సయ్యద్ కిర్మాణీ

సయ్యద్ మూర్తజా హుస్సేన్ కిర్మాణీ (English: Syed Kirmani) భారత మాజీ క్రికెట్ ఆటగాడు. విజయవంతమైన వికెట్ కీపర్ గా జట్టులో ప్రముఖ పాత్ర పోషించాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు, జాతీయ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గానూ కిర్మాణీ వ్యవహరించాడు.

సయ్యద్ కిర్మాణీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సయ్యద్ మూర్తజా హుస్సేన్ కిర్మాణీ
పుట్టిన తేదీ (1949-12-29) 1949 డిసెంబరు 29 (వయసు 74)
మద్రాసు
బ్యాటింగుకుడిచేతి వాటం బ్యాటరు
పాత్రవికెట్ కీపరు బ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1976 జనవరి 24 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1986 జనవరి 2 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే1976 ఫిబ్రవరి 21 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1986 జనవరి 12 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 88 49
చేసిన పరుగులు 2759 373
బ్యాటింగు సగటు 27.04 20.72
100లు/50లు 2/12 0/0
అత్యధిక స్కోరు 102 48*
వేసిన బంతులు 3.1 -
వికెట్లు 1 -
బౌలింగు సగటు 13.00 -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగు 1/9 -
క్యాచ్‌లు/స్టంపింగులు 160/38 27/9
మూలం: ESPNCricinfo, 24 June 2005

జీవిత విశేషాలు మార్చు

ఆయన 1976లో న్యూజీలాండ్‌పై టెస్టు, వన్డేల్లో ఆరంగ్రేటం చేశాడు. 1983లో వరల్డ్‌ కప్‌ నెగ్గిన జట్టులో కిర్మాణీ సభ్యుడు. ఆ ప్రపంచకప్‌లో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా సైతం అవార్డు దక్కించుకున్నాడు. కపిల్‌దేవ్‌తో కలిసి జింబాబ్వేపై అజేయంగా 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కిర్మాణీ. భారత్‌కు తొలి వరల్డ్‌కప్‌ సాధించడంలో కీలక పాత్ర నిర్వహించాడు. సునీల్‌ గవాస్కర్‌ భారత్‌ తరపున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు నెలకొల్పినప్పుడూ, గవాస్కర్‌తో కిర్మాణీ కీలక 143 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. భారత్‌ అత్యుత్తమ స్పిన్నర్లను వికెట్ల వెనకాల కాచుకున్న వికెట్‌ కీపర్‌గా కిర్మాణీ కితాబందుకున్నాడు. 1981-82లో ఇంగ్లాండ్‌తో వరుసగా మూడు టెస్టు మ్యాచుల్లో, ప్రత్యర్థి మొత్తం 1964 పరుగులు చేసిన సమయంలో, కిర్మాణీ వికెట్‌ కీపర్‌గా ఒక్క అదనపు (బై) పరుగు కూడా ఇవ్వలేదు.

1979 క్రికెట్ ప్రపంచ కప్ జట్టు, ఇంగ్లాండ్‌తో జరిగిన తదుపరి సిరీస్ జట్టు లోకీ కిర్మాణీని పక్కనపెట్టి, భరత్ రెడ్డిని తీసుకున్నారు. కెప్టెన్‌గా సునీల్ గవాస్కర్‌ను కూడా తొలగించారు. సరిగా ఆడనందున కిర్మాణిని తొలగించారని కారణం చెప్పినప్పటికీ, కెర్రీ ప్యాకర్ వరల్డ్ సిరీస్ క్రికెట్ నిర్వాహకులు అతన్నీ, గవాస్కర్‌నూ సంప్రదించడమే అసలు కారణమని పుకారు ఉంది.[1]

1979-80లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కిర్మాణీ తిరిగి జట్టులోకి వచ్చాడు, బొంబాయి మ్యాచ్‌లో నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చి శతకం చేశాడు. ఐదు గంటల పాటు ఆడి 101* పరుగులు చేసాడు. అతని ఇన్నింగ్స్ దాదాపు రోజంతా కొనసాగింది. అదే సీజన్‌లో పాకిస్తాన్‌పై 17 క్యాచ్‌లు, రెండు స్టంపింగ్‌లు చేసి, నరేన్ తమ్‌హానే నెలకొల్పిన భారత రికార్డును సమం చేసాడు.

1983 ప్రపంచ కప్ మార్చు

కిర్మాణీ 1983 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఉత్తమ వికెట్ కీపర్‌గా అవార్డు గెలుచుకున్నాడు, వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్‌లో అతను పట్టిన ఫౌద్ బాక్కస్ క్యాచ్ చెప్పుకోదగ్గ విశేషం. జింబాబ్వేతో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో అతను, మూడు క్యాచ్‌లు, రెండు స్టంపింగులు చేసి అప్పటి రికార్డును సమం చేశాడు. కిర్మాణి దిగువ వరుస బ్యాటింగులో ఆధారపడదగ్గ బ్యాట్స్‌మన్. ఈ ప్రపంచ కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 126 పరుగులు చేసి, ఆమ్యాచ్‌ను కాపాడుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆ తరువాత భారత్, టోర్నమెంటులో తమ పరుగును కొనసాగించడంలో ఆ భాగస్వామ్యం కీలకంగా మారింది.[2]

1984–1986 మార్చు

1984 లో బొంబాయిలో జరిగిన టెస్టులో 102 పరుగులు చేసి, రవిశాస్త్రితో కలిసి 235 పరుగుల భాగస్వామ్యం సాధించాడు. అది అతని రెండవ శతకం. ఆ భాగస్వామ్యం 7 వ వికెట్టుకు ఇప్పటికీ భారత రికార్డు గానే ఉంది. అదే సీరీస్‌లో మద్రాసు టెస్టులో కిర్మాణీ కొన్ని కీలకమైన క్యాచ్‌లు పట్టలేకపోయాడు. భారత్ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ సీరీస్ తరువాత జట్టు లోంచి అతన్ని తీసివేసి, సదానంద్ విశ్వనాథ్‌ను తీసుకున్నారు.

1985-86 ఆస్ట్రేలియా పర్యటనలో కిర్మాణీ మళ్ళీ జట్టు లోకి తిరిగి వచ్చాడు. ఆ సీరీస్‌లో అతను ఫరవాలేదుగా ఆడాడు. వరల్డ్ సీరీస్ కప్ మ్యాచ్‌లో ఒక గొప్ప క్యాచ్ పట్టి అలన్ బార్డర్‌ను ఔట్ చేసాడు. ఆ క్రమంలో అతని కాలు నొప్పి చేసింది. దాంతో ఇక ఆ సీరీస్ అంతా ఆడలేదు, అంతటితో అతని కెరీర్ కూడా ముగిసింది. ఆ తరువాత భారత్ యువ కీపర్లు కిరణ్ మోరే, చంద్రకాంత్ పండిట్‌లను తీసుకుంది గానీ కిర్మాణీని మళ్ళీ పరిగణించలేదు.[3]

అంతర్జాతీయ కెరీర్‌లో, టెస్ట్ మ్యాచ్‌లలో 160 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు, వన్-డే ఇంటర్నేషనల్స్‌లో 27 క్యాచ్‌లు, 9 స్టంపింగ్‌లు ఉన్నాయి.[4] మైదానంలో ఎప్పుడూ ప్రధాన వ్యక్తిగా ఉండేవాడు. అతను డైవ్ చేసి, క్యాచ్ పట్టగలడు. అనేక రనౌట్‌లకు కూడా కారణమయ్యాడు.[5]

పురస్కారాలు మార్చు

భారత ప్రభుత్వం 1982లో కిర్మాణీని పద్మశ్రీ పురస్కారంతో ఘనంగా సత్కరించింది. ఆయనకు 2015కు బీసీసీఐ అందించే ప్రతిష్ఠాత్మక కల్నల్‌ సీకే.నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. కల్నల్ సీకే నాయుడు అవార్డ్ ఎంపిక కమిటీ గురువారం బీసీసీఐ కార్యాలయంలో భేటీఅయి మాజీ క్రికెటర్ కిర్మాణీని ఎంపిక చేసింది.[6] బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో కిర్మాణీకి లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు అందజేయనున్నారు. అవార్డు కింద మెమోంటో, రూ. 25 లక్షల నగదు బహుమానం కిర్మాణీ అందుకోనున్నారు.[7]

మూలాలు మార్చు

  1. Nishad Pal Vaidya (29 December 2016). "Syed Kirmani: 17 facts you should know about India's great wicketkeeper". Cricket Country. Retrieved 15 December 2019.
  2. "Player Profile – Test Cricket: Syed Kirmani (India)". Howstat. Retrieved 15 December 2019.
  3. The Illustrated Weekly of India. Published for the proprietors, Bennett, Coleman & Company, Limited, at the Times of India Press. 1988. p. 66.
  4. Josh, Jagran. Current Affairs January 2016 eBook: by Jagran Josh. Jagran Josh. pp. 230–231.
  5. Singh, Nagendra Kr (2001). Encyclopaedia of Muslim Biography: I-M. A.P.H. Publishing Corporation. p. 360. ISBN 978-81-7648-233-2.
  6. "సయ్యద్ కిర్మాణీ కి జీవితకాల సాఫల్య పురస్కారం , December 25, 2015". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-31.
  7. సయ్యద్‌ కిర్మాణీకి జీవితకాల సాఫల్య పురస్కారం Fri 25 Dec 2015

బయటి లంకెలు మార్చు