స్థానం నరసింహారావు

స్థానం నరసింహారావు (ఆంగ్లం: Sthanam Narasimha Rao) (సెప్టెంబర్ 23, 1902 - ఫిబ్రవరి 21, 1971) ప్రసిద్ధ రంగస్థల, తెలుగు సినిమా నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకాభిమానంతో సహా పద్మశ్రీ పురస్కారం పొందాడు.[1]

స్థానం నరసింహారావు
స్థానం నరసింహారావు
జననంస్థానం నరసింహారావు
సెప్టెంబర్ 23, 1902
మరణంఫిబ్రవరి 21, 1971
ప్రసిద్ధిప్రసిద్ధ రంగస్థల , తెలుగు సినిమా నటుడు
తండ్రిహనుమంతరావు
తల్లిఆదెమ్మ

జననం మార్చు

స్థానం నరసింహారావు 1902, సెప్టెంబర్ 23 న హనుమంతరావు, ఆదెమ్మ దంపతులకు గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం మార్చు

1920 సంవత్సరంలో ఒకనాడు బాపట్లలో ప్రదర్శించే హరిశ్చంద్రలో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించాడు. తెనాలిలోని శ్రీరామ విలాస సభలో ప్రవేశించి ఆకాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి అపారమైన అనుభవం సంపాదించాడు.[2]

ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార నాటకంలో రోషనారగా, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా నవరసాలు కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించాడు. వేషధారణ, వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థానం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవాడు.

వీరు సినీ రంగంలో రాధాకృష్ణ (1939), సత్యభామ (1942) వంటి కొన్ని సినిమాలలో నటించాడు. తన నటనానుభవాలను చేర్చి "నటస్థానం" అనే గ్రంథాన్ని ఆయన రచించాడు.

మరణం మార్చు

స్థానం 1971 ఫిబ్రవరి 21 తేదీన మరణించాడు.

ఇతర విశేషాలు మార్చు

  • 1956లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన ఈ బహుమతిని పొందిన తొలి ఆంధ్రుడు, కళాకారుడు.
  • ఆయన రంగ స్థలం పై చూపించిన సమయస్పూర్త్రి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠం కూడా ఇచ్చింది.
  • వీరి నటనకు ముగ్ధులైన రంగూన్ ప్రజలు 1938లో బంగారు కిరీటాన్ని బహూకరించారు.
  • వీరి షష్టిపూర్తి మహోత్సవాన్ని 1962 సంవత్సరంలో ఘనంగా హైదరాబాదులో నిర్వహించారు.

మూలాలు మార్చు

  1. సాక్షి, ఫన్ డే (1 July 2018). "నటస్థానం". Sakshi. డా. గోపరాజు నారాయణరావు. Archived from the original on 3 నవంబరు 2019. Retrieved 3 November 2019.
  2. నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14
  • నటరత్నాలు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, రెండవ ముద్రణ, 2002, పేజీలు 20-23.
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.

బయటి లింకులు మార్చు