ప్రభుత్వం వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, సెజ్‌లపేర పరిశ్రమలు, రోడ్లు, ఇళ్ళస్థలాల కోసం భూములను సేకరించడం జరుగుతుంది. ఒకోమారు ప్రాణాలు పోయినా తమ భూములను ఇచ్చేది లేదంటూ, మా భూములను తీసుకుంటే ఊరుకోబోమని రైతులు ఉద్యమాలు చేస్తారు. ఆర్.డి.వో./స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ ‌ (భూసేకరణ) ల ద్వారా ప్రభుత్వం నోటీసులు ఇచ్చి అవసరమైన భూములను సేకరిస్తుంది. అభివృద్ధి పేరుతో జరిగిన భారీ భూసేకరణలో వ్యవసాయానికి అనువైన, రెండు పంటలు పండే భూములను కూడా ప్రభుత్వం సేకరించింది. రైతులకు పరిహారం ఇచ్చి భూములను సేకరించే పని పరిశ్రమలదే అంటూనే రెవెన్యూ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. అనేక చోట్ల భారీ కుంభకోణాలకు ఇవి తెరతీశాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు, విమానాశ్రయాలు, సిమెంటు, స్టీలు పరిశ్రమలు, రహదారులు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, ఐటీ పరిశ్రమలు.. ఇలా అనేక పేర్లతో భూములను ప్రభుత్వం సేకరించింది.

1894లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటిసారి భూ సేకరణ చట్టం తెచ్చింది

పునరావాసం మార్చు

భూసేకరణలో నిర్వాసితులు ఇళ్ళు, భూమి.. పశువులు, చెట్లు కోల్పోతారు. పరిహారంగా లభించిన మొత్తానికి మరోచోట అంతే మొత్తం భూమి రాదు. తిండికీ, ఉపాధికీ.. రెంటికీ భూమి కీలకం. వ్యవసాయం పని. భూమి లేకపోతే రైతులు ఎందుకూ కొరగారు. పరిహారంగా డబ్బులిచ్చినా.. దాంతో ఏం చేసి బతకాలో తెలిసే అవకాశమూ కానరాదు.పని పోయి, విద్య లేక, మరో పని రాక..మరింత పేదలవుతున్నారు. పరిహారంలో కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. అప్పులు తీరుస్తున్నారు, ఇంటి ఖర్చుల కోసం, పెళ్ళిళ్ల కోసం, వాహనాలు, ఆభరణాలు కొనటం కోసం, విందు వినోదాల వంటి వాటికోసం.. ఖర్చు పెడుతున్నారు. పరిహారంలో ఎక్కువ భాగం నిరుపయోగమైన రీతిలో ఖర్చైపోతోంది.

ప్రత్యామ్నాయ పరిహార మార్గాలు మార్చు

  • ప్రాజెక్టు లాభాల్లో కొంత శాతాన్ని పునరావాస ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చించాలి.
  • రాయల్టీల్లోని కొంత శాతాన్ని తిరిగి ఆ ప్రాంత అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టాలి.
  • స్థానిక ప్రజలకు ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పిస్తూ వారికి వాటా (ఈక్విటీ) ఇవ్వాలి.
  • అభివృద్ధి నిధులతో నిర్వాసితులకు లబ్ధి చేకూరేలా చూసేందుకు ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేయాలి.
  • భూమి ఇస్తున్న స్థానిక ప్రజలను ప్రాజెక్టుల్లో ప్రత్యక్ష పెట్టుబడిదారులుగా చేర్చుకోవాలి.

జపాన్‌లో భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు చెల్లించే నష్టపరిహారాలు మార్చు

  • 1.స్వాధీనం చేసుకున్న భూమికి బదులుగా అటువంటి భూమినే అంతే పరిమాణంలో మరో చోట కొనుగోలు చేసుకోవడానికి అవసరమైన ధనం సమకూరుస్తారు
  • 2.కొత్త ప్రాంతానికి తరలివెళ్ళి, అక్కడ పునరావాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే వ్యయాన్ని భరిస్తారు.కొత్త ప్రదేశానికి తరలివెళ్ళడంలో కోల్పోయే లాభాన్ని కూడా చెల్లిస్తారు.
  • 3.స్వాధీనం చేసుకున్న భూమికి భవిష్యత్తులో లభించే ధరలో వాటా ఇస్తారు
  • 4.ప్రాజెక్ట్‌ను నిర్మించడం వల్ల స్వాధీనం చేసుకొనే భూమి ధరను పెంచుతారు
  • 5.పునరావాసం ఏర్పాటు చేసుకోవడానికై కొత్త ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడంలో అయ్యే వ్యయాన్ని భరిస్తారు.
  • 6.భూమిని చాలవరకు పరస్పర సంప్రతింపుల ద్వారానే కొనుగోలు చేస్తారు.భూమి అవసరం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా ప్రాజెక్ట్‌కు పునఃరూపకల్పన చేస్తారు.

భూసేకరణకు వ్యతిరేకంగా అప్పీల్ చేయవచ్చు మార్చు

భూ సేకరణ చట్టం కింద ప్రభుత్వం ఎటువంటి భూమినైనా సేకరించవచ్చు. కానీ, చట్టంలోని 5ఏ సెక్షన్ ప్రకారం భూముల యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.కొన్ని సందర్భాల్లో భూమి అత్యవసరమైతే 5ఏ సెక్షన్‌ను తోసిపుచ్చు. (17వ సెక్షన్). ఇతరుల భూములను ప్రభుత్వం సేకరించదలచినప్పుడు... ఆ చర్యను వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసే హక్కు సంబంధిత భూ యజమానులకు ఉంటుంది. ప్రభుత్వం భూమిని సేకరించదలచినప్పుడు మొదట ఇందుకోసం నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. భూ యజమానులకు అభ్యంతరాలు తెలిపే అవకాశాన్నిస్తుంది .భూ సేకరణ చట్టంలోని అత్యవసర నిబంధనలప్రకారం ఐతే భూ యజమానుల అభ్యంతరాలు విననక్కరలేదు. యజమానుల అభ్యంతరాలను పరిశీలించి, వాటిని నెలరోజుల్లో పరిష్కరించాలని, అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుంది. అత్యవసర నిబంధనలను అరుదైన సందర్భాల్లో మాత్రమే వినియోగించాలి.

భూసేకరణపై పిటిషన్‌కు ఆలస్యం తగదు మార్చు

భూ సేకరణ ఉత్తర్వులను న్యాయస్థానంలో ఆలస్యంగా సవాల్‌ చేయడమంటే న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమే.ఏ కారణాలతోనైనా ఒక వ్యక్తి సెక్షన్‌ 4 కింద ఇచ్చిన (భూసేకరణ) నోటిఫికేషన్‌ను నిర్దిష్ట కాలావధిలోగానే న్యాయస్థానంలో సవాల్‌ చేయాలి. ఆలస్యం చేస్తే అదే కారణంతో ఆ పిటిషన్‌ను కొట్టి వేయవచ్చు.

మార్కెట్ ధర మార్చు

తమ భూమికి తగిన ధర చెల్లించలేదనే ఎక్కువగా రైతులు ఆందోళన చేస్తారు .సుబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని బేసిక్ విలువకు 30% సొలేషియం,12% వడ్డీ(నోటిఫికేషన్ తేదీ నుండి అవార్డు తేదీ లేదా భూమిని స్వాధీనం చేసుకున్న తేదీ వరకు) కలిపి మార్కెట్ ధరగా నిర్ణయించి భూయజమానికిస్తారు. భూమిపై చెట్లు,కట్టడాలకు విడిగా పరిహారం లెక్కకట్టించి ఇస్తారు.

సంప్రదింపులు మార్చు

నిర్బంధ భూసేకరణ ప్రక్రియ వల్ల తగాదాలు పెరిగి కోర్టు తీర్పులతో తీవ్రజాప్యం జరుగుతున్నందువల్ల ,రైతులు కలెక్టర్లు జిల్లాస్థాయిలో సంప్రదింపులు జరుపుకొని మధ్యేమార్గంగా ఒక ధరకు అంగీకరించి భూసేకరణ జరిపే పద్ధతి ఇటీవల బాగా జరుగుతున్నది. ఒకసారి భూయజమానుల ప్రతినిధులు ప్రభుత్వం ప్రతిపాదించిన ధరకు ఒప్పుకున్నాక కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు.

భూ సేకరణలో ఆంధ్రప్రదేశే ప్రథమం మార్చు

మైనింగ్‌ కార్యకలాపాలకు దేశంలో ఛత్తీస్‌ఘడ్‌ తర్వాత అత్యధికంగా అటవీ ప్రాంతాన్ని కేటాయించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశే. భూసేకరణలో మాత్రం మొదటి స్థానం రాష్ట్రానిదే .కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఐదులక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర కార్యక్రమాలకు మళ్లించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పరిశ్రమల కారణంగా ఎక్కువమంది నిరాశ్రయులు కానున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వల్ల లక్షా 20 వేల కుటుంబాలు నిరాశ్రయులు కానున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల కారణంగా వందల గ్రామాలు కనుమరుగుకానున్నాయి. దళితులు, పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను తిరిగి స్వాధీనం చేసుకొన్నారు.

భూములు మళ్లీ కొనలేని పరిస్థితి మార్చు

సేకరించిన భూములకు ఇచ్చే పరిహారంతో మళ్లీ భూములు కొనడానికి వీల్లేని పరిస్థితి. రైతుల నుంచి భూములు సేకరించడం మొదలు పెడుతూనే చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగి వారికి అందుబాటులో లేకుండా పోయాయి. కొందరికి వచ్చిన పరిహారం అప్పటికే ఉన్న అప్పులకు సరిపోయింది. అనేకమంది రైతులు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి కూలి పనులు చేసుకొంటున్నారు. కొన్ని చోట్ల నిన్న వరకు భూ యజమానులుగా ఉన్న రైతులు ఇప్పుడు తమ భూముల్లో ఏర్పాటుకానున్న పరిశ్రమల్లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. వచ్చిన పరిహారం ఖర్చయిపోతుండటం, కుటుంబ సభ్యులతో కలిసి వీధుల పాలు కావల్సి రావడం, పరిహారంతో మళ్లీ భూములు కొనలేని పరిస్థితి ఏర్పడటంతో అసంతృప్తి పెరుగుతోంది. ప్రజా ప్రయోజనం కోసం మాత్రమే వ్యక్తిపరమైన ఆస్తుల్ని తీసుకోవాలి, పంటలు పండే పొలాల్ని వ్యాపార, పారిశ్రామిక ఉద్దేశాలకై తీసుకోరాదు. ప్రభుత్వ రంగంలోని ప్రాజెక్టులు కాకపోతే, 70 శాతం భూముల్ని సొంతంగా కొనుక్కోవాలి. మిగతా 30 శాతం మాత్రమే భూసేకరణ అనుమతించాలి. ప్రాజెక్టు ఫలాల్లో రైతుల్ని భాగస్వామ్యం చెయ్యాలి, ఏ అవసరం కోసం ప్రభుత్వం భూమిని సేకరించిందో, ఆ అవసరం నిమిత్తం భూమిని ఉపయోగించకపోయినప్పటికీ, ఆ భూమిని తిరిగి తనకు స్వాధీనం చేయాలని కోరే హక్కు సొంతదారుకు ఉండదు. తిరిగి ఆ భూమిని సొంతదారుకు స్వాధీనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. భూమిని ప్రతిపాదిత ప్రయోజనానికి ఉపయోగించకపోతే ఇంకొక ప్రజా ప్రయోజన కార్యక్రమానికి ప్రభుత్వం వినియోగించాలి.

నియమాలు-నిబంధనలు మార్చు

  • మార్కెట్‌ విలువను నష్ట పరిహారంగా చెల్లించాలి.
  • అల్ప సంఖ్యాకవర్గాల విద్యాసంస్థల ఆస్తుల్ని తీసుకుంటున్నప్పుడు.. వారి హక్కులకు భంగం లేని పద్ధతిలో నష్టపరిహారం చెల్లించాలి.
  • షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే భూమి కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలి. అది ఏ విధంగా అనేది నిర్ణయించడానికి గ్రామసభల్లోనూ, మండల పరిషత్తులలోనూ చర్చించాలి.అత్యవసరం అవునా? కాదా? అనేది కోర్టులు తేలుస్తాయి.అత్యవసర అధికారాల్ని ప్రభుత్వం వినియోగించినప్పుడు ముందుగా 80 శాతం నష్ట పరిహారాన్ని భూయజమానులకు చెల్లించాలి. ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ మొత్తాన్ని కోర్టులో జమచెయ్యాలి. ఇది ముందస్తు చెల్లింపు మాత్రమే.నష్ట పరిహారాన్ని నిర్ణయించిన తర్వాత పూర్తి చెల్లింపులు చేయాలి.
  • కలెక్టరు... లేదా అధీకృత అధికారి భూ సేకరణ చేయాలనుకునే స్థలం సర్వే నెంబర్లు, కొలతలతో పటం తయారు చెయ్యాలి.
  • హక్కు, ప్రయోజనం ఉన్నవారందరికీ భూమిని స్వాధీనం చేసుకోబోతున్నట్లు... నష్టపరిహారం ఎంత కావాలో తెలపాల్సిందిగా నోటీసులు ఇవ్వాలి. అందులో భూమికి సంబంధించిన మొత్తం వివరాలు ఉండాలి.
  • భూమికి సంబంధించిన వివరాలు, నష్ట పరిహారం,అర్హులైన వ్యక్తుల వివరాలతో రెండు సంవత్సరాల్లోగా అవార్డు తీర్పు ఇవ్వాలి. ఏ రకమైన స్టే లేకుండా ఈ వ్యవధి మీరితే భూసేకరణ చెల్లకుండా పోతుంది.
  • కంపెనీల అభ్యర్థనపై భూ సేకరణ ప్రజాప్రయోజనం కింద రాదు.
  • అవార్డు ప్రతిని ఇఛ్ఛి భూమిని స్వాధీనం చేసుకోవాలి.అవార్డులో నిర్ణయించిన సొమ్ము తక్కువనిపిస్తే, కోర్టుకు నివేదించమని కోరాలి.దానికి కోర్టు ఫీజూ చెల్లించనక్కర్లేదు.
  • ఇవ్వజూపిన పరిహారం నా హక్కులకు భంగం లేని విధంగా నిరసనతో స్వీకరిస్తున్నాను. ఈ విషయాన్ని కోర్టుకు నివేదించండి అంటూ రాసి తీసుకోవచ్చు
  • హౌసింగ్ కాలనీల అభివృద్ధి కోసం ప్రజల భూములను 'అత్యవసర నిబంధన'ను అడ్డుపెట్టుకుని స్వాధీనం చేసుకోరాదు.ప్రకృతి విపత్తులతో నిర్వాసితులైన వారికి, ప్రాజెక్టుల నిర్మాణం కోసం తరలించిన వారికి పునరావాసం కల్పించడం కోసం, సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి అత్యవసరంగా గృహాలు నిర్మించాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే 'అత్యవసర నిబంధన'ను ఉపయోగించాలి.
  • భూములను స్వాధీనం చేసుకున్నాక, ఆ భూములపై సొంతదారులకు ఎటువంటి హక్కులు ఉండవు.పరిహారం చెల్లించే విషయంలో ఆలస్యం జరిగినా కూడా సొంతదారులకు కేవ లం పరిహారం విషయంలో మాత్రమే హక్కు ఉంటుంది తప్ప, ప్రభుత్వం సేకరించిన భూమి పై ఎటువంటి హక్కులు ఉండవు. ఏ అవసరం కోసం ప్రభుత్వం భూమిని సేకరించిందో, ఆ అవసరం నిమిత్తం భూమిని ఉపయోగించకపోయినప్పటికీ, ఆ భూమిని తిరిగి తనకు స్వాధీనం చేయాలని కోరే హక్కు సొంతదారుకు ఉండదు. తిరిగి ఆ భూమిని సొంతదారుకు స్వాధీనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు.
  • డిజైన్‌ నమూనా పూర్తిగా ఖరారు చెయ్యకుండా, కచ్చితంగా నిర్ధారించకుండా, వాటికి అనుమతులు తీసుకోకుండా అలైన్‌మెంట్‌ తుది నమూనాను ఆమోదించకూడదు.భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేశాక తగిన కారణం లేకుండా వదలకూడదు.అలైన్‌మెంట్‌ను మార్చకూడదు.
  • నోటిఫికేషన్ వెనక ప్రజా ప్రయోజనం లేదనీ, దురుద్దేశంతో, నిర్హేతుకంగా చట్టవ్యతిరేకంగా తన ఆస్తి తీసుకుంటున్నారని సవాల్‌ చేసే హక్కు యజమానికి ఉంటుంది.
  • నీటి చెలమలు, చెరువులు అంతర్థానమయ్యేలా అలైన్‌మెంట్లను తయారుచేయకూడదు.
  • భూసేకరణలో ఒకరికి హానిచేస్తూ మరొకరికి సహాయం చెయ్యాలని తలపెడితే ఆ సేకరణ ప్రజా సంక్షేమం కోసమే అయినా సరే దురుద్దేశపూరితమే అవుతుంది.

సమగ్ర భూసేకరణ చట్టం మార్చు

సుప్రీం ధర్మాసనం- భూసేకరణ చట్టాన్ని సంస్కరించాలని, పరిశ్రమలు, సెజ్‌ల ఏర్పాటుకోసం ప్రభుత్వం భూ సేకరణదారుగానే కాదు, పేదల పక్షాన వారి ప్రయోజనాల పరిరక్షకురాలిగానూ వ్యవహరించాలని సూచించింది. సారవంతమైన పొలాలున్న సన్న చిన్నకారు రైతులకు, వాటిలో 'సెజ్‌'లు నెలకొల్పదలచినవారికీ మధ్య దేశంలో ఇప్పుడు భూ పోరాటం సాగుతోందని డాక్టర్‌ స్వామినాథన్‌ అన్నారు. భూసేకరణపై సమగ్ర బిల్లు తెస్తున్నామని కేంద్రసర్కారు ప్రకటించింది. పవార్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం బిల్లు విధివిధానాలను రూపొందిస్తోంది. దీని ప్రకారం ప్రైవేటు పరిశ్రమలకోసం పారిశ్రామికవేత్తలే స్వయంగా 70శాతం భూమి సేకరించుకొంటే, ప్రభుత్వం మిగిలినదాన్ని సమకూరుస్తుంది. ఏడాదికి ఒక పంట కంటే ఎక్కువ పండే భూముల్ని భూసేకరణ నుంచి మినహాయిస్తారు. భూసేకరణ జరగకముందున్న జీవన స్థితిగతులే ఆ తరువాతా కొనసాగేలా నిర్వాసితులకు పరిహారం ఉండాలని లా కమిషన్‌ 1958లో సూచించింది. సాగుకు పనికిరాని పడావు భూముల్లోనే ప్రత్యేక ఆర్థికమండళ్లను అనుమతించాలంటూ 2006నాటి నైనిటాల్‌ సదస్సులో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు సోనియా చెప్పారు. భూసేకరణ చట్టంలోని- ప్రజాప్రయోజనాల్ని సూటిగా స్పష్టంగా నిర్వచించాలనీ, ప్రైవేటు సంస్థలకోసం సర్కారీ భూసేకరణను పూర్తిగా నిషేధించాలనీ, ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిపితే సామాజిక ప్రభావాన్ని తగురీతిగా అంచనా వేయాలనీ, నిర్ణయించిన పనికే భూమిని వినియోగించాలనీ ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌ సింగ్‌, మమతా బెనర్జీ వాదిస్తున్నారు.

ఇవికూడా చూడండి మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=భూసేకరణ&oldid=4107579" నుండి వెలికితీశారు