బీదలపాట్లు (1972 సినిమా)
ఈ సినిమా విక్టర్ హ్యూగో వ్రాసిన ప్రసిద్ధ నవల లే మిజరబుల్స్(Les Misérables) ఆధారంగా నిర్మించబడింది. ఈ చిత్రానికి డి.వి.నరసరాజు సంభాషణలు చేకూర్చాడు. ఎస్.వెంకటరత్నం ఛాయాగ్రాహకుడు. కె.వి.మహదేవన్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు.
బీదలపాట్లు (1972 సినిమా) (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.విఠలాచార్య |
నిర్మాణం | బి.విఠలాచార్య |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , కృష్ణకుమారి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ మార్చు
కథా నాయకుడు కోటయ్య కూలీనాలీ చేసుకుని పొట్ట పోషించుకుంటూ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అతనికి తోడుగా ఒక అక్క, అరడజను పిల్లలూ ఉంటారు. తన ఆస్తిగా మిగిలిన గొడ్డలిని అప్పులవాళ్లు తీసుకుపోగా అక్కా, పిల్లలూ, తనూ ఆకలితో అలమటించవలసి వస్తుంది. చిన్నపిల్లల ఆకలిబాధ చూడలేక కోటయ్య రొట్టెల్ని దొంగిలిస్తాడు. పట్టుబడిన కారణంగా జైలుకు వెళతాడు. అక్క మరణవార్త విని చెరనుండి తప్పించుకుని ఇంటికి వెళతాడు. ఫలితంగా మళ్లీ జైలు. ఇలా 12 సంవత్సరాలు జైలులో మగ్గుతాడు. పోలీసు అధికారి జావర్ క్రమశిక్షణ గల వ్యక్తి. విధి నిర్వహణ పరమావధిగా ఎనుకుని దయాదాక్షిణ్యాలను దూరంగా నెట్టి కోటయ్యని వెన్నాడుతూ వుండేవాడు. జైలు నుండి విడుదలై వచ్చిన కోటయ్యను సంఘం వెలివేసింది. అతడు నిజంగా దొంగతనానికి పాల్పడ్డాడు కానీ క్రిష్టియన్ ఫాదర్ జ్ఞానోపదేశంతో పశ్చాత్తాపపడి ఫాదర్ను క్షమాపణ వేడుకుంటాడు. అక్కడి నుంచే అతని జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమౌతుంది. ఫాదర్ చేసిన సాయంతో చిన్న బిజినెస్ పెట్టి కలసివచ్చి సంపన్నుడౌవుతాడు కోటయ్య. కోటయ్య పుర్షోత్తం అయ్యాడు. అతన్ని ప్రజలు మేయర్గా ఎన్నుకుంటారు. పేరు మార్చుకున్నా, మేయర్గా ఎన్నుకున్నా అతన్ని పోలీసు అధికారి జావర్ విడిచిపెట్టలేదు. నిత్యమూ వెన్నాడుతూనే వుంటాడు. కోటయ్య ధర్మనిరతి, దీనజన సేవే అతడిని రక్షిస్తూ ఉండేది. కోటయ్య ఎంత ఉన్నతంగా జీవిస్తున్నప్పటికీ, రూపురేఖలు మార్చుకుని మోసం చేస్తున్నాడనే మానసిక క్షోభతో అతడు ఎప్పుడూ నలిగిపోతుండేవాడు. ఈ సంక్షోభం నుండి విముక్తి పొందడానికి చివరికి జానర్కు లొంగి పోదామని భావిస్తాడు కోటయ్య. అదే సమయంలో జావర్లో మానవత్వం మేల్కొని కోటయ్యను మనిషిగా గుర్తించాడు. విధి నిర్వహణకి మానవత్వానికి మధ్య సతమతమై జావర్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. కోటయ్య తన అంతిమ దశలో మేనకోడలి కూతురికి నచ్చిన వాడితో పెళ్లిచేసి కన్ను మూస్తాడు[1],[2].
నటవర్గం మార్చు
- చిత్తూరు నాగయ్య ... క్రిష్టియన్ ఫాదర్
- అక్కినేని నాగేశ్వరరావు ... కోటయ్య
- గుమ్మడి వెంకటేశ్వరరావు ... జావర్, పోలీస్ ఇస్పెక్టర్
- కృష్ణకుమారి ... శాంత
- చంద్రకళ ... పద్మ
- కైకాల సత్యనారాయణ
- చంద్రమోహన్ ... అరుణ్ కుమార్
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- విజయలలిత
- సూర్యకాంతం
- కాశీనాథ్ తాతా
- బేబీ గౌరి
పాటలు మార్చు
- డబ్బులోనే ఉన్నదిరా లోకమంతా - పి.బి.శ్రీనివాస్, జె.వి.రాఘవులు, ఘంటసాల బృందం - రచన: కొసరాజు
- దారినపోయే అయ్యల్లారా తమషా చూసే బాబుల్లారా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- నేనెవరో తెలిసింది నిజమేదో తెలిసింది నిరాశతొ - ఘంటసాల - రచన: డా. సినారె
- నాతల్లి నీవెంతలోన రతనాల .. పాలనవ్వుల పాపాయీ (బిట్) - ఘంటసాల - రచన: డా. సినారె
- పాలనవ్వుల పాపాయీ పసిడి పలుకల పాపయీ నీతల్లి - ఘంటసాల - రచన: డా. సినారె
ఇవి కూడా చూడండి మార్చు
మూలాలు మార్చు
- ↑ "చిత్రసమీక్ష - ఆంధ్రపత్రిక దినపత్రిక - తేదీ: మార్చి 26, 1972 - పేజీ:9". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-24.
- ↑ "చిత్రసమీక్ష - ఆంధ్రప్రభ వారపత్రిక - తేదీ: 19-04-1972 - పేజీల: 47". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-24.