విలియం బెంటింక్

బ్రిటీష్ సైనికుడు మరియు రాజనీతిజ్ఞుడు

విలియం బెంటింక్ (1774-1839)

మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్ లార్డ్ విలియం బెంటింక్

లార్డు విలియం బెంటింక్ గా ప్రసిధి చెందిన విలియం హెన్రీ కావెండిష్ బెంటింక్ (Lord William Henry Cavendish Bentinck ) బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనికి గవర్నర్ జనరల్ గా భారతదేశమును 1828-1835 మధ్య పరిపాలించాడు. 1773 సంవత్సరపు రెగ్యులేటింగ్ చట్టము ప్రకారము వారన్ హేస్టింగ్సు బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీకి మొదటి గవర్నర్ జనరల్ అయుండగా 1833 వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము ప్రకారము విలియం బెంటింక్ బ్రిటిష్ ఇండియాకు మొదటి గవర్నర్ జనరల్ అనవచ్చును. ఉదార రాజనీతిజ్ఞుడనియూ, స్వాతంత్ర్యప్రియుడనియూ ప్రసిధిచెంది యుండెను. బెంటిక్ యొక్క ఉదారభావములు ఆయన పలికిన వాక్యముల వల్లనే తెలియగలదు. ఉల్లేఖన "నోరులేని జనసామాన్యము అజ్ఞానులగు అవకాశముచూసుకుని ఆ అజ్ఞానము చిరస్థాయిగా చేసి దానివలన అక్రమలాభలను కొన్ని పొందుటయే ఈ ప్రభుత్వ లక్ష్యమను తలంపు బ్రిటిష్ నీతికిని ధర్మమునకును విరుధ్దము" అని పలుకచూ పాఠశాలలను విరివిగా స్థాపించి విద్యాభివృధ్దికి తోడ్పెను. ఈయన చేసిన కొన్ని గొప్ప సంస్కరణలవల్ల భారతీయుల పరిపాలనా శక్తి సామర్ధ్యములను గుర్తింపుచేయబడి కంపెనీ ప్రభుత్వయంత్రాంగములో తొలిసారిగా బాధ్యతాయుతమైన ఉన్నత పదవులు, హోదాకల ఉద్యోగములు భారతీయులకు లభించే అవకాశము కలిగినది. విద్యారంగములోను, సాంఘిక జీవనములోను కూడా చిరస్మరణీయములైన సంస్కరణలుచేశాడు. విలియం బెంటింక్ కార్యకాలము భారతీయుల హితముకోరినదైనట్టిదిని భారతీయులకు సంతోషముచేకూర్చినదనీ చెప్పుటకు మరో చరిత్రాధారము ప్రముఖ బ్రిటిష్ రాజ్యాంగవేత్త, చరిత్రకారుడు, రచయిత అయిన సర్ జార్జి ట్రవెలియాన్ (Sir George Otto Trevelyan) 1853లో బ్రిటిష్ పార్లమెంటులో (హౌస్ ఆఫ్ లార్ఢ్సు) ప్రసంగములో వక్కాణించినట్లుగా భారతదేశము భారతీయుల క్షేమలాభముల కొరకే పరిపాలించబడవలెనన్న సూత్రము ప్రారంభించిన ఘనత విలియం బెంటింక్ ఇయ్యవలెనని చెప్పక తప్పదు. భారతదేశములో ఆతని తదనంతరం జరుగిన బ్రిటిష పరిపాలనకు విలియం బెంటిక్ పరిపాలనారీతి, కార్యాచరణ ఒక గీటురాయని నిస్సందేహముగా చెప్పవచ్చును [1]

జీవిత ముఖ్యాంశాలు మార్చు

1774 సెప్టెంబరు 14 తేదిన లండన్ దగ్గర బకింగహామ్ షైర్లో జన్మించెను. తండ్రి విలియమ్ బెంటింక్ 1783 లో బ్రిటిష్ ప్రధానమంత్రిగానుండెను. తల్లి డొరోతి కావెండిష్. తొలి విద్యాభ్యాసము లండన్ జిల్లాలోని ఈలింగ్, తరువాత లండన్ నగరములోని ప్రముఖమైన వెస్టిమినిస్టర్ పాఠశాలలయందు జరిగింది. బెంటింక్ దొర జీవితములో రెండు ముఖ్య మలుపులు దురదృష్టకర మైనవైననూ మొత్తముమీద అదృష్టజాతకుడనే చెప్పాలి. అతని స్వతంత్రభావాలు, ఉదారత గవర్నర్ జనరల్ గా భారతదేశములో పనిచేసిన కాలంలో గొప్పపేరు తెచ్చినవి. 17వ ఏటనే సైనికోద్యోగములో ప్రవేశించాడు. ఆకాలమునందు ఇంగ్లడులో సైన్యములో చేరు పద్ధతులలో ఖరీదుచేసి చేరే సైనిక స్థాయి (Ensign Commission) ఎన్సైన కమిషన్ లో చిన్న సైన్యాదికారి పదవి (లెఫ్టెనెంన్టు) గా 1791 సైన్యములో చేరి త్వరితగతిన పదోన్నతులతో1794లో లెఫ్టెనెంన్టు కర్నల్ గా నెదర్లాండ్ డ్యూక్ సిబ్బందిలో పనిచేసి 1798 కర్నల్ స్థాయికి చేరుకుని 1799 నుండి 1801 వరకూ ఇటలీ, ఆస్ట్రియా దేశములలో సైనిక చర్యలలో అనుభవము గణించి తిరిగివచ్చిన తరువాత తండ్రిగారి పలుకుబడి వలన తన 29 వ ఏటనే, 1803లో బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెంసీ గవర్నరుగా నియమించ బడినాడు. అదే సంవత్సరములో వివాహముగూడా జరిగెను. ఐర్లాండుదేశస్తురాలు మేరి ఆక్సన్ తో వివాహమైనది. 1805 లో మేజర్ జనరల్ గా పదోన్నతి యివ్వబడింది. గవర్నరుగా మద్రాసు (ఇప్పటి చెన్నై రాష్ట్రము) లో బాధ్యతలునిర్వహించుతున్న కాలములో దేశీయ సైనికులకు మతవిరుధ్ధమైన ఆదేశాలు ఇవ్వబడినందున వెల్లూర్ లోని దేశీయ సైనిక దళములో తిరుగుబాటు జరిగింది. అందుకు బాధ్యత గవర్నర్ బెంటింక్ పై ఆరోపింపబడి 1807లో పదవినుంచి తొలగించ బడినాడు.ఇది మొదటి దురదృష్టకరమైన మలుపు.[2]

నెపోలియన్ యుద్దములలో గడించిన అనుభవము (1808-1815) మార్చు

19 వ శతాబ్దారంభములో మొదటి 15 సంవత్సరములలో (1800-1815) ఐరోపాలో నెపోలియన్ యుద్దములు అనబడి అనేక దేశములలో జరిగిన యుద్దములలో ఫ్రెంచిదేశపు నాయకుడైన నెపోలియన్ + అతని మిత్రపక్షముకు ప్రతిపక్షముగా బ్రిటిషదేశము+మిత్రపక్ష కూటమిలు కలసి పోరాడెను. ఆ 15 సంవత్సరములలో మిత్రపక్ష దేశములనబడినవి పక్షములుమారినప్పటికీ బ్రిటిష్ దేశము తదేకదీక్షతో నెపోలియన్ కు ప్రతిపక్షముగనే పోరాటము సాగించింది. 1803-1815 వరకూ విశాలప్రపంచములో నెపోలియన్ సైనిక చర్యలు వుదృతముగానుండెను. అనేక దేశములలో బ్రిటిష్ వారి వలసరాజ్య విస్తీరణ యోచనలున్నందున, నెపోలియన్ తో యుద్దము సంభవించు దేశములలో మిత్రకూటమితో పాలు పంచు కునటకునూ, మిత్రదేశముల రక్షణకును బ్రిటన్ అనేక దేశములలో తమ సైనిక విన్యాసములు జరుపుచుండెను. బెంటింక్ కు 1808-1815 మధ్య అటువంటి యుద్దముల అనుభవము కలిగించుటకు అనేకదేశములకు పంపినందున అచ్చట యుద్దానుభవము పొందెను. పెనిన్స్యులార్ యుద్దము అనబడిన యుద్దము,1807 -1814 మధ్యలో జరిగింది. ఆయుధ్దము బ్రిటన్+స్పేయిన్ +పోర్చుగల్ కూటమి వారు నెపోలియన్ కి ప్రతిపక్షముగా సలిపిన యుద్దము. ఆ కాలమందు 1808 లో పోర్చుగల్లో నూ, అటుతరువాత స్పెయిన్ లోను బ్రిటిష్ సైనిక సిబ్బందిలో చేరుటకు విలియం బెంటింక్ పంపబడినాడు. 1809లో స్పెయిన్ దేశములోని కొరున్నాయుద్దములో (battle of Corunna) ఫ్రెంచ్ సైన్యముతో బ్రిటిష్ సైన్యాధిపతి సర్ జాన్ మూర్ సైన్యముతోకూడి యుద్ధమున అనుభవము సంపాదించాడు. జనరల్ ఆర్ధర్ వెల్లెస్లీ సారథ్యములోని సైన్యమునందు ఒక అధిపతిగా లెఫ్టెనెంన్టు జనరల్ స్థాయి అధికారిగా జర్మనీలో సైన్యమును పోగుచేయుటకు వెళ్లాడు. అప్పటిలో జర్మనీ బ్రిటిష్ వారి మిత్రపక్షమైయుండినది. అచ్చట కూడగట్టుకున్న సైన్యముతో సిసిలీపైన, ఇటలీ తూర్పుతీరముపైన యుద్దము చేశారు. సిసిలీ బ్రిటిష్ వారికి స్వాదీనమైనతరువాత 1811 నుండి 1814 దాకా సిసిలి ద్వీపములో బ్రిటిష్ రాజ్యప్రతినిధిగాను, సర్వసైన్యాధికారిగానుండెను. అప్పటిదాకా స్పెయిన్, ఇటలీ, సిసిలీ ద్వీపములు ఫ్రెంచి నాయకుడైన నెపోలియన్ కు సామంతరాజ్యములుగా నుండిన దేశములు. ఆ రాజ్యములను పరిపాలించువారు నెపోలియన్ మిత్రకూటమి వారుగానుండిరి. సిసిలీ ద్వీపమున మారియా కరోలినా అను ఆస్ట్రియా దేశపు రాణి పరిపాలనలోనుండినది. లార్డు బెంటింక్ ఆమెను త్రోసి రాజని తనే రాజ్యాధికారము చేపట్టి సిసిలీ దేశానికి రాజ్యాంగము తయారుచేయించి ఇటలీతో కలిపి అచ్చట నెపోలియన్ పట్టుసడలించాలనే ప్రయత్నముచేయుచూ ఇటలీపై దండయాత్రకు బయలుదేరాడు. కానీ లార్డు బెంటింక్ చెయుచున్న ఆ సన్నాహములు బ్రిటిష ప్రభుత్వముయొక్క రాజ్యతంత్రమునకు విరుద్దమైనదిగానుండినందున అక్కడనుండి విరమించి వచ్చెయమని 1815 లో ఆదేశించారు. బెంటింక్ జీవితములో ఇది రెండవ దురదృష్టకరమైన మలుపుని చెప్పవచ్చు. సిసిలీనుండి ఇంగ్లండు వచ్చేసిన తరువాత బ్రిటిష్ పార్లమెంటులో 1816 నుండి 1826 దాకా సభ్యుడుగానుండెను. రాజకీయాలలో ప్రమేయం చేసుకోకపోయినప్పటికీ అంతకుముందు రెండుతడవలు ( 1796-1803, 1812-1814) సభ్యడుగానుండేను. యుద్దములలో నిమగ్నుడైయున్న కాలములో స్వదేశమునందు 1813 -1817 మద్య కె.బి., జి.సి.బి., జి. సి. హెచ్ అను బ్రిటిష్ పురస్కారాలు, హోదాలతో సన్మానితుడైనాడు. 1819 లో మరల ఈస్టు ఇండియా కంపెనీ మద్రాసు ప్రెసిడెంసీకి గవర్నరుగా ఉద్యోగమువచ్చినప్పిటికీ వెళ్లుటకు నిరాకరించాడు. గవర్నర్ జనరల్ పదవిలో పనిచేయు అవకాశము 1827 సూచించబడి లండనులోని ప్రీవీకౌన్సిలో సభ్యత్వముపోందిన మీదట ఆ పదవి స్వీకరించి 1828 నుండి 1835 దాకా కలకత్తాలో పదవీబాధ్యతలు నిర్వహించి భారతదేశ ప్రజలపురోగతి, దేశాబివృధ్దికి తోడ్పడునట్టి చెప్పుకోదగ్గ సంస్కరణలు చేశాడు. అతనికి స్మారక చిహ్నముగ తదనంతరం కలకత్తాలో నెలకొల్పబడిన విలియంబెంటింక్ విగ్రహము భారతీయ ప్రజల మన్ననలను, బ్రిటిష్ ప్రభువుల సంతృప్తిని తెలుపుచున్నది. పదవి విరమించిన తరువాత 1839 జూన్ 17 తేదీన ఫ్రాన్సు దేశపు రాజధాని పారీస్ లో చనిపోయాడు.

బయట లింకులు మార్చు

http://www.historyhome.co.uk/people/bentin-w.htm

గవర్నర్ జనరల్ గా కార్యకాలమందలి ముఖ్యాంశాలు (1828-1835) మార్చు

విలియం బెంటింక్ ను ఈ పదవికి నియమించునప్పుడు కంపెనీ వారి దిగజారిన ఆదాయము, ఆర్థిక స్థితిని ముఖ్యముగా తిరగతీయవలసినదని కంపెనివారు అప్పచెప్పిన బాధ్యతను అతి స్వల్పకాలములోనే జయప్రథముగా నిర్వహించి తన కార్యదక్షతను చూపెట్టగలిగాడు. ఎలా చేయగలిగిందీ చరిత్రలో విశదమైనంతమట్టుకూ రాబడికి మించిన ఖర్చులను తగ్గించుటవల్లనేని కనబడుచున్నది. పరిపాలనా సమర్ధతవలనగూడా అయ్యుండవచ్చును. కమిషన్లు ఏర్పాటు చేసి సివిల్ మరియూ మిలిటరీ విభాగములలో జరుగుతున్న అధిక ఖర్చులను గుర్తింపచేసి వాటిని పరిసమాప్తిచేయుట, మరియూ పరిపాలన, న్యాయ సంస్థలలో ఆధిక జీతములతో నియమించు ఇంగ్లీషు ఉద్యోగస్తుల బదులు చాల తక్కువ జీతములతోనే దేశీయ ఉద్యోగస్తులను నియమించుటవలననూ, మిలిటరీ సిబ్బందికి జీతములకు పైపెచ్చుగా ఇచ్చుచున్న రోజువారి బత్తెములను రద్దుపరచియూ కంపెనికి రాబడికిమించిన వ్యయములను తగ్గించి ఆర్థిక స్థితిని మెరుగుపరచాడు. బెంటింక్ చేపట్టిన ఆర్థికసంస్కరణలవల్ల ఇంగ్లీషు ఉద్యోగులు అసంతృప్తులై విరోధము ప్రకటించినప్పటికినీ ఆర్థికలోటుతో నడచుచున్న కంపెనీని ఆర్థిక సమృధ్దిగా చేసి కంపెని డైరెక్టర్లు తనపై పెట్టిన బాధ్యతను లక్ష్యమును సాధించాడు. విలియం బెంటిక్ కార్యకాలము చివరిన 1833లో బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెని రాజ్యాధికార చట్టము అమలుచేయబడి కంపెని వ్యాపారవిసిష్టాధికార హక్కులు పూర్తిగా తీసివెయబడినవి. తత్ఫలితముగా ఈస్టు ఇండియా కంపెని కేవలము రాజ్యపాలనచేయు బ్రిటిష్ ప్రభుత్వము వారి రాజ్య ప్రతినిధిగా చేయబడినందున 1833 నుండి భారతదేశము బ్రిటిష్ ఇండియా గనూ, విలియంబెంటింక్ బ్రిటిష్ ఇండియా మొదటి గవర్నర్ జనరల్ గను పరిగణించవచ్చును. బెంటింక్ కార్యకాలమందు చేసిన రాజ్యతంత్రములు చాల తక్కువ. మైసూరు రాష్ట్రమందలి రాజు పరిపాలనను రద్దుపరచి కంపెనీవారి పరిపాలన ప్రవేశ పెట్టుట, పంజాబ్ రాజు రంజీత్ సింగ్ తోనూ, సింధ్ ప్రాంతములను పరిపాలించుచున్న అమీరులతోను సంధి వడంబడికచేయుట వంటివి. బెంటిక్ చేసిన ఇతర చిరస్మరణీయ కార్యములలో థగ్గులనబడు (Thugs) దారిదోపిడీ దొంగలను, హత్యగాండ్రను అణచివేయుట, సమాజములో అప్పటిలోనున్న శిక్షాదండన పద్ధతి కొరడాలతో కొట్టుటను కూడా నిషేధించుచూ చేసిన సం స్కరణములు గణనీయమైనవి. ఆ కాలమందు దారిదోపిడిదొంగలు కాళికాశక్తి ఆరాధన పేరట మానవ బాటసారులను పట్టుకుని బలివ్వటం తరచూ జరిగే ఘోరకృత్యముల వంటివి బెంటింక్ చేసిన సంస్కరణలతో అదుపులోపెట్టబడినవి. 1833 వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము ప్రకారము నిర్మించబడిన గవర్నింగ్ కౌన్సల్ లో న్యాయశాస్త్రనిపుణిగా నుండిన ప్రసిధ్ధ చరిత్రకారుడైన ధామస్ మెకాలే (Thomas Babington Macaulay), జేమ్స మిల్ (James Mill) విలియం బెంటింక్ సలహాదారులుగా నున్న వారిలో చెప్పదగిన వారు [1]

భూసంస్కరణలు మార్చు

1794 లో గవర్నర్ జనరల్ కారన్ వాలీసు వంగరాష్ట్రములో చేసిన శాశ్వత పరిష్కార మనే భూసంస్కరణ విలియం బెంటిక్ అసంతృప్తి వెలిబుచ్చి తరువాత 1817లో సర్ ధామస్ మన్రో మద్రాసు రాష్ట్రములో ప్రవేశపెట్టిన రైతువారీ పద్ధతిని విలియంబెంటింక్ సమర్దిచటం జరిగింది. 1822 లో మెకంజై (Holt Mackenzie) ప్రవేశపెట్టిన భూసిస్తు నిర్ణయ విధానము ( మహల్వారి సెటిల్ మెంటు) అమలులోనుండినదాని ప్రకారము భూమిమీద వచ్చు ఆదాయములో నాల్గింట మూడువంతులు సిస్తుగా నిర్ణయించబడి ఉత్తర హిందుస్తానములో అమలుచేయబడియున్నది. రైతులకు అది అతిభారమైన సిస్తువిధానము. విలియంబెంటింక్ గవర్నర్ జనరల్ గా చేసిన భూసంస్కరణ ద్వారా ఆ మెహల్వారి విధానమును క్షుణ్ణముగా పునరాలోచనచేసి రెవెన్యూ కమీషనర్ గానుండిన మేధావి మెర్టిన్స్ బర్డు ( Bird, Robert Merttins) సలహతో కృషి సల్పి చేసిన భూసంస్కరణ ద్వారా అట్టి సిస్తును తగ్గించి 2/3 వంతులు మాత్రమే (సెటిల్మెంటు) పరిష్కారము చేసి ప్రజలకు మంచిచేశాడు. ఉత్తర భారతదేశ భూసిస్తు విభాగమును పర్యవేక్షించుటకు ప్రత్యేకముగా అల్హాబాదులో రెవెన్యూ బోర్డునొకటి నియమించెను.

పరిపాలన సంస్కరణలు మార్చు

భారతీయులకు సివిల్ అధికారములు హెచ్చుచేయుటయు, ఆంగ్లేయులకు కలకత్తా సుప్రీమ్ కోర్టుకు సిివిల్ అప్పీల్ చేసుకును హక్కు తీసివేయుటయు విలియం బెంటిక్ చేసిన మహా గణనీయమైన సంస్కరణలు. భారతీయ ప్రజాహితములో చేసినట్టి ఆ సంస్కరణలు తెల్లవారికి నచ్చక బెంటికిపై ఆక్రోశము వెలిబుచ్చిరి. న్యాయస్తానములలో అప్పటివరకూ వాడుచున్న పార్సీ భాషమాధ్యము బదులు ఇంగ్లీషు భాషను ప్రవేశపెట్టెను.వారన్ హేస్టింగ్సు కాలమందలి సర్కూట్ కోర్టులనందు జీతములు లేకుండా కమిషన్ పై ఆధారపడవలసిన మునసబ్బుల వలన కోర్టుకేసులు వృధ్ధికావటమేకాక ప్రజలు న్యాయకోసము వేచియుండవలసిన సమయము అత్యధికమైయుండెను. అట్టి సర్కూట్ కోర్టులను విలియంబెంటింక్ సమాప్తిచేసి వాటిస్తానమందు ప్రతి జిల్లాకు సివిల్, సెషన్సు జడ్జీలను నియమించెను. అంతే కాక న్యాయసంస్థలకు సంబంధించిన సంస్కరణలవల్ల సివిల్ కేసుల విచారణ మొత్తం దేశీయ జడ్జీలక్రిందనే జరిగేటటులనూ, ఉత్తర భారతదేశానికి ప్రత్యేక సదర్ కోర్టులును (chief/ Principal courts) నియమించ బడినవి. విలియంబెంటింక్ చేసిన అనేక సంస్కరణలు అతని తదనంతరం కూడా సాగినవి. కానీ సరకురవాణాలపై పన్నువిధుంచు నిబంధనలను బెంటికి కార్యకాలం తరువాత సమాప్తిచేయబడినవి.

సామాజిక మతసంస్కరణ మార్చు

సతీసహగమనము అను మూఢాచారము భారతదేశములో చిరకాలముగానుండిన మూఢనమ్మకములపై ఉద్భవించిన దురాచారము. చనిపోయిన భర్తచితిపై భార్యకూడా అగ్నిలో ఆహుతి అగుట. అట్టి మూఢాచారమును ఖండించి రూపుమాపుటకు బంగళా దేశపు మహా మేదావి రాజా రామ్మోహన్ రాయ్ అనేక ఉపన్యాసములు చేసి ప్రచారముచేశాడు. ఆ దురాచారమును సంస్కరించుటకు భారతదేశములో నేకాక ఇంగ్లండుదేశములో కూడా భారత ధేశ ప్రజలహితము కోరి ప్రచారముచేసినట్టి రాజా రామ్మోహన్ రాయ్ విలియంబెంటిక్ కు సన్నిహితుడైన తరువాత ఆ దురాచారమును నిషేధించుచూ 1829 డిసెంబరు 29 తేదిన విలియం బెంటింక్ నిబంధనలు అమలుచేశాడు. ఆ నిబంధన ప్రకారము సతిసహగమనము చేయుట చట్టరీత్యా దోషాయుక్త హత్య (culpable Homicide) క్రింద పరిగణించబడింది. సమాజములోనున్న అజ్ఞాన అంధకారములను తొలగించుటకు రాజారామమోహన రాయలు ధైర్యసాహసాలతో చేసిన కృషివలననే విలియం బెంటిక్ కు మనోబలము కలిగి అటువంటి సామాజిక మత సంస్కరణలతో కూడిన నిబంధనలు, నిషేధాలు అమలు చేయగలిగెను. లేనిచో చిరకాలమునుండి వచ్చుచ్చున్న సామాజిక ఆచార వ్యవహారములలో జోక్యము అగ్నితో చలగాటమని ఎరిగియుండిన విలియం బెంటింక్ ముందుకు వచ్చియుండకపోయేవాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "The British Rule in India" D. V. Siva Rao (1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షరశాల, బెజవాడ pp 205-208
  2. Macropidea Britannica 15th Edition (1984) Vol.2 pp839-840