మన్యంకొండ మహబూబ్ నగర్ పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. పేదల తిరుపతిగా పేరొందింది.[1] మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మార్గం నుండి 4 కిమీ లోపలికి ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోనే ఒక పుణ్యక్షేత్రమైన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఉంది. పాలమూరు తిరుపతిగా బాసిల్లుచున్న మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఎత్తయిన కొండపై, ప్రశాంత వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నాడు. మన్యంకొండ అనగా మునులు తపస్సు చేసుకునే కొండ అని అర్థం, వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సి చేసినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దేవస్థానం తెలంగాణ దేవాదాయ శాఖ అధీనంలో ఉంది.

చరిత్ర మార్చు

కేశవయ్య అనే మునికి వెంకటేశ్వరస్వామి కలలో కనిపించి మన్యంకొండ గుహలో తాను వెలిసి ఉన్నానని, నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటూ అంతర్థానం అయ్యారని స్థలపురాణం తెలుపుతుంది. ఆ మరుసటి రోజు కేశవయ్య మన్యంకొండను ప్రచారంలోకి తెచ్చాడు. ఆ తరువాత చాలా సంవత్సరాలకు ఎత్తయిన కొండపై ఘాట్‌రోడ్ నిర్మించి ప్రస్తుత స్థితిలోకి తీసుకువచ్చినవాడు అలహరి రామయ్య.[2] కోనేరు, మంచినీటి బావిని కూడా నిర్మించాడు. ప్రారంభంలో మునులు తపస్సు చేసే స్థలం కాబట్టి మునులకొండగా పిలువబడిననూ కాలక్రమేణా పేరు మన్యంకొండగా స్థిరపడింది.

రెండవ తిరుపతి మార్చు

మన్యంకొండ దేవస్థానానం రెండవ తిరుపతిగా పేరుగాంచింది. 'తీరితే తిరుపతి, తీరకుంటే మన్యంకొండ అన్నట్లు' పాలమూరు పేదలు దూరాన ఉన్న తిరుపతికి వెళ్ళలేనివారు, తీరికలేనివారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో గుట్టపైకి బస్సులు వెళ్తాయి. మామూలు రోజులలో రాయచూరు ప్రధాన రహదారిపై దిగి అక్కడి నుంచి ప్రవేటు వాహనాలను ఆశ్రయించవలసి ఉంటుంది. ఇటీవల కొండపైకి వెళ్ళడానికి ఉన్న ఘాట్‌రోడ్డును డబుల్ రోడ్డుగా మలిచారు.

దేవస్థానం ప్రత్రేకతలు
  • జిల్లాలో అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయాలలో రెండవస్థానం
  • తిరుమల వలె ఎత్తయిన కొండపై స్వామి వెలిశాడు. (మూడూ కొండలు)
  • త్రవ్వని కోనేరు
  • దేవుని పాదాలు
  • ఉలి ముట్టని దేవుడు..

మూలాలు మార్చు

  1. "ఆంధ్రప్రభ దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 25.01.2010". Archived from the original on 2010-09-06. Retrieved 2010-09-04.
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 04.02.2009