నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్

నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (National Gallery of Modern Art or NGMA) ఒక ప్రసిద్ధిచెందిన చిత్రకళా ప్రదర్శనశాల. ఇది భారత ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక మంత్రిత్వం అధీనంలో పనిచేస్తుంది.[1] దీనికి చెందిన ప్రధాన మ్యూజియం జైపూర్ హౌస్, న్యూఢిల్లీ లో మార్చి 29, 1954 తేదీన స్థాపించబడింది. తదనంతరం దీని శాఖలను ముంబై, బెంగుళూరు పట్టణాలలో తెరిచారు. ఇందులో ఆధునిక చిత్రకళకు సంబంధించిన 14,000 కు పైగా చిత్రకళాఖండాలు పరిరక్షించబడ్డాయి. థామస్ డేనియల్, రాజా రవివర్మ, అబనీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోస్, జెమిని రాయ్, అమ్రితా షేర్-గిల్ మొదలైన భారతీయ, పాశ్చాత్య చిత్రకారుల చిత్రాలను పొందుపరిచారు.[1]

నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్
పటం
Established1954
Locationజైపూర్ హౌస్, న్యూఢిల్లీ, భారతదేశం
Collection size17 000
Ownerభారత ప్రభుత్వం
Websitehttp://ngmaindia.gov.in/

చరిత్ర మార్చు

జాతీయ స్థాయి ఆర్ట్ గేలరీ కావాలని మొదటిసారిగా 1938లో ఢిల్లీ స్థావరంగా ఉన్న ఆల్ ఇండియా ఫైన్‌ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ అనే సంస్థ ప్రతిపాదించింది. 1949లో కలకత్తాలో జరిగిన ఆర్ట్ కాన్ఫరెన్స్‌లో భారతప్రభుత్వం జి.వెంకటాచలం, నందలాల్ బోస్, జెమినీరాయ్, ఓ.సి.గంగూలీ, అతుల్ బోస్, జేమ్స్ హెచ్. కజిన్స్, పెర్సీ బ్రౌన్ వంటి కళాకారులను, విమర్శకులను ఆహ్వానించి నేషనల్ మ్యూజియం, నేషనల్ ఆర్ట్ గ్యాలరీ వంటి సంస్థల ఏర్పాటుకు అవసరమైన సలహాలను, సూచనలను కోరింది. ఆ సమావేశంలో జాతీయ ఆర్ట్ గ్యాలరీ స్థాపించాలని తీర్మానం జరిగింది. 1954లో నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ను అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించాడు. జర్మన్ చరిత్రకారుడు హెర్మన్ గోయిట్జ్ ఈ గేలరీకి మొదటి క్యూరేటర్‌గా వ్యవహరించాడు. సుమారు 200 కళాఖండాలతో ప్రారంభమైన ఈ గేలరీలో ప్రస్తుతం 17000కు పైగా పెయింటింగులు, డ్రాయింగులు, శిల్పాలు, ఛాయాచిత్రాలు ఇతర కళాఖండాలు ప్రదర్శనకు ఉన్నాయి.

భవనం మార్చు

ఢిల్లీ నగరంలోని రాజ్‌పథ్‌ ‌కు చివరలో, ఇండియా గేట్‌కు సమీపంలో ఉన్న ఈ భవనం పూర్వం జైపూర్ మహారాజు నివసించే ప్యాలెస్. కాబట్టి దీనిని జైపూర్ హౌస్ అని పిలుస్తారు. సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న ఈ భవనాన్ని సర్ ఆర్థర్ బ్లోమ్‌ఫీల్డ్ డిజైన్ చేయగా 1936లో నిర్మించారు. 2009లో ఈ భవనం కొత్త విభాగాన్ని ప్రారంభించారు. అది ఇంతకు ముందున్న వైశాల్యానికి ఆరు రెట్లు పెద్దది. మొత్తం 12000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రదర్శనశాల ఉంది.[2]

చిత్రసమాహారం మార్చు

ఈ గేలరీలో ఉన్న కొన్ని కళాఖండాలు:

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "History". National Gallery of Modern Art, New Delhi. Archived from the original on 2018-11-06. Retrieved 2020-06-06.
  2. "Inauguration of the New Wing of National Gallery of Modern Art, New Delhi". India: Ministry of Tourism. Retrieved 6 June 2020.

బయటి లింకులు మార్చు