ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు. ఇతనికి యజ్ఞసేనుడు అని కూడా పేరు.[1]

విద్యాభ్యాస సమయంలో ద్రోణుడు అతడికి సహాధ్యాయి, మంచి మిత్రుడు. తమ మైత్రిని పురస్కరించుకుని, తన సకల సంపదలను పంచుకుంటాను అని ద్రోణునికి మాట ఇచ్చాడు. ద్రుపదుడు రాజ్యాధికారానికి వచ్చాక ద్రోణుడు అతనిని కలసి, చిన్నప్పుడు ఇచ్చిన మాట గుర్తు చేసి సహాయం చేయమన్నాడు. ద్రుపదుడు అతడిని గుర్తించనట్లుగా నటించి, అవమానించి పంపివేసాడు. ఆ సంఘటనతో ద్రోణుడు ద్రుపదునిపై కోపం వహించి ఉన్నాడు. తరువాత ద్రోణుడు హస్తినాపురం సందర్శించి కౌరవ పాండవులకు గురువుగా నియమితుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తెమ్మని తన శిష్యులను అడిగాడు. అర్జునుడు ద్రుపదుని బంధించి తెచ్చి ద్రోణునికి సమర్పించాడు. ద్రోణుడు అతడిని అవమానించి, రాజసభలో ద్రుపదుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.

భీష్ముని చేతిలో భంగపడిన అంబ, శిఖండిగా ద్రుపదునికి జన్మించింది. ద్రుపదుడు ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు యాగం చేసాడు. ఆ యాగ ఫలంగా ద్రౌపది, దృష్టద్యుమ్నులను సంతానంగా పొందాడు.

కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణుడు ద్రుపదుని చంపాడు. ఆ యుద్ధంలోనే దృష్టద్యుమ్నుడు ద్రోణుని వధించాడు.

చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. కె. ఎస్., రామమూర్తి (1983). ద్రోణాచార్యుడు (PDF). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. p. 11.[permanent dead link]