మెదక్ కోట తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లాలో ఉంది. ఇది రాష్ట్ర ముఖ్య పట్టనమైన హైదరాబాదు నగరానికి 100 కి.మీ దూరంలో ఉంటుంది.[1] మెదక్ నగరానికి ఉత్తరాన మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై 400 ఎకరాల్లో విస్తరించింది మెదక్ కోట

విశేషాలు మార్చు

ఈ కోట నగరానికి వైపు ఉంది. ఈ కోటకు రోడ్డు, రైలు మార్గాలున్నవి. ఇది ప్రాచీన భారతదేశంలోని కాకతీయుల కాలంనాడు కొండపై నిర్మించిన దుర్గం.నేషనల్ హైవే 44 కి దగ్గరగా, హైదరాబాద్ నుండి వస్తున్నప్పుడు చేగుంట అనే చిన్న పట్టణం నుండి మలుపు తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే పై వైపు నుండి ( ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వైపుగా వస్తే - రామాయంపేట నుండి మలుపు తీసుకొని 25 కి.మీ. రావాల్సి ఉంటుంది. ముంబై దారి మీదుగా వస్తే సంగారెడ్డి వద్ద నాందేడ్, అకోలా హైవే మీదుగా వచ్చి, జోగిపేట వద్ద మలుపు తీసుకొని 35 km. రావాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ లోని బాలానగర్ వద్ద నుండి వస్తే 80 km. - నర్సాపూర్, గుమ్మడిదల, కౌడిపల్లి, పోతాన్ చెట్టిపల్లి, రాంపూర్, మంబోజిపల్లి మీదుగా రావాల్సి ఉంటుంది )

ఈ కోట సుమారు 12 వ శతాబ్దం నాటిది. ఈ కోటను కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు కాలంలో నిర్మించారని ప్రతీతి. ప్రతాపరుద్రుడు ఈ దుర్గాన్ని మెతుకు దుర్గంగా పిలిచేవాడు. కాకతీయ సామ్రాజ్యానంతరం ఇది కుతుబ్ షాహీల అధీనంలోనికి వచ్చింది. ఈ కోట తెలంగాణలో ముఖ్యమైన చారిత్రాత్మక నిర్మాణం. ఈ కోటలో 17 వ శతాబ్దంలో కుతుబ్ షాహీలచే మస్జిద్ నిర్మించబడింది. అచట ధాన్యాగారాలు, శిథిలమైన గృహాలు కనిపిస్తాయి.[2]

ఈ కోటలో మూడు ముఖద్వారాలు ఉన్నాయి. వాటిలో "ప్రధాన ద్వారం", సింహద్వారం (ఇందులో రెండు ఆగ్రహంగా ఉన్న సింహాల శిల్పాలు ద్వారం పైన ఉంటాయి), "గజ ద్వారం" (ఇందులో రెండు ఏనుగులు బొమ్మలు రెండువైపులా ఉంటాయి). ప్రధాన మార్గం కాకతీయుల యొక్క చిహ్నమైన రెండుతలల గంఢబేరుండంతో కూడుకుని ఉంటుంది. ఆ కోటలో స్థిరమైన పైకప్పుకు ఊతం అందించుటకు ఉపయోగించే కలప (టెర్మినాలియా పనికులాటా) ను ప్రస్తుతం కూడా మనం చూడవచ్చు.

కాకతీయ పాలకులకు, వారి తర్వాత చాలా కాలానికి రాజ్యం చేసిన కుతుబ్ షాహిలకు కూడా ఈ కోట నియంత్రణా కేంద్రంగా ఉండేది. కుతుబ్ షాహి పాలకులు ఈ కోట లోపల దాన్యాగారాల గదులతో కూడిన ఒక మసీదును 17వ శతాబ్ద౦లో నిర్మించారు. ఈ కోట చారిత్రిక పరంగానే కాక పురావస్తు పరంగా కూడా గుర్తించదగినది. స్థానిక ప్రజల హృదయాలలో ఇది ఒక గర్వించదగిన స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం ఈ కోటలో 17వ శతాబ్దానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన ఒక ఫిరంగి ఉంది. ఈ కోట నుండి పర్యాటకులు సుందర దృశ్యాలతో బాటుగా పూర్తి పట్టణాన్ని స్పష్టంగా చూడవచ్చు.

చరిత్ర మార్చు

దక్షిణాపథంపై ఖిల్జీలు తుగ్లక్కుల చీకటి నీడలు పడుతున్న వేళ కాకతీయ సామ్రాట్టు రెండో ప్రతాపరుద్రుడు తన రాజ్య రక్షణ కోసం నిర్మించిన కోట ఇది....ఈ కోట నిర్మాణానికి ఎంచుకున్న స్థలమే ఈ కోటను శత్రుదుర్భేద్యంగా మార్చేసింది. ఎత్తైన కొండ, చుట్టూ నలభై కిలోమీటర్ల వరకూ ఎలాంటి కదలికలున్నా పసిగట్టేందుకు బురుజులు, కోటకు ఎక్కడానికి వీల్లేనంత ఎత్తైన గోడలు, మలుపులు, మెలికలు తిరిగే కొండదారి కోటలో వారికి శత్రువు కనిపిస్తాడు కానీ శత్రువుకు కోటలో ఏముందో, ఎక్కడ సలసలకాగే నూనె నిండిన డేగిశా కుమ్మరించేందుకు ఎవరు పొంచి ఉన్నారో, ఏ బురుజు రంధ్రాల్లోంచి ఎవరు విషం పూసిన బాణాలను ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి.కోటలో పలు దిగుడు బావులు, జలాశయాలు, సొరంగ మార్గాలు కూడా నిర్మించారు. అంతేకాదు తాగు నీటి సరఫరాకోసం కుండ పెంకులతో పైప్‌లైన్లు కూడా ఉండేవట...కానీ అవి ఇప్పుడు కనుమరుగైపోయాయి.

అయితే 1203 నుంచే ఢిల్లీ సుల్తాన్ల దాడులూ దండయాత్రలూ ఆరంభమయ్యాయి..... కాకతీయుల తరువాత ఢిల్లీ సుల్తాన్లు, వారి తరువాత బహుమనీలు ఇలా మెదక్‌ కోట ఒక్కక్క రాజవంశం చేతులు మారుతూ వచ్చింది. 18వ శతాబ్దంలో ఈ కోట నైజాం నవాబుల ఏలుబడిలోకి వచ్చింది. సుల్తాన్ల ఏలుబడిలోనే ఈ కోటలో ఇస్లామిక్‌ శైలి కట్టడాల నిర్మాణం జరిగింది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. Medak Fort
  2. "Medak District in AP". Archived from the original on 2014-07-14. Retrieved 2014-10-04.

ఇతర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మెదక్_కోట&oldid=3898336" నుండి వెలికితీశారు