రాముడు భీముడు (1964 సినిమా)

1964 సినిమా

రాముడు భీముడు 1964లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, సురేష్ ప్రొడుక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. చిత్రం విజయవంతమై అనేక చిత్రాలకు మాతృక అయ్యింది.

రాముడు భీముడు
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం తాపీ చాణక్య
తారాగణం నందమూరి తారక రామారావు (ద్విపాత్రాభినయం),
జమున,
ఎల్. విజయలక్ష్మి,
ఎస్.వి. రంగారావు
రాజనాల,
రమణారెడ్డి,
రేలంగి,
గిరిజ,
శాంతకుమారి,
జమున
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ మార్చు

చిన్నతనంలోనే దూరమైన ఇద్దరు అన్నదమ్ముల కథ. రాముడు శాంతకుమారి కొడుకు. తండ్రి లేడు. మేనమామ (రాజనాల) ఆస్తి అజమాయిషీ చేస్తూ రాముడ్ని చాలా హీనంగా చూస్తుంటాడు. అమాయకుడైన రాముడు మేనమామ చే కొరడా దెబ్బలు తింటుంటాడు. భీముడు పల్లెటూర్లో నాటకాలరాయుడిలా తిరుగుతూ పెంపుడుతల్లి మాట వినకుండా అల్లరి పనులు చేస్తుంటాడు. మేనమామ ఏర్పాటు చేసిన పెళ్ళి చూపుల్లో రాముడు అవమాన పడతాడు. మేనమామ మీద భయంతో ఇంటినుండి వెళ్ళిపోతాడు. అదే సమయానికి భీముడు పల్లెటూరినుండి పారిపోయి పట్నం వస్తాడు. కొన్ని పరిస్థితుల్లో ఒకరి స్థానంలో ఒకరు ప్రవేశిస్తారు. మేనమామకి రాముడి స్థానంలో ఉన్న భీముడు బుద్ధి చెబుతాడు. రాముడు భీముడు అన్నదమ్ములని తెలుస్తుంది. రాముడు పల్లె పడుచు ఎల్.విజయలక్ష్మిని భీముడు పట్నం పిల్ల జమునను పెళ్ళాడతారు.

ట్రెండ్ సెట్టింగ్ మార్చు

రాజు పేద నవలలో ఒకే పోలికతో ఉన్న యువరాజు, పేద బాలుడు స్థానాలు మారుతారు. అదే విషయం మీద ఆధారపడి రాముడు భీముడు కథ తయారయ్యింది. తెలుగులో విజయవంతమయ్యాక తమిళ హిందీ భాషల్లో నిర్మించబడింది. హిందీలో రామ్ ఔర్ శ్యామ్ గా దిలీప్ కుమార్ నటించారు. అక్కడ కూడా విజయవంతమయ్యింది. అదేకథను జెండరు మార్పుతో హేమమాలిని ద్విపాత్రాభినయంతో 'సిప్పీ' లు సీత ఔర్ గీత తీశారు. అదే కథను మళ్ళీ తెలుగులో గంగ మంగ (వాణిశ్రీ) గా తీశారు. ఎ.ఎన్.ఆర్ 'శ్రీరామరక్ష'చిత్రకథ కూడా దీనిని పోలి ఉంటుంది. చిరంజీవి నటించిన యముడుకి మొగుడు చిత్రంలో కూడా రాముడు భీముడు చిత్ర ఛాయలు కనిపిస్తాయి. బాలకృష్ణ హీరోగా రాముడు భీముడు వచ్చింది. అందులోనూ అవే ఛాయలున్నాయి. హిందీలో శ్రీదేవి చిత్రం చాల్ బాజ్, సీతా ఔర్ గీతాను పోలి ఉంటుంది.

పాటలు మార్చు

పాట రచయిత సంగీతం గాయకులు
ఉందిలే మంచికాలం ముందుముందునా శ్రీశ్రీ పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్ కొసరాజు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
అదే నాకు అంతు తెలియకున్నది : ఏదో లాగు మనసు లాగుతున్నది సి.నారాయణరెడ్డి పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజ నీ రూపు తెలిసిందిలే సి.నారాయణరెడ్డి పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
సరదా సరదా సిగిరెట్టు కొసరాజు పెండ్యాల నాగేశ్వరరావు మాధవపెద్ది సత్యం, జమునారాణి

తగునా ఇది మామా తమారే , ఘంటసాల, మాధవపెద్ది, రచన: కొసరాజు

పో మామా పొమ్మికన్ , ఘంటసాల, రచన: కొసరాజు

హాయ్ తళుకు తళుకు మని గలగల సాగే , ఘంటసాల, సుశీల, రచన; సి.నారాయణ రెడ్డి

విశేషాలు మార్చు

 
రాజనాల, ఎస్.వి. రంగారావు, జమున, ఎన్.టి.ఆర్., రమణారెడ్డి
  • ఎన్.టి.ఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం.
  • నాగార్జున సాగర్ నిర్మాణకాలంలో తీసిన ఈ చిత్రంలో ఒక పాటలో సాగర్ డామ్ నిర్మాణం నేపథ్యంగా చూపారు (దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్.. పాట)
  • అప్పటి సంకేతిక పరిమితుల దౄష్ట్యా కావచ్చుఎన్.టి.ఆర్ రెండుపాత్రలు తెరపై కలిసి కనిపించే సన్నివేశాలు రెండు/మూడు మాత్రమే ఉన్నాయి.
  • ఎన్.టి.ఆర్ డూప్ గా సత్యనారాయణ ఒక సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తారు.

మూలాలు మార్చు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.