ఆర్. విద్యాసాగ‌ర్‌రావు

ఆర్ విద్యాసాగర్‌రావు (14 నవంబరు 1939 – 29 ఏప్రిల్ 2017)[1] తెలంగాణ రాష్ట్రానికి నీటిపారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల సలహాదారుగా నియమితులయ్యారు.[2] విద్యాసాగ‌ర్‌రావు చాలా నిరాడంబ‌ర‌మైన జీవితాన్ని గ‌డిపారు. నీరు-నిజాలు ఆయన ఇంటిపేరుగా మారింది. నిర్మొహమాటం ఉండే ఆయన వ్యక్తిత్వం. వృత్తిరీత్యా ఇంజనీరు ఐన కొలువులో ఉన్నన్నాళ్లూ మంచి రచయితగా, నటుడిగా పేరొందారు.

ఆర్ విద్యాసాగర్‌రావు
2015లో ఆర్ విద్యాసాగర్‌రావు
జననం(1939-11-14)1939 నవంబరు 14
మరణం2017 ఏప్రిల్ 29(2017-04-29) (వయసు 77)
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్
వృత్తి
  • విద్యావేత్త
  • సామాజిక కార్యకర్త
  • తెలంగాణ సిద్ధాంతకర్త

తెలంగాణలో నీటిపారుదలకి ఆయన చేసిన అపారమైన కృషికి గౌరవంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ఆర్. విద్యాసాగర్ రావు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌గాపేరు పెట్టారు.[3] ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాకు సురక్షిత మంచినీరు, తెలంగాణ ప్రాంతంలోని ఎండిపోయిన భూములకు నీరు అందించాలని పోరాడారు.

జీవిత విశేషాలు మార్చు

ఆయన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకు చెందిన జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందినవారు. ఆయ‌న తల్లి ల‌క్ష్మమ్మ‌, తండ్రి ఆర్ రాఘ‌వ‌రావు. వారిది విద్యావంతుల కుటుంబం‌. ఆయ‌న తండ్రి అప్పటికే టీచ‌రు అయినందువ‌ల్ల ఆ కుటుంబంలో అంద‌రూ చ‌దువుకున్నారు. ఆ ఊళ్లో ఫ‌స్ట్ మెట్రిక్యూలేట్ వాళ్ల నాన్నన‌ట‌. ఫ‌స్ట్ గ్రాడ్యూయేట్ వాళ్ల అన్న‌. విద్యాసాగ‌ర్‌రావు వాళ్ల ఊళ్లో మొట్టమొద‌టి ఇంజ‌నీరింగ్ ప‌ట్టభ‌ద్రుడు. ఇలా ఆ కుటుంబంలో ఆయ‌న చెల్లెండ్లు కూడా అప్పట్లో ఒకామె సెవెన్త్ క్లాస్‌, ఇంకొకామే మెట్రిక్యులేష‌న్ చేశారు.[4]

ఆయన 1960లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయమునుండి ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. 1979లో రూర్కీ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం ఐఐటి రూర్కీ) లో నీటి వనరుల అభివృద్ధి లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆయన 1983లో యు.ఎస్.ఎ లోని కొలోరాడో స్టేట్ విశ్వవిద్యాలయం నుండి నీటి వనరుల వ్యవస్థ ఇంజనీరింగులో డిప్లొమా పొందారు. ఆయన 1990లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టాను కూడా పొందారు.

ఉద్యోగ జీవితం మార్చు

బీటెక్ అయిన వెంట‌నే క్యాంప‌స్‌లోని మ‌హిళా కాలేజీ మెయింటెనెన్స్ ఇంజీనీరుగా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన త‌ర్వాత కూడా రచనలు చేయ‌టం, నాట‌కాలు వేయ‌డం వంటి హాబీల‌ను ఆయ‌న వ‌దులుకోలేదు. రోజూ సాయంత్రం ఆయ‌న అడ్డా ల‌క్డీకాపూల్లోని ర‌వీంద్రభార‌తి. డ్యూటీ అయిపోయిన వెంట‌నే ఆయ‌న అక్కడికి చేరుకునేవార‌ట‌. హైద‌రాబాద్‌లో ఉద్యోగం అనంత‌రం ఢిల్లీకి వెళ్లారు. కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌, నీటిపారుద‌ల శాఖ‌లో ఇంజ‌నీరుగా ప‌నిచేశారు. ఢిల్లీలో ఉండ‌గానే నీళ్ల విషయంలో తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్నారు. రిటైర్మెంట్ త‌రువాత తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చారు. అంత‌కు ముందు దాదాపు 34 సంవత్సరాల పాటు కేంద్ర జలసంఘంలోనే విధులు నిర్వహించడంతో ఆయనకు దేశవ్యాప్తంగా జల వనరుల అంశంపై అపారమైన అనుభవం గ‌డించారు.

తెలంగాణ ఉద్యమకారుడు మార్చు

ఆయన జల సమస్యలపై ప్రజలతో తెలుగులో మాట్లాడేవారు.[5][6] తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులపై అగ్రగామి నిపుణుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాలను ఎత్తిచూపడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన వార్త, ఆంధ్రజ్యోతి, ఈనాడు,, నమస్తే తెలంగాణ పత్రికలలో జల సంబంధిత సమస్యలపై సుమారు 100 వ్యాసాలు రాసారు. అంతే కాకుండా "నీరు-నిజాలు" అనే పేరుతో రెండు సంపుటాలను వెలువరించారు.[7] నీటి వనరుల నిపుణునిగా ఆయన విద్యార్థులు, మేథావులు, సాధారన ప్రజలతో నీటి సమస్యలపై అవగాహన కల్పించుటకు సెమినార్లను నిర్వహించేవాడు.[8] ఆయన తెలంగాణ ప్రభుత్వ నీటి విధానాలపై మీడియాకు తెలియజెసేవారు.[9] ఆయన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సమస్యలపై కూడా రాసారు.[10] ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కె.చంద్రశేఖరరావులతో కలసి పనిచేసారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల వ్యవసాయం, నీటి వనరులపై సరైన అవగాహన కల్పించాడు. ఆయన అనేక ఉపన్యాసాలను, వ్యాసాలను సులభమైన భాషలో యిచ్చేవాడు. అదే విధంగా సరైన గణాంకాలను కూడా సాధారణ పౌరునికి కూడా తెలియజెసే విధంగా రాసేవాడు. ఆయన వ్యాసాలు వివిధ ఆంగ్ల జాతీయ పత్రికలలో కూడా అచ్చయ్యాయి.

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మార్చు

ఆయన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల విషయాలపై సరైన ఆలోచనను కలిగి ఉండేవారు.[11] నవంబరు 2016లో తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయ విశ్వవిద్యాలయంచే నిర్వహించబడిన "మిషన్ కాకతీయ" ప్రాజెక్టుకు సంబంధించిన సెమినార్ లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగంలో వ్యవసాయరంగంలో నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వ విధానాలను వివరించారు.[12]

పురస్కారాలు, గుర్తింపులు మార్చు

  • 2014లో, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) ఇంజినీరింగ్ రంగానికి చేసిన సేవలకుగానూ భారతదేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ పర్సనాలిటీలను ప్రదానం చేసింది. అందులో విద్యాసాగర్ రావును "లీడింగ్ ఇంజనీరింగ్ పెర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా" పురస్కారంతో సత్కరించింది.
  • 2018 జనవరిలో ఏర్పాటుచేసిన జాజిరెడ్డిగూడెంలోని సబ్ మార్కెట్ యార్డుకు "ఆర్. విద్యాసాగర్ రావు సబ్-మార్కెట్ యార్డ్, జాజిరెడ్డిగూడెం" అని పేరు పెట్టారు.[13]
  • ఫ్లోరైడ్ పీడిత, కరువు పీడిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీరు-నీటిపారుదల సౌకర్యాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆర్. విద్యాసాగర్ రావు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పేరు పెట్టారు.[14][15]
  • నీటి రంగ నిపుణులు అయిన ఆయన జయంతి నవంబరు 14న ప్రతీయేట రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల దినోత్సవం గా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.[16] 2020 నవంబరు 14న ఆయన 81వ జన్మదినోత్సవం, 4వ తెలంగాణ నీటిపారుదల దినోత్సవం సందర్భంగా ఎర్రమంజిల్‌లోని తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ భవనంలో, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం (జలసౌధ)లలో రావుకు విగ్రహాలను మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియాలో నీటిపారుదల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం నిర్వహించబడింది.[17][18][19]

సినిమాలు మార్చు

మరణం మార్చు

ఆయ‌న ఏప్రిల్ 29 2017న హైద‌రాబాద్‌లోని కాంటినెంట‌ల్ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. విద్యాసాగ‌ర్‌రావుకు ఇద్దరు సంతానం (అమ్మాయి, అబ్బాయి) ఢిల్లీలో సెటిల‌య్యారు.[20][21]

మూలాలు మార్చు

  1. "Vidyasagar's death: Telangana loses a polite warrior". telanganatoday.news. 29 April 2017.[permanent dead link]
  2. "Vidyasagar's death: Telangana loses a polite warrior". telanganatoday.news. 29 April 2017.[permanent dead link]
  3. http://www.business-standard.com/article/pti-stories/dindi-project-in-telangana-named-after-vidyasagar-rao-118041400400_1.html
  4. నీళ్ల నిపుణుడు విద్యాసాగర్ రావు గురించి..[permanent dead link]
  5. "Telangana State Portal Advisors".
  6. "Welcome to Government Order Issue Register". Archived from the original on 2017-05-07. Retrieved 2017-04-29.
  7. "కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం". Archived from the original on 2016-06-16. Retrieved 2017-04-29.
  8. వీడియో యూ ట్యూబ్ లో
  9. వీడియో యూ ట్యూబ్ లో
  10. Perspectives on Polavaram, a Major Irrigation Project on Godavari. Academic Foundation. 2006. pp. 91–94. ISBN 978-81-7188-578-7.
  11. Rahul, N. (1 February 2015). "TS offers to talk with A.P. on Krishna waters" – via The Hindu.
  12. వీడియో యూ ట్యూబ్ లో
  13. "Agriculture and Co-operation Dept, Telangana State G.O.No.31 dt.6-3-2018".
  14. "Dindi project to be named after Vidyasagar Rao". 14 April 2018.
  15. "namasthe telangana 15-4-2018". Archived from the original on 2018-09-18. Retrieved 2022-01-28.
  16. Velugu, V6 (2020-11-14). "తుది శ్వాస వరకు తెలంగాణ సిద్ధాంతాన్ని,సంక్షేమాన్ని కోరుకున్న మహనీయుడు". V6 Velugu (in ఇంగ్లీష్). Retrieved 2022-01-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  17. "Namasthe Telangana".
  18. "Telangana Engineers Assn Building, Errummanzil, Hyderabad".
  19. "IEI Hall, Khairatabad, Hyderabad".
  20. జలయోధుడు విద్యాసాగర్ రావు ఇక లేరు[permanent dead link]
  21. టీన్యూస్ మీడియా. "ఆర్. విద్యాసాగర్ రావు కన్నుమూత". Archived from the original on 17 మే 2017. Retrieved 29 April 2017.