సంఘమిత్ర

భారతీయ బౌద్ధ సన్యాసిని, అశోక చక్రవర్తి కూతురు

సంఘమిత్ర అశోక చక్రవర్తి, అతని మొదటి భార్య దేవి దంపతుల పెద్ద కూతురు. ఆమె సోదరుడు మహేంద్రుడితో కలిసి బౌద్ధ మత వ్యాప్తికై సన్యాసిగా మారింది. వీరిరువురు అప్పటి శ్రీలంక దేశానికి రాజు, అశోకునికి సమకాలికుడైన దేవనంపియా టిస్సా (సా.పూ 250 – సా.పూ 210) అభ్యర్థన మేరకు బుద్ధుని బోధనలు ఆదేశంలో వ్యాప్తి చేయడానికి వెళ్ళారు. ఈమె మొదటగా మతగల్ అనే గ్రామం చేరింది. ఈ గ్రామం హిందూ మహా సముద్ర తీరంలో శ్రీలంక ఉత్తర ప్రాంతంలో ఉన్న జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె తండ్రి అశోక చక్రవర్తి ఆమెను, ఆమెతో పాటు మరికొంతమంది బౌద్ధ సన్యాసినులను అనురాధపుర లోని టిస్సా రాణి అనుల, ఇతర సభాసదులను బౌద్ధ మతావలంబకులుగా చేయమని కోరాడు. అప్పటికే మహేంద్రుడు వారిని బౌద్ధమతంలోకి మార్చి ఉన్నాడు[1][2][3][4][5]

సంఘమిత్ర
సంఘమిత్ర
శ్రీలంకలోని ఓ బౌద్ధారామంలో సంఘమిత్ర విగ్రహం
ఇతర పేర్లుసంఘమిత్త (పాళీ భాష)
వ్యక్తిగతం
జననంసా.పూ 281
ఉజ్జయిని, అశోకుని సామ్రాజ్యం
మరణంసా.పూ 202
చివరి మజిలీశ్రీలంక
మతంథేరవాద బౌద్ధం
జాతీయతభారతీయురాలు
జీవిత భాగస్వామిఅగ్గిబ్రహ్మ
సంతానంసుమనుడు
తల్లిదండ్రులుఅశోకుడు (తండ్రి)
దేవి (తల్లి)
విద్యబౌద్ధ మతం
దీనికి ప్రసిద్ధిశ్రీలంకలో బౌద్ధ సన్యాసినుల సాంప్రదాయానికి ఆద్యురాలు
ఇతర పేర్లుసంఘమిత్త (పాళీ భాష)
ఆమ సోదరుడు మహేంద్రుడు మొదటగా శ్రీలంక వెళ్ళి బౌద్ధాన్ని వ్యాప్తి చేశాడు. ఆమె కుమారుడు సుమనుడు కూడా మహేంద్రుడి వెంట వెళ్ళాడు.
ఆమ సోదరుడు మహేంద్రుడు మొదటగా శ్రీలంక వెళ్ళి బౌద్ధాన్ని వ్యాప్తి చేశాడు. ఆమె కుమారుడు సుమనుడు కూడా మహేంద్రుడి వెంట వెళ్ళాడు.

ఆమె శ్రీలంకలో బౌద్ధ మతం వ్యాప్తి చేసి భిక్కుని సంఘాలనే పేరుతో మహిళల కోసం సన్యాసినుల సంప్రదాయాన్ని ప్రారంభించింది. కేవలం శ్రీలంక లోనే కాక బర్మా, చైనా, థాయ్ లాండ్ మొదలైన దేశాలలో కూడా ఇలాంటి సంప్రదాయాలు ఏర్పడ్డానికి ఈమె కృషి చేసింది. శ్రీలంకలోని థేరవాద బౌద్ధ మతవాలంబకులు ఈమె బౌద్ధులు పవిత్రంగా భావించే బోధి వృక్షాన్ని శ్రీలంకలోని అనురాధపురలో నాటిన మొదటి రోజును ప్రతి సంవత్సరంలో డిసెంబరు నెలలో వచ్చే పౌర్ణమి నాడు ఉడువప పోయా లేదా ఉపోసత పోయా అనే పేరుతో పండగ చేసుకుంటారు. [2][4][6]

పూర్వ రంగం మార్చు

సా.పూ 3 వ శతాబ్దంలో జీవించిన ప్రముఖ భారతీయ చక్రవర్తి అశోకుడి పుత్రికయైన సంఘమిత్ర, తన తండ్రి ఆదేశం మేరకు సోదరుడు మహేంద్రుడితో కలిసి బౌద్ధ మత వ్యాప్తికి పూనుకున్నది. అలా శ్రీలంకలోని మహిళలను బౌద్ధ మతంలోకి మార్చడమే తన జీవితాశయంగా భావించి అందులో సఫలీకృతురాలు అయింది. అశోకుడు బౌద్ధమతం స్వీకరించిన తర్వాత దాన్ని ఇరుగుపొరుగున ఉన్న 9 దేశాలల్లో వ్యాప్తి చేయడానికి సంకల్పించాడు. అశోకుడితో సత్సంబంధాలు కలిగిన అప్పటి శ్రీలంక పరిపాలకుడు దేవనాంపియ టిస్సా కాలంలో అనురాధపురలో బౌద్ధ మత వ్యాప్తికి బీజం పడింది.[3][4][5]

అశోకుడు బౌద్ధ మత వ్యాప్తికై చుట్టు పక్కల రాజ్యాలకు తన బృందాలను పంపకముందు ప్రముఖ బౌద్ధ గురువు మొగ్గలీపుత్త టిస్సా సలహాతో వెయ్యిమంది అర్హతులుతో మూడవ బౌద్ధ మహాసభలను ఏర్పాటు చేశాడు. ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం అవాంఛనీయమైన బౌద్ధ సంఘాలను నిర్మూలన, హిందూమతానికి చెందిన బ్రాహ్మణుల నుండి ఎదురౌతున్న సవాళ్ళను ఎదుర్కొంటూ బౌద్ధ మత వ్యాప్తిని కొనసాగించాడానికి మార్గాలు అన్వేషించడం. మొగ్గలీపుత్త అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో బౌద్ధ దర్మాన్ని వ్యాప్తి చేయడానికి 9 బృందాలను పంపడానికి నిర్ణయించారు.[4]

అశోకుడు అలా తొమ్మిది బృందాలను తొమ్మిది దిక్కులకు పంపించాడు. దక్షిణ దిక్కున ఉన్న శ్రీలంకకు ఆ దేశపు రాజైన టిస్సా అభ్యర్థన మేరకు అశోకుడు తన కుమారుడైన మహేంద్రుని నేతృత్వంలోని ఓ బృందాన్ని పంపించాడు. మహేంద్రునితో పాటు ఇత్తియ, ఉత్తియ, సంబల, బద్ధశాల, సామనేర (మహేంద్రుడి మేనల్లుడు), బంధూకుడు (మహేంద్రునికి సోదరుని వరస) అనే ఆరు మంది అర్హతులు ఉన్నారు. వీరందరూ కూడా రాజవంశానికి చెందిన వారే. ఇంత ముఖ్యమైన బృందాన్ని శ్రీలంకకు పంపడం వెనుక బౌద్ధమతాన్ని శ్రీలంకలో వ్యాప్తి చేయడం పట్ల అశోకునికి గల ప్రాముఖ్యతను గమనించవచ్చు.[2][3][4]

సాక్షాత్తూ బుద్ధుడు కూడా ఆయనకు జ్ఞానోదయం కలిగిన ఎనిమిదేళ్ళ తర్వాత శ్రీలంకకు మూడు సార్లు వెళ్ళి బౌద్ధ మత తత్వాన్ని, సూత్రాలను అక్కడికి రాజ రాజన్యులకు బోధించి వచ్చి ఉన్నాడు కాబట్టి దాన్ని మరింత బలోపేతం చేయడానికి అశోకుడు ఇదే మంచి అవకాశంగా భావించాడు. అంతే కాకుండా బుద్ధుడు తన తదనంతరం అక్కడి వారిని బౌద్ధ ధర్మాన్ని కొనసాగేందుకు వీలుగా బౌద్ధ భిక్కు, భిక్కుని సంప్రదాయాలను ప్రారంభించి కొన్ని సామాజిక కట్టుబాట్లను కూడా ఏర్పాటు చేసి వచ్చాడు.[4] కానీ టిస్సా రాజు పాలనలో బౌద్ధ మతం క్షీణదశలో ఉండటంతో దాన్ని సముద్ధరించేందుకు భారతదేశం నుంచి వచ్చిన బృందాల ద్వారా ప్రయత్నం చేస్తే బాగుంటుందని భావించాడు.[2][4]

మహేంద్రుడు అనురాధపురలో అడుగు పెట్టగానే మహారాజు టిస్సా తన తమ్ముడి భార్యయైన అనుల రాకుమారి, 500 మంది మహిళలతో కలిసి మహామేఘ తోటలో స్వాగతం పలికాడు. మహేంద్రు శ్రీలంకలో బౌద్ధాన్ని పరిచయం చేయడానికి వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తయింది. అతను పురుషుల కోసం భిక్కు సంప్రదాయాన్ని ప్రారంభించాడు. కానీ మహారాజు, రాణి అనుల, ఆమెతో ఉన్న మహిళలు తమ కోసం ప్రత్యేకంగా భిక్కుణి సాంప్రదాయం ప్రారంభిస్తే బాగుంటుందని భావించారు. కానీ మహేంద్రుడు మాత్రం భిక్కుణి సంప్రదాయాన్ని ప్రారంభించాలంటే అందుకు ఓ మహిళ అర్హుతురాలు అవసరమనీ తన అశక్తతతను వ్యక్తం చేశాడు. టిస్సా రాజును ఈ పరిస్థితిని తెలియజేస్తూ తనంత ప్రజ్ఞ కలిగిన అతని చెల్లెలు సంఘమిత్రను శ్రీలంకకు పంపవలసిందిగా అశోకుడికి ఒక ఉత్తరం రాయమని చెప్పాడు. అంతే కాకుండా బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన బుద్ధగయ లోని భోధి వృక్షం యొక్క కుడివైపు కొమ్మను అక్కడికి తీసుకురావాల్సిందిగా కోరాడు. శ్రీలంక రాజు ఇందుకు తన మంత్రియైన అరిత్తుడు అందుకు స్వచ్ఛందంగా ముందుకురావడంతో అతన్ని భారతదేశానికి పంపించాడు. అరిత్తుడు తాను భారత్ నుంచి అక్కడికి తిరిగి రాగానే మహేంద్రుడి చేత తనకు సన్యాసం ఇప్పించాలని కూడా మాట తీసుకున్నాడు. రాజు కూడా అందుకు అంగీకరించాడు[4][5]

బాల్యం మార్చు

సంఘమిత్ర తల్లిదండ్రులు అశోక చక్రవర్తి, అతని మొదటి భార్య దేవి. దేవి బౌద్ధమతాన్ని స్వీకరించి ఉంది. బౌద్ధ గ్రంథాల ప్రకారం ఆమె జన్మ సంవత్సరం సా.పూ 285. ఆమె అశోకుని దంపతులకు రెండో సంతానం. ఆమె అన్న మహేంద్రుడు కూడా బౌద్ధ సన్యాసియై శ్రీలంక వెళ్ళాడు. ఆమె ఉజ్జయిని నగరం (ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో ఉంది) లో జన్మించింది. అశోకుడు చక్రవర్తి అయ్యేనాటికి ఆమె ఇంకా ఆయన దగ్గరకు వెళ్ళలేదు. తల్లి బౌద్ధురాలు కావడంతో అన్న చెల్లెళ్ళిద్దరూ బౌద్ధాన్ని స్వీకరించారు. ఆమెకు 14 సంవత్సరాల వయసులో ఉండగా అశోకుని బంధువైన అగ్గిబ్రహ్మ అనే అర్హతునితో వివాహం జరిగింది. వారికి సామనేర సుమన అనే కుమారుడు కలిగాడు. అతను కూడా అర్హతుడై మేనమామ మహేంద్రుడితో కలిసి శ్రీలంక వెళ్ళాడు. సంఘమిత్రకు గురువు ఆయుపాలుడు. 18 సంవత్సరాల వయసులో ఆమె ధమ్మపాలుడి దగ్గర థేరవాద బౌద్ధాన్ని అనుసరించి సన్యాసం తీసుకున్నది. ఆమె సోదరుడు కూడా అప్పుడే సన్యాసం తీసుకున్నాడు. బౌద్ధ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ క్రమంగా థేరవాద బౌద్ధంలో సాధికారత సంపాదించి అర్హతురాలిగా మారింది. పాటలీ పుత్రంలో నివసించేది. ఈ ప్రదేశం ఇప్పుడు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఉంది. [2][4][7][8]

యవ్వనం మార్చు

మహేంద్రుడు శ్రీలంకకు వెళ్ళిన కార్యం విజయవంతమైంది. అక్కడ బౌద్ధ మతానికి మారినవారిలో ముఖ్యులు రాజు తమ్ముడి భార్యయైన రాణి అనుల. కేవలం మతం మారడమే కాకుండా తనకు సన్యాస దీక్ష ప్రసాదించమని కోరింది. రాజు టిస్సా అశోకుని కుమార్తె సంఘమిత్రను ఈ కార్యం కోసం పంపమని రాశాడు. మహేంద్రుడు కూడా ఇదే అవసరాన్ని తెలియజేస్తూ తండ్రికి ఉత్తరం రాశాడు.[4]

ఇందుకు సమాధానంగా అశోకుడు తన కుమార్తెను, ఆమెతో పాటు మరో పది మంది జ్ఞానులైన బిక్కుణిలను శ్రీలంకకు పంపి అక్కడ రాణి అనుల, కొంతమంది మహిళలకు సన్యాస దీక్ష ఇవ్వాల్సిందిగా ఆదేశించాడు. తన కుమార్తెను పంపడానికి మొదట్లో అశోకుడు పెద్దగా ఇష్టపడకపోయినా, ఆమె పట్టుపట్టడంతో చివరికి అంగీకరించవలసి వచ్చింది.

మూలాలు మార్చు

  1. "Sanghamittā Therī". What the Buddha said in plain English!. Archived from the original on 2019-09-04. Retrieved 2010-04-28.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "A brief history of Sanghamitta". Bodhistav Foundation. Archived from the original on 2011-07-25. Retrieved 2010-05-02.
  3. 3.0 3.1 3.2 "Mahindagamanaya was more than a diplomatic mission". Daily Mirror. Archived from the original on 2017-09-06. Retrieved 2010-05-02.
  4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 "Theerrii Sanghamiitttta and The Bodhii—tree" (PDF). California: A Gift of Dhamma:Maung Paw. pp. 1–8. Archived from the original (pdf) on 2011-07-24. Retrieved 2016-11-28.
  5. 5.0 5.1 5.2 Harishchanndar, Walisinha (1998). The sacred city of Anuradhapura. Asian Educational Services. pp. 29–36. ISBN 81-206-0216-1. Retrieved 2010-05-02.
  6. "How to be Real Buddhist through Observance?". What Buddha Said Net. Archived from the original on 2010-06-27. Retrieved 2010-05-02.
  7. "Sangamitta Teri". What Buddha Said Net. Archived from the original on 2019-09-04. Retrieved 2010-05-02.
  8. Malalasekera, G.P. (2003). Dictionary of Pali Proper Names: Pali-English. Asian Educational Services. p. 990. ISBN 81-206-1823-8. Retrieved 2010-05-02.
"https://te.wikipedia.org/w/index.php?title=సంఘమిత్ర&oldid=3611846" నుండి వెలికితీశారు