శ్రవణ కుమారుడు హిందూ పురాణమైన రామాయణంలో ఒక ఉదాత్తమైన పాత్ర. తల్లిదండ్రుల పట్ల ఎంత అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే ఒక మహోన్నత వ్యక్తిత్వం గలవాడు.

శ్రవణుడు వయసు మీరిన ఒక అంధ దంపతులకు జన్మించాడు. వారిరువురినీ పోషించిడం కోసం బాలుడైన శ్రవణ కుమారుడు సంపాదించవలసి వచ్చేది. ఈ ప్రయత్నంలోనే అతడు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తుండేవాడు. తన తల్లిదండ్రులు వృద్ధులు, అంధులు కావడం చేత వారు తనతో పాటు నడవలేరని ఒక కావడి లో కూర్చుండ బెట్టుకొని ఆ కావడిని తన భుజంపై మోస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుండేవాడు. ఒకసారి వారు ఒక అడవిలో ప్రయాణిస్తుండగా శ్రవణుని తల్లిదండ్రులకు దాహం వేసింది. వారి దాహార్తిని తీర్చడానికి శ్రవణుడు ఒక పాత్రతో నీళ్ళు తేవడానికి వెళ్ళాడు. అదే సమయానికి అడవికి వేటకు వచ్చిన దశరథుడు కొలనులో నీళ్ళు ముంచుకుంటున్న శ్రవణుడిని జింకగా పొరబడి తనకున్న శబ్దబేది విద్య ద్వారా ఆ శబ్దం వినిపించిన దిశగా బాణం విడిచాడు.

శరాఘాతంతో ఆఖరి దశలో ఉన్న శ్రవణుడు నీటి పాత్రను తన తల్లిదండ్రులకు అందించమని చెప్పి తుదిశ్వాస విడిచాడు. దశరథుడు తెచ్చిన నీళ్ళను అందుకున్న అంధులైన శ్రవణుని తల్లిదండ్రులు తన కుమారుడే అనుకున్నారు. దశరథుడు అన్యమనస్కంగానే జరిగిన దుర్ఘటనను వారికి వివరించాడు. పుత్రశోకంలో ఉన్న వారు దశరథుడు కూడా తమలాగే పుత్రశోకం అనుభవించక తప్పదని శాపం పెట్టి తన కుమారుని చంపిన వానిచేత నీళ్ళు తాగి బ్రతక లేక వెంటనే తనువు చాలించారు. ఆ శాప ఫలితమే శ్రీరాముని వియోగానంతరం దశరథుని మరణం.

మూలాలు మార్చు