వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది.ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఒడిషాకు చెందిన తూర్పు గంగా రాజు లాంగుల నరసింగ దేవ I కళింగ వాస్తుశిల్పం ప్రకారం నిర్మించారు, 1268 ADలో అతని కుమారుడు భానుదేవ I చేత ప్రతిష్ఠించబడింది.

వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (వెనుక వైపునుండి)
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (వెనుక వైపునుండి)
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం) is located in Andhra Pradesh
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయ ప్రదేశం
భౌగోళికాంశాలు :17°46′48″N 83°12′50″E / 17.77987°N 83.213925°E / 17.77987; 83.213925
పేరు
ప్రధాన పేరు :శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:విశాఖపట్నం
ప్రదేశం:సింహాచలం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీ నరసింహస్వామి
ప్రధాన దేవత:లక్ష్మీదేవి
పుష్కరిణి:వరాహ పుష్కరిణి
కవులు:గోగులపాటి కూర్మనాధ కవి
ముఖ్య_ఉత్సవాలు:చందనోత్సవం, గిరి ప్రదక్షిణ
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సా.శ. 1098)
సృష్టికర్త:ప్రహ్లాదుడు

ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు (మే నెలలో) వస్తుంది.

స్థలపురాణం మార్చు

 
పుష్కరిణి

సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి, కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదునిని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించు' మని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.

స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహనరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహనరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహం నరుడు, సింహం రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో (ఆసనంలో) వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ (వైశాఖ పూర్ణిమకు దగ్గరలో) నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు. .

 
సింహాచలం నడక దారిలో వరాహ మూర్తి ప్రతిమ

శాసన సమృద్ధి మార్చు

  • సా.శ.1087: సింహగిరి స్వామి నరసింహదేవరగా ప్రఖ్యాతుడు. స్వామి వారి ప్రసూనాల కోసం తిరునందనవనం కల్పించే శాసనం. ఇప్పటి నుండి ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయం కనబడుతుంది.
  • సా.శ.1198: "వాయు స్ఫటికామలాభవపుషే సింహాచలస్థాయినే" = సింహాద్రి నాధుని స్పాటికామలాభ వపువుగా వర్ణించబడింది.
  • సా.శ.1266: గాంగ నరసింహ చక్రవర్తి స్వామి సన్నిధిలో సంకీర్తనం కోసం నూరుగురు స్త్రీలను స్వామివారికి సమర్పిస్తాడు.
  • సా.శ.1268: ఒక శాసనం ఈనాటికీ వ్యవహారంలో ఉన్న అడవివరాన్ని పేర్కొన్నది.
  • సా.శ.1286:
  • సా.శ.1201, 1291: రెండు శాసనాలు దేవాలయంలో వేద పఠన, అధ్యయన వైభవాన్ని తెలియజేస్తున్నాయి.
  • సా.శ.1293: అక్షయ తృతీయనాడు చందన కర్పూరాలు చాదడానికి ఒక నిబంధన చేస్తూ, ఆనాడే పాయసము, అప్పాలు మొదలైన పణ్యారాల ఆరగింపు కోసం నిబంధన కనబడుతుంది.
  • సా.శ.1342: స్వామికి ఒక మహారాణి అనంత లక్ష్మీదేవి అనేక ఆభరణాలు సమర్పించింది. అందులో బంగారు పొగడపూల మాల, సంపెంగ మాల లున్నాయి.
  • సా.శ.1350: వీరనరసింహదేవుల రాణి గంగా మహాదేవి దేవునికి అనేక సమర్పణలు కావిస్తూ వేయించిన శాసనం.
  • సా.శ. 1371: సింహాచలం అన్న పేరు సింహికారోగిరిః నుండి వచ్చినట్లు చెబుతోంది.
  • సా.శ. 1394: సింహగిరి నరహరిని అహోబల దేవరగా పేర్కొనటం జరిగింది.
 
సింహాచల గోపురం

ఈదేవాలయం లాంగూల గజపతిచే నిర్మించబడిందని పలు శాసనాలు తెలుపుచున్నాయి.ఈ ఆలయం లోని శాసనకాలం సా.శ.1100 నుండి 7శతాబ్దాలవరకు వ్యాప్తం. తూర్పుగాంగులు, రెడ్డిరాజులు, నందపురాన్ని పాలించిన శిలావంశయుజులు, మత్స్య వంశీయులు, గజపతులు స్వామికి అనేకదానాలు గావించిరి.శక సం.1438, 1441 లలో కృష్ణ దేవరాయలు స్వామిని సేవించాడు. శక సం.1438లో కృష్ణదేవరాయలు చిన్నాదేవీ తిరుమలదేవీ సహితుడై ఇక్కడకేతించి స్వామిని అనేక అలంకార వస్తువులు కైంకర్యంలను అర్పించాడు.అనేక గ్రామాలను సా.శ.1441లో ధారపోసినాడు.

గజపతులు పతనమైన తరువాత కుతుబ్ షాహీ వంశం వారు ఈ ప్రదేశంపై దండెత్తి దేవాలయ సంపదను దోచుకొనినారు.సా.శ.1604లో పద్మనాయక కులుడను విప్పర్ణ గోత్రుడును అగు సర్వప్ప అశ్వరాయుడు స్వామికి నిత్యనైవేద్య రాగభోగాలను పునరుద్ధరించి అవి యవిచ్ఛిన్నంగా జరుగునిమిత్తం నరవ అను గ్రామాన్ని సమర్పించాడు.

మిధ్య యుగాన ఈక్షేత్రం విద్యా కేంద్రమని పెక్కు శాసనాలవలన తెలుస్తుంది.శక సం.1275లో గంగానరసింహ భోగకాలాన పురాణాలు పఠించు బ్రాహ్మణులకు జీతమిచ్చునిమిత్తం శృఈ భంఢారాన 52 మాడలను గంగాదేవి యొసగింనది.శా.సం.1305లో సింహాచల మందలి బ్రాహ్మణులకు వేదం చెప్పుటకు జంపూ మహాసేనాపతి యొడ్య పెద్దిభట్టును నియమించాడు. పురాణ కావ్య నాటక వ్యాకరణ కాండవ తైత్తిరీయశాఖలను బోధించు బ్రాహ్మణులకు అదేవిధంగా నారాయణా సేనాపతి నిబంధంల నిచ్చాడు.

కూచిమంచి తిమ్మకవి (1690-1757) కట్టమూరి కామేశ్వరకవి (1830-90) సింహాచల మాహాత్మ్య శ్రీ లక్ష్మీనృసింహ చరిత్ర అనుపేర పేర రచించిన ప్రబంధం సింహచల మహాత్మ్యం వర్ణించారు. కూచిమంచి తిమ్మకవి 5 అశ్వాసాల కావ్యంగా తెలుగులో రచియించి గౌరీవల్లభునికి అంకితమిచ్చాడు.

ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులు - వారు సమర్పించిన కానుకలు మార్చు

  • విశిష్టాద్వైతం నకు ఆద్యుడైన రామానుజులవారు శైవాగమ పద్ధతిని వైష్ణవ సాంప్రదాయంలోకి (ప్రస్తుతం గర్భగుడిలో ఉండే విగ్రహం) మార్చారని ఇక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతుంటారు.
  • సా.శ.1098 నాటి చోళరాజు కులోత్తుంగ చోళుడు వేయించిన శాసనం ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో అతని పాత్ర ఉన్నట్టు విశదమవుతుంది. మరికొన్ని శాసనాల ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో 11వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు, 13వ శతాబ్దంలో తూర్పు గంగా సామ్రాజ్యాధిపతి మొదటి నరసింహుడు పాలు పంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంతంలో నున్న దాదాపు 252 శాసనాలు సింహాచలం ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి.
  • శ్రీ కృష్ణదేవరాయలు గజపతి ప్రతాప రుద్రుడుని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండు సార్లు (సా.శ. 1516, సా.శ.1519లో) దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేసాడు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించాడు. ఇప్పటికీ ఒక పచ్చల హారం ఆలయంలో ఉంది.
  • 14-15 శతాబ్దాలలో [1428] కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని, సింహాద్రి నాథుని దర్శించి నిర్మించిన శ్రీ కృష్ణదేవరాయల విజయ ధ్వజం శిలా శాసనం ఉంది. ఇదేకాక, క్షేత్ర పరిసరాలలో సా.శ.1098 తరువాత చెక్కిన దాదాపు ఐదు వందల శిలా శాసనాలు ఉన్నాయి.
  • గత రెండు శతాబ్దాలుగా విజయనగర రాజుల కుటుంబ సభ్యులు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
 
సింహాచలంలో ఆలయ రథం

ఆలయ విశేషాలు మార్చు

 
సింహాచల దేవాలయ సింహ ద్వారం లోపలి నుండి కనిపించే దృశ్యం
గాలి గోపురం-సింహ ద్వారం

సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా, పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే, పడమర ముఖద్వారం విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి.

కప్ప స్తంభం

దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైంది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.

 
సింహాచలం దేవాలయ వెనుకభాగంలో నరసింహుని విగ్రహం.
 
సింహాచలం వద్ద గంగధార
జల ధారలు

సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కల్యాణం తరువాత ఈ ఘట్టంలో స్నానం ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉంది.

భైరవ వాక

సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందింది.

 
కొత్తగా నిర్మించిన విచారణ కార్యాలయం.
వరాహ పుష్కరిణి

వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది.

మాధవధార
  • మాధవస్వామి దేవాలయం ఉంది. గిరిప్రదక్షిణం సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.

పండుగలు మార్చు

సంవత్సరంపొడుగునా సింహాచలేశునికి ఉత్సవాలు పండుగలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని:

  • పెళ్ళి కొడుకును చేయటం ముహుర్తపు రాట: చైత్ర శుద్ధ పాడ్యమి
  • కల్యాణ మహోత్సవం: చైత్ర శుద్ధ దశమి నుండి చైత్ర బహుళ పాడ్యమి వరకు
  • రథోత్సవం: చైత్ర శుద్ధ ఏకాదశి
  • చందనోత్తరణం: వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రి స్వామివారి విగ్రహం మీది చందనాన్ని తీసివేస్తారు. దీనిని చందనోత్తరణం అంటారు.
  • చందనోత్సవం: వైశాఖ శుద్ధ తదియ నాడు పగటి పూట నిజరూప దర్శనం, చందనోత్సవంతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తదియనాటి రాత్రి చందన సమర్పణ. ఈ రోజు పగలు స్వామివారి నిజరూప దృష్టి పడటంవలన సింహాచలప్రాంతమంతా ఎండవేడితో సెగలు, భుగలుగా ఉంటుందంటారు. (అక్షయ తదియకి లక్షల జనం వస్తారు. ఆనాడు నరసింహస్వామికి (అప్పన్న) పూసిన గంధం ఒలిచి, నిజరూప దర్శనం చూపిస్తారు).
  • వైశాఖ పూర్ణిమ: ఈ రోజున స్వామివారికి రెండవ విడత చందన సమర్పణం చేస్తారు.
  • జ్యేష్ఠ పూర్ణిమ: స్వామివారికి మూడవ విడత చందన సమర్పణం
  • శయనోత్సవం: ఆషాఢ శుద్ధ ఏకాదశి
  • ఆషాఢ పూర్ణిమ: స్వామి వారికి నాలుగవ సారి చందన సమర్పణం
  • గిరి ప్రదక్షిణ: ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి, కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శించడం. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన వున్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 కి.మీ వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు, మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు, ఆలయంలోనే ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసే రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షిణం జరిగే బాటలో వున్న గ్రామాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు, నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు.సింహాచలం అప్పన్న గిరిప్రదక్షిణ సందర్భంగా ఎన్.ఎ.డ్. గోపాలపట్నం పరిసరాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు. సింహాచలంలో సాయంత్రం అప్పన్న రథం ప్రారంభం నుంచి ఉదయం వరకు గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు రక్షణ కల్పించి అవసరమైన సహాయం అండించేలా సిబ్బందిని నియమిస్తారు. కంచరపాలెం నుంచి సింహాచలం వరకు 15 పాయింటులు ఉన్నాయి. ప్రతి పాయింటు వద్ద ఇద్దరు పోలీసు సిబ్బంది పహరా కాస్తారు. అత్యధికంగా స్త్రీలు గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నందున భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది.ఎన్.ఎ.డి, గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు 50మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది పనిచేస్తారు. మరో రెండు మొబైలు బృందాలు ప్రతీ క్షణం పహరా తిరుగుతుంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటలవరకు సింహాచలం నుంచి హనుమంతవాక వరకు ఒక బృందం, హనుమంతవాక నుంచి కంచరపాలెం, మాధవధార, ఎన్.ఎ.డి మీదుగా గోపాలపట్నం, సింహాచలం వరకు ఒక బృందం ప్రతీక్షణం గస్తీ తిరుగుతుంది. కొందరు భక్తులు సింహాచలం తొలిపావంచా నుంచి బయలుదేరి హనుమంతవాక మీదుగా అప్పుఘర్ చేరుకుని, సముద్రస్నానాలు చేసి మాధవధారలోని మాధవస్వామిని చేరడానికి రాత్రి 2.30 నిమిషాలకు బయలు దేరుతారు. వీరు పోర్టు వెనుక నుంచి కైలాసపురం నివాసప్రాంతాల మీదుగా ఎన్.ఎ.డి చేరుకుంటారు. వీరందరికి ప్రత్యేక భద్రతకు ఒక పోలీసు టీము తిరుగు తుంది. రథంతో పాటు ఒక ఇన్‌ఛార్జి అధికారి ఆధ్వర్యంలో పోలీసు భద్రతా దళం ఉంటుంది. ప్రతినిమిషం అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు. 5వ పట్టణ పోలీసులు ప్రత్యేక బృందంగా తిరుగుతారు. భక్తుల సౌకర్యార్ధం సింహాచలం దేవస్థానం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. రెండు మూడు కి.మీ.కు ఒక శిబిరం ఏర్పాటు చేసింది. భక్తులు విశ్రాంతి తీసుకోవటానికి, మంచినీరు తీసుకోవటానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు ఉంటాయి. ఎన్.ఏ.డి కూడలి, గోపాలపట్నం పెట్రోలు బానికి వద్ద సహాయం చేసే శిబిరాలను దేవస్థానం వారు ఏర్పాటు ఉంటుంది. .
  • కరాళ చందనం: శ్రావణ పూర్ణిమ నాడు స్వామి వారికి చందనమలదడం. ఇది కరాళ చందన సమర్పణ
  • పవిత్రోత్సవం:బాధ్రపద శుద్ధ దశమి నుండి చతుర్దశి వరకు. స్వామివారి నిత్యనైమిత్తికాలలో తెలిసిగాని, తెలియకగాని జరిగిన దోషనివారణకోసం జరిపే ఉత్సవం.
  • శరన్నవ రాత్రులు: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుగుతాయి.
  • విజయదశమి, శమీపూజ: ఆశ్వయుజ శుద్ధ దశమి. స్వామి వారు కొండ క్రింది పుష్పక వనానికి వచ్చి, జమ్మి వేట సాగిస్తారు.
  • క్షీరాబ్ధి ద్వాదశి: కార్తీక శుద్ధ ద్వాదశి.
  • వైకుంఠ ఏకాదశికి 10రోజుల ముందు పగల్ పత్తు 10రోజుల తరువాత రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి

రాపత్తులో స్వామి రోజుకో అలంకరణలో కనిపిస్తారు

ప్రధాన పూజలు మార్చు

1. స్వామి వారి నిత్యకల్యాణం: టిక్కెట్టు ధర రూ.1000, రోజూ జరిగే ఈ సేవలో స్వామివారి పట్టు శేష వస్త్రం, చీర, రవికె, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, ఆరుగురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. 2. స్వర్ణ పుష్పార్చన: టిక్కెట్టు ధర రూ.1116, ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికె, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు.

ఇతర సేవల ధరలు మార్చు

  • సహస్రనామార్చన: రూ.200
  • అష్టోత్తర శతనామార్చన: రూ.100
  • లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన: రూ.50
  • గరుడ సేవ: రూ.300
  • కప్పస్తంభ ఆలింగనం: రూ.25
  • లక్ష్మీనారాయణ వ్రతం: రూ.50
  • గోపూజ: రూ.50
  • గోసంరక్షణ పథకం విరాళం: రూ.1116
  • పశువుకట్టు: రూ.15
  • అన్నప్రాశన, అక్షరాభ్యాసం: రూ.50
  • ద్విచక్రవాహన పూజ: రూ.100
  • కారు పూజ: రూ.200
  • కేశఖండన: రూ.10

స్వామి కైంకర్యాలు-దర్శన వేళలు మార్చు

దేవాలయంలో దర్శనవేళలు-ఉదయం 7 నుండి మధ్యాహ్నం 11.30 వరకు, తిరిగి 12.30 నుండి 2.30వరకు, తిరిగి 3.30 నుండి 7వరకు, సాయంత్రం 8.30 నుండి రాత్రి 9 వరకూ దర్శనం లభిస్తుంది

దర్శన వేళలు మార్చు

  • ఉదయం 6.30 నుంచి 11.30 వరకు సర్వదర్శనం
  • ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.
  • మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సర్వదర్శనం
  • మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు
  • సాయంత్రం 3 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం
  • రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.
  • రాత్రి 8.30 నుంచి 9 వరకు సర్వదర్శనం
  • రాత్రి 9.00 పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు
  • మరలా ఉదయం 6.30కి యథావిధిగా దర్శనాలు లభిస్తాయి.

దర్శనం టిక్కెట్ల ధరలు మార్చు

  • రూ.100 గాలిగోపురం నుంచి అంతరాలయంలోకి ప్రవేశం
  • రూ.100 అష్టోత్తరం టిక్కెట్టు. అంతరాలయంలో గోత్రనామాలతో పూజ చేస్తారు
  • రూ.20 సాధారణ క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం.

వసతి కొరకు-ఎ.పి.టి.డి.సి., చందన టూరిస్టు రెస్ట్ హౌస్, దేవాలయ సత్రం, తిరుమల దేవస్థాన సత్రాలు ఉన్నాయి.

చేరుకొనే విధానం మార్చు

విశాఖపట్టణం వరకు బస్సు, రైలు, విమాన మార్గాలలో రావచ్చును. అక్కడ నుండి సింహాచలం కొండ క్రిందికి (అడవివరం) సుమారు 15 కి.మీ. లోపు దూరం ఉంటుంది. అక్కడికి సిటీబస్సు, ఆటో, టాక్సీలలో చేరవచ్చును. సింహాచలం కొండ క్రింది నుండి పైకి దేవాలయం వరకు మెట్లమీదుగా (సుమారు వెయ్యి మెట్లు) గాని, దేవస్థానంవారి ఘాట్ రోడ్డు మీదుగా దేవస్థానం బస్సులోగాని, టాక్సీలోగాని చేరవచ్చును.

రవాణా సౌకర్యం మార్చు

 
సింహాచలం రైల్వేస్టేషన్

సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌకా, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్‌ నుంచి 11 కి.మీ, విశాఖపట్నం బస్‌ స్టేషన్‌ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలానికి 5 కి.మీల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్‌ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్‌ క్యాబ్‌లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్‌ రుసుము చెల్లించి ఆ వాహనాల్లోనే చేరుకోవచ్చు. కొండ పైకి చేరుకునేందుకు దేవస్థానం వారు నాలుగు, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు.

ఇతర దర్శనీయ స్థలాలు మార్చు

ఆండాళ్‌ సన్నిధి (గోదాదేవి), సింహవల్లీ తాయారు సన్నిధి, లక్ష్మి నారాయణ సన్నిధి, త్రిపురాంతక స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, శ్రీసీతారామస్వామి ఆలయం, గంగాధర, అడివివరం గ్రామం నుంచి 3 కి.మీల దూరంలో భైరవస్వామి సన్నిధి, కొండ దిగువన వరాహ పుష్కరిణి, కొండ మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్థూపం, సింహాచలానికి 8 కి.మీ దూరంలో శ్రీమాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికొచ్చే పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

పరిసరాల్లోని దర్శనీయ స్థలాలు మార్చు

ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్న విశాఖపట్నం, భీమిలి బీచ్‌, తొట్లకొండ బౌద్ధారామం, తదితరాలు ఉన్నాయి. ఇవి కాక, ఆంధ్రా వూటీగా పేరున్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బొర్రా గుహలు, అరకులోయ (సుమారు 100 కి.మీ) వెళ్లడం సౌలభ్యంగా ఉండటం సింహాచలం వచ్చే పర్యాటకులకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు

సింహాచలం దేవస్థానం భూములు క్రమబద్ధీకరణ సమస్య మార్చు

సింహాచలం దేవస్థానం భూముల క్రమబద్ధీకరణకు చెందిన 578 జీవో నిలిచిపోయినప్పటికి దానిపై అధికారులు జిల్లా కలెక్టరు ఆదేశాలమేరకు అయిదు గ్రామాల్లో ప్రజాభిప్రయ నసేకరణ్ ప్రారంభించారు 2010 జూలై 6 నుంచి గతంలో దేవస్థానం స్థలాల్లో గృహనిర్మాణాలు చేపట్టిన వారిలో చాలామంది ఈ జీ.ఓ. ప్రకారం ఎందుకు క్రమబద్ధీకరణ చేసుకోలేదో తెలుసుకోవడానికి ఈ సేకరణ చేస్తున్నారు.

చిత్రమాలిక మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

వనరులు-మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు