రెగ్యులేటింగ్ చట్టం, 1773

యునైటెడ్ కింగ్‌డమ్ చట్టం

1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం గ్రేట్ బ్రిటన్ పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందిన చట్టం. ఇది భారత భూభాగంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను నియంత్రించేందుకు రూపొందించిన చట్టం.[1] ఈ చట్టం పూర్తి స్థాయిలో భారత భూభాగంలో కంపెనీ కార్యకలాపాలకు ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వలేకపోయింది. అందువలన 1784లో పిట్స్ ఇండియా చట్టం ద్వారా మరింత ప్రభావవంతమైన మార్పులను కంపెనీ కార్యకలాపాలకు అనుగుణంగా రూపొందించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంపై అమలు చేసింది.

ది ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్, 1772
(1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం)
పూర్తి శీర్షికయూరప్ లో ఉన్న మాదిరిగా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సజావుగా పని చేసే విధంగా విధించబడుతున్న కొన్ని నియమాలను నిర్ధారించే చట్టం
ఉల్లేఖనం13 Geo. 3 c. 63
ప్రవేశపెట్టినవారుఫ్రెడెరిక్ నార్త్, లార్డ్ నార్త్; 18 మే 1773 న
అమలు వలన ప్రభావితమయ్యే ప్రాంతం
  • బ్రిటన్
  • బెంగాల్ ప్రెసిడెన్సీ
  • మద్రాస్ ప్రెసిడెన్సీ
  • బోంబే ప్రెసిడెన్సీ
తేదీలు
రాచరికపు ఆమోదం పొందిన తేదీ10 జూన్ 1773
అమలులోకి వచ్చిన తేదీ10 జూన్ 1773
ఇతర శాసనాలు
దీనికి సంబంధించినది13 Geo. 3 c. 64
స్థితి: తెలీదు
చట్టం యొక్క మూలపాఠం

చరిత్ర మార్చు

1773 నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తి నష్టాలలోకి కూరుకుపోయింది. కాగా కంపెనీ భారత భూభాగంలో వర్తకం చేస్తున్న ఏకైక కంపెనీ, అలానే బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తులకు కంపెనీలో వాటాలు ఉన్నాయి. అందువలన కంపెనీ అస్తిత్వం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా అవసరం. కంపెనీ భారతభూభాగంలో ఏకాధిపత్యం తో వర్తకం చేస్తున్నందుకు గానూ బ్రిటిష్ ప్రభుత్వానికి సాలీనా 4 లక్షల పౌండ్లు (ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే సుమారు 42 కోట్ల రూపాయలు లేదా 4 కోట్ల 61 లక్షల పౌండ్లు) రుసుముగా చెల్లించేది. ఐతే కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వ ఆశయాలకు నిలవలేక పోయింది. అమెరికాలో తేయాకు అమ్మకాలలో వచ్చిన నష్టం వలన 1768 నుండి కంపెనీ ప్రభుత్వానికి జవాబుదారీగా లేదు. అమెరికాలో అమ్మబడే తేయాకులో సుమారు 85% తేయాకు డచ్ వారి నుండి దొంగిలించబడినది. అందువలన కంపెనీ అటు బ్రిటిష్ ప్రభుత్వానికి, ఇటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు అప్పు పడిపోయింది. తేయాకు భారత భూభాగం నుండి సరఫరా అయి వచ్చి బ్రిటిష్ గిడ్డంగులలో కుళ్ళిపోయేది. ఆ విధంగా ఈ రెగ్యులేటింగ్ చట్టం, 1773 తో పాటుగా 1773 నాటి తేయాకు చట్టం కూడా అమలులోకి వచ్చి కంపెనీ ఆధీనంలో ఉన్న తేయాకు నిల్వలను లాభదాయకంగా అమ్మేలా నియంత్రిస్తూ రూపొందించబడింది.

ప్రాధాన్యత మార్చు

ఈ చట్టానికి రాజ్యాంగ ప్రాముఖ్యత ఉంది. ఈ చట్టం ద్వారా ముఖ్యంగా రెండు విషయాలు జరిగాయి. మొదటిది ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి కంపెనీ నియంత్రణను మొదలుపెట్టడం, రెండవది కంపెనీ రాజకీయ, పరిపాలనా విధులను బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది.

ఈ చట్టం ద్వారా భారతదేశంలో కేంద్రీకృత పాలనకు బ్రిటిష్ ప్రభుత్వం పునాదులు వేసింది.

చట్టం లక్షణాలు మార్చు

  1. బెంగాల్ గవర్నర్ పదవికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం జరిగింది. అతనికి సహాయం చేసేందుకు నలుగురు సభ్యుల కార్యనిర్వాహక మండలి ఏర్పాటు జరిగింది. లార్డ్ వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా నియమితుడయ్యాడు.
  2. బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్లను బెంగాల్ గవర్నల్ జనరల్ కి అధీనులుగా చేసింది. ఈ చట్టం అమలులోకి రాక ముందు మూడు ప్రెసిడెన్సీల గవర్నర్‌లు స్వతంత్రులుగా ఉండేవారు.
  3. కలకత్తాలో 1774లో ఈ చట్టం ప్రకారం ఒక సుప్రీం కోర్టు ఏర్పాటు జరిగింది. ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులతో ఈ సుప్రీం కోర్టు ఏర్పాటు జరిగింది.
  4. ఈ చట్టం కంపెనీ ఉద్యోగులపై పలు నిషేధాలను విధించింది. అందులో ప్రయివేటుగా ఉద్యోగాలు చేసుకోవడం, స్థానిక వ్యక్తుల నుండి బహుమానాలు లేదా లంచాలు తీసుకోవడం ఉద్యోగులకు నిషేధించబడింది.
  5. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారత భూభాగంలో జరిగే రెవెన్యూ, సివిల్, మిలిటరీ వ్యవహారాల నివేదికలను కంపెనీ ద్వారా బ్రిటన్ పార్లమెంటుకు అందించే పద్ధతిని ప్రవేశపెట్టింది. అందుకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్(కంపెనీకి సంబంధించిన ఒక విభాగం) ను బాధ్యులను చేసింది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. భారత రాజకీయ వ్యవస్థ, ఎం. లక్ష్మీకాంత్, తెలుగు అనువాదం, పుట. 1.3