లతా మంగేష్కర్

భారతీయ మహిళా చలనచిత్ర గాయకురాలు

లతా మంగేష్కర్ (మరాఠీ: लता मंगेशकर; ఆంగ్లం: Lata Mangeskar), (సెప్టెంబరు 28, 1929 - ఫిబ్రవరి 6, 2022) హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమైంది. తన మొదటి హిట్ పాట మహల్ సినిమాలోని ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా.. నేటికీ సచేతనంగా ఉంది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడింది. ఈమె సోదరి ఆశా భోంస్లే. లతా మంగేష్కర్ కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట ఆమె పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీ సినిమా జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది.

లతా మంగేష్కర్
లతా మంగేష్కర్ (2008)
జననం
హేమ మంగేష్కర్

(1929-09-28)1929 సెప్టెంబరు 28
మరణం2022 ఫిబ్రవరి 6(2022-02-06) (వయసు 92)
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుమెలోడీ రాణి
నైటింగేల్ ఆఫ్ ఇండియా
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1942–2022
తల్లిదండ్రులుపండిట్ దీనానాథ్ మంగేష్కర్
శేవంతి మంగేష్కర్
బంధువులు
ఆశా భోంస్లే (సోదరి)
ఉషా మంగేష్కర్ (సోదరి)
మీనా ఖాదికర్
హృదయనాథ్ మంగేష్కర్ (సోదరుడు)
పురస్కారాలు
సన్మానాలు
లతా మంగేష్కర్

రాజ్యసభ మాజీ ఎంపీ
పదవీ కాలం
22 నవంబరు 1999 – 21 నవంబరు 2005
నియోజకవర్గం నామినేటెడ్ (కళారంగం)

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ స్వతంత్ర[1]
సంగీత ప్రస్థానం
సంగీత శైలి
వాయిద్యాలుగాత్రం
సంతకం

జీవిత సంగ్రహం మార్చు

లత 1929 సెప్టెంబరు 28 తేదీన సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్ కు పెద్ద కుమార్తెగా (ఐదుగురు సహోదరులలో) జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా, మీనా అనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన ఆమెకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం ఉండేది కాదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతివారైనా పెద్దచదువులు చదవాలనుకొంది, కానీ వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. లత తనకు నచ్చిన గాయకుడుగా కె. ఎల్. సైగల్ ను పేర్కొంది.

దీనానాథ్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత చిముక్లా సుసార్ (1943), గజెభావు (1944), జీవన్ యాత్ర (1946), మందిర్ (1948 మొదలైన చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురైయాలు గాయనిలుగా వెలుగుతున్నారు.

లత గాయనిగా 1947లో మజ్ బూర్ చిత్రంతో మొదలుపెట్టింది. దేశ విభజనకాలంలో ఖుర్షీద్, నూర్జహాన్ లు పాకిస్థాన్ వెళ్లడం, నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యత పెరగడం వలన ఆమె గాయనిగా ఉన్నత శిఖరాల్ని చేరడానికి దోహదం చేశాయి. లతకు సంగీత దర్శకుడు గులాం హైదర్ గాయనిగా ప్రోత్సాహమిచ్చారు. సి.రామచంద్ర లత పాటను హిమాలయ శిఖరాలంత పైకి చేర్చాడు. అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలీ లోని పాటలు అద్భుత విజయాలు చవిచూశాయి. తర్వాత అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్యగాన సామ్రాజ్ఞిని చేశాయి.

హిందీ చిత్రసీమలో ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కళ్యాణ్ జీ-అనంద్ జీ, తర్వాత బప్పీలహరి, రాంలక్ష్మణ్, అనంతరం ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. అయితే ఓ.పి.నయ్యర్ మాత్రం లతపాట నా సంగీతానికి పనికిరాదని ఆమె సోదరి ఆషాను దాదాపు లతకు దగ్గరగా తీసుకెళ్ళాడు.

లత సినీనిర్మాతగా మరాఠీలో వాదల్ (1953), కాంచన్ గంగా (1954), హిందీలో ఝూంఝుర్ (1954), లేకిన్ (1990) చిత్రాలు నిర్మించింది. ఆమె సంగీత దర్శకురాలిగా రాంరాంపహునా (1950), మొహిత్యాంచి మంజుల (1963), మరాఠా టిటుకమేల్ వాలా (1964), స్వాథూ మాన్ సే (1965) మొదలైన కొన్ని చిత్రాలకు పనిచేసింది.

గాయకురాలిగా మార్చు

కెరీర్ మొదట్లో (1940వ దశకం) మార్చు

1942లో ఆమె తండ్రి గుండెజబ్బుతో చనిపోగా, నవయుగ్ చిత్రపత్ సినిమా కంపెనీ అధినేత మాస్టర్ వినాయక్ లతా కుటుంబ బాగోగులు చూసుకున్నారు. గాయనిగా, నటిగా లత కెరీర్ మొదలు పెట్టడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు.

నాచు య గడే, ఖేలు సారీ మనీ హౌస్ భారీ అనే పాటను మరాఠీ సినిమా కిటీ హాసల్ (1942) కోసం పాడారు లత. ఈ పాట ఆమె మొదటి పాట. సదాశివరావ్ నవరేకర్ ఈ పాటకు స్వరాలు అందించారు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. నవయుగ చిత్రపత్ బ్యానర్ లో తీసిన మరాఠీ సినిమా పహలీ మంగళా-గౌర్ (1942) సినిమాలో ఒక పాత్ర పోషించారు. దాదా చందేకర్ స్వరపరచిన నటాలీ చైత్రాచీ నవలాయీ పాట కూడా పాడారు ఈ సినిమాలో. మరఠీ సినిమా గజబాహు (1943) లో మత ఏక్ సపూత్ కీ దునియా బాదల్ దే తూ ఆమె పాడిన మొదటి హిందీ పాట.

1945లో మాస్టర్ వినాయక్ సినిమా కంపెనీ ముంబైకి మారిపోయినపుడు, లతా కుటుంబంతో సహా ముంబైకు మకాం మార్చారు. హిందుస్తానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ దగ్గర నేర్చుకున్నారు. వసంత్ జొగలేకర్ తీసిన హిందీ సినిమా ఆప్ కీ సేవా మే (1946) లో దత దవ్జేకర్ స్వరపరచిన పా లగూన్ కర్ జోరీ అనే పాట పాడారామె. ఈ సినిమాలో కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన రోహిణి భతె ఆ తరువాత ప్రముఖ సంప్రదాయ నృత్యకళాకారిణిగా ప్రసిద్ధి చెందారు. వినాయక్ నిర్మించిన మొదటి హిందీ చిత్రం బడీ మా (1945) సినిమాలో లతా, అమె చెల్లెలు ఆశా కూడా చిన్న పాత్రలు పోషించారు. ఈ సినిమాలో లత ఒక భజన పాట పాడుతూ కనిపిస్తారు. మాతే తేరే చరణో మే అనే భజన అది. వినాయక్ రెండవ హిందీ చిత్రం సుభద్ర (1946) సినిమాతో సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ కు పరిచయమయ్యారు లత.

1947లో పాకిస్థాన్ భారతదేశం నుంచి విడిపోయిన తరువాత ఉస్తాద్ అమంత్ అలీ ఖాన్ పాకిస్థాన్ కు వెళ్ళిపోవడంతో అమంత్ ఖాన్ దేవస్వలే వద్ద సంప్రదాయ సంగీతం నేర్చుకున్నారు లత. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ శిష్యుడు పండిట్ తులసీదాస్ శర్మ వద్ద కూడా నేర్చుకున్నారు.

1948లో వినాయక్ చనిపోయిన తరువాత గాయనిగా లతకు గులాం హైదర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. నిర్మాత శశధర్ ముఖర్జీకి లతను పరిచయం చేశారు హైదర్. లత గొంతు పీలగా ఉందంటూ ముఖర్జీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన హైదర్ చాలా బాధపడ్డారట. రాబోయే రోజుల్లో లతా గొంతు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తుంది, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం కాళ్ళావేళ్ళా పడతారని ముఖర్జీతో అన్నారట. దిల్ మేరా తోడా, ముఝే కహీ కా నా చోరా పాటతో లతకు మొదటి హిట్ ఇచ్చారు హైదర్. సెప్టెంబరు 2013లో తన 84వ పుట్టినరోజున, ఒక ఇంటర్వ్యూలో తనలో ఉన్న ప్రతిభను ముందు గుర్తించి, తన ప్రతిభపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన వ్యక్తి హైదర్ అని తలచుకున్నారు లత.

మొదట్లో లతా ప్రముఖ గాయని నూర్ జహాన్ ను అనుకరించేవారట. కానీ తర్వాత తర్వాత విపరీతమైన సాధనతో తన స్వంత శైలితో శ్రోతల మదిలో తన ముద్ర వేశారామె. అప్పట్లో హిందీ సినిమాలలో ఉర్దూ కవుల ప్రభావం వల్ల ఉర్దూ పదాలు ఎక్కువగా ఉండేవి. కథానాయకుడు దిలీప్ కుమార్ లత మహారాష్ట్రా యాస వల్ల ఆమె హిందీ భాష సరిగా లేదని ఆరోపించారు. దాంతో ఉర్దూ శిక్షకుడు షఫీతో ఉర్దూ నేర్చుకున్నారామె.

మహల్ (1949) సినిమాలోని ఆయేగా ఆనేవాలా పాటతో మొదటి హిట్ అందుకున్నారు లతా ఈ సినిమాలోని పాటలను సంగీత దర్శకుడు ఖేమ్ చంద్ ప్రకాశ్. ఈ పాటలో నటి మధుబాల నటించారు.

1950వ దశకం మార్చు

1950వ దశకంలో మంగేష్కర్ వివిధ సంగీత దర్శకులతో పనిచేశారు. అనిల్ బిశ్వాస్ సంగీత సారథ్యంలో తరానా, హీర్ సినిమాలు, శంకర్ జైకిసన్, నౌషాద్ అలీ, ఎస్.డి.బర్మన్, పండిట్ అమర్ నథ్ హుసన్ లాల్ భగత్ రాం సంగీత దర్శకత్వంలో బరీ బెహన్, మీనా బజార్, అఫ్సన, ఆదీ రాత్, అన్సూ, ఛోటీ భాబీ, అదల్-ఎ-జహంగీర్ వంటి సినిమాలు, సి.రామచంద్ర, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్ హుస్సేన్, రోషన్, కళ్యాణ్ జీ-ఆనంద్ జీ, వసంత్ దేశాయ్, సుధీర్ ఫడ్కే, హన్స్ రాజ్ భేల్, మదన్ మోహన్, ఉషా ఖన్నా వంటి వారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారామె.ధూన్ చిత్రంలో కూడ అద్బుతమైన పాటలు పాడారు.

వనారధం (1956) తో తమిళంలో మొదటి పాట పాడారామె. ఈ సినిమాలో ఎన్తమ్ కన్నలన్ అనే పాట పాడారు. ఈ సినిమా ఉరన్ ఖోతల అనే హిందీ సినిమాకు తమిళ డబ్బింగ్. నౌషాద్ సంగీత దర్శకత్వం వహించారు.

దీదార్ (1951), బైజు బవ్రా (1952), అమర్ (1954), ఉరన్ ఖోతల (1955), మదర్ ఇండియా (1957) వంటి సినిమాలలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో ఎన్నో రాగ ప్రధానమైన పాటలు పాడారు లత. నౌషాద్ మొదటి పాట లత, జి.ఎం.దురానీల డ్యుయెట్ ఏ ఛోరీ కీ జాత్ బడీ బేవాఫా. బర్ సాత్, ఆహ్ (1953), శ్రీ 420 (1955), చోరీ చోరీ (1956) సినిమాలలో లతాతో ఎక్కువ పాటలు పాడించారు ఆ సినిమాల సంగీత దర్శకులు శంకర్‌-జైకిషన్. 1957 ముందు తన అన్ని సినిమాలలోనూ లతతో పాడించుకున్నారు సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్. సచిన్ దేవ్ స్వరపరచిన సజా (1951), హౌస్ నెం.44 (1955), దేవదాస్ (1955) వంటి సినిమాలలో బర్మన్ స్వరపరచిన పాటలు పాడారు. కానీ వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె మళ్ళీ 1962 దాకా సచిన్ సంగీత సారథ్యంలో పాటలు పాడలేదు.

1958లో మధుమతి సినిమాలో లతా పాడిన ఆజా రే పరదేశీ పాటకు ఆమె ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఈ సినిమాకు సలీల్ చౌదరీ సంగీత దర్శకత్వం వహించారు. 1950వ దశకం మొదట్లో లత సి.రామచంద్ర నిర్మించిన అల్బెలా (1951), షిన్ షినకయి బుబ్లా బూ (1952), అనార్కలీ (1953), పెహ్లీ ఝలక్ (1954), ఆజాద్ (1955), ఆశా (1957), అమర్ దీప్ (1958) వంటి సినిమాలలో పాడారు. మదన్ మోహన్ సినిమాలు ఐన బాగీ (1953), రైల్వే ప్లాట్ ఫాం (1955), పాకెట్ మర్ (1956), దేఖ్ కబీరా రోయా (1957), అదాలత్ (1958), జైలర్ (1958), మొహర్ (1959), చాచా జిందాబాద్ (1959) లలో పాడారామె.

1960వ దశకం మార్చు

మొఘల్-ఎ-అజమ్ (1960) సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో లతా పాడిన ప్యార్ కియా తో డర్నా క్యా పాట ఇప్పటికీ చాలా ప్రాచుర్యం కలిగిన పాట. ఈ పాటలో మధుబాల నటించారు. దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి (1960) సినిమాలో మీనా కుమారి నటించిన, శంకర్‌-జైకిషన్ స్వరపరచిన అజీ దస్తాన్ హై యే పాట కూడా చాలా హిట్ అయింది.

1961లో బర్మన్ సహాయ దర్శకుడు జయదేవ్ స్వరపరిచిన ప్రముఖ్ భజనలు అల్లాహ్ తేరో నామ్, ప్రభు తేరో నామ్ పాడారు లత. 1962లో హేమంత్ కుమార్ స్వరపరచిన బీస్ సాల్ బాద్ సినిమాలోని కహీ దీప్ జలే కహీ దిల్ పాటకు రెండవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు లత.

1962లో ఆమెపై విష ప్రయోగం జరిగింది. డాక్టర్ ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చారని నిర్ధారించారు. 3రోజుల వరకు ఆమె మృత్యువుతో పోరాడారు. ఆ తరువాత ఆమె కోలుకున్నారు. కానీ ఈ విష ప్రయోగంతో ఆమె చాలా నీరసపడిపోయారు. 3నెలల వరకూ ఆమె మంచంపైనే ఉన్నారు. ఈ 3నెలలూ గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్ పురీ ఆమెను కోలుకోవడానికి సాయం చేశారు. ప్రతీరోజూ సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి సరదగా కథలు, కవితలు చెప్పి నవ్వించేవారట. ఆమె తినే ప్రతీ వంటనూ ముందు ఆయన తిని చెక్ చేసేవారట. ఈ సంఘటన జరిగాకా ఆమె ఇంటిలోని వంటవాడు ఆకస్మికంగా జీతం కూడా తీసుకోకుండా మాయమయ్యాడట. ఆ తరువాత ఆ వంటవాడు చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళలో పనిచేశాడట.

1963 జనవరి 27లో చీనా-భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ ఎదుట అయే మేరే వతన్ కే లోగో(నా దేశ ప్రజలారా) పాట పాడారు లత. ఈ పాట సి.రామచంద్ర స్వరపరచగా, కవి ప్రదీప్ రాశారు. ఈ పాట వింటున్న నెహ్రూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.

1963లో మంగేష్కర్ ఎస్.డి.బర్మన్ సంగీత సారథ్యంలో మళ్ళీ పాడటం మొదలుపెట్టారు. ఆయన కుమారుడు ఆర్.డి.బర్మన్ మొదటి సినిమా ఛోటే నవాబ్ లో పాడారు లత. రాహుల్ దేవ్ మిగిలిన సినిమాలు భూత్ బంగ్లా (1965), పతీ పత్నీ (1966), బహారోన్ కీ సప్నా (1967), అభిలాషా (1969) లలో కూడా పాటలు పాడారు. ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన గైడ్ (1965) సినిమాలోని ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై, కిశోర్ కుమార్తో కలసి గాతా రహా మేరా దిల్ , పియా తుసే పాటలు పాడారు. 1967లో జ్యుయెల్ థీఫ్ సినిమాలో హోతో పే ఏసా బాత్ పాట కూడా పాడారు లత.

1960ల్లో మదన్ మోహన్ సంగీత దర్శకత్వంలో అన్పధ్ (1962) లోని ఆప్ కీ నజరో నే సంజా వో కౌన్ థీ (1964) లో లగ్ జా గలే, నైనా బర్సే రిమ్ జిమ్, జహాన్ అరా (1964) లోని వో చుప్ రహే తో, మేరా సాయ (1966) సినిమాలోని తూ జహా జహా చలేగా, చిరాగ్ (1969) లోని తేరీ ఆంఖో కే సివా పాటలు పాడారు. అలాగే శంకర్-జైకిషన్ లతో కూడా ఆమె చాలా సినిమాలకు పనిచేశారు.

1960లలో లతా తన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ పాటలు ఇచ్చిన సంగీత దర్శకులు లక్ష్మీకాంత్‌-ప్యారేలాల్ లతో భాగస్వామ్యం మొదలైంది. 1963లో మొదలైన్ వీరి భాగస్వామ్యం 35 సంవత్సారాలు కొనసాగింది. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో ఆమె దాదాపు 700 పాటలు పాడారు. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో వచ్చిన పరస్మిని (1963), మిస్టర్. ఎక్స్ ఇన్ బాంబే (1964), ఆయే దిన్ బాహర్ కే (1966), మిలన్ (1967), అనిత (1967), షగిర్ద్ (1968), మేరే హమ్ దమ్ మే దోస్త్ (1968), ఇంతకం (1969), దో రాస్తే (1969), జీనే జీ రాహ్ (1969) వంటి సినిమాలలో పాటలు పాడారు లతా. జీనేకీ రాహ్ సినిమాకి లత మూడవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

మరాఠీ సంగీత దర్శకులు హ్రిదయన్త్ మంగేష్కర్, వసంత్ ప్రభు, శ్రీనివాస్ ఖాలే, సుధీర్ ఫడ్కే వంటి వారి సారథ్యంలో పలు మరాఠీ సినిమాలలో పాటలు పాడారు లత. కొన్ని మరాఠీ సినిమాలకు ఆనందఘన్ పేరుతో ఆమె స్వయంగా సంగీత దర్శకత్వం వహించారు కూడా. 1960, 1970 దశకాలలో సలీల్ చౌదరి, హేమంత్ కుమార్ వంటి వారి సంగీత సారథ్యంలో పలు బెంగాలీ సినిమాలలో కూడా పాటలు పాడారు. 1967లో క్రాంతివీర సంగొల్లి రాయన్నా సినిమాలో బెల్లెనే బెలగాయితు పాటతో కన్నడలో మొదటి పాట పాడారెమె. ఈ సినిమాకు లక్ష్మణ్ బెర్లేకర్ సంగీత దర్శకత్వం వహించారు.

ఈ దశకంలో అప్పటి టాప్ గాయకులు ముఖేష్, మన్నా డే, మహేంద్ర కపూర్, మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్లతో ఎన్నో పాటలు పాడారు లతా. 1960వ దశకంలో కొన్ని రోజుల పాటు రఫీ, లతల మధ్య రెమ్యునరేషన్ విషయంలో కొన్ని గొడవలు జరిగాయి. 1961లో మాయ సినిమాలోని తస్వీర్ తేరీ దిల్ మే పాట తరువాత ఇద్దరూ కలసి పాడకూడదనే నిర్ణయం తీసుకున్నారు. కానీ తరువాత సంగీత దర్శకుడు జైకిషన్ వారిద్దరి మధ్య విభేదాలను పరిష్కరించారు.

1970వ దశకం మార్చు

నటిమీనాకుమారి నటించిన చివరి చిత్రం 1972లో విడుదలైన పాకీజా సినిమాలో గులాం మహ్మద్ సంగీత దర్శకత్వంలో చల్తే చల్తే, ఇన్హే లోగో నే వంటి హిట్ పాటలు పాడారు లత. ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిని చివరి సినిమాలు ప్రేం పూజారీ (1970) లో రంగీలా రే, షర్మీలా (1971) లో ఖిల్తే హై గుల్ యహాన్ , అభిమాన్ (1973) లో పియా బినా వంటి పాటలు పాడారామె. అలాగే స్వరకర్త మదన్ మోహన్ చివరి సినిమాలు అయిన దస్తక్ (1970), హీర్ రాంఝా (1970), దిల్ కే రహే (1973), హిందుస్తాన్ కీ కసమ్ (1973), హసంతే జఖమ్ (1973), మౌసమ్ (1975), లైలా మజ్నూ (1976) లలో ఆమె చాలా పాటలు పాడారు.

1970లలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్, రాహుల్ దేవ్ ల సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట పాటలు పాడారు లత. లక్ష్మీకాంత్-ప్యారేలాల్ స్వరపరచిన చాలా పాటల్ని గేయరచయిత ఆనంద్ బక్షి రాశారు. రాహుల్ దేవ్ సంగీత దర్శకత్వంలో అమర్ ప్రేమ్ (1972), కరావన్ (1971), కటి పతంగ్ (1971), ఆనంది (1975) వంటి సినిమాలలో పాటలు పాడారు. ఈ సినిమాలలో గేయరచయితలు మజ్రూహ్ సుల్తాంపురీ, ఆనంద్ బక్షి, గుల్జార్ ఎన్నో పాటలు రాశారు.

1973లో పరిచయ్ సినిమా కోసం పాడిన బీతీ నా బితాయ్ పాటతో ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు లత. ఈ పాటను ఆర్.డి.బర్మన్ స్వరపరచగా, గుల్జార్ రాశారు. మలయాళంలో ఆమె పాడిన ఒకే ఒక పాట కాదలీ చెనకదలీ. ఈ పాట నెల్లు (1974) లోనిది. ఈ సినిమాకు సలీల్ చౌదరి స్వరాలు అందించగా, వయలర్ రామవర్మ రాశారు. 1975లో కోరా కాగజ్ సినిమాలో కళ్యాణ్ జీ ఆనంద్ జీ స్వరపరచిన రూతే రూతే పియా పాటకు కూడా ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు లత.

1970ల నుంచి లతా సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. కొన్ని కచేరీలను ఉచితంగా చేశారు కూడా. 1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారామె. ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కంపోజ్ చేసిన మీరాబాయ్ భజనలు, ఛాలా వాహీ దాస్ ల భక్తిగీతాలతో ఒక ఆల్బంను రిలీజ్ చేశారు లత. ఈ ఆల్బమ్లలో సాన్ వారే రంగ్ రాచీ, ఉద్ జా రే కాగా వంటి పాటలు కూడా ఉన్నాయి. 1970వ దశకం మొదట్లో ఆమె గాలిబ్ గజళ్ళు, గణేశ్ హారతులు, శాంత్ తుకారాం రాసిన అభంగ్ లు, కోలీ గేటే పేరుతో ఒక మరాఠీ జానపద గేయాలు వంటి ప్రైవేట్ ఆల్బంలను విడుదల చేశారామె. వీటిలో శాంత్ తుకారాం అభంగ్ లు శ్రీనివాస్ ఖాలే స్వరపరచగా, మిగిలినవి ఆమె తమ్ముడు హృదయనాథ్ స్వరపరిచారు.

1978లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన "సత్యం శివం సుందరం" సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది.

1970వ దశకం చివర్లో, 1980వ దశకం మొదట్లో ఆమె రెండవ తరం సంగీత దర్శకులతో పనిచేశారు. 60ల నాటి ప్రముఖ స్వరకర్తల కుమారులతో 80లలో ఆమె ఎన్నో హిట్ పాటలకు పనిచేశారు. రాహుల్ దేవ్ బర్మన్ (సచిన్ దేవ్ బర్మన్ కొడుకు), రాజేష్ రోషన్ (రోహన్ కుమారుడు), అను మాలిక్ (సర్దార్ మాలిక్ కొడుకు), ఆనంద్‌-మిలింద్ (చిత్రగుప్త్ కుమారులు) లతో పనిచేశారు ఆమె. అస్సామీ భాషలో కూడా ఆమె చాలా పాటలు పాడారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత స్వర్గీయ భుపే హజారికాతో మంచి స్నేహం ఉంది లతకు. ఆయన గైడెన్స్ లో ఆమె పాడిన దిల్ హూం హూం కరే పాట ఆ సంవత్సరంలోనే ఎక్కువ అమ్ముడుపోయిన పాటగా రికార్డు సృష్టించింది.

1980వ దశకం మార్చు

1980వ దశకంలో సంగీత దర్శకులు శివ్-హరిలతో సిల్ సిలా (1981), ఫాస్లే (1985), విజయ్ (1988), చాందినీ (1989) వంటి సినిమాలలో ఎన్నో పాటలు పాడారు లత. రామ్-లక్ష్మణ్ ల సంగీత దర్శకత్వంలో ఉస్తాదీ ఉస్తాద్ సే (1981), బెజుబాన్ (1982), వో జో హసీనా (1983), యే కేసా ఫర్జ్ (1985), మైనే ప్యార్ కియా (1989). ఏక్ ధుజే కే లియే, సిల్ సిలా, కార్జ్, ప్రేమ్ రోగీ, ప్యార్ ఝుక్తా నహీ, రామ్ తేరీ గంగ మిలీ, హీరో నాగిన, చాందినీ రామ్ లఖన్ వంటి పెద్ద బడ్జెట్ సినిమాలలో పాటలు పాడారామె. 1985లో విడుదలైన సంజోగ్ సినిమాలోని జు జు జు పాట ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్. 1988లో మంగేష్కర్ వరుసగా తమిళంలో పాటలు పాడారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆనంద్ సినిమాలో ఆరారో ఆరారో పాట, సత్య సినిమాలో వలై ఒసీ పాట పాడారు లత.

1980వ దశకంలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ బాలీవుడ్ సినీ సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశారు. వారి సంగీత సారథ్యంలో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు లత. షీషా హో థా దిల్ హో అశా (1980), తు కిత్నే బరస్ కా కరజ్ (1980), కిత్నా అసన్ హై దోస్తానా (1980), హమ్ కో భీ గమ్ ఆస్ పాస్ (1980), మేరే నసీబ్ మే సనీబ్ (1980), జిందగీ కీ నా టూటే క్రాంతీ (1981), సోలా బరస్ కీ ఏక్ ధుఝే కే లియే (1981), యే గలియన్ యే చౌబ్రా ప్రేమ్ రోగ్ (1982), లిఖ్నే వాలే నే లిఖ్ దాలేఅర్పన్ (1983), దిన్ మహీనే సాల్ అవతార్ (1983), ప్యార్ కర్నేవాలే, నిందియా సే జాగి హీరో (1983), జు జు జు సన్జోగ్ (1985), జిందగీ హర్ కదమ్ మేరీ జుంగ్ (1985), బైత్ మేరే పాస్ యాదోంకీ కసమ్ (1985), ఉంగలీ మే అంగోటీ రామ్ అవతార్ (1988) ఓ రామ్ జీ తేరే లఖన్ నే రామ్ లఖన్ (1989) వంటి ఎన్నో హిట్ పాటలు పాడారు లత. వరుస ఫ్లాపుల తరువాత అవతార్ సినిమాతో రాజేష్ ఖన్నా హిట్ అందుకున్నారు.

80లలో రాహుల్ దేవ్ బర్మన్ లతతో ఎన్నో హిట్ పాటలు పాడించారు. ఆయన సంగీత సారథ్యంలో వచ్చిన ఆజా సర్-ఎ-బజార్ ఆలీబాబా ఔర్ చాలీస్ చోర్ (1980), బిందియా తర్సే ఫిర్ ఓ రాత్ (1981), తోడీ సీ జమాన్ సితార (1981), క్యా యహీ ప్యార్ హై రాకీ (1981), దేఖో మైనే దేఖా లవ్ స్టోరీ (1981), ట్యూన్ ఓ రంగీలే కుద్రత్ (1981), జీనే కైసే కబ్ శక్తి (1982), జబ్ హం జవాన్ హోంగే బతాబ్ (1983), హుమైన్ ఔర్ జీనే అగర్ తుం నా హోతే (1983), తుఝ్ సే నారాజ్ నహీ మౌసమ్ (1983), కహీ నా జా, జీవన్ కే దిన్ బడే దిల్ వాలే (1983), జానే క్యా బాత్ సన్నీ (1984), భురీ భురీ అంఖో అర్జున్ (1985), సాగర్ కినారే సాగర్ (1985), దిన్ ప్యార్ కే ఆయేంగే సవరే వాలీ గాడీ (1986), క్యా భలా హై క్యా, ఖామూష్ సా అఫ్సానా సీలి హవా చూ లిబస్ (1988), పాస్ హో తుమ్ మగర్ కరీబ్ లూట్ మార్ (1980), సుమన్సుధా రజినీ ఛందా మన్ పసంద్ (1980), రఫీ, లతాల డ్యుయెట్లు ముఝే ఛూ రహీ హై స్వయంవర్ (1980), కభీ కభీ బెజుబాన్ జానీ ఐ లవ్ యూ (1982), తుఝ్ సంగ్ ప్రీత్ కామ్ చోర్ (1982), అంగ్రేజీ మే కెహతా హై ఖుద్ దార్ (1982), అంఖియో హి అంఖియో మే నిషాన్ (1983), దిష్మన్ నే కరే ఆఖిర్ క్యూ? (1985), తూ వాదా నా తోడ్ దిల్ తుఝ్కో దియా (1987) వంటి పాటలు ఆమె కెరీర్ లోనే క్లాసిక్స్ గా నిలిచాయి.

ఆ సమయంలోనే పూర్తిస్థాయి సంగీత దర్శకునిగా మారుతున్న బప్పీలహరి దక్షిణ భారతంలో జితేంద్ర-శ్రీదేవి-జయప్రదల సినిమాలకు డిస్కో-ప్రభావిత పాటలను అందించారు. ఆదే సమయంలో బాలీవుడ్ లో బప్పీలహరి సంగీత సారథ్యంలో లతా ఎన్నో హిట్ పాటలను పాడారు. దూరియా సబ్ మితా దో సబూత్ (1980), బైతే బైతే ఆజ్ ఆయీ పతిత (1980), జానే క్యూ ముఝే అగ్రిమెంట్ (1980), తోడా రెషమ్ లగ్తా హై జ్యోతి (1981), దర్ద్ కీ రాగిణీ ప్యాస్ (1982), కిషోర్ కుమార్ తో పాడిన డ్యుయెట్ నైనో మే సపనా హిమ్మత్ వాలా (1983) వంటివి వారిద్దరి భాగస్వామ్యంలో వచ్చిన హిట్ పాటలు.

80లలో ఖయ్యం సంగీత దర్శకత్వంలో కూడా లతా ఎన్నో హిట్ పాటలు పాడారు. కిషోర్ కుమార్ తో కలసి పాడిన డ్యుయెట్ హజార్ రహీ ముడ్ తోడీ సీ బేవాఫి (1980), సిమ్తీ హుయీ చంబల్ కీ కసమ్ (1980), న జానే క్యూ హువా దర్ద్ (1981), నకౌదా (1981), లతా-నితిన్ ముఖేష్ డ్యుయెట్ తుమ్హారీ పాలకోన్ కీ, చాందినీ రాత్ మే దిల్-ఎ-నదాన్ (1982), దిఖాయి దియే బజార్ (1982), చాంద్ కే పాస్ ఆయే దిల్-ఎ-నదాన్ (1982), భర్ లైన్ తుమ్హే, ఆజా నిందియా ఆజా లోరే (1984), కిరణ్ కిరణ్ మే షోఖియా ఏక్ నయా రిష్తా (1988) వంటి హిట్ పాటలు పాడారామె.

జూన్ 1985, యునైటెడ్ వే ఆఫ్ గ్రేటర్ టొరొంటోలోని "మాపల్ లీఫ్ గార్డెన్స్ "లో ఒక సినీ సంగీత కచేరీ చేశారామె. 12,000మంది ఈ కచేరీకి వచ్చారు. ఈ కచేరీ నిర్వహించిన స్వచ్ఛంద సంస్థకు 150,000డాలర్లు వచ్చాయి. ఈ కచేరీని పేదల సహాయార్ధం ఉచితంగా చేశారు లతా. ఈ కచేరీలో అన్నా ముర్రే కోరిక మేరకు యూ నీడ్ మీ ఇన్ ద కాన్సర్ట్ పాట పాడి శ్రోతల్ని ఉర్రూతలూగించారు లతా.

1980వ దశకంలో మిగిలిన బాలీవుడ్ సంగీత దర్శకులకు కూడా ఆమె ఎన్నో హిట్ పాటలు పాడారు. రవీంద్ర జైన్ స్వరపరచిన రామ్ తేరీ గంగా మిలీ హోగయీ)1985) లో సున్ సహిబా సున్ పాట సూపర్ హిట్ అయింది. ఉషా ఖన్నన్ కు పాడిన చందా అప్నా సఫర్ షమా (1981), షాయద్ మేరీ షాదీ, జిందగీ ప్యార్ కా సౌతాన్ (1983), హం భూల్ గయే రే సౌతాన్ కీ బేటీ (1989) ఆమే కెరీర్ లోనే అతి పెద్ద హిట్లుగా నిలిచాయి. ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీత దర్శకత్వంలో లతా కాలే కాలే గెహరే సాయే చక్రా (1981), యే ఆంఖే దేఖ్ కర్ , కుఛ్ లోగ్ మొహొబ్బత్ కో ధన్ వన్ (1981), ముఝే తుం యాద్ కర్నా మషాల్ (1984) వంటి పాటలు పాడారు. స్వరకర్తలు అమర్-ఉత్పల్ లకు జానే దో ముఝే షేహెన్ షా (1989). ఉత్తమ్ జగదీశ్ సంగీత సారథ్యంలో సజన్ మేరా ఉస్ పార్ గంగా జమునా సరస్వతి (1988), మేరే ప్యార్ కీ ఉమర్ వారిస్ (1989) వంటి పాటలు పాడారు.

1990 నుంచి ఇప్పటి వరకు మార్చు

1990వ దశకంలో ఆనంద్-మిలింద్, నదీమ్-శ్రావన్, జతిన్ లలిత్, దిలీప్ సెన్-సమీర్ సెన్, ఉత్తం సింగ్, అను మాలిక్, ఆదేశ్ శ్రీవాస్తవ, ఎ.ఆర్.రహమాన్ వంటి సంగీత దర్శకుల సారథ్యంలో ఎన్నో మంచి పాటలు పాడారు మంగేష్కర్. ఈ సమయంలోనే కొన్ని ప్రైవేట్ ఆల్బంలలోను, గజల్స్ పాడారు. ఆప్పటి ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ, హరిహరన్, కుమార్ సను, సురేశ్ వాడ్కర్, మహ్మద్ అజిజ్, అభిజీత్ భట్టాచార్య, రూప్ కుమార్ రాథోడ్, వినోద్ రాథోడ్, గుర్ దాస్ మాన్, సోను నిగమ్ లతో ఎన్నో హిట్ పాటలు పాడారు లత.

1990లో లతా హిందీ సినీ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. మొదటి సినిమాగా గుల్జార్ దర్శకత్వం వహించిన లేకిన్ సినిమాను నిర్మించారు ఆమె. ఈ సినిమాకు ఆమె తమ్ముడు హృదయనాథ్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లతా పాడిన యారా సిలి సిలీ పాటకు ఉత్తమ నేపథ్యగాయనిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు.

యష్ చోప్రా దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలోనూ పాటలు పాడారు లతా. చోప్రా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బేనర్ లో వచ్చిన చాందినీ (1989), లమ్హే (1991), దార్ (1993), యే దిల్లగీ (1994), దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (1995), దిల్ తో పాగల్ హై (1997), ఆ తరువాత 2000 దశకంలో విడుదలైన మొహొబ్బతే (2000), ముఝ్సే దోస్తీ కరోగీ! (2002), వీర్-జారా (2004) వంటి సినిమాలలో కూడా ఆమె పాటలు పాడారు.

90లలో మంగేష్కర్ రామ్ లక్ష్మణ్ సంగీత దర్శకత్వం వహించిన పత్తర్ కా ఫూల్ (1991), 100 డేస్ (1991), మెహబూబ్ మేరే మెహబూబ్ (1992), సాత్వన్ ఆస్మాన్ (1992), ఐ లవ్ యు (1992), దిల్ కీ బాజీ (1993), అంతిం న్యాయ్ (1993), ది మెలోడి ఆఫ్ లవ్ (1993), ద లా (1994), హమ్ ఆప్కే హై కౌన్! (1994), మేఘా (1996), లవ్ కుశ్ (1997), మంచల (1999), దుల్హన్ బనో మై తేరీ (1999) వంటి సినిమాలలో పాటలు పాడారు.

ఈ సమయంలోనే లతా ఎ.ఆర్.రహమాన్ సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట్ పాటలు పాడారు. జియా జలే (దిల్ సే), ఖామూషియా గున్ గుననే లగీ(ఒన్ 2 కా 4), ఏక్ తు హీ భరోసా (పుకార్), ప్యారా సా గూన్ (జుబేదా), సో గయే హై (జుబేదా), లుక్కా చుప్పీ (రంగ్ దే బసంతీ), ఓ పాలన్ హారే (లగాన్), లాడ్లీ (రానక్). పుకార్ సినిమాలో ఈ పాట పాడుతూ కనపడతారు మంగేష్కర్.

1994లో లతా మంగేష్కర్ అమర గాయకుల హిట్ పాటలను తన స్వంత గొంతుతో పాడి రికార్డ్ లు విడుదల చేశారు. కె.ఎల్.సైగల్, రఫీ, హేమంత్ కుమార్, ముఖేష్, పంకజ్ మల్లిక్, కిషోర్ కుమార్, గీతా దత్, జొహ్రబాయ్, అమీర్ బాయ్, పరౌల్ ఘోష్, కనన్ దేవి వంటి గాయకుల పాటలు పాడి వారికి తన శైలిలో నివాళి ఇచ్వారు ఆమె.

రాహుల్ దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన మొదటి పాట, ఆఖరి పాట కూడా లతా మంగేష్కర్ పాడటం విశేషం. 1994లో రాహుల్ దేవ్ ఆఖరి సినిమాలోని ఆఖరి పాట కుచ్ నా కహో (1942:ఎ లవ్ స్టోరి) పాడారు లతా.

1999లో ఆమె పేరు మీద లతా ఎయు డె పెర్ఫ్యూమ్ అనే సుగంధ ఉత్పత్తి విడుదల చేశారు.

అదే సంవత్సరంలో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. కానీ ఆమె ఎక్కువ సభలకు హాజరుకాలేదు. సహ సభ్యులు ప్రణబ్ ముఖర్జీ, షబానా అజ్మీ, అప్పటి రాజ్యసభ ఉపాధ్యక్షులు నజ్మా హెప్తుల్లా వంటి వారి నుండి విమర్శలు వచ్చేవి. ఆమె అనారోగ్యంతోనే సభకు రాలేదని చెప్పుకునేవారు. లతా రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నందుకు జీతం కానీ దిల్లీలో ప్రభుత్వ వసతిగృహం కానీ తీసుకోలేదు.[6]

2005లో దాదాపు 14ఏళ్ళ తరువాత ఆమె మళ్ళీ నదీమ్-శ్రవణ్ సంగీత దర్శకత్వంలో బేవఫా (2005) సినిమాలో కెసె పియా సై మై కహూ పాట పాడారు లతా. పేజ్ 3 (2005) లో కిత్నే అజీబ్ రిష్తే హై యహాన్ పర్ పాట, జైల్ (2009) సినిమాలో దాతా సున్ లే, సత్రంగీ పారాచ్యూట్ (2011) లో తేరే హస్నే సే ముఝ్కో, "జీనే క్యా హై వంటి పాటలు పాడారు.

28 నవంబర్ 2012లో లతా తన స్వంత ఆడియో లేబుల్ ఎల్.ఎం.మ్యూజిక్ ద్వారా భజనపాటలు విడుదల చేశారు. ఈ ఆల్బంలో తన చెల్లెలు ఉషా మంగేష్కర్ తో కలసి పాడారు. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా "స్ప్రెడింగ్ మెలోడీస్ ఎవ్రీవేర్" అనే ఆల్బంలో ఓ జానే వాలే తుఝ్కో అనే టైటిల్ పాట పాడారు ఆమె. ఈ ఆల్బంను రామ్ శంకర్ స్వరపరచగా, ఎ.కె.మిశ్రా సాహిత్యం అందించారు.

భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక మార్చు

2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో ఆమె పదవ స్థానంలో ఎంపికైయింది.[7]

ఇతర రంగాలు మార్చు

సంగీత సారధిగా మార్చు

1955లో రామ్ రామ్ పవ్హనే అనే మరాఠా సినిమాకు మొదటిసారిగా సంగీత సారధ్యం వహించారు లతా. తరువాత 60లలో ఆనంద ఘన్ అనే మారు పేరుతో కొన్ని సినిమాలకు స్వరాలు అందించారు. అవి:

  • 1963-మరాఠా టితుక మెల్వవా
  • 1963-మోహిత్యంచి మంజుల
  • 1965-సాధి మనసే
  • 1969-తుంబడి మత

సాధి మనసే సినిమాకు గాను ఆమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలోని ఐరనించియా దేవ తులా పాటకు ఉత్తమ గాయినిగా కూడ అవార్డు అందుకున్నారు లతా.

నిర్మాతగా మార్చు

లతా 4 సినిమాలను నిర్మించారు:

  • 1953 - వాదల్(మరాఠీ)
  • 1953 - జహంగీర్(హింది), సహనిర్మాతగా సి.రామచంద్ర
  • 1955 - కాంచన్(హింది)
  • 1990 - లేకిన్...(హింది)

విశేషాలు మార్చు

  • ఈమె 1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించింది.
  • ఈమె గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకొంది.
  • ఈమె తెలుగులో సంతానం (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), ఆఖరి పోరాటం (తెల్లచీరకు, ఇళయ రాజా) మొదలైన పాటలు పాడింది.
  • 1959లో టైం మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతామంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను "భారతీయ నేపథ్యగాయకుల రాణి" (Queen of Indian Playback Singers) గా పేర్కొన్నది.

పాటలు మార్చు

ఈమె పాడిన కొన్ని మధురమైన హిందీ పాటలు:

  • అయ్ మేరె వతన్ కే లోగో, జరా ఆంఖ్ మేఁ భర్ లో పానీ, జో షహీద్ హువే హైఁ ఉన్కీ, జరా యాద్ కరో ఖుర్బానీ
  • ఛోడ్ దే సారీ దునియా కిసీ కే లియే, యే మునాసిబ్ నహీఁ ఆద్‌మీ కే లియే
  • నా కొఈ ఉమంగ్ హై, నా కొఈ తరంగ్ హై, మెరీ జిందగీ హై క్యా, ఏ కటీ పతంగ్ హై
  • జబ్ భీ జీ చాహే నయీ దునియా, బసాలేతే హైఁ లోగ్, ఏక్ చెహ్రే పే కయీ చెహ్రే లగాలేతె హైఁ లోగ్

పురస్కారాలు మార్చు

భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు. ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం.

సంవత్సరం పురస్కారం చిత్రం పురస్కారం పేరు బహూకరించింది ఇతర వివరాలు
2001
 
భారతరత్న[8] భారత ప్రభుత్వం బిస్మిల్లా ఖాన్ తోకలిపి అప్పటి రాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ చేతులమీదుగా స్వీకారం.
1999
 
పద్మవిభూషణ్[9] భారత ప్రభుత్వం
1969
 
పద్మభూషణ్[10] భారత ప్రభుత్వం
2006 ది లీజియన్ అఫ్ హానర్[11] ఫ్రాన్స్ ప్రభుత్వం
  • దాదా సాహెబ్ ఫాల్కే (1989)
  • మహారాష్ట్ర భూషన్ అవార్డు (1997)
  • ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు (1999)
  • శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్
  • రాజాలక్ష్మీ అవార్డు (1990)
  • ఎ.ఎన్.ఆర్. జాతీయ అవార్డు (2009)
  • అప్సరా అవార్డు
  • కాళిదాస్ సమ్మాన్ అవార్డు
  • తాన్ సేన్ అవార్డు
  • నేపాల్ అకాడమీ అవార్డు
  • సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు

మరణం మార్చు

2022 ఫిబ్రవరి 6న ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్‌ కరోనా అనంతర ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ కన్నుమూసారు.[12] చనిపోయేనాటికి ఆమె వయస్సు 92 సంవత్సరాలు.[13] ఆమె జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం రెండు రోజులు (2022 ఫిబ్రవరి 6, 7 తేదీలు) సంతాప దినాలను ప్రకటించింది.[14][15]

స్మారక అవార్డు మార్చు

లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 ఏప్రిల్ 24న ముంబైలో స్వీకరించారు. భారతదేశానికి నిస్వార్థ సేవలందించినందుకు గాను ఆయనికి ఈ అవార్డును ప్రదానం చేశారు.[16]

చిత్రమాలిక మార్చు

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "I was misfit in parliament: Lata Mangeshkar". News18. 5 May 2012.
  2. "Playlist Ghazals - Lata Mangeshkar on Gaana.com". Gaana.com.
  3. "Playlist Bhakti By Lata Mangeshkar on Gaana.com". Gaana.com.
  4. "Playlist Bengali Folk Songs of Lata on Gaana.com". Gaana.com.
  5. "Lata Mangeshkar: The nightingale's tryst with Rabindra Sangeet". The Statesman. 28 September 2018. Retrieved 4 December 2018.
  6. "Lata Mangeshkar: స్వరరాగ గంగా ప్రవాహం.. రూపాయి జీతం కూడా తీసుకోని ఏకైక ఎంపీ". EENADU. Retrieved 2022-02-06.
  7. "A Measure Of The Man | Outlook India Magazine". web.archive.org. 2021-07-24. Archived from the original on 2021-07-24. Retrieved 2021-10-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. [1]భారతరత్న పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద లతామంగేష్కర్ జులై 25,2008 న సేకరించబడినది.
  9. పద్మవిభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద లతా మంగేష్కర్ జులై 25,2008 న సేకరించబడినది.
  10. పద్మభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద లతా మంగేష్కర్ జులై 25,2008 న సేకరించబడినది.
  11. France to honour Lata Mangeshkar[permanent dead link] శీర్షిక క్రింద జులై 25,2008 న సేకరించబడినది.
  12. "ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కన్నుమూత". EENADU. Retrieved 2022-02-06.
  13. Namasthe Telangana (6 February 2022). "గాన కోకిల లతా మంగేష్కర్‌ కన్నుమూత". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  14. "Lata Mangeshkar: లత జ్ఞాపకార్థం 2రోజులు జాతీయ సంతాప దినాలు". EENADU. Retrieved 2022-02-06.[permanent dead link]
  15. "PM Modi, Chiranjeevi, Mahesh Babu, Ravi Teja mourns Lata Mangeshkar's Demise". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-02-06. Retrieved 2022-02-16.
  16. "లతామంగేష్కర్ తొలి స్మారక అవార్డును స్వీకరించిన మోదీ". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-24. Retrieved 2022-04-24.

బయటి లింకులు మార్చు

  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Lata Mangeshkar పేజీ
  • ప్రపంచ సినీసీమకే "భారతరత్న" గానకోకిల లతామంగేష్కర్, ఫాల్కే అవార్డు విజేతలు, హెచ్. రమేష్ బాబు, చిన్నీ పబ్లికేషన్స్, 2003, పేజీలు: 87-94.