పెళ్ళితాంబూలం విక్రమ్‌ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు, నిర్మాత, కెమెరామాన్ బి.యస్.రంగా తీయగా 1962, మార్చి 10న విడుదలైన తెలుగు సినిమా. ఇదే సినిమా తమిళంలో శివాజీ గణేశన్, జమున జంటగా నిచయ తాంబూలం పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది.

పెళ్ళితాంబూలం
(1962 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.యస్.రంగా
నిర్మాణ సంస్థ విక్రమ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

  1. అందం చిందే అప్సరసలమై ఆడేమా కన్నెల ఆశలె - పి.సుశీల బృందం
  2. అమ్మాయి నేనొకటి ఇస్తాను కాదనకు.. ఏమిటది - పిఠాపురం నాగేశ్వరరావు, డి.యల్. రాజేశ్వరి
  3. ఏదారి చనునో ఏమయ్యేనో ఎవరు కానగలేరు - సరోజ
  4. ఓహో జీవితమే ఆనందం నవయవ్వనమే అద్భుతం - పి.బి. శ్రీనివాస్ బృందం
  5. కథయేనా కథయేనా బ్రతుకీ ఇలలో కథయేనా - పి.బి. శ్రీనివాస్
  6. చక్కని ఓ జాబిల్లి పలుకవేలనే నీ వలపులతొ - పి.బి. శ్రీనివాస్
  7. చల్ బడా మజా ఆయెగా భల్ విహారమే హాయిగా - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల బృందం
  8. నిత్య వినోదం ఈ లోకం మధురంగాదా ఈ సౌఖ్యం - డి.యల్. రాజేశ్వరి, పి.బి. శ్రీనివాస్
  9. ప్రేమ నిండిన యిల్లే నవ స్వర్గముగా విలసిల్లే - పి.సుశీల

కథ మార్చు

రంగనాథం తండ్రి దాతగా పేరుగడించాడు. ఒక పాఠశాలను నిర్మించాడు. గంగాధరానికి ఆశ్రయమిచ్చి తాను కట్టించిన పాఠశాలలోనే హెడ్‌మాస్టర్ ఉద్యోగమిచ్చాడు. రంగనాథం కుటుంబం, గంగాధరం కుటుంబం అన్యోన్యంగా ఉండేవి. రంగనాథం భార్య కమలమ్మ, గంగాధరం భార్య పార్వతి ఒకనాడు కబుర్లు చెప్పుకొంటున్న సందర్భంలో కమలమ్మ పార్వతి కుమార్తె సీతను తన కొడుకు రఘుకు పెళ్ళిచేసుకుంటానంటూ పెళ్ళితాంబూలం ఇస్తూ అందుకు గుర్తుగా తన మెడలోని హారం సీత మెడలో వేస్తుంది.

ఇది జరిగిన కొన్నాళ్ళకు బడిలో రంగనాథం కొడుకు అల్లరిచేస్తే మేస్టర్ గంగాధరం శిక్షిస్తాడు. దానిమీద రంగనాథం కోపంతో రెచ్చిపోయి గంగాధరాన్ని తూలనాడతాడు. మాటపడలేని గంగాధరం వెంటనే తన స్కూలు మాస్టర్ ఉద్యోగాన్ని వదులుకొని ఆ ఊరు నుండి వెళ్ళిపోతాడు.

కాలచక్రగమనంలో కొన్ని సంవత్సరాలు దొర్లిపోతాయి. రఘు పెద్దవాడవుతాడు. సీత కూడా పెద్దదై కాలేజీలో చదువుకొంటుంది. యాదృచ్ఛికంగా రఘు, సీత ఒకరినొకరు కలుసుకుంటారు. స్నేహితులౌతారు. అంతకుముందు చెడ్డ సహవాసాలు మరిగిన రఘు శ్రద్ధగా చదివి కాలేజీలో ఫస్టుగా పరీక్ష ప్యాసవుతాడు. సీత రఘులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. తనలో మార్పుకు కారకురాలైన సీతను రఘు తన ఇంటికి తీసుకువెళ్ళి తల్లికి చూపించి తనకు బహుకృతిగా వచ్చిన పతకాన్ని ఆమెకు తల్లిచే బహూకరింపచేస్తాడు.

తాను చిన్ననాడే ఇచ్చిన హారాన్ని కమలమ్మ గుర్తించి గంగాధరం కుమార్తె సీతేనని గ్రహించి వారికి పెళ్ళిచేయాలని ఉబలాటపడి రంగనాథంతో చెబుతుంది. రంగనాథం అంతస్థులు చాలవని అంటాడు. గంగాధరం వచ్చి అడిగినా అలాగే చెప్పి అవమానిస్తాడు.

రఘు తండ్రిమాట కాదని వెళ్ళి సీతను పెళ్ళి చేసుకుంటాడు. రంగనాథం ఇంట్లో అడుగు పెట్టవద్దంటాడు.

దీనికి ముందు గంగాధరం తన కుమార్తెను కోడలుగా స్వీకరించ వలసిందని కోరడానికి వచ్చినపుడు రంగనాథం నిరాకరించిన మీదట చిన్ననాడు కమలమ్మ ఇచ్చిన గొలుసు, రఘు ఇచ్చిన పతకం అక్కడే వదిలేసి పోతాడు. వాటిని తిరిగి ఇచ్చివేయవలసిందని రంగనాథం పిడకల పిచ్చయకు ఇస్తాడు. వాటిని అతని కొడుకు టైగర్ తన దగ్గరే అట్టే పెట్టుకుని సుఖంగా సంతోషంగా సంసారం చేస్తున్న రఘుకు దానిని చూపి ఓ అమ్మాయి తనకు ప్రేమకానుకగా ఇచ్చిందని చెబుతాడు.

దానితో అనుమానం పెనుభూతంలా ఆవహించగా రఘు సీతను పుట్టింటికి పంపివేసి క్లబ్బుల్లో తాగుడుకు బానిసై పతనం పొందుతాడు.

చివరకు నిజంగ్రహించి టైగర్ బాబును పట్టుకుని తంతాడు. అతడు చనిపోయాడనే అపోహతో హత్యానేరం ఆరోపించి తండ్రే అరెస్టు చేయిస్తాడు. కోర్టు విచారణలో రఘు స్వయంగా వాదించుకు కొంటాడు. తర్వాత రఘు నిర్దోషి అని రుజువై రంగనాథం తన తప్పును తెలుసుకుని గంగాధరంతో మునుపటి వలె స్నేహితుడుగా మారడంతో కథ సుఖాంతమౌతుంది[1].

మూలాలు మార్చు

  1. రాధాకృష్ణ (18 March 1962). "చిత్రసమీక్ష పెళ్ళితాంబూలం". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 21 February 2020.[permanent dead link]