జె.ఆర్.డి.టాటా

భారతీయ వ్యాపారవేత్త

జె.ఆర్.డి.టాటా (జూలై 29, 1904 - నవంబర్ 29, 1993) భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త. తొలి విమాన చోదకుడు. ఈయనకు 1992లో భారతరత్న పురస్కారం ఇవ్వబడింది.

జహంగీర్ రతన్ జీ దాదాభాయి టాటా

జననం: (1904-07-29)1904 జూలై 29
పారిస్, ఫ్రాన్సు
మరణం:1993 నవంబరు 29(1993-11-29) (వయసు 89)
జెనీవా, స్విట్జర్లాండు
వృత్తి: పారిశ్రామికవేత్త
భర్త/భార్య:థెల్మా వికాజీ
వెబ్‌సైటు:www.tata.com

ప్యారిస్ లో జన్మించిన ఈయనను "జెహ్" లేక "జేఆర్డీ"గా సంబోధిస్తారు. ఈయన తల్లి ఫ్రాన్సు దేశస్థురాలు కావడంతో, ఈయన ఫ్రెంచి భాషను మొదటి భాషగా నేర్చుకున్నాడు. 1929లో ఈయన భారతదేశములోనే మొట్టమొదటి పైలట్ లైసెన్సు పొందాడు. 1932 లో ఈయన భారతదేశపు తొలి వాణిజ్య విమానసేవలను టాటా ఎయిర్ లైన్స్ పేరుతో ప్రవేశపెట్టాడు. 1946లో అది "ఎయిర్ ఇండియా"గా రూపాంతరం చెందింది. తర్వాతికాలంలో ఆయన భారతదేశపు పౌరవిమానయాన పితామహుడుగా ప్రశంసింపబడ్డాడు.

34 ఏళ్ళ వయసులో ఆయన టాటా వ్యాపారసంస్థలకు పెట్టుబడిదారీ సంస్థ (Holding Company: హోల్డింగ్ కంపెనీ లేక మాతృసంస్థ) అయిన టాటా సన్స్ సంస్థకు చైర్మనుగా బాధ్యతలు చేపట్టి 1991 వరకు ఆ పదవిలో కొనసాగాడు. సుదీర్ఘమైన ఆయన హయాంలో టాటా గ్రూపు ఆస్తులు అరవైరెండు కోట్ల రూపాయల నుండి పదివేల కోట్ల రూపాయల పైబడి పెరగగా, గ్రూపులో సంస్థలు పదిహేను నుండి నూటికి పైగా చేరుకున్నాయి.

బాల్యం మార్చు

జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయి టాటా ఫ్రాన్స్‌ లోని ప్యారిస్‌లో రతన్‌జీ దాదాభాయి టాటాకు ఆయన ఫ్రెంచ్‌ సతీయణి అయిన సుజానె బ్రెయిర్‌కూ రెండో బిడ్డగా 1904 జూలై 29 లో జన్మించాడు. ఆయన తండ్రి భారతదేశంలో తొలి పారిశ్రామికవేత్త అయిన జెంషెట్‌జీ టాటాకు దాయాది సోదరుడు. టాటా ఫ్రాన్స్‌లోని బీచ్‌బడ్డున ఉన్న హార్డెలోట్‌లో తన బాల్యాన్ని గడిపినప్పుడు, ఆయనకు విమానయానం పైన ఆసక్తి ఏర్పడింది. విమానాలు నడపడంలో ఆద్యుడైన లూయీ బ్లెరియో నుండి ఆయన స్ఫూర్తి పొందాడు.1929 లో టాటా భారతదేశంలో మొట్టమొదట పైలట్‌ లైసెన్సు పొందాడు. తర్వాతి కాలంలో ఆయన భారత పౌర విమానయాన పితగా గుర్తింపు పొందాడు. భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య విమానయాన సంస్ధ టాటా ఎయిర్‌ లైన్స్‌ను 1932 లో స్ధాపించాడు. అదే తర్వాత 1946 లో ఎయిర్‌ ఇండియాగా మారింది.

ఆయన తల్లి ఫ్రెంచ్‌ దేశానికి చెందినవారవటం వల్ల ఆయన తన బాల్యాన్ని ఎక్కువగా ఫ్రాన్స్‌లోనే గడిపాడు. అతను నేర్చుకున్న మొదటి భాష ఫ్రెంచ్‌. ఆయనకు ఎన్నో ఇష్టాలుండేవి. కేంబ్రిడ్జ్‌లో చదువుకోవాలనుకున్నాడు. వేగంగా వేళ్లే కార్లపై మోజు పడేవాడు, ఫ్రెంచ్‌ సైన్యంలో లా సఫిస్‌ (సిపాయిు) అనే రెజిమెంట్‌లో పనిచేశాడు. ముంబయిలోని కాథెడ్రల్‌, జాన్‌కానన్‌ పాఠశాల్లో చదువుకున్నాడు.

వ్యాపారం మార్చు

1925 లో టాటా స్టీల్‌ కంపెనీలో అప్పటి డైరెక్టర్‌ ఇన్‌ఛార్జి అయిన జాన్‌ పీటర్సన్‌ దగ్గర పనిచేయడానికి బొంబాయి హౌజ్‌కు వచ్చాడు.1938 లో టాటా సన్స్‌కి చైర్మన్‌ అయిన సర్‌ నౌరోజి సక్లత్‌ వాలా చనిపోగానే 34 ఏళ్ల వయస్సున్న జె.ఆర్‌.డి దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు.

చాలా దశాబ్దాల పాటు స్టీల్‌, ఇంజినీరింగ్‌ ఎల్లక్ట్రికల్‌ కంపెనీ వంటి ఎన్నో పరిశ్రమున్న టాటా గ్రూప్‌ సంస్ధను ఉన్నత ప్రమాణాలతో, ఏ రాజకీయవేత్తకూ లంచాలూ ముడుపులూ చెల్లించకుండా, నల్లబజారు మార్గం ఎంచుకోకుండా ఆయన వ్యాపారం నడిపించాడని కీర్తి పొందాడు.ఈ రోజుకూ విశ్వాసానికి మారుగా టాటా పేరు గడించాడు. 1939 లో దేశంలో మళ్లీ మళ్లీ ఏర్పడుతున్న కొరతను తీర్చడానికై స్వయం ఆధారితమైన మౌలిక కర్బనేతర రసాయన పరిశ్రమ టాటా కెమికల్స్‌ను భారతదేశం కోసం ప్రారంభించాడు. 1945 టాటా స్టీల్‌ వారు భారత రైల్వే శాఖలో లోకోమోటివ్స్‌ను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో టాటా ఇంజనీరింగ్‌ అండ్‌ లోకోమోటివ్‌ కంపెనీని (టెల్కో) ను స్ధాపించాడు. టెల్కోను తర్వాత టాటా మోటర్సుగా మార్పు చేసి భారతదేశంలోనూ, విదేశాల్లోనూ ఆటోమోటివ్‌ మార్కెట్‌లో అత్యంతప్రధానమైనదిగాను తీర్చిదిద్దాడు. జెఆర్‌డి అధ్యక్షతన (చైర్మన్‌) టాటా గ్రూప్‌ కంపెనీ 15 నుండి 100 కు అభివృద్ధి చెందాయి.

1932 లో టాటా విమానయాన సర్వీసును ప్రారంభించడం ద్వారా ఆయనకు విమానాపై ఉన్న ఆశ నెరవేరింది. మొట్టమొదటి భారత పౌర విమానం కరాచీలోని ద్రిగ్‌ రోడ్డు విమానక్షేత్రం నుండి 1932 అక్టోబరు 15 న భయుదేరి టాటానే స్వయంగా ఒంటరిగా దాన్ని నియంత్రిస్తుండగా అహ్మదాబాద్‌కు, అక్కడి నుండి బాంబేకు చేరింది. టాటా ఏవియేషన్‌ సర్వీస్‌ ప్రారంభమైన మొదటి సంవత్సరంలో వందకు వంద శాతం సమయపాలన పాటిస్తూ 10,000 రూపాయి లాభాన్ని పొందింది. 1953 లో ప్రభుత్వం విమానయాన వ్యాపారాన్ని జాతీయం చేయాని నిర్ణయించి ఆ పరిశ్రమకు అధ్యక్షుడుగా టాటాను ఆహ్వానించింది. దేశంలోని విమానయాన పరిశ్రమ అప్పుడు ఆధ్వాన్న స్ధితిలో ఉండింది. టాటా ఏవియేషన్‌ తర్వాత 1946 లో ఎయిర్‌ ఇండియాగా మారింది.

టాటా అంత:కరణ కలిగిన చైతన్యవంతమైన పౌరుడు. జాతికి సేవందించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు.1941 లో ఆసియాలోని మొదటి కేన్సర్‌ ఆసుపత్రిని టాటా నేతృత్వంలో 1941 లో ప్రారంభించాడు. అంతర్జాతీయంగా కేన్సర్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో టాటా మెమోరియల్‌ ఆసుపత్రి భారతదేశంలో మొట్టమొదటిది. దేశంలో శాస్త్ర (సైన్సు) రంగ పరిశోధన కోసం డా॥హోమీబాభాకు, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పండ్‌మెంటల్‌ రిసెర్చ్‌' స్ధాపించడానికై టాటా గొప్ప వితరణతో గ్రాంటు ఇచ్చాడు. హోమి భాభా మాటల్లో చెప్పాంటే ఆ ఇన్‌స్టిట్యూట్‌ మన ఆటోమిక్‌ ఎనర్జీ ప్రోగ్రాంకి నాంది అనవచ్చు. జనాభా నియంత్రణ కోసం మొదటగా కృషి ప్రారంభించింది టాటానే.1951 జనాభా లెక్క ప్రకారం భారతదేశం 35 కోట్ల జనాభాను మించిపోయిందని ఆయన గుర్తించాడు. టాటా ఈ విషయాన్ని అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టికి తీసుకువెళ్లాడు. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. జెఆర్‌డి ప్రభుత్వ స్పందన కోసం అగలేదు, మిసెస్‌ ఆవాబాయి వాడియా ప్రారంభించిన భారత కుటుంబ నియంత్రణ అసోసియేషన్‌కు పాక్షిక సాయం అందించాడు. 1970 లో ఫోర్డ్‌ ఫౌండేషన్‌తో కలిసి కుటుంబ నియంత్రణ సంస్ధను స్ధాపించాడు.ఈ రంగంలో ఆయన చేసిన కృషికిగాను 1992 లో ఆయనకు యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ అవార్డు ప్రదానం చేశారు.

భారతదేశానికి, వాణిజ్య పరిశ్రమ రంగాకు అందించిన ఎనలేని సేవకు గుర్తుగా 1992 లో టాటాకు, ఆయన జీవించిఉండగానే ఇది ఎంతో అరుదైన సంఘటన భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో గౌరవించారు. 1954 లో ఫ్రెంచ్‌ ప్రభుత్వం అయనకు అవార్డు నిచ్చింది. వాణిజ్య విమానయాన సంస్ధకు అయన అందించిన విశిష్టసేవకు గాను ఆయనకు టోనీ జానస్‌ అవార్డు లభించింది.1988 లో ఆయన ప్రతిష్ఠాత్మకమైన గుగెన్‌ హేమ్‌ మెడల్‌ను పొందారు.

జెఆర్‌డి టాటా తన 89వ ఏట 1993 లో స్విట్జర్లండ్‌లోని జెనీవాలో మరణించాడు. ఆయనను పారిస్‌లోని పెర్‌ షైజ్‌ శ్మశానవాటికలో ఖననం చేశారు. ఇండియన్‌ పార్లమెంట్‌, అసాధారణంగా ఏ ప్రభుత్వ రాజకీయపదవీ అనుభవించని సామాన్య పౌరుడైన ఆయనకు నివాళిగా సభను వాయిదా వేసింది. మహారాష్ట్ర మూడు రోజు సంతాపదినాలుగా ప్రకటించింది.

భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక మార్చు

2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను ఆరవ స్థానంలో ఎంపికైయ్యాడు.[1]

మూలాలు మార్చు

  1. "A Measure Of The Man | Outlook India Magazine". web.archive.org. 2021-07-24. Archived from the original on 2021-07-24. Retrieved 2021-10-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)