మద్రాసు ప్రెసిడెన్సీ

బ్రిటిషు భారత దేశంలో ఒక పరిపాలనా విభాగం

మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా లోని పరిపాలనా ఉపవిభాగం (ప్రెసిడెన్సీ). ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ వంటి ప్రాంతాలతో సహా దక్షిణ భారతదేశంలో చాలా వరకూ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. దీన్ని ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రెసిడెన్సీ అనీ, మద్రాసు ప్రావిన్స్ అనీ కూడా పిలుస్తారు. మద్రాసు నగరం, ప్రెసిడెన్సీకి శీతాకాల రాజధాని గాను ఊటీ వేసవి రాజధాని గానూ ఉండేవి. 1793 నుండి 1798 వరకు సిలోన్ ద్వీపం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. మద్రాసు ప్రెసిడెన్సీకి వాయవ్య దిశలో మైసూరు రాజ్యం, నైరుతిలో కొచ్చి రాజ్యం, ఉత్తరాన హైదరాబాద్ రాజ్యం ఉన్నాయి. ప్రెసిడెన్సీ లోని కొన్ని భాగాలను ఆనుకుని బొంబాయి ప్రెసిడెన్సీ కూడా ఉంది.

మద్రాసు ప్రెసిడెన్సీ/ప్రెసిడెన్సీ ఆఫ్ ఫోర్ట్ సెంట్ జార్జి/ మద్రాసు ప్రావిన్సు
ప్రెసిడెన్సీ of బ్రిటిషు ఇండియా

 

1652–1947
Flag Coat of arms
Flag Coat of arms
Location of మద్రాసు ప్రెసిడెన్సీ
Location of మద్రాసు ప్రెసిడెన్సీ
1913 లో మద్రాసు ప్రెసిడెన్సీ
Capital శీతాకాలం: మద్రాసు
వేసవి: ఊటీ
Historical era నయా సామ్రాజ్యవాదం
 -  Established 1652
 -  Disestablished 1947
Colonial India
British Indian Empire
Imperial entities of India
Dutch India1605–1825
Danish India1620–1869
French India1668–1954

Portuguese India
(1505–1961)
Casa da Índia1434–1833
Portuguese East India Company1628–1633

ఈస్ట్ ఇండియా కంపెనీ1612–1757
భారతదేశంలో కంపెనీ పాలన1757–1858
భారతదేశంలో బ్రిటిషు పాలన1858–1947
British rule in Burma1824–1948
స్వదేశీ సంస్థానాలు1721–1949
భారత విభజన
1947

1639 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసుపట్నం గ్రామాన్ని కొనుగోలు చేసింది. మచిలీపట్నం, ఆర్మగావ్‌ల వద్ద 1600 ల నాటికే కంపెనీ కర్మాగారాలు ఉన్నప్పటికీ, ఒక సంవత్సరం తరువాత మద్రాసుపట్నంలో ఫోర్ట్ సెంట్ జార్జ్ ఏజెన్సీని స్థాపించారు. ఇది మద్రాసు ప్రెసిడెన్సీకి పూర్వగామి. 1652 లో దీన్ని ప్రెసిడెన్సీగా అప్‌గ్రేడ్ చేసారు. 1655 లో తిరిగి ఏజెన్సీగా మునుపటి స్థితికి తీసుకొచ్చారు. మళ్ళీ 1684 లో, దీనిని తిరిగి ప్రెసిడెన్సీగా మార్చారు. ఎలిహు యాలేను ప్రెసిడెన్సీకి తొలి ప్రెసిడెంటుగా నియమించారు. 1785 లో, పిట్ ఇండియా చట్టం నిబంధనల ననుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన మూడు ప్రావిన్సులలో మద్రాసు ఒకటి. అప్పటి నుండి ఈ ప్రావిన్సు అధిపతిని "ప్రెసిడెంట్" అని కాకుండా "గవర్నర్" అని పిలవడం మొదలుపెట్టారు. ఈ గవర్నరు, కలకత్తాలోని గవర్నర్ జనరల్ అధీనంలో పనిచేసేవారు. ఈ గవర్నర్ జనరల్ పదవి అప్పటి నుండి 1947 వరకూ కొనసాగింది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక అధికారాలు గవర్నర్‌ వద్దనే ఉండేవి. ఆయనకు కౌన్సిల్ సహాయపడేది. ఈ కౌన్సిల్ రూపనిర్మాణం 1861, 1909, 1919, 1935 లలో చేసిన సంస్కరణల ద్వారా సవరించారు. 1939 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు మద్రాసులో క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగుతూ వచ్చాయి. 1908 నాటికి, ఈ ప్రావిన్సులో ఇరవై రెండు జిల్లాలు ఉండేవి. ఒక్కో జిల్లా ఒక్కో జిల్లా కలెక్టరు పాలనలో ఉండేది. జిల్లాను తాలూకాలు, ఫిర్కాలుగా విభజించారు. పరిపాలన యొక్క అతిచిన్న యూనిట్, గ్రామం.

1919 నాటి మాంటేగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలను అమలు చేసిన మొదటి ప్రావిన్సు మద్రాసు. దీని ప్రకారం ద్వంద్వ ప్రభుత్వ పద్ధతి అమల్లోకి వచ్చింది. ఈ పద్ధతిలో గవర్నరు, ముఖ్యమంత్రి కలిసి పరిపాలించేవారు. 20 వ శతాబ్దం ప్రారంభ దశాబ్దాలలో, భారత స్వాతంత్ర్య ఉద్యమకారులు చాలా మంది మద్రాసు ప్రావిన్సు నుండి వచ్చారు. 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం రావడంతో, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు ప్రావిన్సు అయింది. 1950 జనవరి 26 న భారత గణతంత్ర రాజ్యం ఏర్పడినపుడు మద్రాసు ప్రావిన్సు మద్రాసు రాష్ట్రంగా మారింది.

ఇలా ఏర్పడింది మార్చు

ఇంగ్లీషు వాళ్ళు రాక ముందు మార్చు

ప్రెసిడెన్సీ ఉత్తర భాగంలో మొదటి ప్రముఖ పాలకులు తమిళ పాండ్య రాజవంశం (క్రీ.పూ. 230)  – సా.శ. 102). పాండ్యులు చోళుల సామ్రాజ్యాలు క్షీణించిన తరువాత, కాలభ్రులు అనే జాతి ప్రజలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.[1] తరువాత పల్లవ రాజవంశం క్రింద దేశం తిరిగి ఊపందుకుంది. తరువాత తెలుగు రాజులు తమిళనాడులో విస్తారమైన ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నాక, వారి పాలనలో ఇక్కడి నాగరికత శిఖరస్థాయికి చేరుకుంది. 1311 లో మాలిక్ కాఫూర్ మదురైని స్వాధీనం చేసుకున్న తరువాత, సంస్కృతీ నాగరికతా రెండూ కొంత కాలం పాటు మందకొడిగా ఉండిపోయాయి. 1336 లో స్థాపించబడిన విజయనగర సామ్రాజ్యం కింద తమిళ, తెలుగు భూభాగాలు కోలుకున్నాయి. ఈ సామ్రాజ్యం నశించాక, దేశాన్ని అనేక మంది సుల్తాన్లు, పాలెగాళ్ళు, యూరోపియన్ వాణిజ్య సంస్థలూ పంచుకున్నారు.[2] మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన ప్రాంతాలను 1685 - 1947 మధ్య అనేక మంది రాజులు పరిపాలించారు.[3]

తొలి ఇంగ్లీష్ ట్రేడింగ్ పోస్ట్లు మార్చు

1600 డిసెంబరు 31 న, ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ I (1533-1603) ఒక ఉమ్మడి-స్టాక్ కంపెనీని స్థాపించడానికి ఆంగ్ల వ్యాపారుల బృందానికి అనుమతి మంజూరు చేసింది, దీనిని ఈస్ట్ ఇండియా కంపెనీగా పిలుస్తారు.[4][5][6][7] తదనంతరం, కింగ్ జేమ్స్ I (1567-1625) పాలనలో, సర్ విలియం హాకిన్స్, సర్ థామస్ రోలను పంపి, మొఘల్ చక్రవర్తి జహంగీర్ (1569-1627) తో చర్చలు జరిపి కంపెనీ తరపున భారతదేశంలో వాణిజ్య కర్మాగారాలను స్థాపించడానికి అనుమతి పొందారు. వీటిలో మొదటివి పశ్చిమ తీరంలోని సూరత్ వద్ద,[8] దేశపు తూర్పు తీరంలో మసూలిపటం (నేటి మచిలీపట్నం) వద్దా నిర్మించారు.[9] 1611 లో మసూలిపటంలో ఏర్పాటు చేసిన వాణిజ్య పోస్టు, భారతదేశపు తూర్పు తీరంలో ఆంగ్లేయులు స్థాపించిన తొట్ట తొలిది. 1625 లో దీనికి దక్షిణాన కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న అర్మాగావ్ వద్ద మరొక కర్మాగారాన్ని స్థాపించారు. ఆ తరువాత ఈ రెండు కర్మాగారాలను మచిలీపట్నం వద్ద ఉన్న ఏజెన్సీ పర్యవేక్షణలో ఉంచారు. ఆ సమయంలో తూర్పు తీరంలో ప్రధాన వాణిజ్య వస్తువు అయిన నూలు వస్త్రానికి కొరత ఏర్పడిన కారణంగా ఈ కర్మాగారాలను మరింత దక్షిణానికి తరలించాలని ఆంగ్ల అధికారులు నిర్ణయించారు. పైగా, స్థానిక అధికారులపై గోల్కొండ సుల్తాను వేధింపులు ఎక్కువవడం కూడా సమస్యకు తోడైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేటర్ ఫ్రాన్సిస్ డే (1605–73) చంద్రగిరి రాజు పెద వేంకట రాయలుతో చర్చలు జరిపి, మద్రాసుపట్నం గ్రామంలో ఒక కర్మాగారాన్ని స్థాపించడానికి భూమి మంజూరు చేయించుకున్నాడు. అక్కడ కొత్త ఫోర్ట్ సెయింట్ జార్జ్ నిర్మించారు. కొత్త స్థావరాన్ని పరిపాలించడానికి ఒక ఏజెన్సీని సృష్టించారు. మసూలిపట్నంలోని ఆండ్రూ కోగన్‌ను దాని మొదటి ఏజెంట్‌గా నియమించారు.[10] భారతదేశపు తూర్పు తీరంలో ఉన్న ఏజెన్సీలన్నిటినీ జావాలో బాంటం లోని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రెసిడెన్సీ అధీనంలో ఉంచారు.[11] 1641 నాటికి ఫోర్ట్ సెయింట్ జార్జ్, కోరమాండల్ తీరంలో కంపెనీ ప్రధాన కార్యాలయంగా మారింది.[12]

ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఏజెన్సీ మార్చు

ఆండ్రూ కోగన్ తరువాత ఫ్రాన్సిస్ డే (1643-1644), థామస్ ఐవీ (1644-1648), థామస్ గ్రీన్హిల్ (1648–52, 1655–58) ఉన్నారు. 1652 లో గ్రీన్హిల్ పదవీకాలం ముగిసిన తరువాత, ఫోర్ట్ సెయింట్ జార్జ్‌ను ప్రెసిడెన్సీ స్థాయికి పెంచి, బాంటమ్ నుండి వేరుపరచారు.[9] మొదటి ప్రెసిడెంటుగా ఆరోన్ బేకర్ (1652-1655) ను నియమించారు. అయితే, 1655 లో కోట స్థాయిని తిరిగి ఏజెన్సీకి తగ్గించి, సూరత్‌లోని కర్మాగారం కింద ఉంచారు.[13] 1684 వరకు ఆ స్థితిలోనే కొనసాగింది. 1658 లో బెంగాల్ లోని ట్రిప్లికేన్ గ్రామాన్ని ఆక్రమించాక అక్కడి అన్ని కర్మాగారాల నియంత్రణను మద్రాసుకు అప్పజెప్పారు,.[14][15]

చరిత్ర మార్చు

 
కర్ణాటిక్ నవాబు మహ్మద్ అలీ ఖాన్ వల్లాజాతో కలిసి మద్రాసు సైన్యాన్ని స్థాపించిన స్ట్రింగర్ లారెన్స్

విస్తరణ మార్చు

1684 లో, ఫోర్ట్ సెయింట్ జార్జ్ మళ్లీ మద్రాసు ప్రెసిడెన్సీగా ఎదిగింది. విలియం గిఫోర్డ్ దాని మొదటి ప్రెసిడెంటు.[16] ఈ నగరాన్ని రెండు భాగాలుగా విభజించారు: యూరోపియన్లు నివసించే వైట్ టౌన్, 'స్థానికులు' నివసించిన బ్లాక్ టౌన్. వైట్ టౌన్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ లోపల ఉండగా, దాని వెలుపల బ్లాక్ టౌన్ ఉండేది. బ్లాక్ టౌనే ఆ తరువాత జార్జ్ టౌన్ గా మారింది.[17] ఈ కాలంలో, ప్రెసిడెన్సీ గణనీయంగా విస్తరించింది. మద్రాసు ప్రెసిడెన్సీ ప్రారంభ సంవత్సరాల్లో, ఆంగ్లేయులు మొఘలులు, మరాఠాలు, గోల్కొండ నవాబులు, కర్ణాటిక్ ప్రాంతాలపై పదేపదే దాడి చేశారు.[18] 1774 సెప్టెంబరులో, ఈస్ట్ ఇండియా కంపెనీ భూభాగాల పరిపాలనను ఏకీకృతం చేయడానికి, నియంత్రించడానికీ గ్రేట్ బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన పిట్ ఇండియా చట్టం ద్వారా, మద్రాసు ప్రెసిడెంటు కలకత్తాలో ఉన్న భారత గవర్నర్ జనరల్‌కు అధీనంలో ఉంచింది.[19] 1746 సెప్టెంబరులో, సెయింట్ జార్జ్ ఫోర్ట్‌ను ఫ్రెంచ్ వారు స్వాధీనం చేసుకున్నారు. 1749 వరకు మద్రాసు ఫ్రెంచ్ భారతదేశంలో భాగంగా ఉండేది. 1748 లో కుదిరిన ఐక్స్-లా-చాపెల్లే ఒప్పందం ప్రకారం మద్రాసును బ్రిటిష్ వారికి తిరిగి అప్పగించారు.[20]

కంపెనీ పాలన సమయంలో మార్చు

1774 నుండి 1858 వరకు, మద్రాసును బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది. 18 వ శతాబ్దం చివరి త్రైమాసికం వేగంగా విస్తరించిన కాలం. టిప్పు సుల్తాన్ (1782-99) తోటి, వేలు తంపి, పాలెగాళ్ళు, సిలోన్లపై జరిగిన యుద్ధాల్లో గెలిచి, చాలా భూభాగాన్ని కలుపుకున్నారు. కొత్తగా జయించిన సిలోన్, 1793 - 1798 మధ్య మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది.[21] భారత గవర్నర్-జనరల్, లార్డ్ వెల్లెస్లీ (1798-1805) ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందం అనేక రాజ్యాలను సైనికపరంగా సెయింట్ జార్జ్ గవర్నరు అధీనం లోకి తీసుకువచ్చింది.[22] గంజాం, విశాఖపట్నం కొండ ప్రాంతాలు బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్న చివరి ప్రదేశాలు.[23]

ఈ కాలం 1806 వెల్లూరు తిరుగుబాటుతో మొదలైన అనేక తిరుగుబాట్లను చూసింది.[24] వేలు తంబి, పాలియత్ అచ్చన్, పాలెగాళ్ళ తిరుగుబాట్లు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చెప్పుకోదగ్గ ఇతర తిరుగుబాట్లు. అయితే, 1857 సిపాయిల తిరుగుబాటులో మాత్రం మద్రాసు ప్రెసిడెన్సీ పెద్దగా ఇబ్బంది పడలేదు.[25]

మద్రాసు ప్రెసిడెన్సీ 1831 లో మైసూర్ రాజ్యాన్ని దుర్వినియోగ ఆరోపణలపై స్వాధీనం చేసుకుంది [26] దానిని 1881 లో పదవీచ్యుతుడైన ముమ్మడి కృష్ణరాజ వడయార్ (1799–1868) మనవడూ వారసుడూ అయిన చామరాజ వడయార్ (1881–94) కు తిరిగి అప్పగించారు. శివాజీ II (1832–1855) మరణం తరువాత, అతడికి మగ వారసులు లేనందున, 1855 లో బ్రిటిషు వారు తంజావూరును కలుపుకున్నారు..[27]

విక్టోరియా శకం మార్చు

1858 లో, క్వీన్ విక్టోరియా జారీ చేసిన క్వీన్స్ ప్రకటన నిబంధనల ప్రకారం, మద్రాసు ప్రెసిడెన్సీ, మిగతా బ్రిటిష్ ఇండియాతో పాటు, బ్రిటిష్ రాజు ప్రత్యక్ష పాలనలోకి వచ్చింది.[28] గవర్నర్ లార్డ్ హారిస్ (1854–1859) కాలంలో, విద్యను మెరుగుపరచడానికి, పరిపాలనలో భారతీయుల ప్రాతినిధ్యం పెంచడానికీ చర్యలు తీసుకున్నారు. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 ప్రకారం కౌన్సిల్‌కు శాసనాధికారాలు ఇచ్చారు.[29] ఈ కౌన్సిలుకు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892,[30] ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909,[31][32] భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935 కింద సంస్కరణలు, విస్తరణలూ చేసారు. వి. సదాగోపాచార్లు (1861-63) కౌన్సిల్‌కు నియమితుడైన మొదటి భారతీయుడు.[33] కొత్తగా విద్యావంతులౌతున్న భారతీయుల్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారు.[34] టి. ముతుస్వామి అయ్యర్ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడైన తొలి భారతీయుడు. 1877 లో, ఆంగ్లో-ఇండియన్ మీడియా నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, అతడు ఈ పదవిలో నియమితుడయ్యాడు [35][36] అతను 1893 లో కొన్ని నెలలు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించాడు. తద్వారా ఈ పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు కూడా అతడే అయ్యాడు.[37] 1906 లో, సి. శంకరన్ నాయర్ మద్రాసు ప్రెసిడెన్సీకి అడ్వకేట్ జనరల్ గా నియమితుడైన మొదటి భారతీయుడు.

ఈ కాలంలో అనేక రోడ్లు, రైల్వేలు, ఆనకట్టలు కాలువలు నిర్మించారు. ఈ కాలంలో మద్రాసులో రెండు పెద్ద కరువులు సంభవించాయి, 1876–78 నాటి గొప్ప కరువు, 1896-97 నాటి భారత కరువు.[38] ఫలితంగా, ప్రెసిడెన్సీ జనాభా మొదటిసారిగా 1871 లో 3.12 కోట్ల నుండి 1881 లో 3.08 కోట్లకు పడిపోయింది. ఈ కరువు, చెంగల్పట్టు రైతుల కేసు, సేలం అల్లర్ల విచారణను నిర్వహించడంలో ప్రభుత్వం చూపిన పక్షపాతం ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది.[39]

ద్వంద్వ ప్రభుత్వం (1920–37) మార్చు

మోంటాగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణల ప్రకారం ప్రెసిడెన్సీలో ఎన్నికలు జరపడంతో 1920 లో మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది.[40] ఈ పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు, నిరంకుశాధికారాలున్న గవర్నరు వ్యవస్థతో అధికారాన్ని పంచుకుంటాయి. 1920 నవంబరులో జరిగిన మొదటి ఎన్నికల తరువాత జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పరిపాలనలో బ్రాహ్మణేతరుల ప్రాతినిధ్యం పెరగాలనే నినాదంతో 1916 లో జస్టిస్ పార్టీని స్థాపించారు.[41] ఎ. సుబ్బరాయలు రెడ్డియార్ మద్రాసు ప్రెసిడెన్సీకి మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. కాని ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే రాజీనామా చేశాడు. అతని స్థానంలో స్థానిక స్వపరిపాలన, ప్రజారోగ్య శాఖామంత్రి పానగల్ రాజాగా ప్రసిద్ధి చెందిన పి. రామరాయణింగార్ ముఖ్యమంత్రి అయ్యాడు.[42] 1923 చివరలో సిఆర్ రెడ్డి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ప్రతిపక్ష స్వరాజ్‌పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పార్టీ విడిపోయింది. 1923 నవంబరు 27 న రామారాయణింగార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. కాని, ఆ తీర్మానం 65-44తో వీగిపోయింది. రామారాయణింగార్ 1926 నవంబరు వరకు అధికారంలో ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో కుల-ఆధారిత రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం అతని పాలన యొక్క ఉన్నత అంశాలలో ఒకటి. 1926 తరువాత జరిగిన ఎన్నికలలో జస్టిస్ పార్టీ ఓడిపోయింది. అయితే, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో, గవర్నర్ లార్డ్ గోస్చెన్ పి. సుబ్బారాయన్ నాయకత్వంలో ఒక బహుళ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, దాని సహాయక సభ్యులను నామినేట్ చేసాడు [43] 1930 ఎన్నికలలో జస్టిస్ పార్టీ విజయం సాధించి, పి.మునుస్వామి నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.[44] జమీందార్లను మంత్రివర్గం నుండి మినహాయించడంతో జస్టిస్ పార్టీ మరోసారి విడిపోయింది. తనపై అవిశ్వాస తీర్మానానికి భయపడి, మునుస్వామి నాయుడు 1932 నవంబరులో రాజీనామా చేశాడు. అతని స్థానంలో బొబ్బిలి రాజా ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు.[45] చివరికి, 1937 ఎన్నికలలో జస్టిస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. చక్రవర్తి రాజగోపాలాచారి మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అయ్యాడు.[46]

1920, 930 లలో, మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం తలెత్తింది. ప్రాంతీయ కాంగ్రెస్ లోని బ్రాహ్మణ నాయకత్వం యొక్క సూత్రాలు, విధానాలపై అసంతృప్తి చెందిన ఇ.వి.రామస్వామి దీనిని ప్రారంభించాడు. ఆత్మ-గౌరవ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీని విడిచిపెట్టాడు. పెరియార్, ప్రత్యామ్నాయంగా తెలిసినట్లుగా పత్రికలు, విదుతలై, జస్టిస్ వంటి వార్తాపత్రికలలో బ్రాహ్మణులను, హిందూ మతాన్ని, హిందూ మూఢనమ్మకాలనూ విమర్శించాడు. ట్రావెన్కోర్లో అంటరానివారికి దేవాలయాలలోకి ప్రవేశించే హక్కు కోసం ప్రచారం చేసిన వైకోమ్ సత్యాగ్రహంలో ఆయన పాల్గొన్నాడు.[47]

బ్రిటిష్ పాలన చివరి రోజులు మార్చు

 
1937 లో చక్రవర్తి రాజగోపాలాచారి (ర్యాలీలో చిత్రీకరించబడింది) ముఖ్యమంత్రిగా భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది

1937 లో, మద్రాసు ప్రెసిడెన్సీలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది.[46] కాంగ్రెస్ పార్టీ నుండి ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి, చక్రవర్తి రాజగోపాలాచారి. అతను టెంపుల్ ఎంట్రీ ఆథరైజేషన్ అండ్ ఇండెమ్నిటీ చట్టాన్ని [48] విజయవంతంగా తెచ్చాడు. మద్రాసు ప్రెసిడెన్సీలో మద్య నిషేధాన్ని [49] అమ్మకపు పన్నులనూ ప్రవేశపెట్టాడు. విద్యాసంస్థలలో హిందీని ఉపయోగించడం తప్పనిసరి చేయడం అతని పాలన గుర్తుండిపోయే చర్య. ఈ చర్య వలన అతడు ప్రజాదరణ కోల్పోయాడు.[50] హిందీ వ్యతిరేక ఆందోళనలు చెలరేగాయి. ఇది కొన్ని ప్రదేశాలలో హింసకు దారితీసింది. హిందీ వ్యతిరేక ఆందోళనలలో పాల్గొన్నందుకు 1,200 మంది పురుషులు, మహిళలు పిల్లలూ జైలు పాలయ్యారు.[51] నిరసనల సమయంలో తాలముత్తు, నటరాసన్ మరణించారు. 1940 లో, కాంగ్రెస్ మంత్రులు తమ అనుమతి లేకుండా జర్మనీపై భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించినందుకు నిరసనగా రాజీనామా చేశారు. మద్రాసు గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ పరిపాలనను చేపట్టాడు. జనాదరణ లేని హిందీ చట్టాన్ని 1940 ఫిబ్రవరి 21 న అతడు రద్దు చేశాడు.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఫలితంగా చాలా మంది కాంగ్రెస్ నాయకులను, పూర్వ మంత్రులనూ 1942 లో అరెస్టు చేశారు.[52] 1944 లో పెరియార్ జస్టిస్ పార్టీకి ద్రవిడర్ కజగం అని పేరుమార్చి ఎన్నికల రాజకీయాల నుండి వైదొలిగాడు.[53] రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత, భారత జాతీయ కాంగ్రెస్ తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించింది. తీవ్రమైన వ్యతిరేకత లేకపోవడంతో 1946 ఎన్నికలలో సులభంగా గెలిచింది. టంగుటూరి ప్రకాశం కామరాజ్ మద్దతుతో ముఖ్యమంత్రిగా ఎన్నికై, పదకొండు నెలలు పనిచేశాడు. అతని తరువాత OP రామస్వామి రెడ్డియార్, 1947 ఆగస్టు 15 న భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు మద్రాసు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు.[54] మద్రాసు ప్రెసిడెన్సీ స్వతంత్ర భారతదేశంలో మద్రాసు రాష్ట్రంగా మారింది.

భౌగోళికం మార్చు

 
మద్రాసు ప్రావిన్స్ (ఉత్తర), 1909
 
మద్రాసు ప్రావిన్స్ (దక్షిణ), 1909

మద్రాసు ప్రెసిడెన్సీలో దాదాపు దక్షిణ భారతదేశమంతా భాగంగా ఉండేది. ఈనాటి భారత రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ లోని మలబార్ ప్రాంతం, లక్షద్వీప్ దీవులు, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా దక్షిణ జిల్లాలైన గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, నవరంగ్‌పూర్, మల్కాన్గిరి లు, ప్రస్తుత కర్ణాటక లోనిబళ్ళారి, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలు, తెలంగాణ లోని జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమే. ప్రెసిడెన్సీకి శీతాకాలపు రాజధాని మద్రాసులోను, వేసవి రాజధాని ఉదకమండలము (ఊటీ)లోనూ ఉండేది.[55]

జనాభా వివరాలు మార్చు

1822 లో చేసిన మొదటి జనాభా లెక్కల ప్రకారం మద్రాసు ప్రెసిడెన్సీ జనాభా 1,34,76,923 ఉండేది. 1836 - 1837 మధ్య నిర్వహించిన రెండవ జనాభా లెక్కల ప్రకారం 1,39,67,395 జనాభా నమోదైంది. ఈ 15 సంవత్సరాలలో జనాభా 4,90,472 మాత్రమే పెరిగింది. ఐదేళ్ళకోసారి చేసే జనాభా గణనల్లో మొట్టమొదటిది 1851 - 1852 లో చేసారు. ఇందులో జనాభా 2,20,31,697 అని లెక్కతేలింది 1851-52, 1856-57, 1861-62, 1866-67 లలో తదుపరి గణనలు జరిగాయి. మద్రాసు ప్రెసిడెన్సీ జనాభా 1861–62లో 2,28,57,855, 2,46,56,509, 1866–67లో 2,65,39,052 గా ఉంది.[57] భారతదేశపు మొట్టమొదటి వ్యవస్థీకృత జనాభా గణన 1871 లో నిర్వహించారు. అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో 3,12,20,973 జనాభా ఉన్నట్టు లెక్కతేలింది.[58] అప్పటి నుండి, పదేళ్ళ కొకసారి జనాభా లెక్కలు నిర్వహిస్తూ వచ్చారు. 1941 లో జరిగిన బ్రిటిష్ ఇండియా చివరి జనాభా లెక్కల ప్రకారం మద్రాసు ప్రెసిడెన్సీ జనాభా 4,93,41,810 ఉంది.[59]

భాషలు మార్చు

 
మద్రాసు ప్రెసిడెన్సీ భాషా పటం

మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా, తుళు, ఇంగ్లీషు భాషలు మాట్లాడేవారు. మద్రాసు నగరానికి ఉత్తరాన కొన్ని మైళ్ళ నుండి దక్షిణాన నీలగిరి కొండలు, పడమటి కనుమల వరకూ ఉన్న దక్షిణ జిల్లాల్లో తమిళం మాట్లాడేవారు.[60] మద్రాసు నగరం నుండి ఉత్తరాన, బళ్లారి, అనంతపురం జిల్లాలకు తూర్పున తెలుగు మాట్లాడేవారు. దక్షిణ కెనరా జిల్లాలో, బళ్లారి, అనంతపురం జిల్లాల పశ్చిమ భాగంలో, మలబార్ లోని కొన్ని ప్రాంతాలలో కన్నడం మాట్లాడేవారు.[61] మలబార్, దక్షిణ కెనరా జిల్లాల్లో, ట్రావెన్కోర్, కొచ్చిన్ సంస్థానాల్లో మలయాళం మాట్లాడగా, దక్షిణ కెనరాలో తుళు మాట్లాడేవారు. అప్పటి గంజాం, వైజాగపటం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఒరియా మాట్లాడేవారు. ఆంగ్లో-ఇండియన్లు, యురేషియన్లు ఇంగ్లీషు మాట్లాడేవారు. ఇది ప్రెసిడెన్సీకి, బ్రిటిష్ ఇండియా అధికారిక భాషకూ లింకు భాష. ప్రభుత్వ పనులు, కోర్టు విచారణలూ ఇంగ్లీషు లోనే జరిగేవి.[62]

1871 జనాభా లెక్కల ప్రకారం, 1,47,15,000 మంది తమిళం, 1,16,10,000 మంది తెలుగు, 23,24,000 మంది మలయాళం, 1,699,000 మంది కన్నడం మాట్లాడేవారు. 6,40,000 మంది ఒరియా, 29,400 మంది తుళు మాట్లాడేవారు.[63] 1901 జనాభా లెక్కల ప్రకారం 1,518,2,957 మంది తమిళం, 1,42,76,509 తెలుగు, 28,61,297 మంది మలయాళం, 15,18,579 మంది కన్నడం, 18,09,314 మంది ఒరియా, 8,80,145 మంది హిందుస్థానీ / ఉర్దూ, 16,80,635 మంది ఇతర భాషలనూ మాట్లాడేవారు.[64] భారత స్వాతంత్ర్యం సమయంలో, ప్రెసిడెన్సీ మొత్తం జనాభాలో తమిళం, తెలుగు మాట్లాడేవారు 78% పైగా ఉన్నారు.[65]

మతం మార్చు

 
తంజావూరులోని గురుకులంలో వైష్ణవ బ్రాహ్మణ విద్యార్థులు. 1909
 
అయ్యనార్ మందిరం, 1911

1901 లో, జనాభా ఇలా ఉండేది: హిందువులు (3,70,26,471), ముస్లింలు (27,32,931), క్రైస్తవులు (19,34,480). 1947 లో భారతదేశం స్వాతంత్య్రం పొందే నాటికి, మద్రాసులో 4,97,99,822 హిందువులు, 38,96,452 ముస్లింలు, 20,47,478 క్రైస్తవులూ ఉన్నారు [66]

ప్రెసిడెన్సీలో హిందూ మతం ప్రధానమైన మతం. జనాభాలో 88% మంది హిందువులు. ప్రధాన హిందూ తెగలు శైవం, వైష్ణవం, లింగాయతు.[67] బ్రాహ్మణులలో, స్మార్త సిద్ధాంతం బాగా ప్రాచుర్యం పొందింది.[68] ప్రెసిడెన్సీ దక్షిణ జిల్లాల్లో గ్రామ దేవతల ఆరాధన బలంగా ఉండగా, కంచి, శృంగేరి, అహోబిలం వద్ద ఉన్న మఠాలు హిందూ విశ్వాస కేంద్రాలుగా పరిగణించబడ్డాయి. హిందూ దేవాలయాలలో, అతి పెద్దవి, ముఖ్యమైనవి తిరుపతి వెంకటేశ్వర ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, మదురైలోని మీనాక్షి ఆలయం, శ్రీరంగం లోని రంగనాథస్వామి ఆలయం, ఉడుపిలోని కృష్ణ దేవాలయం, ట్రావన్కూరు లోని పద్మనాభస్వామి ఆలయం.

దక్షిణ భారతదేశం లోకి ఇస్లామును తెచ్చింది అరబ్ వ్యాపారులైనా, తరువాత 14 వ శతాబ్దంలో మాలిక్ కాఫుర్ మధురైని ఆక్రమించినప్పటి నుండి మార్పిడులు బగా జరిగాయి. మద్రాసు ప్రెసిడెన్సీలోని ముస్లింలకు నాగోర్ పవిత్ర నగరం. భారతదేశంలో పురాతన క్రైస్తవ జనాభా ప్రెసిడెన్సీలో ఉంది. చారిత్రక ఆధారాలు లేవు గానీ, క్రీస్తు శిష్యుడైన సెయింట్ థామస్, సా.శ. 52 లో మలబార్ తీరాన్ని సందర్శించినట్లు క్రైస్తవుల్లో విశ్వాసం మాత్రం ఉంది.[69] క్రైస్తవులు ప్రధానంగా మద్రాసు ప్రెసిడెన్సీలోని టిన్నెవెల్లీ (తిరునెల్వేలి), మలబార్ జిల్లాల్లో ఎక్కువగా ఉండేవారు. ట్రావెన్కోర్ సంస్థానం మొత్తం జనాభాలో నాలుగింట ఒక వంతు స్థానిక క్రైస్తవులే.[70]

నీలగిరి, పళని, గంజాం ప్రాంతాల్లో తోడాలు, బడగలు, కోయలు, ఎరుకలు, ఖొండులూ గిరిజన దేవతలను పూజించేవారు. వీరినీ హిందువులుగానే పరిగణించేవారు. 20 వ శతాబ్దం ప్రారంభ సంవత్సరాల వరకు, పల్లార్, పరైయర్, సక్కిలియార్, పులియార్, మాదిగ, ఇజవ, హొలెయా హిందూ కులాలను అంటరానివిగా భావించేవారు. వీరిని హిందూ దేవాలయాల లోకి అనుమతించేవారు కాదు. అయితే, భారతీయ మహిళల విముక్తి, సామాజిక చెడులను తొలగించడంతో పాటు, అంటరానితనాన్ని కూడా చట్టం ద్వారా, సామాజిక సంస్కరణల ద్వారా క్రమేణా నిర్మూలించారు. 1932 నుండి 1936 వరకు ప్రధానిగా సేవలందించిన బొబ్బిలి రాజా, ప్రెసిడెన్సీ అంతా ఆలయ పరిపాలన బోర్డులకు అంటరానివారిని నియమించాడు. 1939 లో సి. రాజగోపాలాచారి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం టెంపుల్ ఎంట్రీ ఆథరైజేషన్ అండ్ ఇండెమ్నిటీ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇది అంటరానివారు హిందూ దేవాలయాలలోకి ప్రవేశించడానికి ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగించింది.[48] ట్రావెన్కోర్‌కు చెందిన చితిర తిరునాళ్ ఇంతకుముందు, 1937 లో, తన దివాన్ సర్ సిపి రామస్వామి అయ్యర్ సలహా మేరకు ఇదే విధమైన చట్టాన్ని ప్రవేశపెట్టాడు.[71]

1921 లో పానగల్లు రాజా ప్రభుత్వం, హిందూ మతపరమైన ఎండోమెంట్స్ బిల్లును ఆమోదించింది [72] ఇది హిందూ దేవాలయాలను నిర్వహించడానికీ, వాటి నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడానికీ మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రభుత్వ నియంత్రణలో ఉండే ట్రస్టులను ఏర్పాటు చేసింది. బొబ్బిలి రాజా కూడా తిరుమల తిరుపతి దేవస్థానము పరిపాలనలో సంస్కరణలు ప్రవేశపెట్టాడు.

సైన్యం మార్చు

ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన స్థావరాలను కాపాడుకునేందుకు గాను, సొంత దండును ఏర్పాటు చేసుకోవడానికి 1665 లో మొదటిసారిగా అనుమతి పొందింది. మొఘల్ మరాఠా ఆక్రమణదారుల నుండి, కర్ణాటక నవాబు చొరబాట్ల నుండి నగరాన్ని రక్షించుకోవడం కంపెనీ దళాల కార్యకలాపాలలో ముఖ్యమైనది. 1713 లో, లెఫ్టినెంట్ జాన్ డి మోర్గాన్ నేతృత్వంలోని మద్రాసు దళాలు సెయింట్ డేవిడ్ ఫోర్ట్ ముట్టడిలోను, రిచర్డ్ రావర్త్ యొక్క తిరుగుబాటును అణచివేయడంలోనూ గుర్తింపు తెచ్చుకున్నాయి.[73]

ఫ్రెంచ్ భారత గవర్నర్ జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే 1748 లో స్థానిక బెటాలియన్లను ఏర్పరచడం మొదలుపెట్టినప్పుడు, మద్రాసు బ్రిటిష్ వారు దాన్ని అనుసరించి మద్రాసు రెజిమెంట్‌ను స్థాపించారు.[74] తరువాత భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోనూ బ్రిటిష్ వారు స్థానిక రెజిమెంట్లను స్థాపించినప్పటికీ, మూడు ప్రెసిడెన్సీల మధ్య నున్న దూరాల కారణంగా ఒక్కోదళానికీ ఒక్కోరకమైన లక్షణాలూ, వ్యవస్థా ఉండేవి. సైన్యపు తొలి పునర్వ్యవస్థీకరణ 1795 లో జరిగింది, మద్రాసు సైన్యాన్ని ఈ క్రింది యూనిట్లుగా పునర్నిర్మించారు:

  • యూరోపియన్ పదాతిదళం - పది కంపెనీలున్న రెండు బెటాలియన్లు
  • ఆర్టిలరీ - ఐదు యూరోపియన్ కంపెనీలున్న రెండు బెటాలియన్లు, పదిహేను కంపెనీల లస్కార్లు ఉన్నాయి
  • స్థానిక అశ్వికదళం - నాలుగు రెజిమెంట్లు
  • స్థానిక పదాతిదళం - పదకొండు రెజిమెంట్లున్న రెండు బెటాలియన్లు [75]

1824 లో రెండవ పునర్వ్యవస్థీకరణ జరిగింది, ఆ తరువాత డబుల్ బెటాలియన్లను రద్దు చేసారు. బెటాలియన్లకు అప్పుడున్న పేర్లు మార్చారు. ఆ సమయంలో మద్రాసు సైన్యంలో ఒక యూరోపియన్, ఒక స్థానిక గుర్రపు ఫిరంగి దళాలు, ఒక్కో దానిలో నాలుగు కంపెనీలున్న మూడు బెటాలియన్ల కాల్బల ఫిరంగిదళాలు, నాలుగు కంపెనీల లస్కర్లు, మూడు రెజిమెంట్ల లైట్ అశ్వికదళం, రెండు కార్ప్స్ ఆఫ్ పయినీర్లు, రెండు బెటాలియన్లు యూరోపియన్ పదాతిదళం, స్థానిక పదాతిదళం 52 బెటాలియన్లు, మూడు స్థానిక బెటాలియన్లు ఉండేవి.[76][77]

1748, 1895 మధ్య, బెంగాల్, బొంబాయి సైన్యాల మాదిరిగానే, మద్రాసు సైన్యానికి కూడా దాని స్వంత కమాండర్-ఇన్-చీఫ్ ఉండేవాడు. అతడు తొలుత ప్రెసిడెంటు కింద, ఆ తరువాత గవర్నరు కింద పనిచేసేవాడు. సాంప్రదాయికంగా మద్రాసు సైన్యపు కమాండర్-ఇన్-చీఫ్, గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో సభ్యుడుగా ఉండేవాడు. మద్రాసు సైన్యపు దళాలు 1762 లో మనీలాపై యుద్ధంలో పాల్గొన్నాయి.[78] 1795 లో సిలోన్, డచ్‌లకు వ్యతిరేకంగా చేసిన దండయాత్రల్లోను,అదే సంవత్సరంలో స్పైస్ దీవుల ఆక్రమణ లోనూ పాల్గొన్నాయి. మారిషస్ (1810), జావా (1811),[79] టిప్పు సుల్తాన్ వ్యతిరేకంగా జరిగిన యుద్ధాల్లో, కర్నాటిక్ యుద్ధాల లోను, రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం కటక్పై బ్రిటిషుదాడి లోను,[80] భారతీయ తిరుగుబాటు సమయంలో లక్నో ముట్టడి లోను, మూడవ ఆంగ్లో-బర్మీస్ యుద్ధంలో ఎగువ బర్మాపై దాడి లోను వారు పాల్గొన్నారు [81]

1857 తిరుగుబాటు, బెంగాల్, బొంబాయి సైన్యాలలో పెను మార్పులకు దారితీసింది గానీ, మద్రాసు సైన్యంపై ఎటువంటి ప్రభావం చూపలేదు. 1895 లో, ప్రెసిడెన్సీ సైన్యాలన్నీ విలీన మయ్యాయి. మద్రాసు సైన్యం బ్రిటిష్ ఇండియా కమాండర్-ఇన్-చీఫ్ ప్రత్యక్ష నియంత్రణలోకి వచ్చింది.[82]

1890 లో మూడు మద్రాసు పదాతిదళ బెటాలియన్లను పునర్నిర్మించారు. అప్పటి వరకు మద్రాసు సైన్యంలో పెద్దగా చేరని మాపిళాలు, కూర్గులతో కొత్త దళాలను ఏర్పాటు చేయ తలపెట్టింది. రెండు మాపిళా బెటాలియన్ల ఏర్పాటు చేసి, వాటిని మలబార్ వెలుపల మోహరించారు. 1900 లో ఏర్పాటు చేసిన కొత్త రెజిమెంట్లు పూర్తిగా విఫలమయ్యాయి. త్వరలోనే ఆ దళాల్లోని సంఖ్య 600 మందికి పడిపోయి 'సేవకు పనికిరాని' స్థాయికి తగ్గిపోయాయి.[83]

భూమి, రైతు, కౌలు, శిస్తు మార్చు

 
మద్రాస్ ప్రెసిడెన్సీలో "రైతువారీ వ్యవస్థ"ను ప్రవేశపెట్టిన సర్ థామస్ మన్రో విగ్రహం

బ్రిటిషువారు పరిపాలన చేపట్టినప్పుడు, శతాబ్దాల నాటి భూ యాజమాన్య వ్యవస్థ చెక్కుచెదరకుండా ఉంది.[84] స్థానిక జమీందార్ల నియంత్రణలో లేని భూముల నుండి ఆదాయాన్ని సేకరించడానికి కొత్త పాలకులు మధ్యవర్తులను నియమించారు. చాలా సందర్భాల్లో, ఈ మధ్య దళారీలు రైతుల సంక్షేమాన్ని విస్మరించి, వారిని పూర్తిగా దోపిడీ చేసేవారు. ఈ సమస్యను పరిష్కరించడానికి 1786 లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూను స్థాపించారు, కానీ ప్రయోజనం లేకపోయింది.[85] అదే సమయంలో, లార్డ్ కారన్ వాలీసు బెంగాల్‌లో ప్రవేశపెట్టిన జమీందారీ పరిష్కారం చాలా విజయవంతమైంది. తరువాత దాన్ని 1799 నుండి మద్రాస్ ప్రెసిడెన్సీలో కూడా అమలు చేసారు.[86]

అయితే, శాశ్వత పరిష్కారం బెంగాల్‌లో లాగా విజయవంతం కాలేదు. కంపెనీ ఆశించిన లాభ స్థాయికి చేరుకోనప్పుడు, టిన్నెవెల్లీ, ట్రిచినోపోలీ, కోయంబత్తూర్, నార్త్ ఆర్కాట్, సౌత్ ఆర్కాట్ జిల్లాల్లో 1804 - 1814 మధ్య "విలేజ్ సెటిల్మెంట్" అనే కొత్త వ్యవస్థను అమలు చేసారు. ఇందులో ప్రధాన సాగుదారులకు భూమిని లీజుకు ఇవ్వడం జరిగింది, వారు భూమిని రైతులకు లీజుకు ఇచ్చారు. అయితే, శాశ్వత పరిష్కారంతో పోలిస్తే విలేజ్ సెటిల్మెంట్లో కొన్ని తేడాలు ఉన్నందున, చివరికి దాన్ని వదిలేసారు. దాని స్థానంలో సర్ థామస్ మన్రో 1820 - 1827 మధ్య అమలు చేసిన "రైతువారీ సెటిల్మెంట్" వచ్చింది. కొత్త విధానం ప్రకారం, భూమిని నేరుగా ప్రభుత్వానికే అద్దె చెల్లించే రైతులకు అప్పగించారు. ఈ భూమిపై ప్రభుత్వం అంచనా కట్టిన శిస్తును చెల్లించేవారు. ఈ వ్యవస్థలో అనేక ప్రయోజనాలున్నాయి. రైతులకు కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. 1833 లో, లార్డ్ విలియం బెంటింక్ "మహల్వారీ" అనే వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో భూస్వాములు రైతులూ కలిసి ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు.[87][88]

జమీందారీలలోని సాగుదారులను దోపిడీ నుండి రక్షించడానికి 1908 నాటి ల్యాండ్ ఎస్టేట్స్ చట్టాన్ని మద్రాసు ప్రభుత్వం ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, రైతులను భూమికి శాశ్వత యజమానులుగా చేశారు.[89] అయితే, ఈ చట్టం రైతులను రక్షించలేదు సరికదా, ఒరియా మాట్లాడే ఉత్తర జిల్లాల్లోని సాగుదారుల ప్రయోజనాలకు హానికరంగా మారింది.[90] ఈ చట్టం సాగుదారును ఆ భూమికి, భూస్వామికీ శాశ్వత వెట్టి కూలీగా మార్చేసింది. జమీందార్ల హక్కులను అరికట్టడానికి, సాగుదారులను దోపిడీ నుండి కాపాడటానికీ 1933 లో బొబ్బిలి రాజా ఈ చట్టానికి సవరణను ప్రవేశపెట్టారు. జమీందార్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ చట్టాన్ని శాసనమండలిలో ఆమోదం పొందింది.

వ్యవసాయం, నీటిపారుదల మార్చు

 
మద్రాసు ప్రెసిడెన్సీలోని వరి పండించే ప్రాంతాల 1936 పటం

మద్రాసు ప్రెసిడెన్సీ జనాభాలో దాదాపు 71% మంది వ్యవసాయంలో నిమగ్నమై ఉండేవారు [91][92] వ్యవసాయ సంవత్సరం సాధారణంగా జూలై 1 నుండి ప్రారంభమవుతుంది.[93] మద్రాసు ప్రెసిడెన్సీలో పండించే పంటలు వరి, మొక్కజొన్న, తృణధాన్యాలు, రాగులు [94] వంటి వాటితో పాటు, వంకాయలు, చిలగడదుంప, బెండకాయ, బీన్స్, ఉల్లిపాయలు, వెల్లుల్లీ [95] మిరపకాయ, మిరియాలు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు. ఆముదం, వేరుశెనగ నూనెలు ఉత్పత్తి చేసేవారు.[96] నిమ్మ, అరటి, పనస, జీడిపప్పు, మామిడి, రామాఫలం, బొప్పాయి వంటి పండ్లు పండించేవారు.[97] వీటితో పాటు, క్యాబేజీలు, కాలీఫ్లవర్స్, గజనిమ్మ, పీచెస్, బెట్ట్ పెప్పర్, నైగర్ సీడ్, మిల్లెట్ వంటి వాటిని ఆసియా, ఆఫ్రికా, ఐరోపా‌ల నుండి తెచ్చారు. ఆస్ట్రేలియా నుండి ద్రాక్షను ప్రవేశపెట్టారు.[98] ఆహార పంటల కోసం ఉపయోగించిన మొత్తం సాగు విస్తీర్ణం 80%. నగదు పంటలకు 15%.[99] స్థూల విస్తీర్ణంలో, వరి 26.4 శాతం ఆక్రమించింది; తృణధాన్యాలు 10 శాతం; రాగులు 5.4 శాతం, జొన్నలు 13.8 శాతం. పత్తి 17 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగు చేసేవారు. నూనెగింజలు, 20.8 లక్షలు, సుగంధ ద్రవ్యాలు 4 లక్షలు, ఇండిగో, 2 లక్షల ఎకరాల్లో పండేవి. 1898 లో, మద్రాసు 2.15 కోట్ల ఎకరాల్లో 74.7 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసింది. ఇందులో 1.93 కోట్ల ఎకరాలు రైతువారీ, ఇనాం భూములుండేవి. 2.8 కోట్ల జనాభా దీనిపై ఆధారపడి ఉండేవారు. బియ్యం దిగుబడి ఎకరానికి 700 నుండి 1100 కిలోలు పండేది. జొన్న దిగుబడి 350 నుండి 700 కిలోలు, రాగి 450 నుండి 600 కిలోలు ఉండేది. ఆహార పంటలకు సగటు దిగుబడి ఎకరానికి 775 కిలోలు ఉండేది.

తూర్పు తీరం వెంబడి సాగునీరు ఎక్కువగా నదులపై కట్టిన ఆనకట్టల ద్వారా, సరస్సులు, సాగునీటి చెరువుల ద్వారా జరుగేదిది. కోయంబత్తూరు జిల్లాలో వ్యవసాయానికి ప్రధాన నీటి వనరు చెరువులు.[98]

1884 లో ఆమోదించిన భూ అభివృద్ధి, వ్యవసాయ రుణాల చట్టం బావుల నిర్మాణానికి నిధులు సమకూర్చింది.[100] 20 వ శతాబ్దం ప్రారంభంలో, మద్రాసు ప్రభుత్వం ఎలక్ట్రిక్ పంపులతో బోర్‌హోల్స్‌ను చేయడానికి, పంపింగ్ బోరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది.[97] మెట్టూర్ ఆనకట్ట,[101] పెరియార్ ప్రాజెక్టు, కర్నూలు-కడప కాలువ, రుషికుల్య ప్రాజెక్టు మద్రాసు ప్రభుత్వం ప్రారంభించిన అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు. 1934 లో మద్రాసు-మైసూర్ సరిహద్దులోని హోగెనక్కల్ జలపాతం క్రింద నిర్మించిన మెట్టూరు ఆనకట్ట ప్రెసిడెన్సీ లోని పశ్చిమ జిల్లాలకు నీటిని సరఫరా చేసింది. పెరియార్ ఆనకట్ట (ప్రస్తుతం ముళ్ళపెరియార్ ఆనకట్ట అని పిలుస్తారు) సరిహద్దుకు సమీపంలో ట్రావెన్కోర్లోని పెరియార్ నదిపై నిర్మించారు.[102] ఈ ప్రాజెక్టు పశ్చిమ కనుమలకు తూర్పున ఉన్న శుష్క భూములకు సాగునీరు ఇవ్వడానికి పెరియార్ నది నీటిని వైగై నది పరీవాహక ప్రాంతానికి మళ్లించింది. అదే విధంగా, గంజాం లోని రుషికుల్య నది నీటిని ఉపయోగించుకునేందుకు రుషికుల్య ప్రాజెక్టును ప్రారంభించారు.[103] ఈ పథకం కింద 1,42,000 ఎకరాలకు పైగా భూమిని నీటిపారుదల కిందకు తీసుకువచ్చారు. బ్రిటిషువారు నీటిపారుదల కొరకు అనేక ఆనకట్టలు, కాలువలను నిర్మించారు. శ్రీరంగం ద్వీపానికి సమీపంలో కొల్లిడమ్ నదికి ఎగువ ఆనకట్ట నిర్మించబడింది.[104] గోదావరి నదికి అడ్డంగా ఉన్న ధవళేశ్వరం ఆనకట్ట, వైనతేయ గోదావరిపై గన్నవరం ఎక్విడెక్టు,[92] కృష్ణ బ్యారేజీ బ్రిటిష్ వారు చేపట్టిన ప్రధాన నీటిపారుదల పనులకు ఉదాహరణలు. 1946–47లో, నీటిపారుదల కింద ఉన్న మొత్తం వైశాల్యం 97.36 లక్షల ఎకరాలు. మూలధన వ్యయంపై 6.94% రాబడిని ఇచ్చాయి.[105]

రవాణా, కమ్యూనికేషన్ మార్చు

 
మద్రాసు, దక్షిణ మరాఠా రైల్వే లైన్ల మ్యాప్

ఏజెన్సీ ఏర్పడిన తొలి రోజుల్లో, రవాణా సాధనాలంటే ఎద్దు బళ్ళు, పల్లకీలు మాత్రమే.[106] మద్రాసు నుండి ఉత్తరాన కలకత్తాను, దక్షిణాన ట్రావెన్కోర్ రాజ్యాన్నీ కలిపే రహదారులు యుద్ధాల సమయంలో సమాచార మార్గంగా పనిచేశాయి. 20 వ శతాబ్దం ఆరంభం నుండి, ఎద్దుల బండ్లు, గుర్రాల స్థానంలో క్రమంగా సైకిళ్ళు, మోటారు వాహనాలలు వచ్చి చేరాయి. అయితే మోటారు బస్సులు ప్రైవేటు రవాణాకు ప్రధాన మార్గంగా ఉన్నాయి.[107] ప్రెసిడెన్సీ ట్రాన్స్‌పోర్ట్, సిటీ మోటార్ సర్వీస్ సంస్థలు 1910 లోనే సింప్సన్ అండ్ కో తయారు చేసిన బస్సులు నడిపేవారు. మద్రాసు నగరంలో మొట్టమొదటి బస్సు రవాణా వ్యవస్థను 1925 - 1928 మధ్య మద్రాసు ట్రామ్‌వేస్ కార్పొరేషన్ నిర్వహించింది. 1939 మోటారు వాహనాల చట్టం ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సు, మోటారు సేవలకు ఆంక్షలు విధించింది. తొలినాళ్ళలో బస్సు సర్వీసులను ఎక్కువగా ప్రైవేట్ ఏజెన్సీలే నడిపేవి.

 
నీలగిరి మౌంటైన్ రైల్వే, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
 
పంబన్ ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే పంబన్ రైల్వే వంతెనను 1914 లో నిర్మించారు
 
మలబార్‌లోని బ్యాక్‌వాటర్, కాలువ, సి. 1913

ప్రెసిడెన్సీలో కొత్త రహదారుల నిర్మాణానికి, పాతవాటి నిర్వహణ కోసం మొదటి వ్యవస్థీకృత చర్య 1845 లో ప్రధాన రహదారుల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించడంతో ప్రారంభమైంది.[108] మద్రాసు-బెంగళూరు రహదారి, మద్రాసు-త్రిచినోపోలీ రహదారి, మద్రాసు-కలకత్తా రహదారి, మద్రాసు-కడప రహదారి, సంపాజీ ఘాట్ రహదారి ఈ అధికారి ఆధ్వర్యంలో ఉన్నాయి. 1852 లో లార్డ్ డల్హౌసీ ఒక పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటును ప్రారంభించాడు. తరువాత 1855 లో నావిగేషన్ కొరకు ఈస్ట్ కోస్ట్ కాలువను నిర్మించారు. రహదారులను గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడి నియంత్రణలో ఉన్న పబ్లిక్ వర్క్స్ సెక్రటేరియట్ నిర్వహించేది. ప్రెసిడెన్సీ యొక్క ప్రధాన రహదారులు మద్రాసు-కలకత్తా రహదారి, మద్రాసు-ట్రావెన్కోర్ రహదారి, మద్రాసు-కాలికట్ రహదారి.[109] 1946–47 నాటికి మద్రాసు ప్రెసిడెన్సీలో, 26,201 miles (42,166 km) తారు రోడ్లు, 14,406 miles (23,184 km) మట్టి రోడ్లు, 1,403 miles (2,258 km) నౌకాయాన కాలువలూ ఉండేవి.[105]

దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం మద్రాసు, ఆర్కాట్‌ల మధ్య వేసారు. దీన్ని 1856 జూలై 1 న ప్రారంభించారు.[110] ఈ మార్గాన్ని మద్రాసు రైల్వే కంపెనీ 1845 లో ఏర్పాటు చేసింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ను రాయపురం వద్ద 1853 లో నిర్మించారు. ఇది మద్రాసు రైల్వే కంపెనీ ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. 1853 లో గ్రేట్ సదరన్ ఇండియన్ రైల్వే కంపెనీని యునైటెడ్ కింగ్‌డమ్‌లో స్థాపించారు. దాని ప్రధాన కార్యాలయం ట్రిచినోపోలీలో ఉండేది. ఈ సంస్థ 1859 లో ట్రిచినోపోలీ, నాగపటం మధ్య మొదటి రైల్వే మార్గాన్ని నిర్మించింది. మద్రాసు రైల్వే కంపెనీ బ్రాడ్-గేజ్ రైల్వే లైన్లను నడుపుతుండగా, గ్రేట్ సౌత్ ఇండియన్ రైల్వే కంపెనీ మీటర్-గేజ్ రైల్వే లైన్లను నడిపింది.[111] 1874 లో, ది గ్రేట్ సదరన్ ఇండియన్ రైల్వే కంపెనీ కర్ణాటిక్ రైల్వే కంపెనీతో (దీన్ని 1864 లో స్థాపించారు) విలీనం అయ్యింది. దీన్ని దక్షిణ భారత రైల్వే కంపెనీగా పేరు మార్చారు.[112] దక్షిణ భారత రైల్వే కంపెనీ 1891 లో పాండిచేరి రైల్వే కంపెనీలో విలీనం కాగా, మద్రాసు రైల్వే కంపెనీ 1908 లో దక్షిణ మరాఠా రైల్వే కంపెనీతో విలీనం అయ్యి మద్రాసు దక్షిణ మరాఠా రైల్వే కంపెనీగా ఏర్పాటైంది. మద్రాసు దక్షిణ మరాఠా రైల్వే కంపెనీ కోసం ఎగ్మోర్ వద్ద కొత్త టెర్మినస్‌ను నిర్మించారు. 1927 లో, దక్షిణ భారత రైల్వే కంపెనీ తన ప్రధాన కార్యాలయాన్ని మదురై నుండి చెన్నై సెంట్రల్కు మార్చింది. ఈ సంస్థ 1931 మే నుండి మద్రాసు నగరానికి సబర్బన్ ఎలక్ట్రిక్ రైలు సేవను నిర్వహించింది. 1944 ఏప్రిల్ లో మద్రాసు, దక్షిణ మరాఠా రైల్వే కంపెనీని మద్రాసు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1947 లో ప్రెసిడెన్సీలో 7,984 కిలోమీటర్ల రైల్వే లైను ఉండేది. 219 కిలోమీటర్ల జిల్లా బోర్డు లైన్లు కూడా ఉండేవి.[105] మద్రాసుకు బొంబాయి కలకత్తా వంటి ఇతర భారతీయ నగరాలతోటీ, సిలోన్‌తోటీ బాగా సంబంధాలుండేవి.[113] 6,776-foot (2,065 m) భారత ప్రధాన భూభాగంలోని మండపాన్ని పంబన్ ద్వీపంతో కలిపే 2,065 మీటర్ల పంబన్ రైల్వే వంతెనను 1914 లో ప్రారంభించారు.[114] నీలగిరి పర్వత రైల్వేను 1899 లో మెట్టుపాళయం ఊటకమండ్ మధ్య ప్రారంభించారు.

మద్రాసు ట్రామ్‌వేస్ కార్పొరేషన్‌ను మద్రాసు నగరంలో 1892 లో హచిన్సన్స్ అండ్ కో ఏర్పాటు చేసింది. 1895 లో ఇది పనిచేయడం ప్రారంభించింది. అప్పటికి లండన్‌లో కూడా ట్రామ్‌వే వ్యవస్థ లేదు.[107] మద్రాసు నగరంలోని సుదూర ప్రాంతాలను కలుపుతూ ఆరు మార్గాలతో మొత్తం 27 కిలోమీటర్ల ట్రామ్‌వేను నిర్మించారు.

ప్రెసిడెన్సీలో ప్రధాన నౌకాయాన జలమార్గాలు గోదావరి, కృష్ణా డెల్టాల్లోని కాలువలు.[109] బకింగ్‌హామ్ కాలువను 1806 లో 90 లక్షల వ్యయంతో తవ్వారు.[115] పెద్దగంజాం వద్ద కృష్ణా నది డెల్టాను మద్రాసు నగరానికి కలుపుతుంది. బ్రిటిషుఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ ఓడలు తరచూ మద్రాసు వద్ద చేరుకుంటూ ఉండేవి. బొంబాయి, కలకత్తా, కొలంబో, రంగూన్లకు తరచూ ప్రయాణిస్తూండేవి.

1917 లో, సింప్సన్ అండ్ కో. మద్రాసులోని మొదటి వైమానిక పరీక్షా యానానికి ఏర్పాట్లు చేసింది.[116] 1929 అక్టోబరులో సెయింట్ థామస్ మౌంట్ సమీపంలోని మౌంట్ గోల్ఫ్ క్లబ్ మైదానంలో ఫ్లయింగ్ క్లబ్‌ను జి. వ్లాస్టో అనే పైలట్ స్థాపించాడు.[117] ఈ స్థలాన్నే తరువాత మద్రాసు ఏరోడ్రోమ్‌గా ఉపయోగించారు. క్లబ్ ప్రారంభ సభ్యులలో ఒకరైన రాజా సర్ అన్నామలై చెట్టియార్ తన స్వస్థలమైన చెట్టినాడ్‌లో ఏరోడ్రోమ్‌ను స్థాపించారు. 1932 అక్టోబరు 15 న, రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ నెవిల్ విన్సెంట్ పైలట్‌గా, JRD టాటా విమానం బొంబాయి నుండి మద్రాసుకు బళ్లారి మీదుగా ఎయిర్ మెయిల్ తీసుకెళ్లింది.[118] కరాచీ నుండి మద్రాసు వరకు టాటా సన్స్ యొక్క సాధారణ దేశీయ ప్రయాణీకుల, ఎయిర్ మెయిల్ సేవలకు ఇది తొలి అడుగైంది. ఈ విమానాన్ని తరువాత హైదరాబాద్ మీదుగా నడిపించారు. వారానికి రెండు సార్లు నడిచేది. 1935 నవంబరు 26 న, టాటా సన్స్ బొంబాయి నుండి గోవా, కన్ననూర్ మీదుగా త్రివేండ్రం వరకు ఒక ప్రయోగాత్మక వారపు సేవను ప్రారంభించారు. 1938 ఫిబ్రవరి 28 నుండి, టాటా ఎయిర్లైన్స్ గా పేరు మార్చుకున్న టాటా సన్స్ ఏవియేషన్ విభాగం, మద్రాసు, ట్రిచినోపోలీ ల మీదుగా కరాచీ - కొలంబో ఎయిర్ మెయిల్ సేవలను ప్రారంభించింది. 1938 మార్చి 2 న, బొంబాయి-త్రివేండ్రం వైమానిక సేవను ట్రిచినోపోలీకి విస్తరించారు.

మొట్టమొదటి వ్యవస్థీకృత తపాలా సేవను మద్రాసు, కలకత్తాల మధ్య గవర్నర్ ఎడ్వర్డ్ హారిసన్ 1712 లో స్థాపించాడు. సంస్కరణ, క్రమబద్ధీకరణల తరువాత, సర్ ఆర్చిబాల్డ్ కాంప్‌బెల్ కొత్త పోస్టల్ వ్యవస్థను ప్రారంభించాడు. 1786 జూన్ 1 న ఈ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ప్రెసిడెన్సీని మూడు పోస్టల్ డివిజన్లుగా విభజించారు: మద్రాసు నార్త్ నుండి గంజాం వరకు ఒక డివిజను, మద్రాసు సౌత్-వెస్ట్ నుండి అంజెంగో (పూర్వ ట్రావెన్కోర్) వరకు మరో డివిజను, మద్రాసు వెస్ట్ నుండి వెల్లూరు వరకు మూడవ డివిజనుగా ఉండేవి. అదే సంవత్సరంలో బొంబాయితో ఒక లింక్ ఏర్పడింది. 1837 లో మద్రాసు, బొంబాయి, కలకత్తా మెయిల్ సేవలను ఏకీకరించి, అఖిల భారత సేవను ఏర్పాటు చేశారు. 1854 అక్టోబరు 1 న, ఇంపీరియల్ పోస్టల్ సర్వీస్ మొదటి స్టాంపులను జారీ చేసింది. 1786 లో సర్ ఆర్చిబాల్డ్ కాంప్బెల్ మద్రాసులోని జనరల్ పోస్ట్ ఆఫీస్ (జిపిఓ) ను స్థాపించాడు. 1872–73లో, మద్రాసు, రంగూన్ మధ్య రెణ్ణెల్లకోసారి సముద్ర-మెయిల్ సేవ ప్రారంభమైంది. దీని తరువాత, మద్రాసుకూ తూర్పు తీరం లోని ఓడరేవులకూ మధ్య పక్షం రోజుల కోసారి నడిచే సముద్ర-మెయిల్ సేవ ప్రారంభమైంది.

1853 లో టెలిగ్రాఫ్‌ల ద్వారా మద్రాసును మిగతా ప్రపంచానికి అనుసంధానించారు. 1855 ఫిబ్రవరి 1 న పౌర టెలిగ్రాఫ్ సేవను ప్రవేశపెట్టారు. వెంటనే, టెలిగ్రాఫ్ లైన్లు మద్రాసు - ఊటకమండ్‌లను భారతదేశంలోని ఇతర నగరాలతో అనుసంధానించాయి. 1854 లో మద్రాసు నగరంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో ఒక టెలిగ్రాఫ్ విభాగాన్ని ఏర్పాటు చేసారు. కొలంబో - తలైమన్నార్ టెలిగ్రాఫ్ లైన్ 1858 లో స్థాపించబడింది. తరువాత దాన్ని 1882 లో మద్రాసు వరకు విస్తరించారు.[119] 1881 లో ప్రెసిడెన్సీలో టెలిఫోన్లు ప్రవేశపెట్టారు. 1881 నవంబరు 19 న మద్రాసులోని ఎర్రబాలు వీధిలో 17 కనెక్షన్లతో మొదటి టెలిఫోన్ ఎక్స్‌ఛేంజిని స్థాపించారు.[120] 1920 లో మద్రాసు, పోర్ట్ బ్లెయిర్‌ల మధ్య వైర్‌లెస్ టెలిగ్రాఫీ సేవ ఏర్పాటు చేసారు. 1936 లో, మద్రాసు, రంగూన్‌ల మధ్య ఇండో-బర్మా రేడియో టెలిఫోన్ సేవను ఏర్పాటు చేసారు.

విద్య మార్చు

ప్రెసిడెన్సీలో పాశ్చాత్య తరహా విద్యను అందించే మొదటి పాఠశాలలు 18 వ శతాబ్దంలో మద్రాసులో స్థాపించారు.[121] 1822 లో, సర్ థామస్ మన్రో సిఫారసుల ఆధారంగా ఒక ప్రభుత్వ బోధనా మండలిను ఏర్పాటు చేసారు. ఆ తరువాత విద్యార్థులకు మాతృభాషలో బోధించే పాఠశాలలను స్థాపించారు.[122] మన్రో పథకం ప్రకారం మద్రాసులో కేంద్ర శిక్షణా పాఠశాలను ఏర్పాటు చేసారు. అయితే, ఈ వ్యవస్థ విఫలమైనట్లు కనిపించింది. యూరోపియన్ సాహిత్యాన్నీ విజ్ఞాన శాస్త్రాన్నీ ప్రోత్సహించడానికి 1836 లో ఈ విధానాన్ని మార్చారు. బోర్డ్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్‌ను మూసివేస్తూ దాని స్థానంలో స్థానిక విద్య కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసారు.[123] 1840 జనవరి లో, లార్డ్ ఎల్లెన్‌బరో వైస్రాయల్టీ సమయంలో, అలెగ్జాండర్ జె. అర్బత్‌నాట్ జాయింట్ డైరెక్టర్‌గా విశ్వవిద్యాలయ బోర్డును స్థాపించారు.[124] 1841 ఏప్రిల్‌లో 67 మంది విద్యార్థులున సెంట్రల్ స్కూల్‌ను ఉన్నత పాఠశాలగా మార్చారు. 1853 లో దీనిలో కళాశాల విభాగాన్ని చేర్చడంతో ప్రెసిడెన్సీ కళాశాలగా మారింది. 1857 సెప్టెంబరు 5 న లండన్ విశ్వవిద్యాలయం పద్ధతి లోనే పరీక్షల నిర్వహణ బాధ్యతలతో మద్రాసు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. సిలోన్‌కు చెందిన సిడబ్ల్యు థామోథరం పిళ్ళై, కరోల్ వి. విశ్వనాథ పిళ్ళైలు ఈ విశ్వవిద్యాలయం నుండి తొలి పట్టభద్రులయ్యారు. సర్ ఎస్. సుబ్రమణయ్య అయ్యర్ విశ్వవిద్యాలయం యొక్క మొదటి భారతీయ వైస్-ఛాన్సలర్.

అదేవిధంగా, 1925 నాటి ఆంధ్ర విశ్వవిద్యాలయ చట్టం ద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు [125] 1937 లో ట్రావెన్కోర్ సంస్థానంలో ట్రావెన్కోర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.[126]

1867 లో కుంబకోణంలో స్థాపించిన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, మద్రాసు వెలుపల ఏర్పాతు చేసిన తొలి విద్యా సంస్థలలో ఒకటి.[127] ప్రెసిడెన్సీలోని పురాతన ఇంజనీరింగ్ కళాశాల, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గిండి, 1861 లో ఇంజనీరింగ్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేసారు. అంతకు ముందు, 1794 లో, దాన్ని ప్రభుత్వ సర్వే పాఠశాలగా స్థాపించారు.[128] ప్రారంభంలో, సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే బోధించేవారు. 1894 లో మెకానికల్ ఇంజనీరింగ్, 1930 లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 1945 లో టెలికమ్యూనికేషన్ అండ్ హైవేస్ విభాగాలను కూడా చేర్చారు.[129] వస్త్రాలు, తోలు సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యతనిచ్చే AC కాలేజీని 1944 లో అలగప్ప చెట్టియార్ స్థాపించారు.[130] ఏరోనాటికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులను ప్రవేశపెట్టిన మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని 1949 లో స్థాపించారు. 1827 లో, ప్రెసిడెన్సీలో మొట్టమొదటి వైద్య పాఠశాలను స్థాపించారు. తరువాత 1835 లో మద్రాసు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసారు.[131] ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాల 1856 లో సైదాపేటలో స్థాపించారు.[132]

ప్రైవేట్ సంస్థలలో, 1842 లో స్థాపించిన పచయ్యప్ప కళాశాల, ప్రెసిడెన్సీలోకెల్లా అత్యంత పురాతన హిందూ విద్యా సంస్థ. 1929 లో చిదంబరంలో రాజా సర్ అన్నామలై చెట్టియార్ స్థాపించిన అన్నామలై విశ్వవిద్యాలయం, ప్రెసిడెన్సీలో హాస్టల్ సౌకర్యాలు కలిగిన మొట్ట మొదటి విశ్వవిద్యాలయం [133] క్రైస్తవ మిషనరీలు ఈ ప్రాంతంలో విద్యను ప్రోత్సహించడంలో మార్గదర్శకులు. మద్రాసు క్రిస్టియన్ కళాశాల, మంగుళూరులోని సెయింట్ అలోసియస్ కళాశాల, మద్రాసులోని లయోలా కళాశాల, తంజావూరులోని సెయింట్ పీటర్స్ కళాశాలలు క్రైస్తవ మిషనరీలు స్థాపించిన కొన్ని విద్యాసంస్థలు.

బ్రిటిష్ ఇండియాలోని అన్ని ప్రావిన్సులన్నిటి లోకీ మద్రాసు ప్రెసిడెన్సీలో అత్యధిక అక్షరాస్యత ఉండేది.[134] 1901 లో మద్రాసులో పురుషుల అక్షరాస్యత రేటు 11.9 శాతం, మహిళా అక్షరాస్యత రేటు 0.9 శాతం.[135] 1950 లో మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారినప్పుడు, అక్షరాస్యత రేటు జాతీయ సగటైన 18 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉండేది.[136] 1901 లో, 9,23,760 మంది పండితులు, 26,771 ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలూ ఉండేవి. వారిలో 784,621 మంది పురుషులు, 139,139 మంది మహిళలూ ఉన్నారు.[137] 1947 నాటికి విద్యా సంస్థల సంఖ్య 37,811 కు, పండితుల సంఖ్య 3,989,686 కూ పెరిగింది.[65] కళాశాలలే కాకుండా, 1947 లో 31,975 ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలలు, బాలుర కోసం 720 మాధ్యమిక పాఠశాలలు, బాలికలకు 4,173 ప్రాథమిక, 181 మాధ్యమిక పాఠశాలలూ ఉన్నాయి. తొలినాళ్ళలో గ్రాడ్యుయేట్లలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండేవారు.[34][138] విశ్వవిద్యాలయాలలో, పౌర పరిపాలనలో బ్రాహ్మణుల ప్రాముఖ్యత, ప్రెసిడెన్సీలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి. బ్రిటిషుఇండియాలో కులాధారిత రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రావిన్సు మద్రాసే.

1923 లో, విద్యా మంత్రి ఎ పి పాత్రో ప్రవేశపెట్టిన మద్రాసు విశ్వవిద్యాలయ బిల్లును సభ ఆమోదించింది.[125] బిల్లు నిబంధనల ప్రకారం, మద్రాసు విశ్వవిద్యాలయ పాలకమండలిని పూర్తిగా ప్రజాస్వామ్య పరంగా పునర్వ్యవస్థీకరించారు. పాలకమండలి ఒక ఛాన్సలర్ నేతృత్వంలో ఉంటుందని, వారికి ప్రో ఛాన్సలర్ సహాయపడాతారనీ బిల్లు పేర్కొంది. ఎన్నుకోబడిన ఛాన్సలర్, ప్రో ఛాన్సలర్‌లు కాకుండా, ఛాన్సలర్ నియమించిన వైస్-ఛాన్సలర్ కూడా ఉంటారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Iyengar 1929, p. 535
  2. "They administered our region HERITAGE". The Hindu. 4 June 2007. Archived from the original on 7 April 2014. Retrieved 6 April 2014.
  3. Thurston 1913, pp. 138–142.
  4. Hunter, 1908, p. 6
  5. Wheeler 1996, p. 5
  6. Wheeler 1996, p. 6
  7. Wheeler 1996, p. 7
  8. Wheeler 1996, p. 19
  9. 9.0 9.1 Wheeler 1996, p. 26
  10. Roy 2012, p. 74
  11. Chaudhuri 2006, p. 206
  12. Thorpe 2011, p. 94
  13. Newell 1919, p. 18
  14. Wheeler 1996, p. 281
  15. Wheeler 1996, p. 282
  16. India Office List 1905, p. 121
  17. Sohail, Sara (10 May 2019). "The Etymology of Madras". Madras Courier.
  18. Hunter 1908, p. 251
  19. Kulke 2004, p. 245
  20. Hunter 1908, p. 252
  21. Codrington 1926, Chapter X:Transition to British administration
  22. Hunter 1908, p. 254
  23. Hunter 1908, p. 255
  24. Read 1997, pp. 34–37
  25. Dodd 1859, p. 288
  26. Kamath 1980, p. 250
  27. Kamath 1980, pp. 250–253
  28. Hibbert 2000, p. 221
  29. Sadasivan 1974, p. 22
  30. Sadasivan 1974, p. 40
  31. Sadasivan 1974, p. 54
  32. Sadasivan 1974, p. 55
  33. Muthiah 2004, p. 418
  34. 34.0 34.1 Frykenberg, Robert Eric (1968). Elite Formation in Nineteenth Century South India, Proceedings of the First International Conference on Tamil Culture and History. Kuala Lumpur: University of Malaysia Press.
  35. S.A. 1969, p. 14
  36. Tercentenary Madras Staff 1939, p. 223
  37. Pramanand 1985
  38. Dutt 1999, p. 10
  39. S., Muthiah (13 September 2003). "Willing to strike and not reluctant to wound". The Hindu. Chennai, India. Archived from the original on 7 November 2012. Retrieved 17 November 2012.
  40. Ralhan 2002, p. 179
  41. Ralhan 2002, p. 180
  42. Ralhan 2002, p. 182
  43. Ralhan 2002, p. 190
  44. Ralhan 2002, p. 196
  45. Ralhan 2002, p. 197
  46. 46.0 46.1 Ralhan 2002, p. 199
  47. W.B. 2005, pp. 3–8
  48. 48.0 48.1 Thurston 1909, p. 116
  49. Bhakshi 1991, p. 149
  50. Kumar, P. C. Vinoj (10 September 2003). "Anti-Hindi sentiments still alive in TN". Sify News.
  51. Ramaswamy 1997, Chapter 4
  52. P. 2001, pp. 42–44
  53. W.B. 2005, p. 109
  54. Walch 1976, pp. 157–160
  55. The Illustrated Weekly of India (in ఇంగ్లీష్). Published for the proprietors, Bennett, Coleman & Company, Limited, at the Times of India Press. 1975. Archived from the original on 19 September 2017.
  56. Kumar 1965, p. 120-121
  57. MaClean 1877, p. 327
  58. Hunter, Volume 16, p. 256
  59. Steinberg 1950, p. 137
  60. Thurston 1913, p. 120
  61. Thurston 1913, p. 121
  62. Mollin 2006, p. 17
  63. MaClean 1877, p. 6
  64. Hunter 1908, p. 260
  65. 65.0 65.1 Steinberg 1950, p. 174
  66. Steinberg 1950, p. 141
  67. MaClean 1877, p. 337
  68. T. 1765, p. 110
  69. Thurston 1913, p. 137
  70. Pirie 1883, p. 110
  71. Smith 1976, p. 42
  72. Ralhan 2002, p. 73
  73. Wheeler 1996, p. 198
  74. Major MacMunn 1911, p. 4
  75. Major MacMunn 1911, p. 7
  76. Major MacMunn 1911, p. 20
  77. Major MacMunn 1911, p. 21
  78. Major MacMunn 1911, p. 14
  79. Major MacMunn 1911, p. 15
  80. Major MacMunn 1911, p. 57
  81. Major MacMunn 1911, p. 123
  82. Major MacMunn 1911, p. 126
  83. The Sepoy and the Raj: The Indian Army, 1860-1940, Page:16
  84. MaClean 1877, p. 92
  85. MaClean 1877, p. 93
  86. MaClean 1877, p. 94
  87. Ahmed 2011 pp. 392–4
  88. Rai 2011, p. 91
  89. Thangaraj 2003, p. 287
  90. Patnaik 1997, p. 330
  91. Thurston 1913, p. 193
  92. 92.0 92.1 Hunter 1908, p. 276
  93. Thurston 1913, p. 194
  94. Thurston 1913, p. 195
  95. Thurston 1913, p. 196
  96. Thurston 1913, p. 197
  97. 97.0 97.1 Thurston 1913, p. 199
  98. 98.0 98.1 Thurston 1913, p. 200
  99. Hunter 1908, p. 274
  100. Hunter 1908, p. 278
  101. Gough 2008, p. 130
  102. Thurston 1913, p. 203
  103. Thurston 1913, p. 205
  104. Thurston 1913, p. 206
  105. 105.0 105.1 105.2 Steinberg 1950, p. 175
  106. Thurston 1913, p. 185
  107. 107.0 107.1 Muthiah 2004, p. 323
  108. Mill 1996, p. 134
  109. 109.0 109.1 Hunter 1908, p. 303
  110. Muthiah 2004, p. 321
  111. Hunter 1908, p. 301
  112. Muthiah 2004, p. 322
  113. Christophers 1927, p. 14
  114. Srinivasan, T. A. (8 July 2005). "Swept off its feet, literally". The Hindu: Entertainment Chennai. Archived from the original on 24 October 2008. Retrieved 17 November 2012.
  115. Hunter 1908, p. 304
  116. "Historical Events at a Glance". District Collectorate, Chennai. Archived from the original on 15 ఏప్రిల్ 2012. Retrieved 17 November 2012.
  117. Muthiah 2004, p. 127
  118. "History 1932–1940". Air India. Archived from the original on 9 జూన్ 2010. Retrieved 17 November 2012.
  119. Wright 1999, p. 207
  120. Muthiah 2004, p. 54
  121. Hunter 1908, p. 383
  122. Hunter 1908, p. 338
  123. Hunter 1908, p. 339
  124. Jebaraj, Priscilla (5 September 2008). "Ongoing saga of higher learning". The Hindu. Chennai, India. Archived from the original on 9 November 2012. Retrieved 17 November 2012.
  125. 125.0 125.1 Ralhan 2002, p. 74
  126. "University of Kerala Home page". University of Kerala. Archived from the original on 11 జూన్ 2010. Retrieved 17 November 2012.
  127. Craik 2007, p. 260
  128. Muthiah 2004, p. 239
  129. Muthiah 2004, p. 240
  130. Muthiah 2004, p. 241
  131. Christophers 1927, p. 41
  132. Hunter 1908, p. 343
  133. "About University". Annamalai University. Archived from the original on 25 నవంబరు 2012. Retrieved 17 November 2012.
  134. Seal 1971, p. 103
  135. Hunter 1908, p. 345
  136. K. Mehrotra 2006, p. 23
  137. Hunter 1908, p. 361
  138. Slater 1918, p. 168