయ సైన్యంలో అధికారి. అతను మలయన్ యుద్ధం ప్రారంభంలో పట్టుబడ్డాడు. తన లోని జాతీయవాద భావాల వల్ల ఫుజివారాలో అతను ఒక మిత్రుడిని చూసాడు. అతనికి జపనీయుల నుండి గణనీయమైన సహాయం, మద్దతు లభించింది.[16] ఆగ్నేయాసియాలోని భారతీయులు కూడా భారత స్వాతంత్ర్యానికి మద్దతునిచ్చారు. యుద్ధానికి ముందే వారు మలయాళో స్థానిక లీగ్‌లను ఏర్పాటు చేశారు. ఆక్రమణ తరువాత జపాన్ ప్రోత్సాహంతో ఇవన్నీ కలిసి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ (IIL) ఏర్పడింది.[17]

ఐఐఎల్‌లో అనేక మంది ప్రముఖ భారతీయ భారతీయులు పనిచేస్తున్నప్పటికీ, మొదటి ప్రపంచ యుద్ధం నుండి జపాన్‌లో స్వీయ బహిష్కరణలో నివసిస్తూ ఉన్న భారతీయ విప్లవకారుడు రాష్ బిహారీ బోసుపై నాయకత్వం పడింది.[18] లీగ్, INA నాయకత్వం రెండూ కూడా INA, IIL కు లోబడి ఉండాలని నిర్ణయించాయి. లీగ్ లోని ప్రముఖ సభ్యులు, INA నాయకులూ సభ్యులుగా ఒక కార్యవర్గం ఏర్పాటౌతుంది. INA ను యుద్ధానికి పంపే అంశాలపై ఈ కార్యవర్గమే నిర్ణయం తీసుకుంటుంది.[19] తాము జపాను వారి కీలుబొమ్మలుగా కనిపిస్తామేమోనని భయపడిన భారతీయ నాయకులు దాన్ని నివారించేందుకు గాను, భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చినప్పుడు మాత్రమే INA యుద్ధానికి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నారు.[20][21] జపాను వారిని, తాము జోక్యం చేసుకోమనే హామీలు ఇవ్వాలని కోరారు. వీటికే బిడాదరి తీర్మానాలు అని పేరు. అవి ఓ స్వతంత్ర ప్రభుత్వంతో కుదుర్చుకునే ఒప్పందం లాంటివి.[13] ఈ సమయంలో, ఎఫ్. కికాన్ స్థానంలో హిడియో ఇవాకురో నేతృత్వంలోని ఇవాకురో కికన్ ఏర్పాటైంది. లీగ్‌తో ఇవాకురో సంబంధాలు మరింత బలహీనంగా ఉండేవి. బిరాదరీ తీర్మానాల నుండి ఉత్పన్నమైన డిమాండ్లకు జపాన్ వెంటనే అంగీకరించలేదు. రాష్ బిహారీకి, లీగ్‌కూ మధ్య కూడా విభేదాలు ఉండేవి. రాష్ బిహారీ జపాన్‌లో చాలాకాలం పాటు నివసించాడనో, అతనికి జపనీస్ భార్య, జపాను సైన్యంలో పనిచేస్తున్న కుమారుడూ ఉన్నారనో అనేవి తోసిపారేయగలిగే కారణాలు కావు.[22] మరోవైపు, సైనిక వ్యూహ సంబంధ నిర్ణయాలు INA స్వయంప్రతిపత్త నిర్ణయాలుగా ఉండాలని, లీగ్‌కు సంబంధం ఉండకూడదనీ మోహన్ సింగ్ ఆశించాడు.[23]

1942 నవంబరు డిసెంబరుల్లో, INA పట్ల జపాను కున్న ఉద్దేశాల గురించి తలెత్తిన ఆందోళన కారణంగా INA, లీగ్‌ల మధ్య ఓవైపు, INA, జపనీయుల మధ్య మరో వైపూ అభిప్రాయ భేదాలు తలెత్తాయి. INA నాయకత్వం లీగ్ (రాష్ బిహారీ మినహా) నుండి రాజీనామా చేసింది. 1942 డిసెంబరులో మోహన్ సింగ్, సైన్యాన్ని రద్దు చేసాడు. INA దళాలను యుద్ధ ఖైదీల శిబిరాలకు తిరిగి రావాలని అతను ఆదేశించాడు.[24][25] మోహన్ సింగ్‌ను కాల్చి చంపాలని భావించారు.[24]

1942 1943 డిసెంబరు ఫిబ్రవరిల మధ్య, రాష్ బిహారీ INA ను నిలిపి ఉంచడానికి చాలా కష్టపడ్డాడు.[26] 1943 ఫిబ్రవరి 15 న సైన్యాన్ని లెఫ్టినెంట్ కల్నల్ M.Z కియాని ఆధీనంలో పెట్టారు.[27] లెఫ్టినెంట్ కల్నల్ జెఆర్ భోంస్లే (మిలటరీ బ్యూరో డైరెక్టరు) ఇన్‌చార్జిగా విధాన నిర్ణాయక సంస్థను ఏర్పరచారు.[28] స్పష్టంగా దీన్ని IIL ఆధిపత్యంలో ఉంచారు. భోంస్లే కింద జనరల్ స్టాఫ్ చీఫ్‌గా లెఫ్టినెంట్ కల్నల్. షా నవాజ్ ఖాన్, మిలిటరీ సెక్రటరీగా మేజర్ పికె సెహగల్, ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ కమాండెంట్‌గా మేజర్ హబీబ్ ఉర్ రహమాన్, ఉద్బోధ, సంస్కృతి లకు అధిపతిగా లెఫ్టినెంట్ కల్నల్. AC ఛటర్జీ (తరువాత మేజర్ AD జహంగీర్) ఉన్నారు.[26][29]

రెండవ INA మార్చు

సుభాష్ చంద్ర బోసు మార్చు

భారతదేశంలోకి తిరుగుబాటు సైన్యాన్ని నడిపించడానికి సుభాష్ చంద్రబోసు సరైన వ్యక్తి అని F కీకన్‌ పని ప్రారంభంలోనే ప్రతిపాదన వచ్చింది. మోహన్ సింగ్ స్వయంగా, ఫుజివారాను కలిసిన తర్వాత, జాతీయవాద భారత సైన్యానికి బోసు సరైన నాయకుడని సూచించాడు.[30] అనేక మంది అధికారులు, సైనికులూ - యుద్ధ ఖైదీల శిబిరాలకు తిరిగి వెళ్ళిన వారితో పాటు అసలు ముందుకే రానివారిలో కొంతమంది కూడా - సుభాస్ బోసు నాయకత్వం వహించినట్లయితే మాత్రమే తాము ఐఎన్‌ఎలో చేరడానికి సిద్ధమని తెలియజేసారు.[31] బోసు జాతీయవాది. 1922 లో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు పదవికి రాజీనామా చేసిన తర్వాత గాంధీ ఉద్యమంలో చేరాడు. కాంగ్రెస్‌లో వేగంగా ఎదిగాడు. పదేపదే జైలు శిక్ష అనుభవించాడు.[32] 1920 ల చివరినాటికి అతను, నెహ్రూ ఇద్దరూ భవిష్యత్తు కాంగ్రెసు నాయకులుగా పరిగణించబడ్డారు.[33] 1920 ల చివరలో, భారతదేశం బ్రిటిషు ఆధిపత్యంగా ఉండాలన్న మునుపటి కాంగ్రెస్ లక్ష్యం నుండి విభేదించి, సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పిలుపునిచ్చిన మొదటి కాంగ్రెస్ నాయకులలో అతను ఒకడు.[33] బెంగాల్‌లో, విప్లవోద్యమంలో పనిచేస్తున్నాడని బ్రిటిషు అధికారులు అతనిపై పదేపదే ఆరోపణలు చేశారు. అతని నాయకత్వంలో, బెంగాల్‌లోని కాంగ్రెస్ యువజన సంఘం బెంగాల్ వాలంటీర్స్ అనే అర్ధ-సైనిక సంస్థను నిర్వహించేది.[34] బోసు గాంధీ ప్రవచించిన అహింసను ఖండించాడు; ప్రభుత్వంతో బోసు పడే ఘర్షణలతో గాంధీ ఒప్పుకోలేదు.[33] నెహ్రూతో సహా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గాంధీకి విధేయులుగా ఉండేది.[33] గాంధీతో బహిరంగంగా విభేదించినప్పటికీ, బోసు 1930 లలో రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచాడు. గాంధీ నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ అతను రెండవసారి విజయం సాధించాడు. గాంధీ బలపరచిన అభ్యర్థి భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఎన్నికల్లో ఓడించాడు. కానీ బోసుతో కలిసి పనిచేయడానికి నిరాకరిస్తూ కార్యవర్గం మొత్తం రాజీనామా చేసింది.[35] బోసు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తన సొంత పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ స్థాపించాడు.[36]

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో, బోసును గృహ నిర్బంధంలో ఉంచారు.[37] అతను మారువేషంలో తప్పించుకుని, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా గుండా మొదట సోవియట్ యూనియన్‌కు, ఆ తరువాత జర్మనీకీ వెళ్ళాడు. 1941 ఏప్రిల్ 2 న బెర్లిన్ చేరుకున్నాడు.[35][38] అక్కడ అతను జర్మనీకి పట్టుబడిన భారతీయ యుద్ధ ఖైదీలతో భారతీయ సైనికుల సైన్యాన్ని ఏర్పాటు చెయ్యాలని అనుకున్నాడు.[39] ఫ్రీ ఇండియా లీజియన్‌ను, ఆజాద్ హింద్ రేడియోనూ ఏర్పాటు చేశాడు.[40] జపాన్ రాయబారి ఒషిమా హిరోషి ఈ పరిణామాల గురించి టోక్యోకు సమాచారం అందించాడు.[41] యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, జపనీస్ నిఘా వర్గాలు తాము స్వాధీనం చేసుకున్న భారతీయ సైనికులతో మాట్లాడటం ద్వారా, జాతీయవాదిగా బోసు పట్ల వారిలో ఎంతో గౌరవం ఉందనీ, తిరుగుబాటు సైన్యానికి నాయకత్వం వహించడానికి అతనే సరైన వ్యక్తిగా భారత సైనికులు భావిస్తున్నారనీ తెలుసుకున్నాయి.

1943 లో INA నాయకులు, జపనీయుల మధ్య జరిగిన వరుస సమావేశాలలో, IIL, INA ల నాయకత్వాన్ని బోసుకు అప్పగించాలని నిర్ణయించారు. 1943 జనవరిలో, తూర్పు ఆసియాలో భారతీయ జాతీయోద్యమానికి నాయకత్వం వహించడానికి జపనీయులు బోసును ఆహ్వానించారు.[42] అతను అంగీకరించి, ఫిబ్రవరి 8 న జర్మనీని విడిచిపెట్టాడు. జలాంతర్గామి ద్వారా మూడు నెలల ప్రయాణం, సింగపూర్‌లో కొద్ది సమయం ఆగిన తరువాత, అతను 1943 మే 11 న టోక్యో చేరుకున్నాడు. టోక్యోలో అతను జపాన్ ప్రధాని హిడెకి టోజోను, జపనీస్ హై కమాండ్‌నూ కలిసాడు. ఆ తర్వాత 1943 జూలైలో సింగపూర్ చేరుకున్నాడు. అక్కడ అతను ఆగ్నేయాసియాలోని భారతీయులను ఉద్దేశించి అనేక రేడియో ప్రసారాలు చేశాడు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనమని వారిని ప్రోత్సహించాడు.

పునరుజ్జీవనం మార్చు

సింగపూర్ చేరుకున్న రెండు రోజుల తర్వాత, 1943 జూలై 4 న, బోసు కాథాయ్ బిల్డింగ్‌లో జరిగిన వేడుకలో ఐఐఎల్, ఇండియన్ నేషనల్ ఆర్మీల నాయకత్వాన్ని స్వీకరించాడు. బోసు ప్రభావం చెప్పుకోదగినది. అతని ప్రభావం INA ని తిరిగి ఉత్తేజపరిచింది. గతంలో ఇందులో ప్రధానంగా యుద్ధ ఖైదీలు ఉండేవారు. ఇప్పుడిది దక్షిణాసియాలోని భారతీయ ప్రవాసులను కూడా ఆకర్షించింది. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అనే ప్రసిద్ధ నినాదాన్ని అతను ప్రకటించాడు.

"స్థానిక పౌరులు INA లో చేరారు, దాని బలాన్ని రెట్టింపు చేశారు. వారిలో న్యాయవాదులు, వ్యాపారులు, తోటల కార్మికులు, అలాగే షాపు కీపర్‌లుగా పనిచేస్తున్న ఖుదాబాది సింధీ స్వర్ణకారులూ ఉన్నారు; చాలామందికి సైనిక అనుభవం లేదు." [43] కార్ల్ వడివెల్ల బెల్లె అంచనా ప్రకారం, బోసు పిలుపుతో ఐఐఎల్ సభ్యత్వం 3,50,000 కు చేరుకుంది. ఆగ్నేయాసియాలో దాదాపు 1,00,000 మంది స్థానిక భారతీయులు స్వచ్ఛందంగా INA లో చేరేందుకు ముందుకు రాగా, చివరికి సైన్యం బలం 50,000 మందికి చేరుకుంది.[44] హ్యూ టోయ్ అనే బ్రిటిషు నిఘా అధికారి, ది స్ప్రింగ్ టైగర్ అనే 1959 నాటి సైనిక చరిత్ర పుస్తక రచయిత, అమెరికన్ చరిత్రకారుడైన్ పీటర్ ఫే (1993 నాటి చరిత్ర పుస్తకం ది ఫర్గాటెన్ ఆర్మీ రచయిత) ముగ్గురూ ఇదే అంచనా వేసారు. మొదటి INA లో సుమారు 40,000 సైనికులున్నట్లు పరిగణిస్తారు. వీరిలో 4,000 మందిని 1942 డిసెంబరులో తొలగించారు. రెండవ INA 12,000 దళాలతో ప్రారంభమైంది. మొదటి భారత సైన్యం లోని సిబ్బందిని చేర్చుకోగా, దీనికి మరో 8,000-10,000 మంది తోడయ్యారు. ఈ సమయంలో దాదాపు 18,000 మంది భారతీయ పౌరులు కూడా చేరారు.  బెల్లే అంచనా ప్రకారం దాదాపు 20,000 మంది స్థానిక మలయన్ భారతీయులు, మరో 20,000 మంది మాజీ బ్రిటిషు భారతీయ సైన్యం సభ్యులు INA లో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.[44]

1945 లో కామన్వెల్త్ దళాలు రంగూన్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే ముందు, అక్కడి నుండి ఖాళీ చేస్తున్న ఆజాద్ హింద్ ప్రభుత్వం దాని రికార్డులను నాశనం చేసింది. ఈ కారణంగా INA కు సంబంధించిన కచ్చితమైన బలమెంతో తెలియదు.[45] ఫే వర్ణించిన యుద్ధ క్రమం (INA- అనుభవజ్ఞులతో చేసిన చర్చల నుండి నిర్మించబడినది), ది స్ప్రింగ్ టైగర్‌లో మొదటి INA గురించి టాయ్ వర్ణించినట్లుగానే ఉంటుంది. MZ కియాని నేతృత్వం లోని 1 వ డివిజనులో, మోహన్ సింగ్ కింద మొదటి INA లో చేరిన మాజీ భారత సైన్యం యుద్ధ ఖైదీల్లో అనేక మంది చేరారు. ఇది 1942 లో చేరని యుద్ధ ఖైదీలను కూడా ఇది ఆకర్షించింది. కల్నల్ ఇనాయత్ కియాని నేతృత్వంలోని రెండు బెటాలియన్లతో కూడిన 2 వ గెరిల్లా రెజిమెంట్ ( గాంధీ బ్రిగేడ్), కల్నల్ గుల్జారా సింగ్ నేతృత్వం లోని మూడు బెటాలియన్లతో కూడిన 3 వ గెరిల్లా రెజిమెంట్ ( ఆజాద్ బ్రిగేడ్ ), లెఫ్టినెంట్ కల్నల్ గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ నాయకత్వం లోని 4 వ గెరిల్లా రెజిమెంట్ (లేదా నెహ్రూ బ్రిగేడ్ ) ఇందులో భాగం. కల్నల్ షా నవాజ్ ఖాన్ కింద ఉన్న 1 వ గెరిల్లా రెజిమెంట్ - సుభాస్ బ్రిగేడ్ - ఒక స్వతంత్ర యూనిట్. ఇందులో మూడు పదాతిదళ బెటాలియన్లు ఉన్నాయి. ప్రత్యర్థి శ్రేణుల వెనుక ప్రచ్ఛన్నంగా పనిచేయడానికి బహదూర్ గ్రూప్ అనే ఒక ప్రత్యేక కార్యాచరణ సమూహాన్ని కూడా ఏర్పాటు చేసారు.

ఆపరేషన్స్ మార్చు

1943 అక్టోబరు 23 న ఆజాద్ హింద్, బ్రిటన్, అమెరికాలపై యుద్ధం ప్రకటించింది.[46] యు-గో అనే కోడ్ పేరుతో మణిపూర్ దిశగా జపనీయులు దాడిని ప్రారంభించడంతో అధికారికంగా మొదటి యుద్ధ బాధ్యత వచ్చింది. భారతదేశంపై దండయాత్ర కోసం చేసిన ప్రారంభ ప్రణాళికలలో, ఫీల్డ్ మార్షల్ తెరౌషి, INA కి గూఢచర్యం, ప్రచారానికి మించి ఎలాంటి బాధ్యతలూ అప్పగించడానికి ఇష్టపడలేదు.[47] బోసు దీనిని మీడియా పాత్రగా తిరస్కరించి,[47] భారతీయ-విముక్తి సైన్యపు ప్రత్యేకమైన గుర్తింపుకు తగినట్లు INA దళాలు గణనీయంగా పాల్గొనాలని నొక్కి చెప్పాడు. ఈ దాడిలో ఐఎన్ఎకు మిత్రరాజ్యాల సైన్యంగా ర్యాంకు లభించేలా బోసు జపాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, జనరల్ సుగియామా నుండి ఒప్పందాన్ని పొందాడు.[48] విజయం లభిస్తుందని ఆశించి ఆజాద్ హింద్ ప్రధాన కార్యాలయాన్ని రంగూన్ కు మార్చారు. INA కు ఆయుధాలతో పాటు మానవశక్తి కూడా లేనందున సెట్-పీస్ యుద్ధాలను నివారించడం దాని వ్యూహం.[49] ప్రారంభంలో అది బ్రిటిషు-భారతీయ సైన్యం లోని సైనికులను ఫిరాయించడానికి ప్రేరేపించి ఆయుధాలను పొందటానికి, దాని ర్యాంకులను పెంచుకోవడానికీ ప్రయత్నించింది. వారు పెద్ద సంఖ్యలో ఫిరాయిస్తారని భావించారు. ఒకప్పుడు సుభాస్ బోసుకు సైనిక కార్యదర్శిగా పనిచేసిన కల్నల్ ప్రేమ్ సెహగల్, తర్వాత మొదటి ఎర్రకోట విచారణల్లో పీఎన్ ఫేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐఎన్‌ఏ వ్యూహాన్ని ఇలా వివరించాడు - యుద్ధంలో బలాబలాలు సమతుల్యంగా ఉండి, జపనీయులు విజయం సాధిస్తారో లేదో ఎవరికీ తెలియకపోయినప్పటికీ, భారతదేశంలో అట్టడుగు స్థాయి మద్దతుతో ఒక ప్రజా విప్లవాన్ని ప్రారంభించడం ద్వారా యుద్ధంలో చివరికి జపాన్ ఓడిపోయినప్పటికీ, బ్రిటన్ దాని వలస అధికారాన్ని తిరిగి స్థాపించుకునే స్థితిలో ఉండదు. జపాన్ దళాలు ఇంఫాల్ వద్ద బ్రిటిషు రక్షణను ఛేదించిన తర్వాత INA, ఈశాన్య భారతదేశంలోని కొండలను దాటి గంగానది మైదానంలోకి ప్రవేశిస్తుందనీ, అక్కడ అది గెరిల్లా సైన్యంగా పనిచేస్తుందనీ తొలుత ప్లాను చేసారు.[50] స్థానిక జనాభా నుండి స్వాధీనం చేసుకున్న బ్రిటిషు సామాగ్రి, మద్దతు, స్థానిక ప్రజలతో ఈ సైన్యం ఆధారపడుతుందని భావించారు.[51]

1944 మార్చు

బోసు, బర్మా ఏరియా సైన్యాధ్యక్షుడు మసాకాజు కవాబేలు చేసిన ప్రణాళికల్లో, U- గో దాడిలో INA కి ఒక స్వతంత్ర రంగాన్ని కేటాయించాలని అనుకున్నారు. బెటాలియన్ కంటే తక్కువ స్థాయి బలంతో INA యూనిట్లు పనిచేయవు. కార్యాచరణ సౌలభ్యం కోసం, సుభాస్ బ్రిగేడ్‌ను బర్మాలోని జపనీస్ జనరల్ హెడ్‌క్వార్టర్స్ ఆధీనంలో ఉంచారు. బహదూర్ గ్రూప్ యొక్క అడ్వాన్స్ పార్టీలు కూడా అధునాతన జపనీస్ యూనిట్‌లతో పాటు ముందుకు సాగాయి.[52] దాడి ప్రారంభమైనప్పుడు, నాలుగు గెరిల్లా రెజిమెంట్లున్న INA లోని 1 వ డివిజన్ను, U గో కు, అరకాన్‌లో మళ్లింపు దాడి చేసే హా-గోకూ పంపించారు.[53][54] ఒక బెటాలియన్ బ్రిటిషు పశ్చిమ ఆఫ్రికా విభాగాన్ని ఛేదించుకుని చిట్టగాంగ్‌లోని మౌడాక్ వరకు చేరుకుంది.[55][56] కల్నల్ షౌకత్ మాలిక్ నేతృత్వంలోని బహదూర్ గ్రూప్ యూనిట్ ఏప్రిల్ ప్రారంభంలో మొయిరాంగ్ సరిహద్దు ప్రాంతాన్ని చేజిక్కించుకుంది.[57] U-Go కి కట్టుబడి ఉన్న 1 వ డివిజన్ యొక్క ప్రధాన భాగం మణిపూర్ వైపుగా కదిలింది. షా నవాజ్ ఖాన్ నేతృత్వంలోని ఈ డివిజను, రెన్యా ముతగుచి యొక్క మూడు విభాగాలు చింద్విన్ నది, నాగ కొండలను దాటినందున చిన్, కాషిన్ గెరిల్లాలకు వ్యతిరేకంగా జపనీస్ పార్శ్వాలను విజయవంతంగా రక్షించింది. తము ద్వారా ఇంఫాల్, కోహిమా దిశలో ప్రధాన దాడిలో పాల్గొంది.[58][59] MZ కియాని కింద ఉన్న 2 వ డివిజను, 33 వ డివిజనుకు కుడి పార్శ్వాన ఉండి కొహిమాపై దాడి చేదింది. అయితే, ఖాన్ దళాలు తమును విడిచిపెట్టేటప్పటికే దాడి జరగడంతో, ఖాన్ సేనలను కొహిమాకు మళ్ళించారు. కోహిమా సమీపంలోని ఉఖ్రుల్ చేరుకునేసరికి, జపనీస్ దళాలు ఆ ప్రాంతం నుండి ఉపసంహరించుకోవడం మొదలైందని తెలిసింది. ఇంఫాల్ ముట్టడిని విచ్ఛిన్నం చేసినప్పుడు ముతగూచి సైన్యానికి పట్టిన గతే INA యొక్క దళాలకూ పట్టింది. సరఫరాలు తగ్గిపోవడానికి తోడు, రుతుపవనాలు, మిత్రరాజ్యాల వైమానిక ఆధిపత్యం, బర్మా క్రమరహిత దళాల వల్ల కలుగుతున్న అదనపు ఇబ్బందుల కారణంగా, 15 వ సైన్యం, బర్మా ఏరియా సైన్యంతో పాటు 1, 2 వ విభాగాలు ఉపసంహరించుకోవడం ప్రారంభించాయి. బలహీనమైన గాంధీ రెజిమెంటు, మణిపూర్ ద్వారా ఉపసంహరణ సమయంలో బర్మా -ఇండియా రహదారిపై మరాఠా లైట్ పదాతిదళానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడింది. 2 వ, 3 వ INA రెజిమెంట్లు ఈ ఉపసంహరణలో అత్యంత క్లిష్టమైన సమయంలో యమమోటో ఫోర్స్ యొక్క పార్శ్వాలను విజయవంతంగా సంరక్షించాయి. కానీ గాయపడిన, వ్యాధిగ్రస్తులైన సైనికులు దారిలో ఆకలితో మరణించారు. జపనీస్ దళాలను అనుసరిస్తున్న కామన్వెల్త్ దళాలు ఆకలితో మరణించిన జపనీస్ దళాలతో పాటు INA కూడా చనిపోయినట్లు గుర్తించారు.[60] ఈ తిరోగమనంలో INA గణనీయమైన సంఖ్యలో సైనికులను, మెటీరియల్‌నూ మొత్తం కోల్పోయింది. అనేక విభాగాలు రద్దు చేయబడ్డాయి. కొన్నిటి లోని మనుషులను కొత్త డివిజన్లలోకి చేర్చారు.[61]

1945 మార్చు

మిత్రరాజ్యాల బర్మా దాడి మరుసటి సంవత్సరం ప్రారంభమైంది. INA బర్మా రక్షణకు కట్టుబడి ఉంది. జపనీయుల రక్షణ వ్యూహాల్లో INA ఒక భాగం. రెండవ విభాగానికి ఇరవాడి, న్యాంగ్యూ చుట్టుపక్కల రక్షణ బాధ్యత అప్పగించబడింది. ప్రతిపక్ష ఇచ్చింది మెసర్వీ నేతృత్వం లోని 7 వ భారత డివిజను పాగాన్, న్యాంగ్యూల నదిని దాటే ప్రయత్నం చేసినపుడు ఈ రెండవ విభాగం గట్టి ప్రతిఘటన ఇచ్చింది. తరువాత, మెయిక్తిలా, మాండలే యుద్ధాల సమయంలో, ప్రేమ్ సెహగల్ అధీనంలో ఉన్న బలగాలు, బ్రిటిషు 17 వ డివిజన్ నుండి పోపా పర్వతం చుట్టుపక్కల ప్రాంతాన్ని రక్షించే పనిలో పడ్డాయి. మేక్తీలా న్యాంగ్యుని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న హైటారె కిమురా దళాలకు ఈ బ్రిటిషు డివిజను ఇబ్బంది పెట్టగలిగేది. శత్రువు ట్యాంకులను హ్యాండ్ గ్రెనేడ్‌లతోటి, పెట్రోల్ సీసాల తోటీ ఎదుర్కొనాల్సి వచ్చిన INA డివిజన్ ఈ పోరాటంలో నిర్మూలించబడింది. చాలా మంది INA సైనికులు తాము నిరాశాజనకమైన స్థితిలో ఉన్నామని గ్రహించారు. వారిలో చాలామంది, తమను వెంటాడుతున్న కామన్వెల్త్ దళాలకు లొంగిపోయారు. నీరసంతో మరణించడం వలన, దళాన్ని వదలి పారిపోవడం వలనా సైనికుల సంఖ్య తగ్గిపోవడం, మందుగుండు సామగ్రి, ఆహారం తగ్గిపోవడం, ఒంటరైపోవడం, కామన్వెల్త్ దళాలు వెంటాడడం, రెండవ డివిజనులో మిగిలిన యూనిట్లు రంగూన్ వైపుగా పారిపోయే ప్రయత్నం మొదలుపెట్టాయి. వారు కామన్వెల్త్ లైన్లను అనేక సార్లు వివిధ ప్రదేశాలలో ఛేదించినప్పటికీ చివరికి 1945 ఏప్రిల్ ప్రారంభంలో లొంగిపోయారు.[62][63] జపనీయుల పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో, ఆజాద్ హింద్ ప్రభుత్వం తమ 1 వ డివిజను, రాణి ఝాన్సీ రెజిమెంట్లతో పాటు రంగూన్ నుండి సింగపూర్‌కు తరలిపోయింది. దాదాపు 6,000 INA దళాలు రంగూన్‌లో AD లోగానాథన్ ఆధ్వర్యంలో ఉండిపోయాయి. రంగూన్ పడిపోవడంతో వారు లొంగిపోయారు. మిత్రరాజ్యాల దళాలు నగరంలోకి ప్రవేశించే వరకు శాంతిభద్రతలు నిర్వహించడంలో సహాయపడ్డాయి.

బర్మా నుండి జపనీయుల ఉపసంహరణ జరుగుతూండగా, INA కు చెందిన ఇతర అవశేష దళాలు కాలినడకన బ్యాంకాక్ వైపు సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టాయి. "ఎపిక్ రిట్రీట్ టు సేఫ్టీ" అని పిలవబడే ఈ ప్రయాణంలో బోసు, తన జవాన్లతో పాటు నడిచాడు. జపాన్ సైనికులు అతని కోసం ప్రయాణ సాధనాలను ఏర్పాటు చేసినప్పటికీ అతను సైనికులతో పాటే నడిచాడు.[64] ఉపసంహరించుకునే దళాలపై క్రమం తప్పకుండా మిత్రరాజ్యాల విమానాలు, ఆంగ్ సాన్ దళాలు, చైనా గెరిల్లాలూ తరచుగా దాడి చేసి నష్టాలు కలిగించాయి. బోసు ఆగస్టులో సింగపూర్‌ వచ్చి అక్కడ మిగిలిన INA, ఆజాద్ హింద్‌ సభ్యులను కలిసారు. అతను సింగపూర్‌లోనే ఉండి బ్రిటిషు వారికి లొంగిపోవాలని కోరుకున్నాడు. తద్వారా భారతదేశంలో విచారణ జరిగి, తనకు ఉరిశిక్ష పడితే అది దేశాన్ని రగిలించి, స్వాతంత్య్రోద్యమానికి దోహద పడుతుందని వాదించాడు. అతను అలా చేయరాదని ఆజాద్ హింద్ క్యాబినెట్ అతన్ని ఒప్పించింది. 1945 సెప్టెంబరులో జపాన్ లొంగిపోయిన సమయంలో బోసు, జపాన్ ఆక్రమిత చైనాలో సోవియట్ సరిహద్దుకు సమీపంలో ఉన్న డాలియన్‌కు వెళ్ళి సోవియట్ సైన్యాన్ని సంప్రదించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో తైవాన్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలిసింది. మిగిలిన INA దళాలు MZ కియాని నేతృత్వంలో సింగపూర్‌లోని బ్రిటిషు-ఇండియన్ దళాలకు లొంగిపోయాయి.

INA ముగింపు మార్చు

స్వదేశానికి పంపడం మార్చు

 
మౌంట్ పోపా వద్ద లొంగిపోయిన భారత జాతీయ సైన్యం దళాలు. రమారమి 1945 ఏప్రిల్.

దక్షిణాసియాలో యుద్ధం ముగియక ముందే, మిత్రరాజ్యాల చేతికి చిక్కుతున్న INA ఖైదీలపై విచారణ జరిపేందుకు నిఘా విభాగాలు సాధ్యాసాధ్యాలను పరిశీలించాయి. ఇంఫాల్, కోహిమా యుద్ధాలలోను, ఆ తరువాత జరిగిన ఉపసంహరణ లోనూ దాదాపు పదిహేను వందల మంది పట్టుబడ్డారు. 14 వ సైన్యం చేసిన బర్మా దాడిలో అంతకంటే పెద్ద సంఖ్యలో లొంగిపోయారు లేదా పట్టుబడ్డారు. INA కు చెందిన 43,000 మందిలో మొత్తం 16,000 మందిని పట్టుబడ్డారు. వీరిలో దాదాపు 11,000 మందిని కంబైన్డ్ సర్వీసెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కార్ప్స్ (CSDIC) విచారించింది. చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్న ఖైదీల కారణంగా బోసు సిద్ధాంతాల పట్ల బలమైన నిబద్ధత ఉన్నవారి పైననే విచారణలు జరిపారు. తక్కువ నిబద్ధత ఉన్నవారు లేదా ఇతర పరిస్థితులు ఉన్నవారి పట్ల ఒకింత సున్నితంగా వ్యవహరించి తక్కువ శిక్షలతో సరిపెట్టారు. ఇందు కోసం, ఫీల్డ్ ఇంటెలిజెన్స్ యూనిట్లు ఆజాద్ హింద్ పట్ల బలమైన నిబద్ధతతో ఉన్న దళాలను నల్లవారు అని పిలిచారు. పరిస్థితుల ప్రభావం వల్ల INA లో చేరినవారిని బూడిదరంగు వారు (గ్రేస్) అని అన్నారు. తప్పని పరిస్థితులలో ఏదో ఒత్తిడి మీద INA లో చేరినవారిని తెల్లవారు అన్నారు.

1945 జూలై నాటికి, పెద్ద సంఖ్యలో ఖైదీలను వెనక్కి భారతదేశానికి పంపారు. జపాన్ పతన సమయంలో పట్టుబడిన దళాలను రంగూన్ ద్వారా భారతదేశానికి పంపారు. ఝాన్సీ రాణి రెజిమెంటు లోని రిక్రూట్‌లతో సహా పెద్ద సంఖ్యలో స్థానిక మలయ్ బర్మా వాలంటీర్లు జన జీవన స్రవంతి లోకి తిరిగి వెళ్ళారు. ఆ తరువాత వారెవరో గుర్తు తెలియలేదు. వెనక్కి భారతదేశానికి పంపబడినవారిని చిట్టగాంగ్, కలకత్తా ల్లోని శిబిరాల్లో ఉంచి, అక్కడినుండి వారిని జింగర్‌గచ్ఛా, నీల్‌గంజ్, కిర్కీ, అట్టోక్, ముల్తాన్, ఢిల్లీ సమీపంలో బహదూర్గఢ్ వద్ద నెలకొల్పిన జైలు శిబిరాల్లో ఖైదు చేసారు. బహదూర్‌గఢ్‌లో ఫ్రీ ఇండియా లెజియన్ కు చెందిన ఖైదీలను కూడా ఉంచారు. నవంబరు నాటికి, దాదాపు 12,000 INA ఖైదీలు ఈ శిబిరాల్లో ఉన్నారు. వాళ్లను "రంగుల" ప్రకారం విడుదల చేసారు.[65] డిసెంబరు నాటికి, వారానికి దాదాపు 600 మంది తెల్ల రంగువారిని విడుదల చేసారు. విచారణను ఎదుర్కొనే వారిని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది.[65]

బ్రిటిషు-భారతీయ సైన్యం, INA లో చేరిన తన సైనికులపై అంతర్గత క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని భావించింది, అదే సమయంలో భారత సైన్యంలో క్రమశిక్షణను కాపాడటానికి, నేరపూరిత చర్యలకు పాల్పడ్డ వారికి శిక్షలు విధించేందుకు ఎంపిక చేసిన కొందరిపై విచారణ చేపట్టింది. సైన్యం గురించిన వార్తలు దేశంలో వ్యాపించడంతో, భారతీయుల నుండి వారికి విస్తృతంగా సానుభూతి, మద్దతు, ప్రశంసలూ లభించాయి. 1945 నవంబరులో INA దళాలను ఉరితీసినట్లు వార్తాపత్రిక నివేదికలు రాసాయి.[66] ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితి దీనితో మరింత దిగజారింది. భారతదేశమంతటా జరుగుతున్న భారీ ర్యాలీలలో పోలీసులు నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. INA సైనికులకు మద్దతుగా బహిరంగ అల్లర్లు తలెత్తాయి. ఈ ప్రజాగ్రహం ఉపఖండంలోని సాంప్రదాయక మతపరమైన అంతరాలను అధిగమించింది. స్వాతంత్ర్యోద్యమంలో పాకిస్తాన్ కోసం ప్రచారంలో తదితర అంశాల్లో కనిపించే హిందూ ముస్లింల విభజన ఈ సందర్భంలో కనిపించలేదు.

ఎర్ర కోట విచారణలు మార్చు

1945 1946 నవంబరు మే మధ్య, ఢిల్లీలోని ఎర్రకోటలో సుమారు పది కోర్టు-మార్షళ్ళు బహిరంగంగా జరిగాయి. బ్రిటిషు భారతీయ సైన్యం యొక్క కమాండర్-ఇన్-చీఫ్ అయిన క్లాడ్ ఆచిన్‌లెక్ ఎర్ర కోటలో బహిరంగ విచారణలు నిర్వహిస్తే, హింస, సహకారానికి సంబంధించిన కథనాలను మీడియా నివేదించినట్లయితే, ప్రజాభిప్రాయం INA కి వ్యతిరేకంగా మళ్ళుతుందని, రాజకీయంగా స్థిరపడటానికి సహాయపడుతుందనీ అతడు ఆశించాడు. విచారణలను ఎదుర్కోవలసిన వారిపై హత్య, హింస, "చక్రవర్తిపై యుద్ధం చేయడం" వంటి వివిధ ఆరోపణలు పెట్టారు. అయితే, ప్రేమ్ సెహగల్, గురుబక్ష్ సింగ్ ధిల్లాన్, షా నవాజ్ ఖాన్‌లపై జరిపిన మొట్టమొదటి అత్యంత ప్రసిద్ధ ఉమ్మడి కోర్టు-మార్షళ్ళ ద్వారా ఆచిన్‌లెక్ భారతీయ పత్రికలకు, ప్రజలకూ చెప్పాలని ఆశించినది చిత్రహింసలు, హత్యల కథ కాదు. బర్మాలో ఉండగా వారు తమ సహచరులనే హత్య చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. పీటర్ ఫే, ది ఫర్గాటెన్ ఆర్మీ అనే తన పుస్తకంలో వాస్తవానికి అవి హత్యలు కావని, చేజిక్కిన యుద్ధఖైదీలను కోర్టు-మార్షల్ చేసిన సంఘటనలేననీ రాసాడు. ఈ ముగ్గురినీ సైన్యంలో భాగమని అంగీకరించినట్లయితే (న్యాయ వాదుల బృందం అలానే వాదించింది), వారు INA చట్టం అమలులో సర్వామోదిత యుద్ధ ప్రవర్తన ప్రక్రియనే పాటించినట్లు అవుతుంది. భారతీయులు వారిని శత్రు సహకారులుగా కాకుండా దేశభక్తులుగా చూసారు. అప్పటి యుద్ధ శాఖ సెక్రెటరీ అయిఉన ఫిలిప్ మాసన్, "కొద్ది వారాల్లోనే ... జాతీయవాద భావోద్వేగ తరంగంలో INA, భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన హీరోగా ప్రశంసలు పొందింది" అని రాశాడు. నిందితులు ముగ్గురూ భారతదేశంలోని మూడు ప్రధాన మతాలకు చెందినవారు: హిందూ, ఇస్లాం, సిక్కు మతం. బ్రిటిషు-భారతీయ సైన్యం లోని కుల మత విభేదాలతో పోలిస్తే, INA నిజమైన, లౌకిక, జాతీయ సైన్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని భారతీయులు భావించారు. మొదటి విచారణ ప్రారంభంలో పెద్దయెత్తున హింస, అల్లర్లు జరిగాయి. తరువాతి కాలంలో దాన్ని "సంచలనం" అని వర్ణించారు. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ రెండూ 1945-1946లో స్వాతంత్ర్య పోరాటంలో INA ఖైదీలను విడుదల చేయడాన్ని ఒక ముఖ్యమైన రాజకీయ సమస్యగా మార్చాయి. 1946 దీపావళి నాడు లాహోర్‌లో ఖైదీలకు మద్దతుగా ప్రజలు సాంప్రదాయిక మట్టి దీపాలను వెలిగించకపోవడంతో చీకటిగా ఉండిపోయింది. సహాయ నిరాకరణ, అహింసాయుత నిరసనలతో పాటు, బ్రిటిషు-భారతీయ సైన్యంలో తిరుగుబాట్లు, బ్రిటిషు-భారతీయ దళాలలో సానుభూతి వ్యాపించాయి. ఐఎన్‌ఎకు లభించిన మద్దతు మతపరమైన అవరోధాలను దాటింది. ఇది కాంగ్రెసు, ముస్లిం లీగ్‌లు కలిసి చేసిన చివరి ప్రధాన ప్రచారం; నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ త్రివర్ణ పతాకం, లీగ్ యొక్క పచ్చ జెండాలు కలిసి ఎగిరాయి.

INA సైనికులను కోర్టు మార్షల్‌ నుండి రక్షించడానికి కాంగ్రెసు పర్టీ చకచకా అడుగులు వేసింది. INA సంరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ, భూలాభాయ్ దేశాయ్, కైలాశ్‌నాథ్ కట్జూ, అసఫ్ అలీ వంటి ప్రముఖ భారతీయ న్యాయవాదులను చేర్చారు. ఈ విచారణలు సైనిక చట్టం, రాజ్యాంగ చట్టం, అంతర్జాతీయ చట్టం, రాజకీయాలు మొదలైనవాటిపై ఆధారపడి వాదనలు జరిగాయి. ప్రారంభ వాదనలు ఎక్కువ భాగం వారిని యుద్ధ ఖైదీలుగా పరిగణించాలి అనే వాదనపై ఆధారపడ్డాయి. ఎందుకంటే వారేమీ కిరాయి సైనికులు కాదు, ఆజాద్ హింద్ అనే చట్టబద్ధమైన ప్రభుత్వానికి చెందిన సైనికులు. నెహ్రూ, "వారికి ఉన్న సమాచారం తప్పుడుదో మరోటో కావచ్చు గాక, వారు తమ దేశం పట్ల తమ దేశభక్తి విధికి సంబంధించిన భావనలో ఉన్నారు" అని వాదించాడు. వారు స్వేచ్ఛా భారత దేశాన్ని తమ సార్వభౌమాధికారంగా గుర్తించారు, కానీ బ్రిటిషు సార్వభౌమాధికారాన్ని కాదు. కనీసం ఒక INA ఖైదీ -బుర్హాన్-ఉద్-దీన్- చిత్రహింసలకు పాల్పడ్డాడనే ఆరోపణలకు అర్హుడు కావచ్చు అని పీటర్ ఫే రాసాడు. కానీ అతని విచారణ పాలనావిధుల ప్రాతిపదికన వాయిదా వేయబడింది. మొట్టమొదటిగా జరిగిన కోర్టు-మార్షళ్ళ తర్వాత, యుద్ధఖైదీలపై హింస హత్య లేదా హత్యకు ప్రేరణ అభియోగాలు మాత్రమే మోపారు. ప్రజల్లో క్రోధం పెల్లుబుకుతుందనే భయంతో వారిపై రాజద్రోహం ఆరోపణలు తొలగించారు.

కోర్టు-మార్షల్ కొనసాగింపుపై విస్తృతమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ, బ్రిటిషు ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. ముగ్గురు నిందితులు అనేక ఆరోపణలలో దోషులుగా నిర్ధారించబడ్డారు. వారిపై జీవితకాల బహిష్కరణ విధించారు. అయితే, ఆ శిక్ష ఎన్నడూ అమలు చేయలేదు. విపరీతమైన ప్రజా ఒత్తిడి, ప్రదర్శనలు, అల్లర్ల కారణంగా క్లాడ్ ఆచిన్‌లెక్‌ ఆ ముగ్గురు నిందితులను విడుదల చేయవలసి వచ్చింది. మూడు నెలల్లో, INA కు చెందిన 11,000 మంది సైనికులు వారికివ్వాల్సిన చెల్లింపులు, భత్యాలను జప్తు చేసి విడుదల చేసారు. లార్డ్ మౌంట్‌బాటెన్ సిఫారసు, దానికి జవహర్‌లాల్ నెహ్రూ ఒప్పుకోవడం లతో, INA మాజీ సైనికులను కొత్త భారత సాయుధ దళాలలో చేర్చుకోకూడదనే షరతుతో విడుదల చేసారు.[67]

1947 తరువాత మార్చు

భారతదేశంలో, INA ఒక భావోద్వేగ, చర్చనీయాంశంగా కొనసాగుతోంది. ఇది 1947 వరకు ప్రజల మనసుల్లో, సాయుధ దళాల మనోభావాల్లో బలమైన ముద్ర వేసింది. 1946 చివరలో, 1947 ప్రారంభంలో జవహర్‌లాల్ నెహ్రూ అభ్యర్థన మేరకు, INA దళాల చేత కాంగ్రెస్ వాలంటీర్లకు శిక్షణ ఇప్పించడానికి షా నవాజ్ ఖాన్‌కు బాధ్యత అప్పగించారు. 1947 తరువాత, సుభాస్ బోసుతో, INA విచారణలతో సన్నిహితంగా ఉన్న అనేక మంది INA సభ్యులు ప్రజా జీవితంలో ప్రముఖులయ్యారు. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే స్వతంత్ర భారతదేశంలో చాలా మంది ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ఈజిప్టు, డెన్మార్క్‌లలో అబిద్ హసన్ , ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలో ACN నంబియార్, కెనడాలో మెహబూబ్ హసన్, నెదర్లాండ్స్‌లో సిరిల్ జాన్ స్ట్రేసీ, స్విట్జర్లాండ్‌లో ఎన్. రాఘవన్ లు రాయబారి పదవులను నిర్వహించారు. మోహన్ సింగ్ రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పార్లమెంటులోను, వెలుపలా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులుగా భారత జాతీయ సైన్యం సభ్యులను గుర్తింపజేసేందుకు అతను కృషిచేశాడు. షా నవాజ్ ఖాన్ మొదటి భారతీయ క్యాబినెట్‌లో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. లక్ష్మీ సహగల్, ఆజాద్ హింద్ ప్రభుత్వంలో మహిళా వ్యవహారాల మంత్రి, భారతదేశంలో బాగా పేరున్న, విస్తృతంగా గౌరవించబడే నాయకురాలు. 1971 లో, ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) లో చేరింది. తరువాత అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘానికి నాయకురాలిగా ఎన్నికయ్యారు. జాయ్స్ లెబ్రా, ఒక అమెరికన్ చరిత్రకారుడు, INA సభ్యుల భాగస్వామ్యం లేకపోయి ఉంటే ద్రవిడ మున్నేట్ర కళగం పునరుజ్జీవనం సాధ్యమయ్యేదే కాదని రాసాడు.

హైదరాబాద్ విలీనానికి ముందు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడీన పౌర నిరోధక దళాలకు శిక్షణ ఇవ్వడంలో INA సైనికులు పాల్గొన్నారని కొందరు సూచించారు.[68] మొదటి కాశ్మీర్ యుద్ధంలో కొంతమంది ఐఎన్ఏ అనుభవజ్ఞులు పాకిస్తాన్ సైనికులకు నాయకత్వం వహించారనే సూచనలు కూడా ఉన్నాయి. మహమ్మద్ జమాన్ కియానీ 1950 ల చివరలో గిల్గిట్‌లో పాకిస్తాన్ రాజకీయ ఏజెంట్‌గా పనిచేశారు.[69] 1947 తర్వాత భారత సాయుధ దళాలలో చేరిన అతి కొద్ది మంది మాజీ ఐఎన్ఏ సభ్యులలో, టోక్యో బాయ్స్ సభ్యుడు ఆర్ఎస్ బెనగల్ 1952 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాడు. తరువాత ఎయిర్ కమోడర్‌గా ఎదిగాడు. బెనగల్ 1965, 1971 లో జరిగిన ఇండో-పాకిస్తానీ యుద్ధం రెండింటిలోనూ పాల్గొన్నాడు. భారతదేశపు రెండవ అత్యున్నత పరాక్రమ పురస్కారమైన మహా వీర చక్రను పొందాడు.[70]

INA లోని ఇతర ప్రముఖ సభ్యులలో, రామ్ సింగ్ ఠాకూర్, INA యొక్క రెజిమెంటల్ మార్చి కదం కదమ్ బడాయే జాతో సహా అనేక పాటల స్వరకర్త. భారత జాతీయ గీతపు ఆధునిక ట్యూన్ చేసిన ఘనత అతనిదేనని కొందరు అంటారు.[71]

1990 లలో భారత ప్రభుత్వం గురుబక్ష్ సింగ్ ధిల్లాన్‌కు పద్మభూషణ్, లక్ష్మీ సహగల్‌కు పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సన్మానించింది. 2002 లో కమ్యూనిస్టు పార్టీల ద్వారా లక్ష్మీ సహగల్ భారత రాష్ట్రపతి పదవికి APJ అబ్దుల్ కలాం పోటీ పడింది. 1992 లో సుభాస్ బోసుకు మరణానంతరం భారతరత్న పురస్కారం లభించింది. అయితే అతని మరణ పరిస్థితులపై రేగిన వివాదం కారణంగా ఉపసంహరించుకున్నారు.[72]

సింగపూర్‌లో మాజీ INA సైనికులు విభిన్నమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. సింగపూర్‌లో, భారతీయులు - ప్రత్యేకించి INA తో సంబంధం ఉన్నవారు - "ఫాసిస్టులు, జపనీయుల సహకారులుగా అవమానించబడ్డారు. కాబట్టి వారి పట్ల అసహ్యంతో వ్యవహరించారు. తరువాతి కాలంలో వీరి లోని కొందరు ప్రముఖ రాజకీయ సామాజిక నాయకులుగా ఎదిగారు. నేషనల్ యూనియన్ ఆఫ్ ప్లాంటేషన్ వర్కర్స్ రూపంలో కార్మిక సంఘాల ఏకీకరణలో మాజీ ఐఎన్ఏ నాయకులు నాయకత్వం వహించారు. మలయాలో, 1946 లో మలేషియన్ ఇండియన్ కాంగ్రెస్ (ఎంఐసి) ని స్థాపించడంలో INA కి చెందిన ప్రముఖ సభ్యులు పాల్గొన్నారు. జాన్ తివి దీని వ్యవస్థాపక అధ్యక్షుడు. రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంటుకు చెందిన సెకండ్-ఇన్-కమాండ్ జానకీ అతి నహప్పన్ కూడా MIC వ్యవస్థాపక సభ్యురాలు. తరువాత మలేషియా పార్లమెంటులోని దివాన్ నెగరాలో ప్రముఖ సంక్షేమ కార్యకర్త, విశిష్ట సెనేటర్‌ అయింది. ఝాన్సీ రాణి రెజిమెంటుకు చెందిన రసమ్మా భూపాలన్, తరువాత మలేషియాలో మహిళల హక్కుల కోసం పాటుపడీన సంక్షేమ కార్యకర్తగా విస్తృతంగా గౌరవించబడింది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Fay 1993, p. viii
  2. Lebra 2008, Foreword, pp. viii–x
  3. Lebra 2008, p. 99
  4. Fay 1993, pp. 212–213
  5. "Subhas Chandra Bose, Mahatma Gandhi and Nehru: Admirers or adversaries? A myth buster".
  6. 6.0 6.1 Lebra 2008, p. xv
  7. Fay 1993, pp. 423–424, 453
  8. 8.0 8.1 Toye 1959, Mason, in Foreword, p. xiv
  9. Fay 1993, p. 228
  10. Lebra 1977, p. 23
  11. 11.0 11.1 11.2 Lebra 1977, p. 24
  12. Fay 1993, p. 75
  13. 13.0 13.1 Toye 2007, p. 4
  14. Fay 1993, pp. 56, 224, 226
  15. Toye 1959, p. 30
  16. Toye 1959, p. 7,8
  17. Fay 1993, pp. 91, 108
  18. Fay 1993, p. 108
  19. Lebra 2008, p. 77
  20. Fay 1993, p. 94
  21. Fay 1993, p. 111
  22. Lebra 2008, p. 49
  23. Fay 1993, p. 150
  24. 24.0 24.1 Toye 1959, p. 45
  25. Fay 1993, p. 149
  26. 26.0 26.1 Fay 1993, p. 151
  27. "MZ Kiani". World News. Retrieved 2011-08-12.
  28. "MZ Kiani". World News. Retrieved 2011-08-12.
  29. Lebra 2008, p. 98
  30. Toye 2007, p. 2
  31. Lebra 1977, p. 27
  32. Toye 1959, p. 80
  33. 33.0 33.1 33.2 33.3 Toye 2007, The Rebel President
  34. Sengupta 2012, pp. 23–24
  35. 35.0 35.1 Toye 1959, p. 88
  36. Fay 1993, p. 197
  37. "Subhas Chandra Bose in Nazi Germany". Sisir K. Majumdar. South Asia Forum Quarterly. 1997. pp. 10–14. Retrieved 2011-08-12.
  38. Lebra 2008, p. 107
  39. Tojo 1943
  40. Toye 1959, pp. 117–119
  41. Lebra 2008, p. 231
  42. "Total Mobilisation". National Archives of Singapore. Archived from the original on 2011-08-29. Retrieved 2011-08-12.
  43. "Historical Journey of the Indian National Army". National Archives of Singapore. Archived from the original on 2007-05-16. Retrieved 2007-07-07.
  44. 44.0 44.1 Belle 2014, p. 199
  45. Fay 1993, p. 556
  46. Singh 2003, p. 16
  47. 47.0 47.1 Toye 1959, p. 86
  48. Toye 1959, p. 149
  49. Fay 1993, pp. 292, 298
  50. Fay 1993, p. 268
  51. Fay 1993, p. 262
  52. Toye 1959, p. 159
  53. Toye 1959, p. 161
  54. Toye 1959, p. 162
  55. Sareen 1996, p. 184
  56. van Der Bijil 2013, p. 112
  57. Toye 1959, pp. 198, 215
  58. Fay 1993, pp. 283–284
  59. Toye 1959, pp. 189–191
  60. Toye 1959, p. 180
  61. Fay 1993, p. 417
  62. Fay 1993, p. 539
  63. Singh 2003, pp. 32–33
  64. Toye 1959, p. 248
  65. 65.0 65.1 Fay 1993, p. 436
  66. "Many INA already executed". Hindustan Times. Archived from the original on 9 August 2007. Retrieved 2007-09-02.
  67. Ganguly, Sumit. "Explaining India's Transition to Democracy". Columbia University Press. Retrieved 2007-09-03.
  68. Menon, P. "The States". The Hindu. Retrieved 2007-09-03.
  69. "Taj Muhammad Khanzada. Legislators from Attock". Provisional Assembly of Punjab (Lahore-Pakistan). Govt of Pakistan. Archived from the original on 2007-11-01. Retrieved 2007-09-19.
  70. "Air Commodore Ramesh Sakharam Benegal". Bharat Rakshak. Retrieved 2015-09-18.
  71. "Who composed the score for Jana Gana Mana? Gurudev or the Gorkha?". Rediff on the net. Retrieved 2015-09-18.
  72. "Why was the Bharat Ratna Award given to Netaji Subhash Chandra Bose withdrawn by the Supreme Court in 1992?". Times of India. Retrieved 2015-09-18.