బోయి భీమన్న

భారతీయ రచయిత

బోయి భీమన్న, సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. సహజంగానే అతను వీటిని నిరసించాడు. అంబేద్కర్ వ్రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశాడు.

బోయి భీమన్న
బోయి భీమన్న
జననం
బోయి భీమన్న

(1911-09-19)1911 సెప్టెంబరు 19
మామిడికుదురు, తూర్పు గోదావరి జిల్లా
మరణం2005 డిసెంబరు 16(2005-12-16) (వయసు 94)
వృత్తిఉపాధ్యాయుడు
తల్లిదండ్రులు
  • పుల్లయ్య (తండ్రి)
  • నాగమ్మ (తల్లి)
వెబ్‌సైటుhttp://www.boyibhimanna.com

బాల్యం-విద్యాభ్యాసం మార్చు

భీమన్న 1911 సెప్టెంబరు 19తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో ఓ హరిజన కుటుంబంలో పుట్టాడు.[1] నాగమ్మ, పుల్లయ్య ఇతని తల్లిదండ్రులు. వీరికి పంచపాండవుల వలె ఐదుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల జన్మించారు. పుల్లయ్య తన మగపిల్లలకు వరుసగా ధర్మరాజు, భీమన్న, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేర్లు పెట్టాడు. భీమన్న 1935లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడై 1937లో బి.ఇడి. పూర్తి చేశాడు. గుడిసెలు కాలిపోతున్నాయ్ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భీమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 2005 డిసెంబరు 16న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

ఉద్యోగం మార్చు

1911 సెప్టెంబరు 19తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో ఓ హరిజన కుటుంబంలో పుట్టాడు.ఇతని తండ్రి పుల్లయ్య, తల్లి నాగమ్మ. వీరికి పంచపాండవుల వలె ఐదుగురు మగపిల్లలు,, ఒక ఆడపిల్ల జన్మించారు. పుల్లయ్య తన మగపిల్లలకు వరుసగా ధర్మరాజు, భీమన్న, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేర్లు పెట్టాడు. భీమన్న 1935లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడై 1937లో బి.ఇడి. పూర్తి చేశాడు. గుడిసెలు కాలిపోతున్నాయ్ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భీమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.

రచయితగా మార్చు

బోయి భీమన్న ప్రముఖ రచయిత. ఈయన సుమారు 70 పుస్తకాలు రాశాడు. పద్య, గేయ, వచన రచనలతో పాటు, నాటకాలను కూడా వ్రాశాడు. వివిధ పుస్తకాలకు వ్రాసుకున్న పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది. వాటిలో కొన్నేవో కొత్తప్రతిపాదనల్ని, కొత్త సిద్ధాంతాల్నీ చెప్తున్నట్లుంటుంది. ఆకాశవాణిలో ప్రసారం కోసం అనేక భావగీతాల్ని వ్రాశాడు. వీటన్నింటితో పాటు అంబేద్కర్‌ వ్రాసిన కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించడంతో పాటు, ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ రాశాడు. వీరు వ్రాసిన ‘జయ జయ జయ అంబేడ్కర!’ దళితులకు జాతీయగేయమై నేటికీ ఊరూరా ప్రార్థనా గీతంగా మార్మోగుతోందని డా.దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ‘జాతీయ కవి బోయి భీమన్న’ పేరుతో 2011 ఫిబ్రవరి 28వతేదీన సూర్య దినపత్రిక సాహిత్య అనుబంధంలో డా.దార్ల వెంకటేశ్వరరావుగారు ఒక వ్యాసాన్ని రాస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాసంలోని భాగాల్ని గమనిస్తే, బోయి భీమన్నగారి వ్యక్తిత్వం, సాహిత్య దృక్పథం స్ఫష్టమవుతుంది.

సాహితీ సేవ మార్చు

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు డా. బోయి భీమన్న పేరుతో ఒక సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసి, వీరి రచనలన్నింటినీ ప్రచురిస్తున్నారు. నిజానికివన్నీ విశ్లేషిస్తే గాని, భీమన్న సమగ్ర సాహిత్య దృక్పథం స్పష్టం కాదు. ఈయనే కాదు, ఏ రచయిత దృక్పథాన్నైనా అంచనా వేయాలంటే, వివిధ పరిణామాలుగా సాగిన రచనలన్నింటినీ స్పృశించగలిగినపుడే ఇది సాధ్యమవుతుంది. అలా కాకుండా, దళిత పదాన్ని ప్రయోగించలేదనీ, దాన్ని వ్యతిరేకించాడనీ, భారతదేశంలో కులం లేదన్నాడనీ, ఆయన వర్గాన్నే సమర్ధించాడనీ, కులం గురించి వ్రాయలేదనీ వక్రీకరించే వాళ్లని చూసిన తర్వాత ఆయన సాహిత్యదృక్పథాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.

ఇప్పటికే అనేకమంది భీమన్న రచనలపై పరిశోధనలు చేశారు. రాష్ర్టవ్యాప్తంగా జాతీయ సదస్సులు జరుగు తున్నాయి. వీటన్నింటికీ ఒక మార్గదర్శనాన్ని కల్గించిన గ్రంథం ఒకటి ఉంది. అది హైమావతి చక్కని కథనాత్మక శైలిలో వ్రాసిన ‘‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయిభీమన్న’’ గ్రంథం. ఇది వీరి సాహిత్య దృక్పథాన్ని తెలిపే చుక్కానిలాంటిది. దానిలోని సూచనల్ని గమనిస్తే, ఆయన వ్రాసిన రచనల్లో పరిశోధకులకు, విమర్శకులకు తమదైన విశ్లేషణకు ప్రేరణ దొరుకుతుంది.

భారతదేశంలోని ‘భిన్నత్వంలోని ఏకత్వం’ లాగే, భీమన్న రచనల్లోనూ ఆ లక్షణం కనిపిస్తుందనీ, ఆయన కుల, మతాల కంటే మానవత్వాన్నే ఆశించిన జాతీయవాది అనీ ఆ గ్రంథం ప్రతిపాదిస్తుంది. భారతజాతీయదృక్పథంలో అంతర్భాగంగా ప్రవహించే హిందూమతంలో కులాన్ని ప్రత్యేకంగా విశ్లేషించు కోవాలి. అంబేద్కర్‌ విశ్లేషించిందీ, భీమన్న వ్రాసిందీ అదే! తన జీవితాంతం ఆయన జాతీయవాదిగానే ఉన్నాడు. జాతీయతలో తాను పుట్టి పెరిగిన దేశీయవాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే, ఆత్మగౌరవంతో జీవించాలనే ఆకాంక్ష ఉంటుంది.

ఒకప్పుడు ‘బ్రాహ్మణ’ శబ్దాన్ని చదువుకున్నవాళ్ళనీ, ఆలోచనాపరుల్నీ సూచించడానికి ప్రయోగించారు. సామాజిక నిర్మాణంలో చాతుర్వర్ణ వ్యవస్థలోకి చేరిన తర్వాత కుల సూచికగా మారిపోయింది. తమ తెలివితేటలతో ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు, క్రమేపీ ఒక వర్గంగా తయారయ్యారు. ఈ ఆలోచనాపరులు ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్ని మతమని ప్రబోధిస్తూనే, ఆచార, వ్యవహారాల పేరుతో, కర్మ సిద్ధాంతం వైపు నడిపించుకొనిపోయిన హిందూమతం పైనే డా. అంబేద్కర్‌ ముందుగా తన దృష్టిని కేంద్రీకరించాడు. కొన్ని వందలసంవత్సరాలుగా పాతుకుపోయిన హిందూమతంతో అవినాభావసంబంధాన్ని కలిగి ఉన్న వాళ్ళు, తమకు బోధించిన ధర్మశాస్త్రాల వల్ల మానసికంగా, అస్పృశ్యులుగా ఉండిపోవడానికైనా సిద్ధపడతారు.

పురాణేతిహాసాలు, సాంప్రదాయ సాహిత్యాల పేరుతో పాలకవర్గాలతో ‘ఆలోచనాపరులు’ కలిసి కొనసాగించిన కుట్ర ఫలితంగా, నేటికీ కులాధిపత్య సాహిత్యమే ఉత్తమసాహిత్యంగా కొనసాగిపోతోంది. దురదృష్టమేమిటంటే, నాటిభావజాలాన్ని నేటికీ కొనసాగించడాన్ని ఆ భావజాలం వల్ల నష్టపోయిన, ఇంకా నష్టపోతున్న వాళ్ళు వ్యతిరేకిస్తుంటే, నాటి ఆధిపత్య భావజాలానికి ప్రతినిధుల్లా వాటిని సమర్ధించేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. అందుకనే తన ప్రజలంతా దేని వల్లనైతే మోసపోతున్నారో, దాన్నుండి రక్షించుకోవడానికి సామాజిక ఉద్యమాన్ని నడిపే బాటలో పయనించిన వాడు అంబేద్కర్‌. అలాంటి ఆశయాన్నే సాహిత్యంలో కొనసాగించిన రచయిత బోయి భీమన్న కూడా!

డా. బోయి భీమన్న సమగ్రసాహిత్యం పేరుతో మొదటి సంపుటిని తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇటీవలే విడుదల చేశారు. దీనిలో ‘పాటలలో అంబేద్కర్‌’ (పుటలు : 306- 462 ) ఉంది. దీనిలో అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని, భావజాలాన్ని వర్ణించిన 118 పాటలు ఉన్నాయి. దీనిలోనే భీమన్న అనేక పాటల్లో దళిత పదాన్ని ప్రయోగించాడు. కానీ, దళిత పదాన్ని వాడడం ఇష్టం లేదని ఆయన తన చివరి రోజుల్లో ప్రకటించాడు. దానికి అనేక కారణాలున్నాయి.

దాన్ని మరోసారి చర్చించుకుందాం. ‘దళిత జనులకంబేడ్కరు, ధర్మమె మతమన్నాడు, బౌద్ధధర్మమొకటేరా, భారతీయమన్నాడు’ అని ఒక చోట, ‘ దళితులనుద్ధరించని ధర్మం కుంటిదంటూ..’ ఒక పాటకు దళిత పదాన్ని శీర్షికలోనే పెట్టిమరీ మరోచోట వ్రాశాడు. దళితుల్ని ఈయన అవర్ణులు, పంచములు, హరిజనులనే పేర్లతో వర్ణించడం కనిపిస్తుంది. కులనిర్మూలనను బలంగా వ్యతిరేకించిన నాటకం పాలేరు. 1988 నాటికి పాలేరు నాటకానికి ఏభై యేళ్ళైందని రచయితే చెప్పుకున్నాడు. అంటే, ఆ నాటకం 1938లో వ్రాసినట్లు స్పష్టమవుతుంది.

భీమన్న రాసిన ‘పాలేరు’ నాటకంలో వెంకన్న, వనబాలల ప్రేమకథలోను, 1959లో వ్రాసిన ‘రాగవాసిష్ఠం’ నాటకంలో గల అరుంధతి, వశిష్ఠుల ప్రణయ గాథలోను, మరికొన్ని రచనల్లోను కులాంతర వివాహాల పేరుతో కులనిర్మూలన అవకాశాల్ని చర్చించాడు. సమాజంలో కులం వల్ల గౌరవం పొందుతున్న కుటుంబం నుండి వచ్చిన వనబాల, కులం వల్ల సమాజంలో అవమానాలకు గురౌతున్న వెంకన్న పరస్పరం ప్రేమించుకుంటారు.

పాలేరుగా పనిచేయాల్సిన వాడు, అగ్రకులంగా గౌరవమర్యాదల్ని పొందుతున్న అమ్మా యిని పెళ్ళి చేసుకోవాలంటే, ఎన్ని బాధలకు గురికావాల్సివస్తుందో, అన్నింటినీ అగ్రకుల, భూస్వామి కుబేరయ్య వల్ల పాలేరు వెంకన్న ఎదుర్కొంటాడు. చివరికి ‘ఉపకారి’ మాస్టారు సహాయంతో చదువుకుని, వెంకటే శ్వరరావుగా గౌరవం పొంది, డిప్యూటీ కలెక్టరుగా ఉన్నతోద్యోగం సాధిస్తాడు. ఉద్యోగిగా తన గ్రామానికే వచ్చి, భూస్వాముల దురాగతాలను చట్టబద్ధంగా అడ్డుకుంటాడు. అస్పృశ్యతను పాటించే వాళ్ళనీ, ప్రోత్సహించేవాళ్ళనీ నిరోధిస్తాడు. ప్రజాస్యామ్యబద్ధంగా దళితులు తమ హక్కుల్ని సాధించుకోవాలనే అంబేద్కర్‌ ఆశయాన్ని దీని ద్వారా ప్రేరేపించాడు రచయిత.

సమాజంలోని వాళ్ళంతా చెడ్డవాళ్ళే కాదనీ, మంచివాళ్ళూ ఉంటారనేది భీమన్న సాహిత్యంలో కనిపించే ఒక విశిష్ట గుణం. ఈ పాలేరు నాటకంలో వనబాల కూడా అగ్రవర్ణానికి చెందిన కుంటుంబం నుండే వచ్చినా, సంకుచిత మూర్ఖ కులతత్వ వాదులు లేని వాళ్ళూ ఉంటారనే మరో పార్శ్వాన్ని కూడా చూపారు. వెంకన్న తండ్రి పుల్లయ్య తన తండ్రి బాటలోనే తానూ పయనించి, తన కొడుకునీ పాలేరుతనానికి పంపుతాడు. అలాంటి సేవ చేయడానికే తాము జన్మించామనే భ్రమను కల్పించి, కొన్ని తరాలుగా కర్మసిద్ధాంతం పేరుతో దళితుల్ని అగ్రవర్ణభూస్వాములు వంచించిన తీరుతెన్నుల్ని ఈ నాటకం ద్వారా వివరించారు.

నిజజీవితంలో అటు అంబేద్కర్‌, ఇటు భీమన్న ఇరువురి జీవితాల్నీ పాలేరు నాటకం స్ఫురింపజేసేటట్లుంది. ఇరువురూ కులం వల్ల అనేక అవమానాల్ని ఎదుర్కొన్నవాళ్ళే. ఇరువురూ చదువుకోవడం వల్లనే అనేకమంది దళితులకి ఆదర్శం కాగలిగారు. యాదృచ్ఛికంగా ఇరువురూ కులాంతర వివాహాలనే చేసుకున్నారు. తాము చెప్పిన వాటిని నిజజీవితంలో ఆచరించి చూపి మరీ ఆదర్శవంతులయ్యారు. రాగవాసిష్ఠంలో అరుంధతీదేవి మాహాత్మ్యాన్ని వివరించడానికి, పురాణేతిహాసాల్లోని కులాంతర వివాహాల్ని సృజనీకరణ ప్రతిభతో భారత జాతీయదృక్పథాన్ని ప్రదర్శించారు. దీనికి ఆర్యద్రావిడ వాదాల్ని కూడా నాటకంలో అంతర్భాగం చేశారు.

సనాతన సాంప్రదాయవాది భావాల్ని ‘ప్రాచీనుడు’ అనే పాత్ర ద్వారా వర్ణించారు. నిష్కళంకమైన ప్రేమకు సాంప్రదాయం ఎలా అడ్డంకిగా మారుతుందో వివరిస్తూనే, ఆ ప్రేమలో నిజాయితీ ఉంటే, అన్నింటినీ జయిస్తుందని నిరూపించారు. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు తోడ్పడతాయని చెప్పినట్లే, తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లల సామాజిక స్థితి గతుల్ని చర్చించవలసిన అవసరం ఉంది. నేడు కులాంతర వివాహాలు జరిగినా, మళ్ళీ తండ్రిది గానీ, తల్లిదిగాని కుల గుర్తింపేవస్తే, కులనిర్మూలన జరిగినట్లెలా అవుతుందో ఆలోచించాల్సిందే!

‘గుడిసెలు కాలిపోతున్నై’ (1973) కావ్యంలో ఏడాది కోసారి దళితుల గుడిసెలెందుకు కాలిపోతున్నాయో, మరలా కొత్తగుడిసెలు మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఓట్లకోసం వచ్చేవారిని నిలదీసే చైతన్యం దళితుల్లో కలగాలనే ఆశయం కనిపిస్తుంది. చీమలను శ్రామిక దళితులకు, పాములను కులదోపిడీదారులకు ప్రతీకలుగా చేసి దానిలో వర్ణించారు. దళితుల మధ్య ఉండాల్సిన సమైక్యత ప్రబోధిస్తారు. ‘కూలిరాజు’ (1946) నాటకంలో కులంతో పాటు ఆర్థికాంశాల్ని కూడా స్పర్శించారు.‘ధర్మం కోసం పోరాటం’లో బహుజనులంతా రాజ్యాధికారదిశగా పయనించడానికి సూచనలు చేశారు. వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు మొదలైన వాళ్ళు దళితులేనని వాదిస్తూ, వాళ్ళు వ్రాసిన భారత, రామాయణ, భాగవతాలు తమవేనని చెప్పడంలో భీమన్న దృక్పథాన్ని లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

హింసావాదానికి భీమన్న వ్యతిరేకి. దళితులందరూ శ్రామికులనే వారిని భీమన్న వ్యతిరేకించారు. కమ్యూనిస్టుపార్టీలో పనిచేసి, కులం, వర్గం వేరని వాదించిన కోనాడ సూర్యప్రకాశరావుకి పాలేరు నాటకాన్ని అంకితమిచ్చాడు. భీమన్న రచనల గురించి మాట్లాడుతున్న వాళ్ళు మూడు ప్రధానాంశాల్ని గుర్తించాలి. ఆర్యఅనార్య సిద్ధాంతాన్ని అంబేద్కర్‌ ఆలోచనతోనే ‘రాగవాసిష్ఠం’ లాంటి నాటకాన్ని వ్రాశాడు. రెండవది, వర్ణం విషయంలో భారతదేశంలో కులమనే అవగాహన చేసుకోవాలి. ఇది ప్రపంచ దేశాలన్నింటికీ సమన్వయించినప్పుడు కుదరదు. దీన్ని కూడా అంబేద్కర్‌ ఆంత్రోపాలజీ, సామాజిక శాస్త్రాల్ని ఆధారంగా చేసుకుని చెప్పిన సిద్ధాంతమే. దీన్నే భీమన్న కూడా తన రచనల్లో సమన్వయించాడు.

పాలేరు నాటకానికి వ్రాసిన ముందుమాటలో భీమన్న స్పష్టంగానే వర్గం, కులం పట్ల తన అభిప్రాయాల్ని ప్రకటించాడు. ‘భారత్‌లో వర్గపద్ధతి (ఛిజ్చూటట) లేదు. వర్ణవ్యవస్థ అంటే కుల వ్యవస్థ (ఛ్చిట్ట టడట్ట్ఛఝ) వుంది. ఇక్కడ కూలీలంతా అభ్యుదయం సాధించాలంటే ముందుగా అంటరానితనాన్ని తొలగించాలి’ అన్నాడు. వర్గపోరాటాలు జరుగుతున్న తీరుని విమర్శిస్తూ ‘నాయకులంతా దేశీయ స్థితిగతులను గుర్తించకుండా ప్రపంచ కార్మిక దృష్టిమాత్రమే కలిగిన ధనిక సవర్ణులు’ అని ప్రకటించాడు. ఇంత స్పష్టంగా కులనిర్మూలనను ఆశించిన భీమన్న సాహిత్యాన్ని వివిధ జాతీయసదస్సుల్లో కులం లేదన్నారని వక్రీకరిస్తున్నారు. మూడవది వర్ణాంతవివాహాల వల్ల కులనిర్మూన జరగడాన్ని ఆకాంక్షించారు. ఈ విషయాలన్నీ బాధ్యతగల సాహితీవేత్తలు గుర్తించాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్‌ భావజాలానికి సాహిత్య ప్రతిఫలమే భీమన్న సాహిత్యమని గుర్తించాల్సి ఉందని డా.దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించింది నూటికి నూరుశాతం నిజమనితెలుస్తుంది.

కవితలు మార్చు

  • అనాది కొసనుంచి అనంతతత్త్వంలోకి
  • రాగవైశాఖి
  • రాభీలు (కవితా సంకలనం).
  • గుడిసెలు కూలిపోతున్నై' కవితాసంపుటి 1975 (కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది).
  • భీమన్న ఉగాదులు
  • భీమన్న కావ్యకుసుమాలు
  • మోక్షం నా జన్మహక్కు
  • చివరిమెట్టుమీద శివుడు
  • కూలీ శతకం
  • రాగోదయం
  • అకాండతాండవం
  • గిల్లిచెబుతున్నా
  • మధుబాల
  • మధుగీత
  • దీపసభ[2]

నాటకాలు మార్చు

  • పాలేరు, నాటకం - 1938
  • కూలిరాజు
  • అసూయ
  • ప్రగతి
  • పడిపోతున్న గోడలు
  • రాగవాసిష్ఠం[3]
  • ఆదికవి వాల్మీకి
  • వేదవ్యాసుడు
  • ధర్మవ్యాధుడు
  • బాలయోగి
  • చిత్రకళా ప్రదర్శనం (నాటికల సంపుటి)
  • నవజీవన్ పత్రిక
  • చండాలిక (టాగూర్ రచించిన చండాలిక నాటికకు అనువాదము)

వచన రచనలు మార్చు

  • ఏకపద్యోపాఖ్యానం
  • ఇదిగో ఇదీ భగవద్గీత
  • జన్మాంతరవైరం
  • పురాణాలలో హరి-గిరిజన మనీషులు
  • ధర్మం కోసం పోరాటం
  • అంబేద్కరిజం
  • అంబేత్కరమతం
  • జానపదుని జాబులు

పురస్కారాలు మార్చు

బోయి భీమన్న సాహిత్య పీఠం మార్చు

బోయి భీమన్న సాహిత్య పీఠం హైద్రాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించబడుతుంది.

2014 పురస్కార గ్రహీతలు మార్చు

 
బోయి భీమన్న పురస్కార సభ

భీమన్న 104వ జయంత్యుత్సవంలో భాగంగా 2014 సాహిత్య పురస్కారాల ప్రదానం సెప్టెంబరు 19న తెలుగు విశ్వవిద్యాలయం లోని నందమూరి తారక రామారావు కళామందిరం జరిగింది.[4]

  • జీవన సాఫల్య పురస్కారం - సి.నారాయణరెడ్డి (జ్ఞానపీఠ పురస్కార గ్రహీత), 2 లక్షల నగదు, ప్రసంశపత్రం
  • పద్య కవితా పురస్కారం - రసరాజు, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం
  • గేయ కవితా పురస్కారం - గూడ అంజయ్య, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం
  • వచన కవితా పురస్కారం - శీలా వీర్రాజు, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం
  • నాటక పురస్కారం - పాటిబండ్ల ఆనందరావు, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం
  • కథ నవల పురస్కారం - కేశవరెడ్డి, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం
  • అనువాద పురస్కారం - నలిమెల భాస్కర్, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం
  • ఉత్తమ రచయిత్రి పురస్కారం - పి. సత్యవతి, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం

సూచికలు మార్చు

  1. చల్లా, అనంత పద్మనాభ స్వామి. "సాహితీ భీముడు". archive.org. ఆంధ్రభూమి. Retrieved 16 December 2016.
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో దీపసభ ప్రతి
  3. బోయి, భీమన్న (1953). రాగవాసిష్ఠం. అజంతా ప్రింటర్స్. Retrieved 2020-07-13.
  4. "నమస్తే తెలంగాణలో బోయి భీమన్న సాహితీ పురస్కారాలు వ్యాసం". Archived from the original on 2014-09-20. Retrieved 2014-09-21.

వెలుపలి లంకెలు మార్చు