రాంపూర్ (ఉత్తర ప్రదేశ్)

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

రాంపూర్ ఉత్తర ప్రదేశ్, రాంపూర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. రాంపూర్ లోని గ్రంథాలయంలో 12,000 పైచిలుకు అరుదైన లిఖిత ప్రతులు, మొగలు కాలపు సూక్ష్మ చిత్రాలు ఉన్నాయి.[2] పట్టణ పరిపాలనను మునిసిపాలిటీ నిర్వహిస్తుంది. రాంపూర్ గతంలో చక్కెర, నూలు కర్మాగాలకు ప్రసిద్ధి చెందింది.

రాంపూర్
పట్టణం
మధ్య: జామామసీదు, పైనుండి సవ్యదిశలో: రాంపూర్ రైల్వే స్టేషను; మహమ్మదాలీ జౌహర్ యూనివర్సిటీ; రాంపూర్ రజా గ్రంథాలయం; ఆర్యభట్ట ప్లానెటేరియం, గాంధీ సమాధి
మధ్య: జామామసీదు, పైనుండి సవ్యదిశలో: రాంపూర్ రైల్వే స్టేషను; మహమ్మదాలీ జౌహర్ యూనివర్సిటీ; రాంపూర్ రజా గ్రంథాలయం; ఆర్యభట్ట ప్లానెటేరియం, గాంధీ సమాధి
రాంపూర్ is located in Uttar Pradesh
రాంపూర్
రాంపూర్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 28°48′N 79°00′E / 28.8°N 79.0°E / 28.8; 79.0
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లారాంపూర్
ప్రాంతంరోహిల్‌ఖండ్
డివిజన్మొరాదాబాద్
Named forరాజా రాంసింగ్
Area
 • Total84 km2 (32 sq mi)
 • Rank43
Elevation
288 మీ (945 అ.)
Population
 (2011)
 • Total3,25,248
 • Density3,900/km2 (10,000/sq mi)
భాషలు
 • అధికారికహిందీ[1]
Time zoneUTC+5:30 (IST)
PIN
244901
టెలిఫోన్ కోడ్0595
లింగనిష్పత్తి1000/927 /

2011 భారత జనగణన లెక్కల ప్రకారం రాంపూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం లోని ఏకైక ముస్లిం మెజారిటీ జిల్లా.[3]

2007 లో భారత ప్రభుత్వం రాంపూర్ జిల్లాను రాష్ట్రంలోని 14 'మైనారిటీ మతస్థులు అధికంగా గల' జిల్లాలలో ఒకటిగా గుర్తించింది. 2001 జనాభా లెక్కలలో జనాభా, సామాజిక-ఆర్థిక సూచికలు, ప్రాథమిక సౌకర్యాల సూచికలపై ఆధారపడి ఈ గుర్తింపు నిచ్చింది.[4] దీనిని నవాబుల నగరం అని కూడా పిలుస్తారు. రాంపూరి చాకు (కత్తి) కు ఈ పట్టణం ప్రసిద్ధి చెందింది.

పేరు వ్యుత్పత్తి మార్చు

వాస్తవానికి ఇది రాజా రామ్ సింగ్ పేరు మీద ఉన్న నాలుగు గ్రామాల సమూహం. మొదటి నవాబు ఈ నగరానికి ఫైజాబాద్ అని పేరు మార్చాలని ప్రతిపాదించాడు. కానీ ఫైజాబాద్ పేరుతో అనేక ఇతర ప్రదేశాలున్నందున ముస్తఫాబాద్ అని పేరు పెట్టాడు. అయితే రాంపూర్ అనే పేరే స్థిరపడి పోయింది.[5]

చరిత్ర మార్చు

మధ్యయుగ చరిత్ర ప్రకారం, రాంపూర్ ఢిల్లీ రాజ్యంలో భాగంగా బదాయూన్, సంభాల్ జిల్లాల్లో కలిసి ఉండేది. రోహిల్‌ఖండ్‌కు ఎగువన ఉన్నందున, దీనిని కాథర్ అనే పేరుతో పిలిచేవారు. దీనిని కాథేరియా రాజపుత్రులు పాలించారు. కాథేరియా రాజపుత్రులు సుమారు 400 సంవత్సరాల పాటు ఇస్లామిక్ పాలనను ప్రతిఘటించారు. ఢిల్లీ సుల్తాన్‌లతో, ఆ తరువాత మొగలులతో పోరాడారు. వారు 1253 లో నాసిరుద్దీన్ మహమూద్, 1256 లో గియాస్ ఉద్ దీన్ బాల్బన్, 1290 లో జలాల్-ఉద్-దీన్ ఖల్జీ, 1379 లో ఫిరుజ్ షా తుగ్లక్, 1494 లో సికందర్ లోడి లతో అనేక యుద్ధాలు చేసారు.

తరువాత, మొగలు కాలపు తొలినాళ్ళలో, రోహిల్ఖండ్ రాజధానిని బదాయూన్ నుండి బరేలీకి మార్చారు. దాంతో రాంపూర్ ప్రాముఖ్యత పెరిగింది.[5]

 
రాంపూర్ పతాకం

అవధ్ నవాబు మరాఠాలకు వ్యతిరేకంగా 1772 లో రోహిల్లా పఠానులకు చేసిన సైనిక సహాయానికి ప్రతిఫలంగా తాము చెల్లించాల్సిన ధనాన్ని పఠానులు ఎగగొట్టడంతో 1774-5 లో రోహిల్లా యుద్ధం మొదలైంది. నవాబు, ఈస్టిండియా కంపెనీ దళాల సహాయంతో రోహిల్లాలను వారి రాజధాని బరేలీ నుండి పారదోలాడు.

1774 అక్టోబరు 7 న బ్రిటిష్ కమాండర్ కల్నల్ ఛాంపియన్ సమక్షంలో నవాబ్ ఫైజుల్లా ఖాన్, రాంపూర్ రోహిల్లా రాజ్యాన్ని స్థాపించాడు. ఇక ఆ తరువాత అది బ్రిటిష్ రక్షణలో ఉన్న ఒక చిన్నపాటి సంస్థానంగా మిగిలిపోయింది.[6]

 
ఫైజుల్లా ఖాన్

ఖాన్, రాంపూర్ వద్ద ఒక కొత్త కోట కట్టేందుకు పునాది వేసాడు. దాంతో రాంపూర్ నగర స్థాపన 1775 లో జరిగినట్లైంది. వాస్తవానికి ఇది రాజా రామ్ సింగ్ పేరిట ఉన్న నాలుగు గ్రామాల సమూహం. మొదటి నవాబు నగరానికి 'ఫైజాబాద్' అని పేరు పెట్టాలని ప్రతిపాదించాడు. కానీ ఇప్పటికే ఫైజాబాద్ పేరుతో చాలా ఇతర ప్రదేశాలు ఉన్నందున దీనికి ముస్తఫాబాద్ అని పెట్టాడు. నవాబ్ ఫైజుల్లా ఖాన్ 20 సంవత్సరాలు పాలించాడు. అతను పండిత పోషకుడు. అరబిక్, పెర్షియన్, టర్కిష్, ఉర్దూ మాన్యుస్క్రిప్ట్‌ల సేకరణను ప్రారంభించాడు. రాంపూర్ రాజా లైబ్రరీలో ఉన్న సేకరణల్లో ఎక్కువ భాగం అవే. అతని మరణం తరువాత అతని కుమారుడు ముహమ్మద్ అలీ ఖాన్ బాధ్యతలు స్వీకరించాడు. కాని 24 రోజుల లోనే రోహిల్లా నాయకులు అతన్ని చంపేసి, అతడి సోదరుడు గులాం ముహమ్మద్ ఖాన్‌ను నవాబుగా ప్రకటించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ దీనికి ఒప్పుకోలేదు. కేవలం 3 నెలల 22 రోజుల పాలన తరువాత గులాం ముహమ్మద్ ఖాన్ బ్రిటిషు బలగాల చేతిలో ఓడిపోయాడు. బ్రిటిషు గవర్నర్ జనరల్, దివంగత ముహమ్మద్ అలీ ఖాన్ కుమారుడు అహ్మద్ అలీ ఖాన్ ను కొత్త నవాబుగా చేశారు. అతను 44 సంవత్సరాలు పరిపాలించాడు. అతనికి కుమారులు లేరు కాబట్టి గులాం ముహమ్మద్ ఖాన్ కుమారుడు ముహమ్మద్ సాయిద్ ఖాన్ కొత్త నవాబుగా బాధ్యతలు స్వీకరించాడు. అతను సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు, కోర్టులను స్థాపించాడు, రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు అనేక పనులు చేశాడు. అతడి మరణం తరువాత, అతని కుమారుడు ముహమ్మద్ యూసుఫ్ అలీ ఖాన్ బాధ్యతలు స్వీకరించాడు. 1865 లో అతని కుమారుడు కల్బ్ అలీ ఖాన్ కొత్త నవాబు అయ్యాడు.[5]

 
సర్ కల్బ్ అలీ ఖాన్, రాంపూర్ నవాబ్ (1832–1887)

నవాబ్ కల్బ్ అలీ ఖాన్ అరబిక్, పర్షియన్ భాషలలో పండితుడు. అతడి పాలనా కాలంలో విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి చాలా కృషి చేసాడు. లార్డ్ జాన్ లారెన్స్ వైస్రాయల్టీ సమయంలో అతను కౌన్సిల్ సభ్యుడుగా ఉండేవాడు. రాంపూర్‌లో రూ. 3,00,000 వ్యయంతో జామా మసీదును నిర్మించాడు. ఆగ్రాలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అతనికి నైట్‌హుడ్ నిరుదును ప్రదానం చేసాడు. అతను 22 సంవత్సరాల 7 నెలలు పరిపాలించాడు. అతని మరణానంతరం కుమారుడు ముష్తాక్ అలీ ఖాన్ బాధ్యతలు స్వీకరించాడు. అతను డబ్ల్యుసి రైట్‌ను రాష్ట్ర చీఫ్ ఇంజనీర్‌గా నియమించాడు. అనేక కొత్త భవనాలు, కాలువలను నిర్మించాడు. నవాబ్ హమీద్ అలీ 1889 లో 14 సంవత్సరాల వయసులో కొత్త పాలకుడు అయ్యాడు. అతని పాలనలో చాలా కొత్త పాఠశాలలు ప్రారంభించాడు సమీపం లోని కళాశాలలకు విరాళాలు అందించాడు. లక్నో మెడికల్ కాలేజీకి రూ. 50,000 విరాళమిచ్చాడు. 1905 లో అతను కోటలో అద్భుతమైన దర్బార్ హాల్‌ను నిర్మించాడు. ప్రస్తుతం ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్‌ల గొప్ప సేకరణ ఉన్న రాంపూర్ రాజా లైబ్రరీ ఈ దర్బారు హాల్లోనే ఉంది. అతని కుమారుడు రజా అలీ ఖాన్ 1930 లో చివరి పాలక నవాబు అయ్యాడు. 1949 జూలై 1 న రాంపూర్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. రాంపూర్ క్షీణదశలో ఉంది. కోట ద్వారాలు గోడలూ నవాబుల రాజభవనాలూ కూలిపోతున్నాయి. అయితే, లైబ్రరీ మాత్రం, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన పండితులకు ఎంతో విలువైన సంస్థగా మిగిలిపోయింది.[5]

1857 నాటి భారత తిరుగుబాటు సమయంలో రాంపూర్ నవాబులు బ్రిటిష్ వారి పక్షాన నిలిచారు. దీంతో వాళ్ళు ఉత్తర భారతదేశపు సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక జీవితంలో - ముఖ్యంగా యునైటెడ్ ప్రావిన్సుల ముస్లింలలో - తమ పాత్రను కొనసాగించడానికి వీలు కలిగింది. వారు బహదూర్ షా జాఫర్ కోర్టు నుండి కొంతమంది సాహితీకారులకు ఆశ్రయం ఇచ్చారు.

స్వాతంత్ర్యం తరువాత మార్చు

నవాబుల ముఖ్యమైన వారసులలో రాంపూర్కు చెందిన దివంగత నవాబు మూర్తజా అలీ ఖాన్ బహదూర్ మొదటి బిడ్డ మురాద్ మియాన్ ఉన్నాడు. బేగం నూర్ బానో, మాజీ నవాబ్ తమ్ముడు, రాంపూర్ మాజీ ఎంపీ జుల్ఫికర్ అలీ ఖాన్ యొక్క భార్య. బేగం నూర్ బానో రాజకీయ నాయకురాలిగా మారి 1999 లో రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. ఆమె రాంపూర్ నుండి 2004, 2009 ఎన్నికల లోను, మొరాదాబాద్ నుండి 2014 లోనూ పోటీచేసి ఓడిపోయింది. ముర్తాజా అలీ ఖాన్, జుల్ఫికర్ అలీ ఖాన్ (మిక్కీ మియా)లు ప్రస్తుతం జీవించి లేరు. రాయల్టీని రద్దు చేసిన తరువాత కూడా నవాబు బిరుదును ఉపయోగించడం కొనసాగించారు, కాని వాళ్ళు రాంపూర్‌ను ఎప్పుడూ పాలించలేదు. మూర్తజా అలీ 1972 లో రాంపూర్ నుండి తన తల్లి రఫత్ జమానీ బేగానికి ఎదురుగా ఎన్నికలలో పోటీ చేసి గెలిచాడు. ఇద్దరు సోదరులు ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ వారు ఎన్నికలలో ఒకరినొకరు ఎదుర్కోలేదు. తదనంతరం, పాకిస్తాన్ నుండి కొన్ని స్మగ్లింగ్ కుంభకోణాలకు కుటుంబం పాల్పడింది. మూర్తజా అలీ కుమారులలో ఒకరు పాకిస్తాన్లో పెళ్ళి చేసుకున్నాడు. రాజా ఇంటర్ కాలేజి, హమీద్ ఇంటర్ కాలేజి, మూర్తజా ఇంటర్ కాలేజి ఈ మూడూ నవాబుల పేరిట ఉన్న మూడు ఉన్నత మాధ్యమిక పాఠశాలలు.[6]

రాంపూర్ యొక్క ప్రస్తుత నవాబు, ముహమ్మద్ మురాద్ అలీ ఖాన్ బహదూర్ రాంపూర్‌కు ప్రస్తుత నవాబు. మూర్తజా అలీ ఖాన్ బహదూర్ పెద్ద కుమారుడైన ఇతడు, 1982 లో తండ్రి మరణించిన తరువాత నవాబయ్యాడు. రాంపూర్‌లోని రాజా లైబ్రరీ బోర్డులో 1993 నుండి 2002 వరకు సభ్యుడిగా పనిచేశాడు.

భౌగోళికం మార్చు

రాంపూర్ 28° 48' ఉత్తర అక్షాంశం, 79° 05' తూర్పు రేఖాంశం వద్ద ఉంది.

వాతావరణం మార్చు

వేసవికాలంలో ఉష్ణోగ్రత సాధారణంగా 31 °C ఉంటుంది శీతాకాలంలో ఇది 25 °C నుండి 5 °C వరకు పడిపోతుంది.[6]

శీతోష్ణస్థితి డేటా - Rampur
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 17.1
(62.8)
20.5
(68.9)
25.6
(78.1)
32.4
(90.3)
31.4
(88.5)
31.7
(89.1)
29.5
(85.1)
29.4
(84.9)
29.1
(84.4)
27.8
(82.0)
24.7
(76.5)
20
(68)
26.16
(79.09)
సగటు అల్ప °C (°F) 7
(45)
9.1
(48.4)
11.2
(52.2)
15.7
(60.3)
17.4
(63.3)
17.7
(63.9)
19.2
(66.6)
21.5
(70.7)
19.2
(66.6)
13.2
(55.8)
12.1
(53.8)
8
(46)
15.58
(60.04)
సగటు అవపాతం mm (inches) 18.2
(0.72)
24.5
(0.96)
12.1
(0.48)
12.4
(0.49)
21.6
(0.85)
99.1
(3.90)
168.1
(6.62)
207.1
(8.15)
99.3
(3.91)
27.1
(1.07)
6.1
(0.24)
9.0
(0.35)
704.6
(27.74)
Source: WWO

జనాభా వివరాలు మార్చు

రాంపూర్‌లో మతం[7]
మతం శాతం
ఇస్లాం
  
70.02%
హిందూ మతం
  
28.46%
సిక్కుమతం
  
1.00%
క్రైస్తవం
  
0.24%
జైనమతం
  
0.17%
ఇతరాలు†
  
.11%
ఇతరాల్లో
బౌద్ధం (<0.03%).ఉంది

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[8] రాంపూర్ జనాభా 3,25,248 (2001 లో 2,81,549). 2001–11 దశాబ్దంలో జనాభా 16% వృద్ధి చెందింది. జనాభాలో పురుషులు 52.2%, మహిళలు 47.8% ఉన్నారు. జాతీయ సగటు 940 తో పోలిస్తే ఇక్కడి లింగ నిష్పత్తి 915. రాంపూర్ అక్షరాస్యత 53.7%, ఇది జాతీయ సగటు 64.3% కంటే చాలా తక్కువ. పురుషుల అక్షరాస్యత 56%, స్త్రీల అక్షరాస్యత 51%. రాంపూర్లో ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 37,945 ఉన్నారు. ఇది జనాభాలో 11.7% (2001 లో 14%).

రాంపూర్‌లో బీడీ తయారీ మరో వృద్ధి చెందుతున్న పరిశ్రమ. రాంపూర్, కత్తులు చాకుల తయారీకి కూడా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ తయారుచేసిన కత్తులు 20 వ శతాబ్దంలో చాలా ప్రసిద్ధి చెందాయి. వీటిని రాంపురి చాకు అని పిలుస్తారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 4.5 అంగుళాల కన్నా ఎక్కువ పొడవున్న కత్తులు తయారు చేయడాన్ని నిషేధించిండంతో వాటికి జనాదరణ తగ్గింది.[9]

రాంపూర్ రైల్వే స్టేషను లక్నో-మొరాదాబాద్ మార్గంలో, కాథ్‌గోడమ్ మార్గపు కూడలి మీద ఉంది. అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్, జమ్మూ తావి-సియాల్దా ఎక్స్‌ప్రెస్, కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్, హౌరా-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్, గంగా సట్లెజ్ ఎక్స్‌ప్రెస్, సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్‌లు ఈ స్టేషన్ గుండా వెళ్తాయి.

 
రాంపూర్ రైల్వే స్టేషన్

త్రోవ

 
రాంపూర్‌లో రోడ్‌వేస్ బస్ డిపో.

జాతీయ రహదారి 9 రాంపూర్ గుండా వెళుతుంది.[10] రాంపూర్ నుండి మొరాదాబాద్కు గంట గంటకూ బస్సులు నడుస్తాయి. ఢిల్లీ, లక్నో, బరేలీ, అలీగఢ్, హరిద్వార్, రిషికేశ్, కాన్పూర్, ఆగ్రా మొదలైన ప్రదేశాలకు కూడా బస్సులు ఉన్నాయి. జాతీయ రహదారి 530 రాంపూర్ వద్దే మొదలౌతుంది.

ఆర్థిక వ్యవస్థ మార్చు

పరిశ్రమలు, వ్యవసాయం మార్చు

రాంపూర్‌లో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇక్కడి భూమి చాలా సారవంతమైనది. రాంపూర్ లోని ప్రధాన పరిశ్రమలు వైన్ తయారీ, చక్కెర ప్రాసెసింగ్, నేత, వ్యవసాయ పనిముట్ల తయారీ. రాంపూర్‌లోని చక్కెర మిల్లు, రాజకీయ శత్రుత్వాల కారణంగా 1999 లో మూతబడింది. రాష్ట్రప్రభుత్వం దీన్ని మళ్ళీ తెరిచే ప్రయత్నం చేస్తోంది.[11]

రాంపూర్‌లోని పురాతన పరిశ్రమలలో గాలిపటాల తయారీ పరిశ్రమ ఒకటి, వివిధ పరిమాణాలు, ఆకారాల్లో గాలిపటం తయారు చేస్తారు. ఇక్కడ తయారైన గాలిపటాలకు ఉత్తర ప్రదేశ్ అంతటా చాలా డిమాండ్ ఉంది.

మూలాలు మార్చు

  1. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 2 డిసెంబరు 2020.
  2. Rampur Raza library a structure of national importance Archived 2012-05-25 at the Wayback Machine, Razalibrary.gov.in. Retrieved 7 July 2012
  3. "A pocket of intense Muslim presence and growth in Uttar Pradesh". 8 May 2016. Retrieved 4 October 2018.
  4. "Identification of Minority Concentration Districts". 22 June 2007. Retrieved 4 October 2018.
  5. 5.0 5.1 5.2 5.3 Rampur history Archived 21 మే 2012 at the Wayback Machine, Rampur.nic.in Retrieved 8 July 2012
  6. 6.0 6.1 6.2 Rampur Climate, Nainital tourism Retrieved 7 July 2012
  7. "Census GIS Household". Office of the Registrar General and Census Commissioner, India. Retrieved 7 July 2012.
  8. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  9. "Famed Rampuri knives may soon go into oblivion | TopNews". www.topnews.in.
  10. National highway 87 and rampur, india9.com Retrieved 8 July 2012
  11. Rampur sugar mill lies in ruins, Retrieved 7 August 2012