మైరావణుడు రావణుని మేనమామ, పాతాళలంక పాలకుడు. జానపద కథలనుసరించి మైరావణుడు మహా మాయావి. మైరావణునికి ఒక చెల్లెలు ఉండేది. ఆమెకు కుమారుడు జన్మించగానే జ్యోతిష్కులు అతడు పాతాళలంకకు రాజు అవుతాడని వైభవోపేతంగా పరిపాలన సాగిస్తాడని చెప్పారు. అది విన్న మైరావణుడు చెల్లెలిని, చెల్లెలి కుమారుడిని కారాగారంలో గొలుసులతో బంధించాడు. రామాయణంలో మైరావణుడు రామరావణ యుద్ధసమయంలో మాత్రమే కనిపిస్తాడు.

మైరావణుని వధించి రామలక్ష్మణులను తీసుకుపోతున్న హనుమ

రావణుడు మైరావణుని సహాయం కోరుట మార్చు

రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రాత్రివేళలలో రామలక్ష్మణులను వానర సైన్యాన్ని రాక్షసుల బారి నుంచి రక్షించాలని ఆంజనేయుడు తన వాలాన్ని ఒక ప్రాకారంగా చేసి తాను ద్వారపాలకుడుగా నిలబడ్డాడు. ఆప్రాకారంలో వానరసైన్యం, రామలక్ష్మణులు నిద్రిస్తూ ఉండేవారు. ఆ విషయం తెలుసుకున్న రావణుడు రాముణ్ణి జయించడం అసాధ్యమని భావించి, పాతా ళలంకకు వెళ్లి తన మేనమామ అయిన మైరావణుణ్ణి కలిసి ఇలా " మైరావణా! నువ్వు మాయావులలో శ్రేష్ఠుడివి. నీ సహాయంకోరి వచ్చాను. ఆంజనేయుడు వానర సైన్యం చుట్టూ తన తోకను ప్రాకారంగా నిర్మించి రామలక్ష్మ ణులను, వానరులను రక్షిస్తున్నాడు. ఈ ఒక్క రాత్రి గడిచిందంటే రాముడు నన్ను సంహరించక మానడు. అందువల్ల ఏ విధంగా నైనా సరే ఆంజనేయుణ్ణి మోసం చేసి రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకు రావాలి" అని కోరాడు. రావణుడంతటివాడు తన సహాయాన్ని ఆర్థించినందు కు మైరావణుడు చాలా సంతోషించి " రావణా ! ఈ నువ్వు కోరితే చేయగూడని కార్యమైనా సరే నిస్సంకోచంగా చేస్తాను. దాని వల్ల నాకు కీర్తి లభిస్తుంది. నువ్వు కోరిన చిన్న పనిని చేయలేనా " అని రావణుడికి ధైర్యం చెప్పి పంపాడు.

రామలక్ష్మణుల కొరకు మైరావణుడు అనుచరులను పంపుట మార్చు

రావణుడు వెళ్లిపోయిన తరువాత మైరావణుడు సూచీముఖుడనే (సూది వంటి ముఖం ఉన్నవాడు) రాక్షసుణ్ణి పిలిచి- లంకలో ఆంజనేయుడు తన తోకను ప్రాకారంగా చుట్టి, శత్రు నిర్భేద్యంగా చేసి వానర సైన్యాన్ని రక్షిస్తున్నాడు. ఆ ప్రాకారంలోకి ప్రవేశించడం వాయువుకు కూడా సాధ్యంకాదు. నువ్వు అనేక ఉపాయాలు తెలిసిన వాడివి. భూమిని తవ్వడంలో నేర్పరివి. నీ ముఖంతో (భూమిని తవ్వి ప్రాకారం ద్వారా సైన్యంలోకి ప్రవేశించి, రామలక్ష్మ ణులను ఒక్క పెట్టెలో పెట్టి తీసుకురా అన్నాడు. సూచీముఖుడు వెంటనే బయలుదేరి వెళ్లాడు. వానర సైన్యం ఆక్రమించిన భూభా గాన్ని తవ్వడం మొదలుపెట్టాడు. కానీ ఆంజనే యుడి వాలప్రాకారం తగిలి వాడి ముఖం పగిలిపోయింది. ఆ విధంగా కార్య విఫలుడై పాతాళలంకకు తిరిగివెళ్లాడు. అప్పుడు మైరావణుడు మహామాయా విశారదుడైన మూషికముఖుడనే రాక్షసుణ్ని పంపించాడు. మూషికముఖుడు " వజ్రంతో సమానమైన ఆంజనే యుడి వాల ప్రాకారాన్ని చూసి ఈ ప్రాకారం లోకి ఎలా ప్రవేశించగలను? నిద్రాగతులైన రామలక్ష్మణులను ఎలా తెలుసుకోగలను? తిరిగి ఎలా తిరిగిరాగలను? " అని చింతిస్తూ ఆంజనేయుడి తోకను తన ముఖంతో పొడిచాడు. వెంటనే వాడి ముఖం పగిలిపోయింది. మూషికముఖుడి ప్రయత్నం కూడా విఫలం కావడంతో మైరావణుడు క్రుద్ధుడై, పాషాణాభేది అనే రాక్షసుణ్ని పిలిచి " నీ దేహం తగిలినంత మాత్రాన పాషాణాలు కూడా పగిలిపోతాయి. నీవు హనుమంతుడు తోకతో నిర్మించిన కోటను బేధించి రామలక్ష్మణులను తీసుకురా " అని పంపించాడు. పాషాణ బేధి కోపంతో వాల ప్రాకా రాన్ని ఢీకొట్టగా అతడు తల కూడా పగిలింది. పాషాణాభేది పగిలిన తలతో పాతాళలంకకు పారిపోయాడు.

మైరావణుడు రామలక్ష్మణుల కొరకు వెళ్ళుట మార్చు

మైరావణుడు స్వయంగా తానే విభీషణ వేషంలో వెళ్లి, ప్రాకారం వద్ద హనుమంతుణ్ని చూసి ఇలా అన్నాడు. "మహావీరా! హనుమా! రాత్రి సమయంలో మహామాయావులైన రాక్షసులు సర్వత్రా సంచరిస్తూ ఉంటారు. నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. నేనిప్పుడు రామలక్ష్మణులు ఎలా ఉన్నారో చూసి వెంటనే తిరిగి వస్తాను. దీనికి నీ అనుమతి కావాలి " అని కోరాడు. విభీషణుడు స్నేహితుడు కావడం వల్ల మారుతి విభీషణుడి వేషంలో ఉన్న మైరావణుని లోపలికి వెళ్ళడానికి అనుమతించాడు. మాయా విభీషణుడు ఆంజనేయుడి రెండు కాళ్ల మధ్య భాగం నుంచి లోపలికి ప్రవేశించాడు. రామలక్ష్మణులను సమీపించి, తనతో తెచ్చుకున్న ఔషధాలను చల్లి వారిని మూర్ఛితులను చేశాడు. అనంతరం వారిని ఒక పెట్టెలో పెట్టి, ఆ పెట్టె మీద ఒక వస్త్రం, కప్పి, చంకలో పెట్టుకుని బయటికి వస్తూ లోపల అందరూ కులాసాగానే ఉన్నారని ఆంజనేయుడికి చెప్పి, వానర సైన్యాన్ని జాగ్రత్తగా రక్షించుకోవలసిందిగా హితవాక్యాలు పలికి, ఒక్క క్షణంలో తన నగరాన్ని చేరుకున్నాడు.

విభీషణుడి రాక మార్చు

మాయావిభీషణుడు వెళ్లిపోయిన తరువాత రావణ సోదరుడైన విభీషణుడు వచ్చి ఆంజనేయుడితో హనుమా! మాయావులు, పాపకర్మలు పంచకులు, కోపధారులు అయిన రాక్షసులు మన సైన్యం ముందు గద్దల రూపాలలో, గాడిదల రూపాలలో విచ్చల విడిగా సంచరిస్తున్నారు. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు రామలక్ష్మణులు కృతార్థులైనట్లే. మనం ధన్యులమైనట్లే. మహావీరా! సుగ్రీవ పాలితమైన ఈ సైన్యమంతా నీ అధీనంలో ఉంది. ధైర్యంలో గాని, బలంలో గాని, బుద్ధిలోగాని, సాహసంలో గాని నీవంటి శూరుడు మరొకడు లేదు. నువ్వే మాకు గతివి. ఈ ప్రాకారంలోకి ఎవ్వరినీ పోనివ్వకుండా అప్రమత్తంగా ఉండు. రామలక్ష్మణులు ఎలా ఉన్నారో ఒక్కమాటు చూసి వస్తాను. అనుమతించు అన్నాడు. ఆ మాటలు వినగానే ఆంజనేయడికి అనుమానం వచ్చి ఇప్పుడే గదా లోపలికి వెళ్లి వచ్చావు! మళ్లీ ఎందు కొచ్చావు? నీ ఉద్దేశమేమిటో స్పష్టంగా చెప్పు అన్నాడు విభీషణుడితో. ఆంజనేయుడు అలా అనగానే విభీషణుడు ఆశ్చర్య చకితుడై, కలత చెందిన మనస్సుతో ఆయనకిలా సమాధానం చెప్పాడు. ఆంజనేయా ! ఇంతకు ముందు నేను రాలేదు. రామలక్ష్మణులను చూడలేదు. ఇప్పుడే వచ్చాను. మా మేనమామ మైరావణుడు నీచుడు. దుర్బిద్ధి. దురాచారపరుడు. మాయావి. అనేక రూపాలు దరిస్తూ సజ్జనులనందరినీ మోసం చేస్తూ ఉంటాడు. అలాగే నా రూపంలో వచ్చి, నిన్ను మోసగించి, మన సైన్యం లోకి ప్రవేశించి ఉంటాడు. రామలక్ష్మణులను ఏం చేశాడో! మనం వెంటనే వారిని దర్శించాలి అంటూ ఆందోళన చెంది ఆంజనేయుడితో కలిసి లోపలికి వెళ్లాడు.

రామలక్ష్మణుల అపహరణకు హనుమ కుపితుడగుట మార్చు

రామలక్ష్మణులు శయనించిన ప్రదేశం ఖాళీగా ఉండడం చూసి ఆంజనేయ విభీషణులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. వారిని చూసి వానరులందరూ గొల్లుమన్నారు. హాహాకారాలు చేశారు. దీనంగా ఆ క్రోశించారు. ఆంజనేయుడు మూలం తెగిన వృక్షం లాగా పడిపోయాడు. దుఃఖ విహ్వలుడైనందువల్ల ఆయనకు క్షణకాలం బాహ్య ప్రపంచం కనిపించలేదు. ఆ వెంటనే లేచాడు. రామలక్ష్మణులనే స్మరిస్తూ " నా పరాక్రమం వ్యర్థమైంది. స్వామి కార్యాన్ని చెడగొట్టిన మూర్ఖుడిని. మిత్రద్రోహిని. కుత్సితుణ్ణి. నా ప్రజ్ఞ నిరుపయోగం. దీర్ఘమైన నా వాలం వృథా. నేను ద్వారపాలకుడుగా ఉండడం వృథా. నేను వృథా. నా జీవనమే వృథా. వానరుడనై ఉండి కూడా రాజపుత్రుల రక్షణ బాధ్యతను స్వీకరించాను. నాకు ఈ రక్షణ బాధ్యతను అప్పగించిన సుగ్రీవుడు ఇప్పుడే మంటాడో! శత్రుపక్షం వారితో చేతులు కలిపి నేనే రామలక్ష్మణులను అపహరించానని సీత అనుమానిస్తుందేమో! అని తనను తాను నిందించుకున్నాడు. కొంతసేపు వ్యాకుల చిత్తుడయ్యాడు. ఆ తరువాత ఉద్దేగపూరితుడై విశ్వరూపం ధరించాడు. ప్రళయాగ్ని సదృశ్యమైన ఆయన శరీరం బ్రహ్మలోకం దాకా వ్యాపించింది. ఆయన ముఖం భయంకరంగా ఉంది. విభీషణా! మైరావణుడు ఎక్కడుంటాడో చెప్పు. నా వాల రోమాగ్రాలతో వాడిని సంహరిస్తాను. లేదా నా పాదాలతో తన్ని అంతమొదిస్తాను కోపంతో అన్నాడు ఆంజనేయుడు.

మైరావణ పురం మార్చు

హనుమా! పాతాళ లంకలో మైరావణపురం ఒకటి ఉంది. మైరావణుడు అందులో నివసిస్తాడు. అది దేవ దానవులకు కూడా చొరరానిది. దానికి ఏడు ప్రాకారాలున్నాయి. లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి రెండే ద్వారాలున్నాయి. ఆ రెండింటిలో ఒక ద్వారం తామరతూడంత సూక్ష్మంగా ఉంటుంది. అది మైరావణుడి అంతః పురానికి వెళ్లే మార్గం. రెండవ ద్వారం చాలా విశాలంగా దీర్ఘంగా ఉంటుంది. అక్కడ ఆయుధ పాణులైన రాక్షసులు కాపలా ఉంటారు. ఆ మార్గం ద్వారా వెళ్లాలంటే వారితో యుద్ధం చేయవలసివస్తుంది. అప్పుడు మన కార్యానికి విఘ్నం ఏర్పడుతుంది. అందువల్ల పద్మనాళ మార్గం ద్వారా వెళ్లడమే మంచిది. ఆంజనేయా! సప్త ప్రాకారాలకు బయట ఒక పుష్కరిణి ఉంటుంది. దాని తీరాన పద్మనాళం వంటి ఒక యంత్రం (నాళయంత్రం) అమర్చబడి ఉంటుంది. ఆ సూక్ష్మ మార్గంలో కామరూపాలు ధరించిన రాక్షసులు సంచరిస్తూ ఉంటారు. ఏదైనా అపాయం వస్తే ఆ మార్గాన్ని ఒక పెద్ద బండరాతితో మూసేస్తారు. దానిని తొలగించి ముందుకు సాగిపోవాలి " అన్నాడు.

మైరావణుడు రామలక్ష్మణులను బలి ఇవ్వడానికి సిద్ధపడుట మార్చు

పాతాళలంకకు రామలక్షమణులను తీసుకు వెళ్ళిన మైరావణుడు వారిని బలి ఇవ్వాలని నిర్ణయించి తన చెల్లెలైన దుర్దండిని పిలిచి " రామలక్ష్మణులకు జలముతో అభిషేకించి వారిని బలి ఇవ్వడానికి సిద్ధం చెయ్యి " అని ఆఙాపించాడు. దుర్దండి జలపాత్రను తీసుకుని మైరావణ దుర్గం వదిలి వెలుపలకు వెళ్ళింది.

పాతాళలంకకు ఆంజనేయుడి ప్రవేశం మార్చు

విభీషణుడు చెప్పినట్లుగా ఆంజనేయుడు పాతాళానికి వెళ్లి, బండ రాయిని తొలగించాడు. సూక్ష్మరూపం ధరించి నాళమార్గం ద్వారా పయనించి పుష్కరిణీ తీరాన్ని చేరుకున్నాడు. ఆ సరస్సును చూడగానే ఆయనకు పంపా సరోవరం గుర్తుకొచ్చింది. బహుయోజన విస్తీర్ణం కలిగిన ఆ సరోవర సౌందర్యాన్ని కన్నుల పండువుగా దర్శించాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న అత్యున్నతమైన జమ్మిచెట్టునెక్కి ఆ సరస్సును పరిశీలనగా చూస్తూ ఉండగా సప్త ప్రాకార పరివేష్టితమైన పాతాళలంక ఆయన కన్నులకు గోచరించింది.

దుర్దండి వృత్తాంతం మార్చు

చెట్టెక్కి చూస్తున్న హనుమకు ఒక స్త్రీ రోదన వినిపించింది. దయార్ద్రహృదయుడైన ఆంజనేయుడు చెట్టునుంచి క్రిందికి దిగి ఆమె వద్దకు వెళ్లాడు. ఆమెను ఓదార్చి, ఆమె కాళ్లను బంధించిన సంకెళ్లను ఊడదీసి, ఆమె దుఃఖానికి కారణ మేమిటని ప్రశ్నించాడు.నాయనా! నా పేరు దుర్దండి. నా భర్త పేరు కాలదండుడు. నా కొడుకు నీలమేఘుడు. మైరావణుడు నా సోదరుడు. వాడొక పాపాత్ముడు. సజ్జన ద్వేషి. రావణాసురుడికి మేనమామ. ఒకప్పుడు నారదమహర్షి వచ్చి నా కొడుకు పాతాళలంకకు రాజు అవుతాడని చెప్పాడు. ఆ మాట విని మైరావణుడు క్రుద్ధుడై నాకూ, నా కుమారుడికీ సంకెళ్లు తగిలించి మమ్మల్ని వేరు వేరు కారాగృహాలలో బంధించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా కొడుకును నేను చూడలేక పోయాను. మమ్మల్ని విడిపించే నాథుడు లేక కారాగృహ వాసం చేస్తున్నాం. హనుమ ఆమెను ఓదార్చి " అమ్మా నా పేరు ఆంజనేయుడు. రామబంటును. నికిక భయం లేదు. నీ కష్టాలు ఇక తీరగలవు. ఈ దుర్మార్గుడు రామలచ్మణులను అపహరించి తీసుకు వచ్చాడు. వారిని గురించిన సమాచారం ఏదైనా తెలిస్తే నాకు తెలియజేయి " అని కోరాడు.

మైరావణుడి దుర్గంలోకి ప్రవేశం మార్చు

దుర్దండి " మహాబలా ! మైరావణుడు రామలక్ష్మణులను మూర్చిల్లజేసి తీసుకుని వచ్చాడు. వారిని బలీవ్వడానికి సిద్ధం చెయ్యమని నన్ను ఆఙాపించాడు. అందుకే నేనీ జలాలను తీసుకుపోతున్నాను. నీవు ఎలాగైనా వారిని రక్షించు " అని చెప్పింది. హనుమ " నన్ను మైరావణుడి దురగంలోకి తీసుకువెళ్ళగలవా ? " అని అడిగాడు. దుర్దండి " మహాబలా ! మైరావణుడి దుర్గంలోకి బిలాబార్గంలో వెళ్ళాలి. ఆమార్గానికి చివర ఈశ్వర ప్రసాదితమైన త్రాసు ఒకటి ఉంది. లోపలికి ప్రవేశించాలంటే ఎవరైనా ఆత్రాసులో నుండి ప్రవేశించాలి. ఆ త్రాసుకు ఒక మహత్యం ఉంది. అందులో మైరావణుడి అనుచరులు ఎవరు ప్రవేశించినా సమానంగానే ఉంటుంది. శత్రుభావంతో ఉన్న వారు ఎవరు ఆత్రాసులో కాలు పెట్టినా ఒకవైపు పైకి లేస్తుంది. అలాగే పెద్ద శబ్దం ఉత్పన్నమౌతుంది. అది విన్న రాక్షసులు ఆయుధాలతో వస్తారు " అని చెప్పింది. మారుతి దుర్దండితో " నన్ను ఆమార్గం గుండా తీసుకుని పోగలవా " అని అడిగాడు. అందుకు దుర్దండి అంగీకరించింది. వెంటనే హనుమ జమ్మి ఆకంతగా మారి జపాత్ర అంచును పట్టుకుని దుర్దండితో లోనికి వెళ్ళాడు. వారు త్రాసును సమీపించి త్రాసులో ప్రవేశించగానే త్రాసు ఒకవైపు పైకి లేచింది. పెద్ధగా శబ్ధాలు వినంచాయి.

మైరావణసైన్యాలతో మారుతి యుద్ధం మార్చు

మైరావణ దుర్గంలో శబ్ధాలు వినగానే రాక్షసులు హోరుమని పెద్దపెట్టున శబ్దం చేస్తూ వివిధరకాల ఆయుధాలతో హనుమతో యుద్ధానికిదిగారు. హనుమ వారినందరినీ హతమార్చి యుద్ధం కొనసాగించాడు. అప్పుడు ఒకరాక్షస యోధుడు హనుమతో ఘోరంగా యుద్ధం చేసాడు. చాలాసమయం యుద్ధం జరిగిన తరువాత హూనుమ అలసిపోయాడు. హనుమకు చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు హనుమ యుద్ధం ఆపి " మహావీరా ! నాకు సాధారణంగా యుద్ధంలో అలసట కలగదు. అలాంటి నాతో అలసిపోయే అంతగా యుద్ధం చేయగలిగిన నీవు ఎవరు ? " అని అడిగాడు.

హనుమ కుమారుడు మార్చు

అప్పుడా యోధుడు హనుమతో " మా తల్లి ఒక అప్సర కన్య. ఒకానొకప్పుడు మాతంగ మహర్షి శాపానికి గురి అయింది. మా తల్లి మహర్షిని శాపవిమోచనం ఇమ్మని ప్రార్ధించడంతో మహర్షి మా తల్లితో " నీవు సముద్రంలో దీర్ఘకాయురాలివై సంచరించే సమయంలో ఒకసారి దైకార్యం కొరకు హనుమ సముద్రం దాటి పోయే సమయంలో జారిపడిన స్వేదబిందువు వలన నీవు పుత్రుడికి జన్మ ఇచ్చిన వెంటనే నీకు శాపవిమోచనం కలుగుతుంది " అని చెప్పాడు. ఒకానొక సమయంలో రామకార్యార్ధం ఆంజనేయుడు సముద్రం దాటే సమయంలో నీ నుదుటి నుండి జారిపడిన స్వేదబిందువుని గ్రహించిన నా తల్లి చేప రూపంలో గ్రహించి నాకు జన్మ ఇచ్చింది . నేను పుట్టిన వెంటనే మా అమ్మ నాతో " కుమారా ! నీవు మైరావణుడి వద్దకు వెళ్ళి అతడిని సేవించు. అక్కడకు వచ్చి నీతో యుద్ధంచేసి అలసటనొదిన వీరుడే నీ తండ్రి ఆని గుర్తించు " అని చెప్పింది. అందువలన " నాతో యుద్ధం చేసి అలసట నొడానని చెప్పావు కనుక నీవు ఆ ఆజనేయుడివై ఉండాలి " అన్నాడు. వెంటనే ఆజనేయుడు ఆయోధుని పుత్రప్రేమతో ఆలింగనం చేసుకుని " కుమారా ! ఆ ఆంజనేయుడిని నేనే. నీ తండ్రిని నేనే " అని చెప్పాడు. అతడు ఆంజనేయుని పాదాలకు నమస్కరించి " తండ్రీ ! నేను ఏమి చేయాలో అనుఙ ఇవ్వండి " అని అడిగాడు. మారుతి నన్ను మైరావణుడు ఉన్న ప్రదేశానికి తీసుకునిపో అని అడిగాడు.

మైరావణుని వధ మార్చు

ఆజనేయుని కుమారుడు ఆంజనేయుని మైరావణుడు ఉన్న ప్రదేశానికి తీసుకుపోయాడు. ఆంజనేయుడు మైరావణునితో పోరు సాగించాడు. ఇరువురి మద్య చాలా సమయం తీవ్రమైన పోరు సాగించి. చివరకు ఆంజనేయుడిది పైచేయి అయింది. ఎన్ని మార్లు మైరావణుని ముక్కలు చేసినా మైరావణుడు తిరిగి ఒక్కటిగా మారుతూ ఉన్నాడు. ఇది గమనించి హనుమ ఆశ్చర్యచకితుడుకాగా దుర్దండి " మహావీరా ! కలవర పడకు. మైరావణిని పంచప్రాణాలు ఐదు తుమ్మెదల రూపంలో బిలంలో దాచబడి ఉన్నాయి. అవి బయటకు రాకుండా బిలద్వారం మీద ఒక రాయితో మూతపెట్టి ఉన్నది. నీవు ఆరాతిని కాలితో తన్ని తుమ్మెదలు వెలుపలికి రాగానే వెంటనే వాటిని కాలితో తొక్కవేస్తే మైరావణుడు హతుడుకాగలడు " అని చెప్పంది. అది విన్న మైరావణుడు " దుర్మార్గురాలా ! చెల్లెలివైయుండి ఇలా ఇంటి గుట్టు రట్టు చేస్తావా ! ఇది ధర్మమా ! " అని అడిగాడు. దుర్దండి " నీ తోడపుట్టిన చెల్లెలను. నాకుమారుడు రాజైతాడని జ్యోతిష్కులు చెప్పినందుకు నన్ను, నా కుమారుడైన నీలమేఘుని గొలుసులతో బంధించిన నీ ప్రాణరహస్యం చెప్పడం అధర్మమేమి కాదు " అని చెప్పింది. హనుమ వెంటనే ఆరాతిని కాలితో తన్నగానే ఐదు తుమ్మెదలు వెలుపలికి వచ్చాయి. ఆజనేయుడు ఆతిమ్మెదలను కాలితో నొక్కి చంపగానే మైరావణుడు కుప్పుకూలాడు. ఆంజనేయుడు దుర్దండి కుమారుడైన నీలమేఘుడికి పాతాళలంక రాజుగా పట్టాభిషేకం చేసి రామాక్ష్మణులను భుజంమీద ఎక్కించుకుని అక్కడి నుండి లంకకు వెళ్ళాడు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు