ఉదయ్ సింగ్ II  ప్రస్తుత  రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ నగరాన్ని  కనుగొన్న మేవాడ్  రాజు. మేవాడ్ రాజవంశంలో 53వ రాజైన ఉదయ్ సింగ్ తన  పరిపాలనా  కాలంలో మేవాడ్  ప్రాంతం నుంచి రాజధానిని ఉదయ్  పూర్ కు మార్చారు. ఈయన  మహారాణా సంగ్రాం సింగ్ కు నాలుగో  కుమారుడు.[1] ఆయన తల్లి రాణీ కర్ణవతీ బుండీ రాకుమార్తె.

ఉదయ్ సింగ్ II

తొలినాళ్ళ జీవితం మార్చు

చిత్తోర్ లో జన్మించారు ఉదయ్ సింగ్. ఆగస్టు 1522లో ఆయన తండ్రి రాణా సంగ్రాం సింగ్ మరణించిన తరువాత అన్నగారు రతన్ సింగ్ II అధికారంలోకి వచ్చారు.[2] 1531లో రాణా రతన్ కూడా చనిపోయాకా, ఉదయ్ సింగ్ రెండో అన్నగారు మహారాణా విక్రమాదిత్య సింగ్ పరిపాలించారు. విక్రమాదిత్య పాలనాకాలంలో తురక సుల్తాన్ గుజరాత్ బహద్దూర్ షా చిత్తోర్ ను ముట్టడించే ప్రయత్నాలు చేశారు. 1534లో భద్రతా విషయాల దృష్ట్యా ఉదయ్ సింగ్ ను తన అమ్మగారి పుట్టిల్లు బుండీకి పంపించారు.[1] 1537లో వీరి బంధువు బంబిర్ విక్రమాదిత్యను చంపి, రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. చిన్నపిల్లవాడైన ఉదయ్ సింగ్ ను కూడా చంపడానికి ప్రయత్నించారు. ఉదయ్ సింగ్ ను పెంచుతున్న ఆయా పన్నాదాయ్ ఉదయ్ కు బదులుగా తన కొడుకు చందన్ ను బంబిర్ కు ఇచ్చింది. అలా కాపాడుకున్న ఉదయ్ ను బంబిర్ కు దొరకకుండా కుంబల్ గఢ్ కు పంపించేసింది.  ఆమె బుండీలోనే ఉంటూ ఉదయ్ సింగ్ ను కుంబల్ గఢ్ లో రెండేళ్ళ పాటు రహస్యంగా పెరిగేలా ఏర్పాటు చేసింది. ఆ రెండేళ్ళూ ఉదయ్ సింగ్ గవర్నర్ ఆషా షా దెపురాకు మేనల్లుడిగా మారువేషంలో పెరిగారు.

1540లో మేవాడ్ మంత్రుల సహాయంతో ఉదయ్ సింగ్ కుంబల్ గఢ్ రాజ్య సింహాసనాన్ని అధిష్టించారు. అదే ఏడాది తన మొదటి భార్య మాహారాణీ జైవంతబాయ్ సొంగరా తన మొదటి కుమారుడు  మహారాణాప్రతాప్ కు  జన్మనిచ్చారు.[3] ఉదయ్ సింగ్ కు ఇరవై రెండు భార్యలు, 56 మంది కొడుకులు, 22 మంది కుమార్తెలు ఉన్నారు. ఆయన రెండో భార్య సజ్జాబాయ్ సొలంకినీకి ఆయన రెండో కొడుకు శక్తి, సాగర్ సింగ్, విక్రం దేవ్ లు జన్మించారు. ఉదయ్ సింగ్ ప్రియ భార్య ధీర్ బాయ్ భట్టియానీ కి జగ్మల్ సింగ్, ఇద్దరు కుమార్తెలు చంద్ కున్వర్, మాన్ కున్వర్ లు పుట్టారు. ఆయన నాలుగో భార్య రాణీ వీర్ బాయ్ ఝాలా, ఖేర్వా మహారాజు రాణా జైత్ సింగ్ కుమార్తె.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Tod, James (1829, reprint 2002).
  2. Mahajan V.D. (1991, reprint 2007) History of Medieval India, Part II, S. Chand, New Delhi, ISBN 81-219-0364-5, p.11
  3. Tod, James (1829, reprint 2002).